Saturday, August 9, 2025

మమ్మీ, 'ఉత్తరం' అంటే...!?

                                     ~ యం. ధరిత్రీ దేవి 

 సాయంత్రం ఆరు గంటలవుతోంది. వైదేహి, శ్రీధరమూర్తి తేనీరు సేవించడం పూర్తయి, విశ్రాంతిగా కూర్చుని, ఆ రోజు న్యూస్ పేపర్ లో విశేషాలు ముచ్చటించుకుంటూ ఉన్నారు. మరోవైపు కొడుకు, కోడలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వారిద్దరి మధ్యలో ఏడో తరగతి చదువుతున్న మనవరాలు శ్రావ్య ! పుస్తకాల సంచీ  పక్కన పెట్టుకొని, హోంవర్క్ చేసుకుంటోంది. 
   అంతలో వైదేహి ఫోన్ నుండి ఏదో మెసేజ్ సౌండ్ వచ్చింది. తీసి చూసింది. స్నేహితురాలు పావని... శ్రావణమాసం.. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ఉన్న ఓ కార్డు  ఫోటో ఫార్వర్డ్ చేసింది. నిట్టూర్చింది  వైదేహి ! ఆ చెప్పేదేదో ఓ ఫోన్ కాల్ చేసి చెప్పి ఉండొచ్చు కదా! పోనీ కనీసం తన స్వహస్తాలతో టైపు చేసి, విషెస్ పంపినా సంతోషించేది. ఇదే కాదు... ఈమధ్య ప్రతీ సందర్భానికీ  ఇలాగే రెడీమేడ్ శుభాకాంక్షలు అందించడానికి బాగా  అలవాటు పడిపోయారంతా. ముఖా ముఖీ కలుసుకోకపోతే పోయె...ఎంచక్కా ఫోనులో రెండు మాటలు మాట్లాడుకుంటే ఎంత తృప్తిగా, సంతోషంగా ఉంటుంది ! వైదేహికి రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంభాషణ గుర్తుకు వచ్చింది.
" ఏమిటో వైదేహీ...కాలం ఇలా మారిపోయింది ! పెళ్లి పిలుపులు కూడా వాట్సాప్ లో శుభలేఖ పెట్టి కానిచ్చేస్తున్నారు..."
 పక్కింటి శార్వరి వాపోయింది వైదేహి దగ్గర. వెంటనే పక్కనే ఉన్న వసుంధర,
" మంచిదే కదా,రేపు మనం కూడా అదే ఫాలో అయితే సరి ! శ్రమ, ఖర్చు రెండూ ఆదా... !"
అనేసి, నవ్వింది.
" నిజంగానే రోజులు బాగా మారిపోయాయి సుమా ! శుభకార్యాలంటే ఎంత హంగామా! ఎంత సందడిగా ఉండేది ! పిలుపులకే కొన్ని రోజులు కేటాయించుకునేవాళ్లు."
మళ్లీ అందుకుంది శార్వరి.
"...ఇప్పుడన్నీ సులభ పద్ధతులొచ్చేశాయండీ... అంతా ఈపాడు  సెల్ ఫోన్లొచ్చాకే !! "
సాగదీస్తూ నిష్టూరంగా అంది వసుంధర. అలా మాట్లాడుకుంటూ ఉన్నారా ! తమాషా ఏంటంటే... అప్పుడు ఆ ముగ్గురి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ లు తళతళలాడుతూ ఒకదాన్ని మించి ఒకటి మెరిసిపోతున్నాయి..! వాళ్ళ మాటలు విని, అవి మూడూ పరస్పరం చూసుకుని... తెల్లబోయి, తర్వాత చిన్నబోయి .. ఆ వెంటనే తెప్పరిల్లి... 
" ఏం మనుషులు ! మనం లేకపోతే  క్షణం కూడా తోచని స్థితికి వచ్చారు ఈ జనాలంతా ! కానీ ప్రతిక్షణం తిట్టడం మాత్రం మానరు ! ఎప్పుడైనా బ్యాలెన్స్ లేకనో..ఇంకే లోపం వల్లనో... కాసేపు మనం పని చేయకపోతే..పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి !! చేతిలో ఆభరణమే అయిపోయాం కదా ! అయినా ఎందుకో ఈ నిందలు మన మీద ! "
అనుకుంటూ నొచ్చుకున్నాయి కూడా. అంతలోనే శార్వరి కొనసాగిస్తూ...కాస్త  పాజిటివ్ ధోరణిలోకి వచ్చింది.
"... అయినా...నిజం చెప్పొద్దూ.. వయసు మీద పడి తిరగలేని వాళ్లకు ఓ విధంగా ఇది సౌలభ్యమే కదా! కాకపోతే అవతల అర్థం చేసుకోవాలి బంధుజనం మరి!.. "
 వసుంధర అందుకుని , 
"...ఆ..ఇప్పుడంతా ఫోన్ పిలుపులకు అలవాటుపడిపోయారు లెండి. ఏ ఫంక్షన్ కైనా  ఆ పిలుపులే! ఇది పరస్పర అవగాహన. అందులోనూ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చి, అందరికీ అదే ప్రాణానికి హాయిగా అనిపిస్తోంది. అందుకే ఏ అపార్థాలూ, అలగటాలూ ఉండక హ్యాపీగానే ఫీలవుతున్నారు  లెండి.."
( సెల్ ఫోన్ లు కాస్త స్థిమితపడ్డాయి. )
మళ్లీ శార్వరి మొదలెట్టింది. 
"...అయినా, ఈ ఫోన్లు వచ్చాక వార్తలు చేరవేయడాలు ఎంత ఈజీ అయిపోయిందో కదా ! ఒకప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, అర్జెంటయితే టెలిగ్రామ్ ఇచ్చుకోవడం ! ఇప్పుడు.. క్షణాల్లో.. ఎంత దూరాలకైనా, విదేశాలకైనా.. !"
" ఔను మరి ! అసలిప్పుడు ఉత్తరాలు రాసుకునేవారున్నారా అని ! నేను డిగ్రీ చదివే రోజుల్లో హాస్టల్లో ఉండేదాన్ని. క్షేమ సమాచారాలు తెలియజేసుకోడానికి ఉత్తరాలే  దిక్కు అప్పుడు! హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర ఓ టేబుల్ వేసి, దానిపై ఓ ట్రే పెట్టి, స్టూడెంట్స్ కు వచ్చిన లెటర్స్ అన్నీ మధ్యాహ్నం వేళ అందులో ఉంచేవారు మా వార్డెన్. ఆటైమ్ లో చూడాలి...మా అమ్మాయిల కోలాహలం ! లెటర్ వచ్చిన వాళ్ళ ఆనందం! అబ్బో ! వర్ణనాతీతం ! అదేదో పెద్ద నిధి దొరికినట్టు !! సంతోషం పట్టలేక పరుగులు తీస్తూ రూములోకి ఉరికే వారు."
వైదేహి ఒక్క క్షణం కాలేజీ రోజుల్లోకి వెళ్ళింది.
" నిజమే! ఇప్పుడు ఉత్తరాల ఊసేలేదు.. అంతా ఫోన్ లో మెసేజీలే కదా !.."
శార్వరి అంది. 
  అలా,వైదేహికి రెండ్రోజుల క్రితం ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ మదిలో మెదిలి, చిన్నగా నవ్వుకుంది. ఇంతలో ఉన్నట్లుండి...
" మమ్మీ, ఇలా చూడు.. 'ఉత్తరం' అంటే ఏంటి మమ్మీ? మన  వీధిలో వినాయక చవితి పూజ, నిమజ్జనం ఎలా జరిగాయో వివరంగా మా ఫ్రెండ్ కు ఉత్తరం రాయాలట! సొంత వాక్యాల్లో...! రేపటికంతా రాసి తీసుకు రమ్మంది మా తెలుగు మిస్.. అసలు ఉత్తరం ఏంటి? ఎలా రాయాలి? డాడీ చెప్పవా..!"
కొడుకు, కోడలూ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు కూతురి ప్రశ్నకు ! వైదేహి కిసుక్కున నవ్వింది. శ్రీధరమూర్తి  కూడా శృతి కలుపుతూ, 
" శ్రావ్యా, ఇలా రా, ఉత్తరం అంటే ఏమిటో, ఎలా రాయాలో నేను చెప్తాను..."
అంటూ పిలిచాడు. పరుగున వచ్చిన శ్రావ్యను పక్కనే కూర్చోబెట్టుకుని, 
" ఉత్తరం అంటే...లేఖ  అని కూడా అంటారు దీన్ని.. అదెలా రాయాలంటే...."
కొనసాగించాడు శ్రీధరమూర్తి.
*****************************************






Sunday, August 3, 2025

కలిమిని మించిన చెలిమి...


 బంధాలకు అతీతమైనది...
 అన్ని బంధాల్లో శ్రేష్టమైనది..
 ఏ రక్తసంబంధం లేనిదీ..సృష్టిలో తీయనిదీ... 
 అపురూపమైనదీ..స్నేహ బంధమే నోయి...

 బీదా గొప్పా..ఆస్తీ..అంతస్తు చూడనిదీ
 కుల మతాలకు కడు దూరం అనేది...
 ప్రతిఫలం ఆశించని పవిత్ర భావనకు
 ప్రతిరూపమైనది..! స్వార్థ చింతన ఎరుగని 
 స్వచ్ఛమైన ప్రేమనందించేదీ స్నేహమేనోయి !!

 అమ్మకు చెప్పుకోలేనిది...నాన్నతో పంచుకోలేనిది...
 తోబుట్టువులతో మనసు విప్పలేనిది..
 కష్టం సుఖం..కబుర్లతో కాలక్షేపం...అది ఏదైనా..
 అరమరికలు లేని స్నేహంతోనే కదా సాధ్యం...!

 బాధలో భుజం తట్టి ధైర్యాన్నిచ్చేది...
 కష్టకాలంలో చేయూత నిచ్చేది...
 కలకాలం నిలిచేది..పేగుబంధం కన్నా 
 పదిలమైనది..! నిరాశలో ఊపిరి పోసి 
 దారి చూపించేది..కల్మషరహితమైన
 స్నేహమంటే  అదేనోయి..!
 అది వెదజల్లే సుగంధ పరిమళం 
 అనిర్వచనీయమోయి...!
 
 ఇలపై ఇంతకు మించిన బంధముండునా!?
 అటువంటి చెలిమిని మించిన కలిమి ఉండునా!!

 
 
 
 

Tuesday, July 22, 2025

రోజు గడిచిందిలా...

   🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅

 ఉషోదయాన...రవికిరణాలు తొలిసారి 
 నేలతల్లిని తాకుతున్న క్షణాన..
 కొమ్మల చాటున కనిపించక 
 వినిపిస్తూ కోయిల గానం !!
 పులకరించిన ప్రకృతిమాత పలకరింపుతో...
 స్వచ్ఛమైన చిరుగాలి lస్వాగత గీతికలతో.
 కన్నాను సూర్యోదయం  మైమరచి...!

 నీలాకాశం...పులుముకుంది శ్వేతవర్ణం 
 చల్లగాలి సోకి పరుగులు తీస్తూ 
 వెండి మబ్బు జల్లై...కురిసింది మల్లెల వర్షం!
 ఎండిన నేల తడిసి...మట్టి సువాసన ఎగసి 
 నను చుట్టేసిన అపరాహ్నవేళ...పరవశించింది 
 నా మది ప్రకృతి స్పర్శతో మరోసారి..!

 పగలంతా మానవాళిని జాగృతి చేసి 
 అలసి సొలసినాడేమో దినకరుడు...!
 దిగిపోతున్నాడు పడమటి దిక్కున 
 సంధ్యారాగం వినిపిస్తూ...
 ఈరోజుకి సెలవంటూ...నింగిని 
 అద్భుత వర్ణ చిత్రమొకటి 
 ప్రకృతికి కానుకగా ఇస్తూ...

 నల్లటి తివాసీపై మెరిసే చుక్కల సందడి..
 పండు వెన్నెల కురిపిస్తూ రేరాజు...!
 అద్భుతం! ఆ దృశ్య సోయగం !!
 పగలంతా ఏమాయెనో మరి..ఈ మాయ..!
 రేయి ఆగమనంతో నిదరోయింది జగతి...
 నిదురమ్మ ఒడిలో నిశ్చింతగా సేదదీరింది !
 రోజు గడిచింది...మళ్లీ తెల్లారింది...
 అదిగో భానుడు..! తూర్పున ఉదయిస్తూ...
 మరో రోజుకు ప్రాణం పోస్తూ....

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

 


Tuesday, July 15, 2025

ఈ గమనం...ఈ పయనం...అనివార్యం..

🌄🌞🌄🌞🌄🌞🌅🌞🌄🌞🌄🌞🌄🌞🌄🌞

                               ~~ యం.ధరిత్రీ దేవి ~~

తెల్లవారింది...
సూరీడు పలకరించాడు...
మది...పులకరించలేదు...
పక్క వదలనంది...
తట్టిలేపింది నీరెండ...!
తప్పుతుందా...!
మెదిలింది కర్తవ్యపాలన... 
పారిపోయాయి బద్ధకం..బడలిక...
మొదలయ్యాయి పరుగులు...
అంతే ! దినచర్య ఆరంభం...
ఆగమన్నా ఆగదే సమయం !
నేనాగుదామన్నా...కుదరదుగా.. 
కదలక తప్పదే...ప్రతీక్షణం !
అలసిపోతూ ఈ దేహం...
అడగనైనా అడగదే విరామం !
అడిగితేమాత్రం....
అందుతుందా ప్రియనేస్తం...!
ఆందోళనలు...అలజడులు...
ఆపసోపాలు...అన్నింటి నడుమ 
నలుగుతూ...నలుగుతూ...
పూర్తయింది...విద్యుక్తధర్మం... 
పొద్దువాలింది...
సూరీడు నిద్దరోయాడు... 
అందర్నీ నిద్రబుచ్చాడు...
రోజు గడిచింది...ఆ రోజుకి...
మళ్ళీ తెల్లారింది..సూరీడొచ్చాడు..
మళ్ళీ మొదలైంది రోజు !! 
రోజూలాగే..!అయినా...
ప్రతీరోజూ సరికొత్తగానే.. !!
అలా అలా..గడుస్తూనే ఉంటుంది..
మళ్ళీ...మళ్ళీ మళ్ళీ....
తెల్లవారుతూనే ఉంటుంది... 
కదిలిపోతూనే ఉంటుంది..కాలగమనం.....
దానితోపాటు జీవనరథం... 
ఉరుకులూ పరుగులతో సహజీవనం !
వద్దూవద్దంటూనే అందిస్తాం ఆహ్వానం...
అందులోని ఆనందం అనిర్వచనీయం !!
ఏదో ఒక దినం...ఏదో ఒక క్షణం... 
అనుకోని కుదుపులు...
ఊహించని మలుపులు..!!
అవుతాయి ప్రత్యక్షం... 
ఎదురై విసురుతాయి సవాళ్లు..!!
విషాదవీచికలతో కొన్ని... 
వినూత్న ఆనందకెరటాలతో కొన్ని...!
అన్నింటి కలబోతతో.. 
సాగుతూ...సాగుతూ... 
ఈ గమనం...ఈ పయనం.. 
అనివార్యం !పిలుపు అందేదాకా... 
కొనఊపిరి ఆగేదాకా...!!

🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦









Wednesday, July 9, 2025

' చిన్నారి' కథ... తానొకటి తలిస్తే...

 
    రాత్రి పన్నెండు దాటింది. నిద్రపట్టని రాజారావు పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. వారం రోజుల నుండి ఇదే వరుస! దానికి కారణం లేకపోలేదు...ఎదురింటి  రంగనాథానికి తాను  ఊహించిన దానికంటే రెట్టింపు పంట పండటమే. అదొక్కటే కాదు.. ఆ ఊర్లో మరెన్నో విషయాల్లో రాజారావు కంటే ఓ మెట్టు పైనే ఉంటున్నాడు రంగనాథం.
    చాలా ఏళ్లుగా అదంతా గమనిస్తున్న రాజారావుకు అంతకంతకూ రంగనాథం మీద ఓ విధమైన అసూయ అంతరాంతరాల్లో పేరుకుపోయింది. ఏ విధంగానైనా అతను నష్టపోతే చూడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. కానీ,అలాంటిదేమీ జరగకపోగా మరింతగా దినదినాభివృద్ధి పొందటం చూసి అతని రక్తం ఉడికెత్తిపోతోంది.
    దానికి తోడు అతని కొడుకు శ్రీరామ్ తన కొడుకు సురేష్ కంటే బాగా చదువుతూ అన్నింట్లో మొదటివాడుగా ఉంటున్నాడు. అది మరో దెబ్బ రాజారావుకి. అందుకే ఈనాడిలా అసహనంగా ఉన్నాడు. ఏమైనా సరే, ఏదో ఒకటి చేసి, అతనికి తీరని నష్టం కలిగించాలని తీర్మానించుకున్నాడు. అలా అనుకున్న తర్వాతే అతని మనసు ప్రశాంతత పొంది, మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
   ఆ క్షణం నుండి బాగా ఆలోచించి, రెండు రోజుల తర్వాత ఓ పన్నాగం పన్నాడు రాజారావు. ఆరోజు ధాన్యం బస్తాల్ని ఎడ్ల బండి మీద ఎక్కించుకొని పట్నం తీసుకుపోబోతున్నాడు రంగనాథం. అదును చూసుకొని రాజారావు ఎవరూ చూడకుండా ఆ బండి చక్రం ఒక దానికి ఆధారంగా ఉండే పెద్ద మేకును తొలగించేశాడు. అదేమీ గమనించని రంగనాథం పాలేరును తోడు తీసుకుని బండి తోలుకుంటూ పట్నం బయలుదేరి వెళ్ళాడు.
  ఆ మధ్యాహ్నం రాజారావు బంధువొకాయన రొప్పుకుంటూ వచ్చి  ఓ దుర్వార్త రాజారావుకు చేరవేశాడు.దాని సారాంశం...రాజారావు కొడుకు సురేష్ ఎడ్ల బండి మీద నుండి కింద పడి, తలకు బాగా దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నాడని..! లబోదిబోమంటూ రాజారావు ఆసుపత్రికి పరుగెత్తాడు. అక్కడ రంగనాథం ఎదురుపడేసరికి ఒక్కసారిగా  అవాక్కైపోయాడు రాజారావు. తీరా విషయం తెలిసేసరికి అతనికి తల కొట్టేసినట్లయింది.
    రంగనాథం ఎడ్లబండి తోలుకొని పోతుండగా   అదే దారిన పట్నం వెళ్తున్న సురేష్ అనుకోకుండా అతని బండి ఎక్కి కూర్చున్నాడట! అంతే! కొంత దూరం వెళ్లేసరికి రాజారావు చేసిన పనికిమాలిన పని ఫలితంగా బండి చక్రం దబ్బున ఊడి, బండి కాస్తా ఉన్నట్టుండి ఒకవైపు ఒరిగిపోయింది. అటువైపే కూర్చున్న సురేష్ విసురుగా కిందపడి దొర్లుకుంటూ వెళ్లడంతో తల అక్కడున్న ఓ పెద్ద రాతికి బలంగా తగిలింది. అదృష్టవశాత్తు రంగనాధానికి, అతని పాలేరుకూ పెద్దగా దెబ్బ లేమీ తగలలేదు. వెంటనే అటువైపుగా వెళుతున్న ఓ ఆటోను ఆపి, సురేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు రంగనాథం. విషయం అంతా వివరించి, సమయానికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని డాక్టరు చెప్పాడని రంగనాథం రాజారావును ఓదార్చాడు. రాజారావు సిగ్గుతో చితికిపోయాడు.
    రంగనానికి హాని  చేయబోతే తిరిగి అతనే తనకు అనుకోని రీతిలో సాయపడడం అతనికి మింగుడు పడలేదు. తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే కాబోలు అనుకుంటూ తల పట్టుకున్నాడు.

నీతి : చెడపకురా చెడేవు.

( ఆంధ్రభూమి  వారపత్రికలో 'ఫలితం' పేరుతో ప్రచురితం )





Tuesday, July 1, 2025

కనిపించే దేవుళ్ళు...

   
" వైద్యో నారాయణో హరిః" అంటారు. డాక్టర్లు దేవుళ్ళనీ అంటారు. పోతున్న ప్రాణాలు సైతం నిలబెట్టి మనిషికి ఆయుష్షు పోసే శక్తి ఒక్క వైద్యులకే సొంతం అన్నది నిర్వివాదాంశం. కానీ.. ప్రస్తుత రోజుల్లో వైద్యులు మునుపటి గౌరవాన్ని పొందడం లేదన్నది వాస్తవ దూరమైతే కాదు. ఒకప్పటిలా డాక్టర్ల సేవాతత్పరత నేడు కానరావడం లేదు.. ఎందుకని!
   వృత్తి పట్ల అంకితభావం లోపిస్తోంది. ఎంతో కష్టపడి మెడిసిన్లో సీటు సంపాదించి ఏడెనిమిదేళ్లు శ్రమకోర్చి తెచ్చుకున్న డిగ్రీ..! అంత కష్టంతో డాక్టర్ అయ్యాక.. అసలు తానెందుకు ఆ చదువే ఏరి కోరి ఎంచుకున్నాడో మరిచిపోతే ఎలా!!
   శారీరక బాధలు,అనారోగ్యాలు వేధిస్తున్నప్పుడు ఎవరికైనా తక్షణమే గుర్తుకొచ్చేది డాక్టరే...! ఎంతో నమ్మకంతో,ధైర్యంతో వెళ్లి డాక్టర్ ముందు కూర్చున్న రోగి డాక్టర్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేషెంట్ చెప్పే సమస్యను పూర్తిగా సహనంతో వినడం ఆ వైద్యుని కనీస ధర్మం. అలాగే ప్రసన్నంగా కనిపించడం, చిరునవ్వుతో తన ముందున్న రోగిని పలకరిస్తూ సమస్యను సందేహించక తనతో చెప్పేలా చేయడం ఓ డాక్టర్ కు ఉండాల్సిన ప్రథమ లక్షణం.
    ప్రస్తుతం ఎందరు డాక్టర్లు ఈ విధంగా ఉంటున్నారనేది ప్రశ్నార్థకమే! రోజుకు లెక్కలేనంతమంది రోగులు వస్తుంటారు.. అందరితో అలా అంత ఓర్పుగా, వ్యవహరించడం ప్రతి ఒక్కరికి అంత సమయం కేటాయించడం..సాధ్యమేనా! అన్నది ప్రశ్న! అది కొంతవరకు నిజమే అయినా.. వైద్యులకు ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యాన్ని విస్మరించడం మాత్రం తగదని చెప్పాలి.
   మరో విషయం.. ఎందరో డాక్టర్లున్నా, కేవలం కొందరికి మాత్రమే మంచి డాక్టర్ అన్న పేరు వస్తూ ఉంటుంది. దానికి కారణం రోగులతో ఆ డాక్టర్స్ ప్రవర్తిస్తున్న తీరు మాత్రమే..! వైద్య రంగంలో రాణించడం, రాణించకపోవడం అన్నది ప్రధానంగా ఆ వైద్యుల చక్కటి ప్రవర్తనా తీరుపై ఆధారపడి ఉంటుంది. కొందరికి చక్కటి నైపుణ్యాలున్నా కోపం, చిరాకు,విసుక్కోవడం, వ్యంగ్య ధోరణిలో మాట్లాడటం, రోగి చెప్పేది పూర్తిగా వినకుండానే మందులు రాసేయడం, టెస్టులు చేయించమనడం.. ఇలాంటి లక్షణాల వల్ల రోగులు అలాంటి డాక్టర్ల వద్దకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు.
   ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్లుండే వారేమో గానీ.. ఇప్పుడా అవకాశం ఉండడం లేదు. ఈ సందర్భంగా..  ఓ విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో మా గ్రామంలో ఒకాయన ఉండేవారు.యాభై ఏళ్ళు ఉంటాయి. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు..అయినా ఎంతో అనుభవజ్ఞుడైన డాక్టర్ కున్న పరిజ్ఞానం ఉండేది . ఊర్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆయనకు కబురు పంపేవారు. ఆయన కూడా ఏ భేషజం లేకుండా తక్షణమే వచ్చి రోగిని పరామర్శించి తన వద్ద ఉన్న టాబ్లెట్స్ ఇచ్చేవాడు. అందులో అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేదం కూడా ఉండేవి. ఆయన హస్తవాసి ఏమోగానీ  మరుసటి దినానికంతా సమస్య సద్దుమణిగి మనిషి నార్మల్ అయిపోయేవాడు. ఆ ఊరికి ఆయనే తిరుగులేని డాక్టర్ !! నయాపైసా ఆశించక ప్రతివారికీ అందుబాటులో ఉండేవాడు.
  అంతటి సేవాతత్పరత ఈరోజుల్లో  ఎందరు డాక్టర్లకు ఉందంటారు! ఎంతటి ప్రమాద స్థితిలో ఉన్న పేషెంట్ నైనా.. పక్క ఇంటిలోనే ఉన్న డాక్టర్ కూడా పిలిచినా రాడు..! పేషెంట్ నే అతని వద్దకు తీసుకొని పోవాల్సి వస్తోంది. అలాగే కొద్ది సంవత్సరాల క్రితం ఏదైనా అస్వస్థతకు లోనై డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షించి మందులు మాత్రం రాసిచ్చేవారు. ఇప్పుడు వెంటనే టెస్టులు కూడా రాసిస్తున్నారు.! అందరూ ఇలాగే ఉంటున్నారు అని మాత్రం చెప్పడం లేదు.. కానీ ఎక్కువ శాతం జరుగుతున్నది ఇదే! అందుకేనేమో.. చిన్న చిన్న అనారోగ్యాలకు డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారు చాలామంది.
    ఏది ఏమైనా డాక్టర్లు దేవుళ్ళు అనే పేరు ప్రజల్లో నిలిచిపోవాలంటే డాక్టర్లకు సేవాభావం, రోగుల పట్ల దయ తప్పక ఉండాల్సిందే. అప్పుడే మంచి డాక్టర్ అనిపించుకుంటాడు. ప్రస్తుతం వృత్తి పట్ల అంకితభావం లేని వాళ్ళు అసలు లేరని చెప్పడం కూడా భావ్యం కాదు. కాలాలతో నిమిత్తం లేకుండా అప్పుడూ ఇప్పుడూ మంచి డాక్టర్స్ ఉంటూనే ఉన్నారు. సంపాదనే ధ్యేయం కాకుండా ఉచిత వైద్యం చేస్తూ, మందులు కూడా ఉచితంగానే అందిస్తూ రోగులను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునే వారూ ఉంటున్నారు. వారు నిజంగా వైద్య నారాయణులే..! వారందరికీ హృదయపూర్వక నమస్సులు. డాక్టర్స్ ని విమర్శించరాదు. ఎందుకంటే ఏ అనారోగ్యం పొడసూపినా వారే దిక్కు మరి!! వ్యాధుల బాధలు బాపే అపరధన్వంతరులు రోగుల పట్ల శ్రద్ధ చూపడం ఎంతైనా అవసరం. అప్పుడే వారు కనిపించే దేవుళ్ళు అవుతారు...🙏 

                 ( నేడు 1.7.25 డాక్టర్స్ డే )

Thursday, June 19, 2025

స్ఫూర్తి ప్రదాత... అబ్దుల్ కలాం

 

   భారత రాష్ట్రపతిగా వినుతికెక్కిన A. P. J. అబ్దుల్ కలాం గారు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన విశిష్ట వ్యక్తి. Missile Man of India గా పిలువబడ్డ వీరి పూర్తి పేరు Avul Pakir Jainulabdeen Abdul Kalam. అక్టోబర్ 15  1931 న రామేశ్వరంలో జన్మించారు. యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వీరి కీర్తి అజరామరం. 2015 జూలై 27 న ఓ సమావేశంలో విద్యార్థుల సమక్షంలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ మహనీయుని స్ఫూర్తిదాయకమైన సూక్తులు, మాటలు ఓసారి మననం చేసుకుందాం...

మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది.   కానీ, ఏదైనా గాయమైతే  మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ... మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి.
*
కల అంటే  నిద్రలో వచ్చేది కాదు... నిద్రపోనివ్వకుండా చేసేది. నిజమైన కల దాన్ని సాకారం చేసుకునేవరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు.
*
ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే..అది అలవాటుగా ఎదుగుతుంది.. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే...అది తలరాతగా ఎదుగుతుంది...కాబట్టి మన తలరాతను సృష్టించుకునేది మనమే...!!
*
హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది.

*********************************
       

Monday, June 16, 2025

కథలు కాదు వాస్తవాలు

 

 ఇటీవల ( 12.6.25 ) అహ్మదాబాదులో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం నుండి ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతమే! మొత్తం 242 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం నుండి అనూహ్యంగా స్వల్ప గాయాలతో బయటపడి మృత్యుంజయుడుగా నిలిచిన బ్రిటిష్ జాతీయుడైన నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ తాను ఎలా ప్రమాదం నుండి ప్రాణాల్ని దక్కించుకున్నాడో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలియజేశాడని సమాచారం. తాను కూర్చున్న సీటుకు కాస్త ముందు భాగంలో అత్యవసర ద్వారం ఉండడం..ప్రమాదం జరిగే క్షణాల్లో ఆ ద్వారం తెరుచుకోవడంవల్ల సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి సీటు బెల్టు తొలగించుకుని ఆ ద్వారం గుండా బయటకు దూకడం జరిగిందనీ, తన సీటుతో సహా మెడికల్ కాలేజీ వసతి గృహం మీద ఓ సురక్షిత ప్రదేశంలో పడ్డాననీ చెప్పాడట!!
    వందల మంది ప్రయాణికుల్లో ఒక్కడు మాత్రం సజీవంగా బయటపడటం ఊహకందని వాస్తవ ఘటన కాక మరేమిటి! భారతదేశ వైమానిక చరిత్రలో ఇదొక అత్యంత విషాదకరమైన  ఘట్టం అయితే... మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన మరొకటి ఈ దుస్సంఘటనతో ముడివడి ఉండడం మనసును మెలిపెట్టే మరొక బాధాకర విషయం... అదేమిటంటే....
   ఈ సంఘటనతో గానీ, ఈ విమానంతో గానీ, అందులోని ప్రయాణికులతో గానీ ఏ మాత్రం సంబంధం లేకున్నా..వైద్య కళాశాల వసతి గృహంలో యధాలాపంగా మధ్యాహ్నం భోజనం చేస్తూ అనూహ్యంగా దుర్మరణం పాలైన అమాయక వైద్య విద్యార్థులు విధి వంచితులుగా మారడం !! వారి కుటుంబాలకే గాక యావత్తు ప్రజానీకానికి ఇది తీరని వేదనను మిగిల్చింది. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో!!
    --- అలాగే ఇదే విమానంలో లండన్ కు ప్రయాణించాల్సిన భూమి చౌహాన్ అనే మహిళ ఆలస్యంగా బయలుదేరడం వల్ల విమానం అందుకోలేక తనకు తెలియకుండానే మరణం బారి నుండి తప్పించుకోవడం కేవలం యాదృచ్ఛికమే.. ఇది కూడా కథ కాదు.. వాస్తవమే !

Saturday, June 14, 2025

'చిన్నారి'... అమ్మా తేవే నా పలక...బాలగేయం

🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠
                                                ~ యం. ధరిత్రీ దేవి

 బాలగేయాలు చిన్నపిల్లల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎప్పుడూ పాఠాలే కాకుండా వారికి పాటలు కూడా నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు. అలాగే పాటల ద్వారా అంతర్లీనంగా చక్కటి సందేశాలనూ పిల్లలకు అందించవచ్చు.పాటలకు అభినయం జోడిస్తే అభినయ గీతాలవుతాయి కూడా. అలాగే ఉపాధ్యాయులకు పిల్లలకూ మధ్య చక్కటి అనుబంధం ఈ పాటల ద్వారా ఏర్పడుతుంది. ఈ క్రింది బాల గేయానికి చక్కటి రాగం కట్టి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నేర్పించవచ్చు...

అ ఆ ఇ ఈ అమ్మా తేవే నా పలక 
ఆడుతు పాడుతు పరుగున 
నేనూ బడికెళతా
                                                               //అఆ// 
అన్నతో నేనూ పోటీ పడతా 
చెల్లికి నేనూ పాఠం చెబుతా
బడిలో నేనూ బుద్ధిగ ఉంటా
తరగతి లీడర్ నేనే అవుతా 
                                                              //అఆ//
ఒకట్లు పదులు వందలు వేలు 
వారాలు నెలలు సంవత్సరాలూ
తెలుగు ఆంగ్లం గణితం జ్ఞానం
చకచక అన్నీ నేర్చుకుంటా

                                                              //అఆ//
గురువులు మాకు దైవాలు
భవితకు  దారులు వేస్తారు
నా తోటి పిల్లలు నా నేస్తాలు
మానేస్తాము కలహాలు
 
                                                            //అఆ// 
🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠

                                                

Thursday, June 12, 2025


      ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం 
                   Stop Child Labour
                   ````````````````
                                  ~ యం. ధరిత్రీ దేవి

    కొద్ది రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పు తీర్చలేక తల్లిదండ్రులు తొమ్మిది సంవత్సరాల వారి కొడుకును అప్పిచ్చిన వారి వెంట పనికి పెట్టారనీ, అక్కడ పని భారం మోయలేక వారు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ పిల్లవాడు మృతి చెందాడన్నది ఆ వార్త సారాంశం. ఇలాంటి ఉదంతాలు కొత్తేమీ కాదు..తరచూ వింటూనే ఉంటాం...
    చాలా ఏళ్ల క్రితం.. అంటే దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం వెట్టి చాకిరీ ( bonded labour ) అనే మాట ఎక్కువగా వినవస్తూ ఉండేది. తీసుకున్న అప్పుకు వడ్డీ కింద అప్పిచ్చిన వారి వద్ద కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు పనులు చేయడం..! సంవత్సరాలు గడిచినా..ఆ 'అసలు'తీరడం అన్నది ఎప్పటికీ ఉండనే ఉండదు. తరాలు మారినా ఆ అప్పు తీరదు. చేస్తున్న చాకిరీకి వడ్డీ జమ చేయడమే!! పెద్దలకు కుదరనప్పుడు చిన్నపిల్లలనే ఆ పనికి కుదిర్చేవారు. అది అసమంజసమైనా ఆ నిరుపేదలకు తప్పని దుస్థితి. ఇది బాలల హక్కుల్ని కాలరాయడం కాక మరేమిటి!?
తండ్రి చేసిన అప్పు తీర్చే మిష మీద పసివారి బాల్యాన్ని తాకట్టు పెట్టడం! ఇంతకంటే శోచనీయం ఉంటుందా !
   5 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు హాయిగా తల్లిదండ్రుల చాటున ఉంటూ ఆటపాటలతో కాలం గడిపే ఆహ్లాదకరమైన, అపురూపమైన బాల్యమది. పైగా.. చక్కగా చదువుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకునే వయసు కూడా.అది వారి జన్మ హక్కు. ప్రాథమిక హక్కు కూడా. అలాంటి వారి హక్కుల్ని అపహరిస్తూ వారి భావి జీవితాన్ని కాలరాసే హక్కు కన్న తల్లిదండ్రులకు కూడా ఉండదు గాక ఉండదు. కుటుంబం కోసం పెద్దలు చేసిన అప్పులకు అభం శుభం ఎరుగని పసివాళ్లను బలిపెట్టడం ఎంతవరకు భావ్యం!? ఇది ఖచ్చితంగా పిల్లల శ్రమను దోపిడీ చేయడమే...
   ఏళ్లుగా సాగుతున్న ఈ దుశ్చర్యల్ని అరికట్టడానికి ఆవిర్భవించినదే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈరోజు కోసం ప్రతి సంవత్సరం జూన్ 12వ తారీకు నిర్ణయించబడినది. International Labour organization ( ILO ) 2002 లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది .
 ఇంతకీ... ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
* ఈ సమస్యపై శ్రద్ధ చూపడం...
* దానిని నిర్మూలించడానికి మార్గాలను కనుగొనడం..
* ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా బాల కార్మికులుగా 
   పిల్లలు ఎదుర్కొంటున్న,మానసిక,శారీరక సమస్యల
   గురించి తెలియజేయడం...
* బాల కార్మికులను అరికట్టడానికి అవసరమైన
   చర్యలు చేపట్టడం...
* ఆదిశగా అభివృద్ధి సాధించడం...
---- ఇంతకీ బాల కార్మికులు అంటే ఎవరు ?
18 సంవత్సరాల లోపు పిల్లలు... వీరిని పనుల్లో పెట్టడం ద్వారా వారి శారీరక, మానసిక, సామాజిక ఇంకా విద్యాభివృద్ధికి హాని కలిగించడం జరుగుతుంది. ప్రమాదకర కార్యకలాపాల్లో వీరి శ్రమను ఉపయోగించుకోవడం వల్ల వీరి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. తద్వారా వారి చక్కటి భవిష్యత్తు  అగమ్య గోచరంగా మారిపోతుంది. లేత వయసులో వారి మానసిక స్థితి వక్రమార్గం పట్టే దిశగా పయనించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందరిపై అకారణ ద్వేషాలు, సమాజంపై ఒక రకమైన  కసి పెరిగిపోతాయి. ఆ విధంగా మొత్తం సమాజానికి వీరు చేటు తెచ్చే దుష్ట శక్తులుగా మారే ప్రమాదం పొంచి ఉంటుందన్నది నిర్వివాదాంశం.
   రేపటి తరం పౌరులు అలాంటి విద్రోహులుగా మారడం... దేశ భవిష్యత్తును అనూహ్యమైన సమస్యల విష వలయంలోకి నెట్టి వేయగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.
   దీనికి ముఖ్య కారణం.. బాల్యంలో వారికి విద్యాబుద్ధులు అలవడకపోవడమే. హాయిగా చదువుకోవలసిన వయసులో ఆ లేత చేతులు, పాదాలు కార్ఖానాల్లో, కర్మాగారాల్లో, ఇళ్లల్లో వెట్టి చాకిరీతో సతమతమవుతూ కునారిల్లుతుంటే ఆ పసి మనసులకు సంతోషం అన్నది ఉండడం సంభవమా! ఆటపాటలతో ఉల్లాసంగా తల్లిదండ్రుల ప్రేమాదరణలో సేదదీరాల్సిన ఆ బాల్యం పనీపాటలతో బండబారిపోవలసినదేనా !! ఇలాంటి వాతావరణంలో విపరీత, విపత్కర పరిస్థితులతో రాజీపడుతూ.. బాల్యాన్ని బలి పెడుతూ, పెరుగుతూ ఆ దశ దాటిపోయాక గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ బ్రతుకంతా భారంగా వెళ్లదీయడానికి కారకులెవరు ? 
 --- తల్లిదండ్రులా ? బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్న యాజమాన్యాలా ? లేక వారిపై శ్రద్ధ చూపని ప్రభుత్వాలా  ?
 ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఆవిర్భవించినదే బాల కార్మిక వ్యతిరేక దినం. అందుకోసం నిర్ణయించబడ్డ, పాటించాల్సిన కొన్ని ముఖ్యంశాలు...
* పిల్లల హక్కుల్ని కాపాడాలి...
* పిల్లలు పని చేయకూడదు. వారితో పనులు 
   చేయించరాదు.
* బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి.
* ప్రభుత్వాలు, వ్యాపారస్తులు, కర్మాగారాలు 
    పిల్లల హక్కుల్ని కాపాడాలి.
--- ఇందుకోసం ఆచరించవలసిన విషయాలు..
* బాల కార్మిక వ్యవస్థ యొక్క మూల కారణాలను 
   కనుగొనడం,పరిష్కరించడం, నిర్మూలించడం..
--- బడి ఈడు పిల్లలు బడి బయట కాదు.. బడిలోనే ఉండాలి అన్న భావన ముఖ్యంగా తల్లిదండ్రుల్లో కలిగించాలి. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైనదిగా చెప్పవచ్చు. పెద్దలు చేసిన అప్పులకు,వారు మోయవలసిన బాధ్యతలకు కన్నబిడ్డల్ని బాధ్యులుగా చేయడం సమంజసం కాదని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడం జరగాలి.
  అశాంతికి, అభద్రతకూ లోనైన పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా మారి, సమాజానికి, దేశానికి హాని కలిగించే కారకాలుగా అయ్యే అవకాశాల్ని పెద్దలకు వివరించాలి. తద్వారా వ్యక్తిగత కుటుంబాలకే కాక సమాజం, దేశం అలజడికి లోనయ్యే పరిస్థితులు వారి ముందుంచడం అతి ముఖ్యం.
 పేదరికంలో మగ్గిపోతూ, పిల్లల్ని చదివించలేకపోతున్న వారికి ఎన్నో విధాలుగా ప్రభుత్వం చేయూతనందించడం హర్షణీయం. అందులో మధ్యాహ్న భోజన పథకాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, ఫీజులు రద్దు చేయడాలు, ఇంకా స్కాలర్షిప్  మంజూరు చేయడాలు మొదలైనవి పేదవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ సౌకర్యాలన్నీ కాలేజీ చదువుల దాకా విస్తరింప చేయడంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఎంతేని అభినందనీయం..
    ఏది ఏమైనా... ఆటపాటలతో బాల్యాన్ని ఆస్వాదిస్తూ, చదువుకోవాల్సిన పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుండి కాపాడడానికి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని ప్రవేశపెట్టి, జూన్ 12 వ తేదీని  ఆ దినోత్సవానికి కేటాయించడం ఎంతో సంతోషించాల్సిన విషయం. అలాగే ఆచరణపై కూడా అన్ని యాజమాన్యాలు దృష్టి పెట్టడం చాలా అవసరం.
   మనం గమనిస్తూ ఉంటాం.. ఇళ్లల్లో పని మనుషులుగా 10 నుండి 15 సంవత్సరాల అమ్మాయిలు చేస్తూ ఉండడం.. అదే వారి ఆర్థిక దుస్థితి కావచ్చు.. కానీ ప్రోత్సహించకపోవడం మంచిది. ఆ పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని పాఠశాలకు పంపేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రభుత్వమే వారికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తుందని తెలియజెప్పాలి.
   ఇవన్నీ అమలు చేయడం ద్వారా కొంతలో కొంతవరకైనా ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించగలం. జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం గురించి అందరికీ అవగాహన కలిగిద్దాం. ప్రతి ఒక్కరం అందులో భాగస్వాములమవుదాం. అది మనందరి కనీస బాధ్యతగా పరిగణిద్దాం...
                          __________________
 
   


Tuesday, June 10, 2025

'చిన్నారి'... రేపటి ప్రపంచ పౌరులు... బాలగేయం

బాలల్లారా బాలల్లారా 
రేపటి ప్రపంచ పౌరుల్లారా 
రారండీ రారండీ 
పాఠశాల పిలుస్తోంది రారండీ 
                                                        //బాలల్లారా //
చిట్టి చిట్టి చేతులు మీవి 
పలకా బలపం పట్టాలి 
పలుగూ పారా వదిలేయాలి 
అ ఆ ఇ ఈ నేర్వాలి 
                                                       //బాలల్లారా //
చిన్ని చిన్ని పాదాలు మీవి 
ఆడీ పాడే వయస్సు మీది 
ముద్దుముద్దుగా సాగే బ్రతుకు
మొద్దుబారిపోనీయొద్దు 
                                                        //బాలల్లారా //
మట్టితో ఆటలు ఆడండి
మట్టిపనులు మీకొద్దు మానండి 
కార్ఖానాలు క్వారీలు కూలిపనులు 
చాకిరీలు...వద్దు వద్దు చాలించండి 
                                                        //బాలల్లారా//
అమ్మలు నాన్నలు ఆలకించండి 
ఆలకించి మీరు ఆలోచించండి
మీ అప్పులు మీ తిప్పలు 
మీ పిల్లలకొద్దండీ వద్దండీ
                                                       //బాలల్లారా//
పసివయసును చిదిమేసి 
బ్రతుకు బరువు చేయకండి
బాల్యాన్ని బలిపెట్టి  
నిలోన పెట్టకండి 
చదివించీ చూడండి 
ప్రగతి దారి చూపండి 
                                                        //బాలల్లారా //

Friday, June 6, 2025

పర్యావరణాన్ని కాపాడుకుందాం...

 

🌳🌴🌴🌳🌲🪻🫒🍀🎋🪴🍍🌱🍂🌿🎋🌳

 
   ఉదయం 6.30 దాటింది.గబగబా తాళం వేసి, బ్యాగ్ భుజానికి తగిలించుకుని రోడ్డెక్కాను. ఆటో కోసం ఐదారు  నిమిషాలు నడవాల్సిందే! అటు ఇటు చూస్తూ నడుస్తున్న నాకు రోడ్డు రెండు వైపులా చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లు..ఇంకా రకరకాల వ్యర్థాలు పేరుకుపోయి కనిపించాయి. నిన్న రాత్రి వర్షం కురిసిందేమో.. రోజూ నడుస్తున్న దారే అయినా మరీ అధ్వాన్నంగా ఇంకా చెప్పాలంటే అసహ్యంగా కనిపించింది. ఇళ్ల నుండి రోజూ చెత్త సేకరిస్తూనే ఉన్నారు.. అయినా..రోడ్ల పక్కన ఇంతలా ఎలా పేరుకు పోతోంది !  చుట్టుపక్కల హోటళ్ల వాళ్ళు మిగిలిపోయినవన్నీ పారవేయడం కూడా ఇక్కడే..! పర్యావరణం కలుషితం అవమంటే అవ్వదా! రోగాలు రాకుండా ఎలా ఉంటాయి?
    అలా ఆలోచిస్తున్న నా ముందు ఆటో వచ్చి ఆగింది. ఎక్కి కూర్చుని, బస్టాప్ లో  దిగాను. ఏడు గంటలకు నేను వెళ్లాల్సిన బస్సు వచ్చింది. ఎక్కి ఖాళీగా ఉన్న  కిటికీ పక్క సీట్లో కూర్చున్నాను. చల్లగాలి వీస్తోంది. హాయిగా అనిపించింది. కానీ,అది కాసేపే..! కిటికీలోంచి కనిపిస్తున్న దృశ్యాలకు  ఆ ఆహ్లాదం కాస్తా ఆవిరైపోయింది. కంపచెట్లకు అడ్డదిడ్డంగా తగులుకున్న ప్లాస్టిక్ కవర్లు దారి పొడవునా దర్శనమిస్తూఉంటే మూడ్ అంతా పాడయిపోయింది.
   ప్లాస్టిక్ వాడకం తగ్గించండి అంటారు..అసలు వాడొద్దు అంటారు.. కానీ, అవి ఉత్పత్తి కాకుండా నిరోధించరు.మన ప్రారబ్దం ! అవి లేకుండా మనకు రోజు గడవదు. ఫలితంగా ఎన్ని అనర్థాలో! ఏం చేయగలం! ఇవన్నీ భూమిలో కలిసిపోవడానికి వందల ఏళ్ళు పడతాయట! పెరుగుతున్న టెక్నాలజీతో రకరకాల పరికరాలు, వస్తువులు కనిపెడుతున్నారు. ఎన్నో సౌకర్యాలు అందిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది.. కానీ, సౌకర్యాలతో పాటు అనివార్యమైన అసౌకర్యాలూ, అనారోగ్యాలు భరించక తప్పడం లేదు.. అవి మనల్ని చుట్టు ముడుతున్నాయి, చాప కింద నీరులా..! 
     వంట పాత్రల నుండి, తాగే నీటి బాటిళ్ల వరకూ అంతా ప్లాస్టిక్ మయమే. నివారించలేము.. వాడకుండా ఉండలేము. అంతకన్నా మనకు మరోదారి ఉండడం లేదు. ఒకప్పటిలా మట్టికుండలు వాడమంటున్నారు.ఆకర్షణీయమైన,సౌకర్యవంతమైన  వస్తుసామాగ్రి కనిపెట్టి జనాల మీదకి వదిలేసి, ఇప్పుడు వాటన్నింటినీ పక్కకు పెట్టేయండి.. మళ్లీ పాత రోజుల్లోకి వెళ్ళండి.. అంటే సాధ్యపడుతుందా!! సుఖానికి అలవడ్డ ప్రాణాలు మరి!
   అయినా.. చెప్పుకుంటూ పోతే ఒక్క.. ప్లాస్టిక్ మాత్రమేనా పరిసరాల్ని కలుషితం చేస్తూ ఆరోగ్యానికి చేటు తెస్తున్నది..!? గాలి కాలుష్యం చేస్తున్న హాని అంతా ఇంతా కాదుగదా! 
    అయినా.. ప్రతిరోజూ నేను ప్రయాణిస్తున్న దారే ఇది. ఉద్యోగరీత్యా రోజూ ఉదయం, సాయంత్రం ఈ ప్రయాణం తప్పదు నాకు. కానీ ఈ రోజే ఎందుకో చుట్టూ చూడాలనిపిండానికి కారణం ఉంది... అదేంటంటే.. ఈ దినం ప్రపంచ పర్యావరణ  దినం (5.6.25) కాబట్టి...
     మన చుట్టూ పరిసరాలు శుభ్రగా, ఆహ్లాదంగా ఉండాలంటే అది ముందుగా మన ఇంటి నుండే మొదలవ్వాలి అంటాను నేను. ప్రతివారూ ఇంటి ముందు రెండు మొక్కలైనా నాటాలి.స్థలం లేపోతే నాలుగైదు తొట్లు పెట్టుకుని అందులో ఏ పచ్చని మొక్కలో నాటుకోవాలి. ఇంట్లో, ఇంటి ముందు చెత్తా చెదారం లేకుండా శుభ్రత పాటించాలి.ఇలా ప్రతీ ఇల్లు తయారైతే వీధులన్నీ శుభ్రంగా,ఆహ్లాదంగా తయారై అందంగా కూడా కనిపిస్తాయి. ఆవిధంగా పర్యావరణం బాగుపడుతుంది. కాదంటారా!, ప్రతి ఒక్కరం పాటించాల్సిన నియమం ఇది.
       ఆవిధంగా ఆహ్లాదం, ఆరోగ్యం, ఆనందం మన సొంతమవుతాయి. పర్యావరణ దినోత్సవం నాడు అందరం ఈ నిర్ణయం తీసుకుందాం. తద్వారా కాలుష్యాన్ని నిర్మూలిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుకుందాం....
🌴🌵🌿🌲🌳🍀🫒🎋🪴🍍🌱🍂🌾🌴🌳🌲

   
 

Sunday, June 1, 2025

పాదచారులు ప్రకృతి ప్రేమికులైన...


                                             ~యం. ధరిత్రీ దేవి 

🌲🍀🌿🌵🌳🌵🌿☘️🌾🍀🌲🪻🪴🍁🦠🌲
        
     నడిచే దారిలో...
     పేరు తెలియని ఆ మొక్కలు...
     వరుణుడి దయతో మొలిచి 
     నిలిచిన అడవి అందాలు...!
     తరచి తరచి చూశామా...
     కనగలం కళాత్మక రూపాలు..
     ఆకులా అవి !.
     చిత్రకారుడు గీసిన ఆకృతులా..!
     హరితవర్ణాన మెరిసిపోతూ...
     ముద్దులొలుకుతూ ఆ పత్రదళాలు !
     పసుపువన్నెతో విచ్చుకున్న 
     ఆ చిన్ని చిన్ని పూరేకలు !!
     పరిమళభరితాలు కాకున్ననేమి...
     పాదచారులు ప్రకృతి ప్రేమికులైన
     ఇట్టే నిలబెట్టే మనోహర దృశ్యాలవి !!
     మదిని సృజన ఉంటే చాలదా...
     కవితాఝరులు పొంగిపొరలవా !
     కాగితాలపై భావగీతాలుగ మారవా !!
     పిచ్చిమొక్కలు కావవి....
     అలలు అలలుగా కదులుతూ 
     భూమాతచే  లాలించబడుతున్న 
     పసిపాపలు !! దేవుని సృష్టిలో  
     తిరుగులేని భాగస్వాములు !!

🌲🌵🌴🌳🌿☘️🌲🌵🌳🌱🌲🌵🌿🌲🌴🌳

     
     


Thursday, May 15, 2025

నీలాల నింగిలో తిరిగేటి జాబిల్లి నింగికేమిస్తుంది ఓలి?

                                         ~ యం. ధరిత్రీ దేవి

 ప్రేమతో తమకుతామే ఇష్టపూర్వకంగా ఎదుటివారికిచ్చేది 'కానుక'. పీడించి, బలవంతంగా తీసుకునేది కానుక ఎలా అవుతుంది? కట్నకానుకలనేవి పరస్పరం ప్రేమాభిమానాలతో ఇచ్చిపుచ్చుకునేవిగా ఉండాలి.  అంతేగానీ మనసుల్ని గుచ్చేలా ఉండకూడదు.  ఈ అంశం గురించి కాసేపు ---
 అదనపు కట్నం కోసం భార్యను వేధించి చివరికి హత్య చేసిన ఓ భర్తకు ఉరి శిక్ష విధించారంటూ కొద్దిరోజులక్రితం ఓ వార్త వచ్చింది. హత్యానంతరం మూడు సంవత్సరాలకు ఈ తీర్పు ఇచ్చారంటూ కథనం !
  పెళ్లయి మూణ్ణెళ్లు తిరక్కుండానే అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు హింసిస్తూ కోడల్ని పుట్టింటికి తరిమేశారంటూ ఒక చోట, ఇద్దరు పిల్లల తల్లిని కట్నం కోసం వేధిస్తూ తల్లిదండ్రుల వద్దకు పంపారంటూ మరో ఘనుడి ఘనత గురించి మరోచోట! వరుసగా ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావని దూషించి, వారి ఖర్చులు పుట్టింటి వారే భరించాలంటూ ఇంటి నుంచి గెంటేసిన భర్త-- అంటూ ఇంకోచోట !  ఇలా రకరకాల వార్తాకథనాలు ! ప్రదేశాలు వేరైనా దాని అంతర్లీన సారాంశం ఒక్కటే !
  వరకట్నమే  నేరమని ప్రభుత్వం నిషేధిస్తే, మరి ఈ అదనపు కట్నం గోలేమిటి? సంసారమనే బండికి భార్య, భర్త రెండు చక్రాల వంటివారు అంటారు . రెండూ సజావుగా సాగితేనే బండి కదులుతుంది అంటారు.. భర్తలో సగం భార్య అనీ, జీవితభాగస్వామి అనీ అంటారు. కష్టసుఖాల్లో ప్రతిక్షణం భాగం పంచుకునే అలాంటి ఇల్లాలికి ఎంత విలువ ఇవ్వాలి! ఎలా గౌరవించాలి! 
  పెళ్లి తర్వాత పుట్టి పెరిగిన ఇంటినీ, ఊరిని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రుల్నీ వదలిపెట్టి, ముక్కూ మొహం తెలీని ఓ మగాడి  చేయిపట్టుకుని అమాయకంగా అతని వెంట నడిచి మరో ఇంటికి ఓ ఆడపిల్ల తరలివెళ్తోందంటే కేవలం అతని పై నమ్మకం! అన్ని వేళలా తనకు తోడునీడగా, రక్షణగా ఉంటాడన్న కొండంత నమ్మకం! ఆ భరోసా ఆమెకు కల్గించడం భర్తగా అతని  బాధ్యత. ఒకప్పుడైతే కుటుంబ విలువలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. చిన్న వాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్లు సర్ది చెప్పేవాళ్లు. కానీ, కాలక్రమేణా విలువలన్నవి పతనావస్థకు చేరుకుని మనుషుల్ని దిగజార్చేశాయి. 
  భార్య అంటే ఏమిటో  ఓ చక్కటి నిర్వచనం ఓ చలనచిత్రంలో బహు చక్కగా తెలియజేశారు.
* కొడుకన్న వాడికి కష్టం వస్తే అతని కోసం తల్లీ, తండ్రి, తోబుట్టువులు బాధపడటం, విపరీతంగా ఆవేదన చెందడం అత్యంత సహజం. ఎందుకంటే వారి మధ్య రక్త సంబంధమన్నది ఉంటుంది కాబట్టి. కానీ, ఏ సంబంధం లేకుండా తనతో మూడుముళ్ల బంధం మాత్రమే ఉన్న మనిషి భర్త అన్న వాడికోసం బాధపడ్డం, అతనితోనే తన జీవితం అనుకోవడం,  తన సర్వస్వం  ధారపోయడమన్నది చాలా గొప్ప విషయం! అదే భార్య అంటే!" 
నిజంగా ఎంత గొప్పగా చెప్పారు భార్య స్థానం గురించి! 
   అలాగే -- వరుసగా ఆడపిల్లల్ని కన్నదని భార్యను పుట్టింట్లో దిగబెట్టిన ఓ బావగారితో అంటాడు ఓ బావమరిది, 
* నీకు జన్మనివ్వడానికి ఓ ఆడది కావాలి. నీకు భార్యగా  ఓ ఆడది కావాలి. నీకు తండ్రి హోదా ఇవ్వాలంటే మళ్ళీ ఓ ఆడదే కావాలి. కానీ నీ కూతురిగా మాత్రం ఆడపిల్లవద్దా"
   -- సిగ్గుతో తలవంచుకుంటాడా బావగారు. 
  ఎన్ని సినిమాల్లో ఎన్ని సందేశాలిచ్చినా మారుతున్నారా  జనాలు! ఎన్ని చట్టాలు, శాసనాలు చేసినా మారుతున్నారా? ఎవరి ధోరణి వారిదే ! 
  ఇంతకీ, ఈ అదనపు కట్నం ఎలా పుట్టుకొచ్చిందో ఆలోచిస్తే ఒకటే బోధపడుతుంది. పెళ్లి సమయంలో ఇచ్చినది  వారికి సరిపోయినట్లు అనిపించకపోయినా లేక ఇతరులతో పోల్చుకున్నా కొన్ని అసంతృప్తులు బయలుదేరుతాయి వారిలో. ఫలితంగా, అసహనంతో అదంతా భార్యమీద చూపించడం మొదలెడతారు. ఆమె స్థానానికున్న విలువ, ప్రత్యేకత తెలిసినా కట్నకానుకల కోసం వేధించడం, హింసించడం, హతమార్చడం చేస్తున్న కొందరి అమానుష ప్రవర్తన ఎంత హేయమైన చర్య!  నేటి సమాజంలో ఇలాంటి వారి శాతం పెరిగిపోవడానికి కారణమేమిటి? 
   పూర్వం పెళ్లయిన కొత్త జంటకు అవసరాల కోసమై కొంత పైకం, వస్తు సామాగ్రి అమ్మాయి తరపు వారు తమకు తాముగా ఇష్టపూర్వకంగా ఇవ్వడం మొదలైనదని చెప్తూ ఉంటారు. అదే క్రమక్రమంగా కాలక్రమేణా ఓ  ఆచారమై రాన్రానూ  ఓ దుష్ట సాంప్రదాయంగా రూపాంతరం చెంది ఇలా ఆడపిల్లల పాలిటి శాపంగా పరిణమించిపోయింది. ఇరు కుటుంబాలవారూ ఇష్టపూర్వకంగా ఏ బలవంతం లేకుండా కట్నకానుకలు ఇచ్చుకునేవాళ్లు లేకపోలేదు. పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఎంతో సఖ్యంగా, సంస్కారయుతంగా ఉండే కుటుంబాలూ ఉంటున్నాయి, కానీ అలాంటి వారి శాతం బాగా తగ్గిందని చెప్పక తప్పదు.
   పూర్వం కన్యాశుల్కం ( ఓలి  ) పేరిట ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి ముక్కుపచ్చలారని బాలికల్ని వయసు మీరినవారు  వివాహం చేసుకునేవారట ! అమ్మాయికి  కట్నం ఇచ్చినా, అబ్బాయికి కట్నం ఇచ్చినా -- అప్పుడూ, ఇప్పుడూ అమ్మాయే బలి  పశువు  కావడం గమనార్హం !  
    అప్పట్లో ఆడపిల్లలకు చదువే అవసరం లేదనీ,  పెళ్లయ్యాక మొగుడనే వాడికి ఓ ఉత్తరంముక్క రాసుకునే పాటి అక్షరజ్ఞానం ఉంటే చాలనీ ఆడపిల్లల్ని ఇంటికే పరిమితం చేయడం జరిగేది.ఆడపిల్లకు వంటా వార్పు వస్తే చాలని అనుకునే రోజులవి. కాలక్రమేణా స్త్రీవిద్య ప్రాముఖ్యత పెరిగిపోయి ఉన్నత చదువులు చదవడమే గాక అమ్మాయిలూ ఉద్యోగాల కోసం గడప దాటే రోజులు వచ్చేశాయి. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు కూడా వెలిశాయి. తల్లిదండ్రుల్లో కూడా గణనీయంగా మార్పు వచ్చి కొడుకులతో సమానంగా కూతుళ్లను కూడా  చదివించడం మొదలైంది. అంతవరకు బాగానే ఉంది. ఈ మార్పు అభిలషణీయమూ, సంతోషదాయకము కూడాను.
    కానీ అందువల్ల కొత్త చిక్కులు చాప కింద నీరులా వచ్చేసి, దరిమిలా అమ్మాయిల పెళ్లిళ్లు సమస్యగా మారిపోయాయి. ఒకప్పుడు అంతగా చదువు లేని ఆడపిల్లలకు ఏదో గంతకు తగ్గ బొంత అని సంబంధాలు ఖా చేసుకొని చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేసి బాధ్యత దించేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమో బాగా చదివిన అమ్మాయిలకు  అంతకంటే పెద్ద చదువు చదివిన లేదా కనీసం సమానంగానయినా చదివిన అబ్బాయిని వెతకడం పెద్ద సమస్య అయి కూర్చుంది. పైగా, ఎంత చదివించినా, ఉద్యోగాలు చేస్తూ సంపాదనాపరులైనా కట్నాలు మాత్రం అమ్మాయిలకు ఇచ్చుకోవాల్సిందేనన్న సంప్రదాయం జనాల నరనరానా జీర్ణించుకుపోయి ఉండనే ఉంది!!
   ఓవైపు చదివించడానికి ఖర్చు, మరోవైపు వరకట్నాల ఖర్చు, అది చాలదన్నట్లు పెళ్లి ఖర్చు... తడిసి మోపెడై ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది అంటే అతిశయోక్తి కానే కాదు. కొందరైతే ఎందుకు చదివించాంరా బాబు వీళ్ళని... అనుకునే దుస్థితిలో కూడా పడిపోతున్నారు. ఇవన్నీ అక్షర సత్యాలు అంటే నమ్మితీరాలి.
     మరోవైపు...మగ పిల్లలకు పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదంటూ సర్వే నివేదికలు !! అందులో నిజమెంతో ప్రస్తుత సమాజపోకడ క్షుణ్ణంగా  గమనిస్తే పరిస్థితి అవగతమవుతుంది. అమ్మాయిలు కూడా తమ స్థాయికి తగిన సంబంధం కుదిరే వరకు వేచి చూడడంతో వివాహ వయస్సు దాటిపోతోంది...అది మరో సమస్య! తల్లిదండ్రులకే కాదు అమ్మాయిలకు కూడా...!! 
 ఇంతకీ--- అసలు విషయానికొస్తే..ఈ కట్నమన్నది వరునికి ఎందుకు ఇవ్వాలి? 
 భార్యవిలువ తెలిసీ సంప్రదాయాల పేరిట ఈ ఆచారాలు ఎందుకు కొనసాగాలి ? ఇద్దరూ సమానమే అయినప్పుడు, సంసారరథానికి ఇద్దరూ అవసరమే అయినప్పుడు పెళ్లి సమయంలో స్త్రీయే ఎందుకు కట్నమివ్వాలి? ఇది ఏ ఒక్కరి ప్రశ్నో కాదు, అనాదిగా ఎందరో...ఎందరెందరో స్త్రీల ఆవేదనతో కూడిన ప్రశ్న. 
  ఎప్పుడో, ఎన్నో ఏళ్ళ క్రితం రేడియో లలిత సంగీతంలో విన్న ఓ పాట ఈ సందర్భంగా తలపుకొస్తోంది. ఈ పాటను గమనిస్తే, ఏళ్లకు ఏళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు ఎంత మాత్రమూ రాలేదని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఆలోచించండి...

               " నీలాల నింగిలో తిరిగేటి జాబిల్లి 
                  నింగికేమిస్తుంది ఓలి...
                  బ్రతుకులో వెన్నెలై వెలిగేటి మగనాలి 
                  ఎందుకివ్వాలి ఓలి...?!
  ------------------------------------------------------------------
 
                   






  






 





Tuesday, May 13, 2025

ఉన్నోళ్లు పోయినోళ్ల తీపి గురుతులు...

                                  యం.ధరిత్రీ దేవి    


     తల్లి గర్భంలో జీవం పోసుకున్న ప్రాణి జన్మించిన పిదప క్రమక్రమంగా ఎదుగుతూ, ఆ జీవనగమనంలో ఎన్నో సాధిస్తూ చివరకు ఏదో ఒక రోజు ఆ జీవమన్నది ( అదే ప్రాణమన్నది ) తన దేహం నుండి వేరై ఆ దేహం నిర్జీవంగా మారిపోతుంది.

  ప్రాణానికి ఇంత విలువ ఉందా! అది ఉన్నంత వరకేనా మనిషి మనుగడ ! ఆ తర్వాత ఎంతటి వారలైనా కాటికి చేరాల్సిందేనా !

* మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ! ఈ పేరు వినని వాళ్లు ఏ తరంలోనైనా ఉంటారా? ఓ బక్కపలుచని వ్యక్తి కొల్లాయి గట్టి కనీసం వంటిమీద చొక్కా అయినా లేకుండా అతి నిరాడంబరంగా కనిపిస్తూ అందర్నీ తన కనుసన్నల్లో నిలుపుకుని మొత్తం భారతావనికే తలమానికంగా నిలిచిన ఓ మహామనీషి! భరతమాత దాస్యశృంఖలాలను తెంచాలన్న దృఢ సంకల్పంతో సకల జనావళినీ తన వెన్నంటి నడిచేలా చేయగలిగిన ధీశాలి. స్వాతంత్ర్యం సాధించి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టే దాకా నిద్రించని పట్టువదలని నిత్య శ్రామికుడు! 

 అంతటి మహోన్నత వ్యక్తి చివరకో తూటాకు బలై నేలకొరిగి ప్రాణమన్నది అనంత వాయువుల్లో కలిసిపోయి అచేతనుడై పోయాడు. యావత్తు దేశాన్ని తన వెంట నడిపించిన ఆ మహోన్నత వ్యక్తి దేహం నిర్జీవమై పోయి పిడికెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోయింది. ప్రాణం ఉన్నంత వరకు అంతటి శక్తివంతమైన ఆ కాయం అది కాస్తా మాయమవగానే కూలిపోయింది ! ఇంతకూ ఆ ప్రాణమన్నదెక్కడ? 

* ఇందిరాగాంధీ. ధీరవనిత! శక్తివంతమైన మహిళ! మేధోసంపత్తి, చాకచక్యం పుష్కలంగా కలిగి దేశ ప్రధానిగా తిరుగులేని విధంగా భాసిల్లి 'ఇందిర అంటే ఇండియా' అన్న విధంగా కీర్తింప బడ్డ అద్వితీయ నారీమణి! చక్కటి చీర కట్టుతో, ఒత్తయిన తలకట్టుతో ఎంతో హుందాగా కనిపించే ఇందిరమ్మ కంచే చేను మేసిన రీతిని  తన ఇంటి ప్రాంగణంలో అండగా నిలవాల్సిన అంగరక్షకుల తూటాలకే బలై పోయింది. దేశాన్ని తిరుగులేని విధంగా ఏలిన ఆ గొప్ప మహిళ కూడా ప్రాణం దేహాన్ని వీడగానే ఒక్కసారిగా ఆమె జీవనయానం స్తంభించిపోయి నిస్సహాయురాలై పోయింది. 

* చక్కటి రూపం, అంతకుమించిన అద్భుత నటనా కౌశలం, గంభీరమైన స్వరం -- ఆయన సొంతం. పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు. భీష్ముడు ఆయనే! ఇంకా ఇంకా ఎన్నో సాంఘిక చిత్రాల్లోని పాత్రల్లోనూ జీవించిన నందమూరి తారక రామారావు అశేష తెలుగు ప్రజానీకానికి ఆరాధ్య దైవం. రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రిగా వెలుగొంది కాలిడిన ప్రతీ రంగంలో తనకు తానే సాటి అనిపించుకున్న కారణజన్ముడు! అంతటి ధీరోదాత్తచరిత ప్రాణం ఉన్నంత వరకే!-- ప్రాణం అంటే ఏమిటి? 

* ఒకటి కాదు, వంద కాదు, వెయ్యి కాదు --ఏకంగా నలభై వేల పాటలు --అదీ పదహారు భాషల్లో పాడిన ఘనత సాధించి రికార్డు సొంతం చేసుకుని 'గానగంధర్వుడి' గా కీర్తింపబడ్డ ఎస్. పి. బాలసుబ్రమణ్యంగారు..ఏరీ, ఎక్కడ? నిండైన ఆ విగ్రహం, చిరునవ్వులు చిందించే ఆ మోము, గళం విప్పితే చాలు  జాలువారే మధుర గీతాలు, పెదవి విప్పితే చాలు అనర్గళంగా సాగిపోయే ఆ వాక్ప్రవాహం.. అన్నీ ఎక్కడ? జీవం కోల్పోయి అలా  గాజుపెట్టెలో అచేతనంగా !! తేనెల వానలు కురిపించే ఆగళం, ఆ పెదవులు నిర్జీవంగా...! ప్రాణం లేనందుకేగా!

  దేహంలో ప్రాణమన్నదానికి ఇంతటి ప్రాధాన్యత ఉందన్నమాట! అది వీడిన మరుక్షణం దేహానికి విలువ లేదు. మట్టిలో కలిసి పోవాల్సిందే. ఊపిరి ఉన్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు, బాధలూ, బాధ్యతలూ --- అది కాస్తా ఆగాక అంతా శూన్యం, శూన్యం. 

  ఏమిటీ, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, సెలబ్రిటీల గురించే చెబుతున్నావు, వాళ్లంతా జగమెరిగిన వాల్లనా ! నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటేమిటి?  వాళ్లు సెలబ్రెటీలు కారా? 

 ఎంత మాట! ప్రతీ వ్యక్తికీ అమ్మ నాన్నలను మించిన వారెవరుంటారు? 

గుడ్లురిమినా నీపైనే 

గుండెలకదుముకున్నా నిన్నే  --- అనే అమ్మ 

వేలెడంత వయసు నుంచీ 

వేలు పట్టి నడిపించి 

లోకం చూపించి, లోకజ్ఞానం 

తెలిసేలా చేసి, విలువలు నేర్పించి 

దారి చూపిన నాన్న !

--- మేము లేకున్నా ఇక నీవు బ్రతుకు బాటలో నిర్భీతిగా  సాగిపోగలవులే -- అన్న భరోసా వచ్చాక నిష్క్రమించిన ఇరువురూ కట్టెల్లో కట్టెగా మారి కాలిపోతున్న క్షణాన చూడలేక తల తిప్పుకున్న క్షణాలు ఇప్పటికీ గుర్తే ! 

  ఇంతకీ నేచెప్పాలనుకున్నది దేహంలో ఈ ప్రాణం గురించి--

 అసలు ప్రాణం అంటే ఏమిటి?  ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు మరణం ఉండదంటారు. మనిషి మరణించాక శరీరం నుండి ఆత్మ వేరై పోతుంది అనడం వింటుంటాం. అయితే దానికి మరణం తర్వాత తన భౌతికకాయానికి జరిగే తతంగాలన్నీ తెలుస్తూ ఉంటాయా?  ఇవన్నీ వేధించే ప్రశ్నలే. జవాబులు మాత్రం దొరకడం లేదు. 

     ఏది ఏమైనా...పుట్టిన ప్రతివారూ గిట్టక తప్పదు. ఈ గీతాసారం వంటబట్టించుకుంటే బాధ అన్నది ఉండదు... అంతే కదా!! 'కరోనా' ఉదృతంగా ఉన్న రోజుల్లో ఎందరో ప్రముఖులతో పాటు మనకు బాగా దగ్గర బంధువులు, ఆప్తమిత్రులు కూడా దూరమైపోయారు. కొందరైతే కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఇప్పటికీ తేరుకోలేని స్థితిలో కుమిలిపోతుండడం చూస్తూనే ఉన్నాము. గుండె దిటవు  పరుచుకోవాలి, తప్పదు. 

    అలాగే...మరణం అన్నది ఏ రూపంలో ఎప్పుడు వచ్చినా విధివిలాసమే ! కొందరు ఎంతో చేరువగా వచ్చి అనతికాలంలోనే అంతులేని ఆత్మీయతను పంచి, అకస్మాత్తుగా కనుమరుగై పోతూ ఉంటారు. కానీ, వారితో గడిపిన క్షణాలు, అనుభూతులు జ్ఞాపకాల రూపంలో ఎప్పటికీ అలా నిలిచే ఉంటూ ఆ స్నేహ బంధాలను గుర్తుకు తెస్తూనే ఉంటాయి. ఆ విధంగా  మనుషులు కనుమరుగైనా ఆ మనసు పంచిన జ్ఞాపకాల తడి మాత్రం ఆరదు. అందుకేనేమో మనసుకవి ఆచార్య ఆత్రేయ గారు ఎప్పుడో రాసేసి, అందరి మనసుల్ని ఆర్ద్రతతో నింపేశారు...!

      మనిషి పోతెమాత్రమేమి మనసు ఉంటది

      మనసు తోటి మనసెపుడో కలిసిపోతది 

      సావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది 

      జనమ జనమ కది మరీ  గట్టిపడతది 

      పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు 

      ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపిగురుతులు..

ఈమాటలు ఎప్పటికీ మాసిపోనివి...మరణం లేనివి 

                           ________________

 



    



Saturday, May 10, 2025

ఎవరు ? ఎవరామె ?!

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

🤱
                          ~ యం.ధరిత్రీ దేవి ~

     బిడ్డ బోసినవ్వుకు 
     పులకరిస్తుంది..
     తప్పటడుగులనాడు 
     పరవశిస్తుంది...
     తప్పుటడుగులు 
     సవరిస్తుంది...
     ఎవరు ? ఎవరామె ?

     పరులు తన పిల్లల్ని 
     పల్లెత్తు మాటన్నా పడదు..
     పోట్లాడుతుంది...
     వెన్నుదన్నుగా నిలబడుతుంది

     తన ఆకలి ఎరుగనిది...
     తన పిల్లల కడుపులు నింపేది...
     తన ఆశల పునాదిపై 
     వారి కలల సౌధం నిర్మించేది !!

     చేవగలిగినన్నాళ్లు సేవకు 
     సిద్ధమంటుంది..
     వయసుడిగిననాడు
     మాటలు పడుతుంది... 
     మౌనంగా రోదిస్తుంది 

     ఎవరు  ?  ఎవరామె  ?
     త్యాగానికి ప్రతిరూపం...
     నడిచే వెన్నెల దీపం...
     ఇలపై 'అమ్మ' కాక  
     ఆమె మరెవరు ?    🤱

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
                               11.5.2025
      అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

గుర్తించి గౌరవిద్దాం...

                         ~యం. ధరిత్రీ దేవి

 అహరహం శ్రమించే అమ్మలు 
 అలుపెరుగని శ్రమజీవులు...
 స్వార్థం ఎరుగరు..అంతటి అమాయకులు!
 పిల్లలే ప్రపంచమనుకునే ప్రేమమూర్తులు 
 
 కర్మాగారాల్లో పనిచేస్తేనే శ్రామికులా..
 కుటుంబం కోసం నిరంతరం కష్టించే 
 గృహిణులు కారా శ్రామికులు!గుర్తింపు ఎక్కడ?
 ఆ శ్రమజీవి చిందించే చెమటకు..!
 
 ధన్యజీవులని పొగడ్తలు!
 త్యాగమూర్తులని బిరుదులు!!
 ఇవన్నీ బయట వినపడే నోటి మాటలు..
 నిజానికి..వాస్తవ దూరాలు..

 ప్రతిఫలం ఆశించని అమ్మలు..ఇంటిల్లిపాదికీ
 అందించే సౌకర్యాలు వెలకట్టగలరా!
 ఊహకు అందదు ఆ మొత్తం..అవగలదు
 మనిషన్నవాడు మోయలేనంత !! 

 సింహాసనం కోరదు.. కిరీటం ఆశించదు..
'అమ్మ' ఆమె!అన్నింటా సమర్థురాలు...
 జీతభత్యాలు లేని ఇంటి దేవత! ప్రేమిద్దాం..
 గుర్తించి గౌరవిద్దాం..అదే ఆమెకు అద్భుతమైన
 మాతృదినోత్సవ బహుమానం 
  


Monday, May 5, 2025

కార్మికులంటే... శ్రామికులేనా..!!



    పురాణగాథలు మార్చాయి 
    కొన్ని రోజుల్ని ఇంటికి  పర్వదినాలుగా...
    జాతీయ సంఘటనలు 
    కొన్ని మారాయి సమాజానికి
    పర్వదినాలుగా...అయితే...
    కొందరు మహనీయులు చిందించిన రక్తం 
    చారిత్రాత్మక రోజుగా మారిన 
    చైతన్యదినం..అదే మే డే !!
   "ప్రపంచ కార్మికులారా ఏకం కండి "
    కార్ల్ మార్క్స్ ఈ నినాదం 
    ప్రపంచ గమనాన్ని శాసించిన దినం!!
    కార్మికులంటే కర్మాగారాల్లో పనిచేసే 
    శ్రామికులేనా! అంటూ 
    ప్రశ్న ఉదయించిన మహత్తరక్షణం!                
    సమాజం కోసం చెమటోడ్చే వారు
    నిరంతర శ్రమజీవులు...
    కానేకాదు యంత్రాలు..ఇనుప పనిముట్లు...
    శక్తికీ పరిమితులు ఉంటాయి...   
    రోజులో.. పని..విశ్రాంతి..వినోదం..
    విభజనకై మొదలైన ఆ పోరాటం
    గెలిచి నిలిచిన దినం..అది మే డే!!
    అదే..అంతర్జాతీయ కార్మికదినోత్సవం 
    శ్రమైక జీవన సౌందర్యం 
    వెల్లి విరిసిన సుదినం !!
    కార్మిక లోకానికి పర్వదినం!!

                         ~ ధరిత్రీ దేవి
      
    






  

అమ్మకు వందనం... కథ

  

అందరికీ వందనం 🙏

 'విహంగ'  (మే నెల 2025)  అంతర్జాల మాసపత్రికలో మదర్స్ డే సందర్భంగా నా కథ...

 'అమ్మకు వందనం' ప్రచురించబడినది. వీక్షించగలరు. 



Friday, May 2, 2025

మండే ఎండల్లో మల్లెల సౌరభాలు !


            ~ యం. ధరిత్రీ దేవి ~
************************
వేసవి  వచ్చింది 
ఎండల్ని తెచ్చింది 
మల్లెల్ని ఇచ్చింది !
ముడుచుకున్న ఆకులన్నీ  
విప్పారినవి 
పండుటాకులు రాలి 
పచ్చని చివుళ్లు 
పలుకరిస్తున్నాయి 🙂
ఇన్నాళ్లూ ఎక్కడ 
దాక్కున్నాయో మరి !!
నిద్రించిన కొమ్మలు 
ఒక్కసారిగా మేల్కొన్నాయి !
అదిగో, మొదటి మొగ్గ  !!
విచ్చుకుంది మరునాటికి !
కనురెప్ప పాటులో 
కనువిందు చేస్తూ... 
కొమ్మకొమ్మనా చిట్టి మొగ్గలు !
చిరు నవ్వులు చిందిస్తూ... 
చెట్టంతా...విరిసిన మల్లెలు 
వారం గడిచేసరికి  !
నింగిని పరుచుకున్న 
నక్షత్రాల మాదిరి !!
పరిమళభరితాలు 
మల్లెలు...సన్నజాజులు 😊
ఋతురాగాలకు స్పందించే 
శ్వేతవర్ణ కుసుమాలు !
మండే ఎండల్లోనే కదా 
ఈ మల్లెల గుభాళింపులు !
ఆస్వాదించాలంటే
స్వాగతించాలి మరి 
వేసవి వడగాడ్పుల్ని  !! 
అందుకే...
వేసవి రావాలి 
ఎండల్ని తేవాలి 
మల్లెల్ని మనకివ్వాలి  🙂🙂
**************************
                 
                

Thursday, April 24, 2025

పుస్తకం... నా ప్రియ నేస్తం...

.                                          
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                                            ~ యం. ధరిత్రీ దేవి 
   పుస్తకం నా ప్రియ నేస్తం...
   నాకు ప్రాణప్రదం...
   అలసిన వేళ సేదదీర్చే ఔషధం
   ఒంటరినైన...ఊరడించే నెచ్చెలి...
   తెరిస్తే చాలు... అక్షరాలు కావవి...
   అనంత కోటి ఆలోచనలు 
   కొలువుదీరిన కూటమి...!
   మేధావుల కలం నుండి జాలువారి
   చెక్కుచెదరక నిలిచిన 
   అక్షర శిల్పాలే మరి...!!
   అలరిస్తూ..మురిపిస్తూ ఒకసారి...
   నవ్విస్తూ..విషాదంలో ముంచేస్తూ
   మరోసారి... అంతలోనే...
   ఓదారుస్తూ.. నిద్రాణమైన శక్తిని 
   తట్టిలేపుతూ.. బద్ధకాన్ని వదిలిస్తూ...
   గమ్యం చూపిస్తూ.. ఆగకుమా 
   సాగిపొమ్మంటూ..వెన్నుతడుతూ 
   ముందుకు తోసే స్ఫూర్తిప్రదాతలు 
   ఆ అక్షర దీపాలు...!!
   హస్తభూషణం కాదు పుస్తకం...
   మస్తిష్కాన్ని మధించే 
   మహిమాన్విత ఉపకరణం..
   ఉజ్వల భవితకు సోపానాలు 
   వేసే ఉత్తమోత్తమ సాధనం...!
   విజ్ఞాన వినోదాల భాండాగారం...
   కాలక్షేపం కలగలసి..లభ్యం..
   మానసికోల్లాసం...!
   పుస్తకపఠనం..మెదడును
   పదును పెట్టే ఇంధనం...
   కావాలి దినచర్యలో అదో భాగం..
   నూతనోత్తేజానికి పడుతుందపుడే బీజం!!
   అందుకే... పుస్తకం నా ప్రియనేస్తం..
   నాకు ప్రాణప్రదం...!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








Thursday, April 17, 2025

ధన్యవాదాలు

 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

 అందరికీ నమస్కారం 🙏. 2020 వ సంవత్సరం 
( 20.4.2020 ) ఇదే రోజు బ్లాగు మొదలుపెట్టాను. ఇప్పటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయినాయి. క్రమం తప్పకుండా రాయడం అలవాటైపోయింది.అదో మంచి అలవాటు అలవడింది. నా ఆలోచనలు నలుగురితో పంచుకోవడానికి సరైన వేదిక లభించినందుకు సంతోషంగానూ ఉంది. నేనొక కవితగానీ, కథగానీ, వ్యాసంగానీ మరే రచనగానీ రాస్తే ఓ పదిమంది చదివినా చాలనుకుని మొదలెట్టాను. అనూహ్యంగానే వీక్షిస్తున్నందుకు సంతృప్తిగానూ ఉంది. ఇలాగే ఈ పయనం కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు  🙏 మరియు ధన్యవాదాలు.

                                               ~ యం. ధరిత్రీ దేవి      

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐   

Tuesday, April 15, 2025

ఇదీ పరిష్కారం...కథ

 
                                  ~యం. ధరిత్రీ దేవి   
    
      "సౌమ్యా, ఇంకా ఏం చేస్తున్నావ్?"
 లాంగ్ బెల్లయి పది నిమిషాలైనా ఇంకా రాని సౌమ్య కోసం వెతుకుతూ  ఉన్న దుర్గకు క్లాస్ రూములో డెస్క్ మీద తలవాల్చి కూర్చున్న సౌమ్య కనిపించడంతో గట్టిగా పిలిచింది. తలెత్తి చూసింది గానీ సౌమ్య అక్కడినుంచి కదల్లేదు.
" ఏమిటి సౌమ్యా? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆర్ యూ ఓకే!"
 తనే లోనికి వెళ్లి సౌమ్య భుజం మీద చేయి వేసి కుదిపింది దుర్గ. లేచి నిలబడి, బ్యాగ్ తగిలించుకుంటూ,
"ఆ, ఓకే పద.."
 అంటూ కదిలింది సౌమ్య. కానీ దుర్గకు ఎందుకో సౌమ్య మామూలుగా లేదనిపించింది. బాగా ఏడ్చినట్టు మొహమంతా అదోలా ఉంది. మరీ బలవంతం చేస్తే బాగోదని దుర్గ తనతో కలిసి బయటకు దారితీసింది.
   అదో గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల. రెండంతస్తుల పాత భవనం. అందులో దుర్గ, సౌమ్య సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. దుర్గ హెచ్ఈసి గ్రూపు. సౌమ్య బైపీసీ గ్రూపు. ఇద్దరూ లాంగ్వేజ్ క్లాసుల్లో కలుస్తూ ఉంటారు. ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్. కానీ కొన్ని రోజులుగా సౌమ్య 'మూడీ'గా ఉండడం దుర్గ గమనిస్తూనే ఉంది. సౌమ్య స్వతహాగా చాలా నెమ్మదైన అమ్మాయి. ఎక్కువగా మాట్లాడదు. కానీ చదువులో చురుగ్గా ఉంటూ క్లాసులో మొదటి ఐదుగురిలో ఒకదానిగా ఉంటూ ఉంటుంది. దుర్గ స్వభావం పూర్తిగా విరుద్ధం. అందరితో గలగలా మాట్లాడుతూ అల్లరి కూడా బాగానే చేస్తూ ఉంటుంది.
" ఏమిటో, సౌమ్య ఇలా ఉండటం నాకు బొత్తిగా నచ్చడం లేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమో ఏమో..!"
 లోలోపల అనుకుంటూ కదిలింది దుర్గ.
                         **********
   వారం గడిచింది. సంవత్సరాంత పరీక్షలకు ముందు జరిగే ప్రిపరేషన్ పరీక్షలకు టైంటేబుల్ ఇచ్చారు. చివరి సంవత్సరం..పైగా పబ్లిక్ ఎగ్జామ్స్.. అందువల్ల లెక్చరర్స్ అంతా స్టూడెంట్స్ ను ప్రిపేర్ చేయడంలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులు అంటూ, స్టడీ అవర్స్ అంటూ తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారంతా.
   ఆరోజు శనివారం. సోమవారం నుండి పరీక్షలు మొదలు. క్లాసులన్నీ అయిపోయి, అమ్మాయిలంతా బిలబిలమంటూ క్లాసుల్లోంచి బయటపడ్డారు. తన క్లాసులో నుంచి ముందుగా బయటికి వచ్చిన దుర్గ సౌమ్య కోసం చూస్తూ నిలబడింది. కాసేపటికి వచ్చిన సౌమ్య,
" దుర్గా, నువ్వు వెళ్ళవే. నేను అర్జంటుగా టాయిలెట్స్ కి వెళ్ళాలి  "
అంది దుర్గతో.
, " సరేలే వెళ్లిరా. నేను వెయిట్ చేస్తూ ఉంటా బయట. త్వరగా వచ్చెయ్  "
 అంటూ వెళ్లబోయి,
"...అదేంటి సౌమ్యా పైకి వెళ్తున్నావ్, ఇక్కడే ఉన్నాయిగా టాయిలెట్స్..?"
 అప్ స్టైర్స్ వైపు వెళుతున్న సౌమ్యను ప్రశ్నించింది దుర్గ. తిరిగి చూడకుండానే,
" ఇక్కడ వాటర్ రావడం లేదులే దుర్గా "
 అనేసి పైకి దారి తీసింది సౌమ్య.
" అలాగా" అన్న దుర్గకు వెంటనే గుర్తొచ్చి,అదేంటి, ఇందాకే నేను వెళ్ళొచ్చాను, బాగా వస్తున్నాయే నీళ్లు..! అనుకుంటూ వెనుతిరగబోయిన ఆ పిల్లకు ఠక్కున ఏదో స్ఫురించి, మళ్లీ తిరిగి చూసింది. అప్పటికే పైకి వెళ్ళిపోయింది సౌమ్య. గుండె ఆగినంత పనైంది దుర్గకు . వెంటనే అప్ స్టైర్స్ వైపు పరిగెత్తింది. సౌమ్య బిల్డింగ్ టెర్రస్ మీద చివరికి గబగబా పరుగు లాంటి నడకతో నడుస్తూ పోతోంది. మరుక్షణంలో దూకేసేదే! శక్తినంతా కూడా తీసుకొని దుర్గ పరుగున వెళ్లి ఒక్క ఉదుటున సౌమ్యను చేయి పట్టి లాగేసింది. ఊహించని హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కింద పడిపోయింది సౌమ్య. అయినా వెంటనే లేచి,దుర్గ చేయి విడిపించుకొని ముందుకురకడానికి ప్రయత్నించింది. కానీ దుర్గ రెండు చేతులతో గట్టిగా సౌమ్యను వాటేసుకుని,
" బుద్ధుందా నీకు, ఏమిటీ పిచ్చి పని!!"
" దుర్గా, నన్ను వదిలేయ్ ప్లీజ్ "
" అసలేం జరిగింది? ముందు నాకు చెప్తావా లేదా? "
 అక్కడే కూలబడిపోయి,దుర్గను వాటేసుకుని  భోరున ఏడ్చేసింది సౌమ్య. మెల్లిగా ఆమె వీపు మీద తడుతూ, ఓదార్పుగా,
" ఊరుకో సౌమ్యా, ముందు ఇక్కడ నుంచి పదా, ఎవరైనా ఇక్కడ మనల్ని చూస్తే బాగోదు.. "
 అంటూ చేయి పట్టుకుని కిందికి తీసుకెళ్ళింది సౌమ్యను. అక్కడ ఎదురుగా వాచ్ మ్యాన్!
" ఏంటమ్మా ఏం చేస్తున్నారిక్కడ ? బెల్లయిపోయి ఎంత సేపయింది..! వెళ్లండి ఇక్కడి నుంచి.. "
 అంటూ అరిచాడు.
"వెళ్తున్నాం అన్నా, బుక్స్ కనిపించకపోతే వెతుక్కుంటున్నాము.. "
 అంటూ సౌమ్యతో పాటు దుర్గ బయటపడింది. పది నిమిషాల తర్వాత ఎవరూ లేని చోటు చూసుకుని ఓ చెట్టు కింద నిలబడ్డారు ఇద్దరూ. ఏడుస్తూ, సౌమ్య చెప్పిన విషయం వినేసరికి దుర్గ తల తిరిగిపోయింది. చాలా రోజులుగా సౌమ్య ముభావంగా ఉంటూ సరిగా మాట్లాడకపోవడం, పరీక్షల్లో మార్కులు కూడా తగ్గడం.. వీటన్నింటికీ కారణం ఇదన్న మాట!
  రాధాకృష్ణ ఆ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. ఇదే సంవత్సరం మొదట్లో వేరే కాలేజీ నుండి వచ్చి జాయిన్ అయ్యాడు. పాఠాలు బాగానే చెప్తాడు. ఎక్కువగా మాట్లాడడు ఎవరితో. డీసెంట్ గా కనిపిస్తాడు. అందరూ మంచివాడు అనుకునే ఈ అధ్యాపకుడి నైజం  ఇదా!!
" ఫిజిక్స్ సార్ ను చూస్తేనే భయమేస్తోంది దుర్గా. మొదటి రెండు నెలలు బాగానే ఉండేవాడు. కానీ మెల్లిగా అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించ సాగింది నాకు. కూర్చుని రాసుకుంటుంటే వెనక వీపు మీద చేయి వేయడం, భుజం మీద చేతులు వేసి మీదకు వంగి ఏదో డౌట్ క్లియర్ చేస్తున్నట్టు మాట్లాడడం...! మొదట్లో ఏదో పెద్దవాడులే అనుకొని పట్టించుకోకూడదనుకున్నా . కానీ రానురానూ ఆ చేష్టలు ఎక్కువైపోయాయి. పక్కన ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయం నన్ను మరీ బాధించసాగింది. "
 సౌమ్య చెబుతుంటే విస్తుబోయి వింటూ నిలబడిపోయింది దుర్గ. కన్నీళ్లు తుడుచుకుంటూ కొనసాగించింది సౌమ్య.
" నేను గమనించాను, నాతో మాత్రమే అలా ప్రవర్తిస్తున్న సంగతి. మిగతా వాళ్లంతా సార్ తో నవ్వుకుంటూ బాగా మాట్లాడుతుంటారు. ఎందుకు నాతోనే ఎందుకలా చేస్తున్నాడు! నాకే ఎందుకు ఇలా జరుగుతోంది!"
 ఏడుపు ఆపుకోలేక దుర్గ భుజం మీద తలవాల్చేసింది సౌమ్య .
"... ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఈ కొద్ది రోజులు ఎలాగోలా భరిద్దామనుకున్నా.నిన్న ఫిజిక్స్ క్లాస్ అయ్యాక బయటికి వస్తుంటే నన్ను దగ్గరికి రమ్మన్నాడు. ఏమిటీ, మార్కులు ఇంత తక్కువగా వచ్చాయి? అర్థం కావటం లేదా? రేపు ప్రాక్టికల్స్ అయ్యాక కాసేపు ఉండిపో. డౌట్స్ క్లియర్ చేస్తాను. అన్నాడు. మౌనంగా తలూపి వచ్చేశా. ఈరోజు ల్యాబ్ నుండి త్వరగా బయటపడదామని వచ్చేస్తున్నా. అందరూ బయటికి వెళ్లిపోయారు. ఈ లోపే వెనకగా వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని..."
 ఆపై మాటలు రాక వెక్కివెక్కి ఏడవసాగింది సౌమ్య. తనని ఎలా ఓదార్చాలో తెలియక దుర్గ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని  అనునయించసాగింది. రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.
" సౌమ్యా, వాడలా ప్రవర్తిస్తుంటే ఇన్నాళ్లుగా భరించడం పొరపాటు. ఇంకా చావాలనుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. ఇక చాలు, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాటివ్వాలి.. "
 చేయి చాపింది దుర్గ.
" లేదులే దుర్గా, ఏదో తట్టుకోలేక ఆ క్షణంలో అలా చేశాను గానీ ఇప్పుడు అనిపిస్తోంది నాకూ, అదెంత  పొరపాటో.. ప్రామిస్, ఇక ఎప్పటికీ అలా చేయను.."
దుర్గ చేతిలో చేయి వేసింది సౌమ్య.
                          ********
  మర్నాడు లంచ్ బ్రేక్ లో దుర్గ ఆలోచన ప్రకారం ఇద్దరూ వెళ్లి ఇంగ్లీష్ మేడం సాధన గారిని కలిశారు. జరిగిందంతా పూస గుచ్చినట్టు వివరించింది దుర్గ.
"వ్వాట్! రాధాకృష్ణ సర్ ఇలా చేస్తున్నాడా!అన్బిలీవబుల్. చూడ్డానికి ఎంతో మర్యాదస్తుడిలా కనిపిస్తాడే!.. "
 అంటూ సౌమ్య కేసి తిరిగి,
" ఇలా జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సమస్య చెప్పుకోవాలి. అలాకాక చచ్చిపోదామనుకుంటే ఎలా? తప్పు చేసింది అతనైతే శిక్ష నీవు వేసుకుంటావా! అలా మరికొందరు అమ్మాయిల్ని అతను టార్గెట్ చేయడా?"
 సున్నితంగానే మందలించింది సౌమ్యను.
"..పోతే, నీతోనే ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడన్నావు కదా...నెమ్మదిగా, కూల్ గా ఉండేవాళ్లు ఏమీ అనలేరనీ, ఎవరితోనూ చెప్పుకోలేరని ఇలాంటి వాళ్ళ ధైర్యం. అది నువ్వు బాగానే నిరూపించావు. కానీ దుర్గ పసిగట్టడం చాలా మంచిదయింది. సరే, దీని గురించి ఆలోచిస్తాను. మీరు క్లాస్ కి వెళ్ళండి"
 అని చెప్పి ఇద్దరినీ పంపించేసింది.
                                 ***********
 మరుసటి రోజు---
 సాధన చెప్పిందంతా విన్న ప్రిన్సిపల్ సుదేష్ణాదేవి కోపానికి అంతులేకపోయింది. కానీ,అంతలోనే ఇది సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం అన్న విచక్షణతో వెంటనే మరో ఇద్దరు లేడీ లెక్చరర్స్ ని, సివిక్స్ లెక్చరర్ శివశంకర్ ను కూడా పిలిపించి వాళ్లతో కూడా సంప్రదించి, వాళ్లందరికీ కొన్ని పనులు అప్పగించి పంపించేసి ఆలోచనలో పడింది.
   తను ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో దగ్గరి బంధువు ఒకతను  ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన భుజాలపై చేతులు వేయడం, బుగ్గల్ని సాగదీయడం లాంటి పనులు చేసేవాడు. రెండు మూడు సార్లు చూసి, కంపరంగా అనిపించి అమ్మతో చెప్పేసింది. యధాలాపంగా ఓరోజు ఇంటికి వచ్చిన అతన్ని పట్టుకుని అమ్మ చెడామడా దులిపేసింది. అంతే! అతను మళ్లీ ఇంటి గడప తొక్కితే ఒట్టు! ఆరోజు నుండీ అతనికీ, తమ ఇంటికీ సంబంధం పూర్తిగా తెగిపోయింది. అలాంటి ప్రబుద్ధులు, వికృత చేష్టల మృగాళ్లు అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటారన్నమాట !! అనుకుంటూ తల పంకించింది సుధేష్ణాదేవి.
                                 **********
   రెండు రోజుల వ్యవధి తీసుకుని పని పూర్తి చేసుకుని లెక్చరర్స్ అంతా వచ్చి కూర్చున్నారు ప్రిన్సిపల్ ఎదురుగా. వాళ్ళు చెప్పిన సమాచారం వినగానే సుదేష్ణాదేవి కాసేపు నిర్వికారంగా అయిపోయింది. ఇంతవరకూ సౌమ్య ఒక్కతే బాధితురాలు అనుకుంటున్నారు. కానీ, సైన్స్ గ్రూపుల వారందరినీ కూర్చోబెట్టి అనునయంగా వారిని ప్రశ్నించేసరికి ధైర్యం వచ్చి నోరు తెరిచారట! మొత్తం మీద బైపీసీలో ముగ్గురు, ఎంపీసీలో మరో ఇద్దరు ఇలాంటి చేదు అనుభవాలే తామూ ఎదుర్కొంటున్నట్లు బయటపడ్డారు. చెబితే అంతా తమను అదోలా చూస్తారని, ఇంట్లో తెలిస్తే కాలేజీ మాన్పించేస్తారని భయపడి  మిన్నకుండి పోయామని వాళ్ళనగానే విస్తుబోవడం  లెక్చరర్ల వంతయిందట!! ఆలోచిస్తే...ఇంకా బయటపడని వాళ్ళూ ఉండే ఉంటారని చెప్పారు లెక్చరర్స్.
     కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీలలిత ఎంక్వయిరీలో అతని వ్యక్తిగత సమాచారం కొంతవరకు తెలిసింది. నలభై దాటిన  రాధాకృష్ణ అనే ఈ అధ్యాపకునికి పెళ్లయింది. భార్య గృహిణి. పెద్దగా చదువుకోలేదు. ఇద్దరు కొడుకులు హైస్కూల్లో చదువుతున్నారు.
  తరువాత శివశంకర్ గతంలో రాధాకృష్ణ పని చేసిన కాలేజీ నుండి సేకరించిన సమాచారం తెలిపాడు. ఆ కాలేజీ కో ఎడ్యుకేషన్ . అక్కడ కూడా అమ్మాయిల నుండి ఇలాంటి ఆరోపణలు ప్రిన్సిపాల్ కు అందాయి. బ్రతిమాలి బామాలి పై అధికారుల దాకా పోకుండా చేసుకున్నాడు. అందుకే రెండేళ్ల గడువు దాటిపోగానే ఎలాగోలా ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికొచ్చి పడ్డాడు. కానీ కుక్క తోక వంకర పోయేది కాదు గదా! అలాగే ఇతని నైజమూ మారలేదన్నమాట! అనుకుంది సుదేష్ణాదేవి. వెంటనే,ఇక ఉపేక్షించడంలో అర్థం లేదు అని స్థిరంగా నిశ్చయించుకున్నారామె. గంట తర్వాత మళ్లీ కలుద్దామని చెప్పి వాళ్లను పంపించేసి, అటెండర్ తో చెప్పి రాధాకృష్ణను పిలిపించింది.ఏ ఉపోద్ఘాతమూ లేకుండా సూటిగానే విషయంలోకి వెళ్లారామె.
" మీ ప్రవర్తన వల్ల స్టూడెంట్స్ ఎంత మానసిక వేదనకు లోనవుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతోందా!గురువు తండ్రితో సమానమంటారు.
 మీ ఈ ప్రవర్తనకు మీ సంజాయిషీ ఏమిటి? "
"మేడం,వాళ్ళు చిన్న పిల్లలు. నన్ను అపార్థం చేసుకున్నారు. నేనలాంటి వాణ్ణి కాదు. ఏదో చిన్న వాళ్ళని చనువుకొద్దీ చేయి పట్టుకుంటే ఇలా వక్రీకరిస్తే ఎలా మేడం ? "
 దిగ్గున లేచింది సుదేష్ణాదేవి.
"ఆపండి, సీనియర్ ఇంటర్ చదువుతున్న టీనేజీ ఆడపిల్లలండీ వాళ్ళు. ఏది గుడ్ టచ్చో, ఏది బాడ్ టచ్చో తెలీని పసిపాపల వయసా వాళ్లది? నీ చేష్టల వల్ల ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది, తెలుసా నీకు?.. "
" సారీ మేడం, క్షమించండి ... "
" సారీతో సమసిపోయే సమస్య కాదిది. ఇక మీరు వెళ్ళవచ్చు.. "
మౌనంగా లేచి నిల్చున్నాడతను.
                          **********
  మరుదినమే స్టాఫ్ మీటింగ్ పెట్టి విషయం చర్చలో పెట్టారు సుదేష్ణాదేవి. అందరి అభిప్రాయం విన్నాక అందరి సమ్మతితో ఓ నిర్ణయం తీసుకుని ఎవరు ఏం చేయాలో చెప్పి పంపించేశారు.
   మరుసటి రోజు మధ్యాహ్నంకల్లా సైన్స్ స్టూడెంట్స్ రాధాకృష్ణ సర్ మీద కంప్లైంట్ రాసి "ఈ సార్ మాకొద్దు" అంటూ సంతకాలు చేశారు. తానూ ప్రిన్సిపల్ గా మరో కంప్లైంట్ రాసి ఆ రోజే పై అధికారులకు పంపించేశారు  సుదేష్ణాదేవి గారు.
   వారం రోజుల్లో ఎంక్వయిరీ కమిటీ వచ్చి విచారించింది. అంతా నిజమేనని తేల్చి రిపోర్ట్ రాసుకొని వెళ్లారు. రెండు రోజుల్లో రాధాకృష్ణకు సస్పెన్షన్  ఆర్డర్స్ చేతికి అందాయి. రెండు వారాల తర్వాత దూర ప్రాంతంలో మారుమూలనున్న ఓ బాలుర జూనియర్ కాలేజీకి బదిలీ జరిగిపోయింది.
                        *************
   ఆరోజు అసెంబ్లీ హాల్లో స్టాఫ్, స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ నూ సమావేశపరిచి అందరినీ ఉద్దేశిస్తూ ప్రసంగించారు సుదేష్ణాదేవి గారు.
" ఇలాంటి సంఘటనలు కాలేజీలో జరగడం చాలా బాధాకరం. కానీ, ఒక్క విషయం అందరం ఆలోచించాలి. సమస్యలు ఎలాంటివైనా సరే ఎప్పుడైనా,ఎక్కడైనా, ఎవరివల్లనైనా రావచ్చు. అలాంటప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ పిరికిగా భయపడకూడదు. తనకు తానుగా పరిష్కరించుకో లేనప్పుడు పక్కవారి సాయం తీసుకోవడంలో తప్పులేదు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. తప్పు నీదేనని మందలించడం, చదువు మానిపించడం పరిష్కారం కానే కాదు. వాళ్లకు ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టాలి. అమ్మాయిలందరికీ మరోసారి మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఇలాంటి సమస్య ఏదైనా మీకు ఎదురైనప్పుడు మీలో మీరే కుమిలిపోకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలి. ఈ సందర్భంగా దుర్గ అనే స్టూడెంట్ ను నేను మనసారా అభినందిస్తున్నాను. స్నేహితురాలి మనస్థితిని గమనించిన ఆ అమ్మాయి వయసుకు మించిన పరిణతి చూపించి సౌమ్యనే గాక మరెందరినో ఈ సమస్య నుండి బయట పడేయగలిగింది. ఆ అమ్మాయికి నా మనఃపూర్వక అభినందనలు. ఇంకా స్టూడెంట్స్ తమ వ్యక్తిగత సమస్యల్ని తనతో పంచుకునేలా వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకున్న సాధన మేడం గారినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను... "
హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
                          **********
" థాంక్యూ వెరీమచ్ దుర్గా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నన్నో పెద్ద ఉపద్రవం నుండి బయట పడేశావు.. "
 సమావేశం అయిపోయాక దుర్గ చేతులు పట్టుకుంటూ ఆర్ద్రంగా అంది సౌమ్య.
"ఛ! ఊరుకోవే, సరేగానీ, ఇప్పటికైనా పిరికితనం వదులుకుంటావా లేదా...!?"
" ఇంకానా! నీలా పదిమందికి ధైర్యం చెప్పే శక్తి వచ్చింది తెలుసా..? "
 ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని గలగలా నవ్వుకుంటూ గేటు దాటి ముందుకు కదిలారు.
              ****************************