Tuesday, September 23, 2025

నాకు నచ్చిన పద్యం


        తనిసిరే వేల్పులు దధి రత్నముల చేత 
        వెరచిరే ఘోర కాకోల విషము చేత
        విడిచిరే యత్న మమృతమ్ము వొడయు దనుక
        నిశ్చితార్థమ్ము వదలరు నిపుణమతులు

 అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్న దేవతలు ఆ సమయంలో వారికి లభించిన రత్నాలకు సంతోషించలేదు...తృప్తిజెందలేదు. ఆ ప్రయత్నంలో వెలువడిన కాలకూటవిషానికీ ఏమాత్రం భీతి చెందలేదు. అమృతం లభించేదాకా తమ ప్రయత్నాన్నీ వీడలేదు. ధీరులు, కార్యసాధకులు తాము తలపెట్టిన కార్యం సఫలమయ్యేవరకు తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు. అంటే సజ్జనులు తాము పూనిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నం విడవరని ఈ పద్యం సారాంశం. చక్కటి భావంతో పాటు సందేశాన్ని కూడా ఇస్తూ, స్ఫూర్తిని కలిగించే ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతిశతకంలోనిది.





Monday, September 15, 2025

బాలగేయం... పిల్లలం మేము పిల్లలం

 
 పల్లవి :

 పిల్లలం మేము పిల్లలం..
 బడి పిల్లలం 
 గుడిలాంటి బడిలో
 గురువుల సన్నిధిలో
 చదువులమ్మ ఒడిలో
 పాఠాలు నేర్చే విద్యార్థులం 
 వసివాడని కుసుమాలం        
                                                  //పిల్లలం// 
 చరణం :
 చదువే మా ధ్యేయం
 సమతావాదం మా నినాదం 
 ప్రగతి బాట మా గమ్యం
 దేశభవిత మా లక్ష్యం
                                                 //పిల్లలం//
 చరణం :
 గురువులను గౌరవిస్తాం
 పెద్దల మాట మన్నిస్తాం 
 పిన్నలను ప్రేమిస్తాం
 కర్తవ్యం బోధిస్తాం
                                                 //పిల్లలం//
 చరణం :
 రేపటి తరం వారసులం
 భావి భారత నిర్మాతలం
 కలలు కంటాం కష్ట పడతాం
 కలల తీరం చేరుకుంటాం
 సమాజహితం కోరుకుంటాం
 సదాశయంతో సాగుతాం
                                                 //పిల్లలం//
 



  
                                     

Wednesday, September 10, 2025

ఈ సమయం గడిచిపోతుంది...

🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🥀🌷🌷🥀🌷

కష్టాలు...కన్నీళ్లు...అశాశ్వతం...
 వచ్చి పోయే చుట్టాలవి...ఇది నిజం... 
భగవానుడు సూచించిన దివ్య మంత్రం... 
"గడిచిపోతుందిలే ఈ సమయం" అనుకో నేస్తం...
తక్షణం పొందుతావు ఉపశమనం...!!

🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀🌷🌷🥀

Friday, September 5, 2025

నా జ్ఞాపకాల్లో నా గురువులు...

                                           🌺భువి భావనలు 🌺🐦                                                     *************
        

 ఐదేళ్ల  వయసుకు ముందు నా మస్తిష్కంలో పెద్దగా నిక్షిప్తమైన జ్ఞాపకాలేవీ లేవనే చెప్పాలి. కానీ మా నాన్నగారు ఓ కొత్త పలక, బలపం నా చేతికిచ్చి నా చేయి పట్టుకుని తీసుకెళ్లి ఓ మున్సిపల్ పాఠశాలలో కూర్చోబెట్టిన రోజు మాత్రం బాగా గుర్తుంది. కాసేపయ్యాక ఓ  పంతులమ్మ వచ్చి నా వద్ద కూర్చుని పలక మీద'అ ఆ' అక్షరాలు రాసి నా చేయి పట్టుకుని దిద్దించింది. ఆమె చాలా ప్రశాంతంగా, ఆప్యాయంగా ఇంకా ప్రసన్నంగా కనిపించింది. ఆమె పేరు అయితే గుర్తులేదు గానీ ఆ రోజు అక్షరాలు దిద్దించిన ఆ పంతులమ్మ నా స్మృతిపథంలో ఈనాటికీ నిలిచి  ఉంది. అలా మొదలైన నా ప్రాథమిక విద్య మరో రెండు స్కూళ్లు మారాక పూర్తయింది.
  అప్పట్లో కొందరు ఉపాధ్యాయులు ట్యూషన్ ఫీజ్ అంటూ ఏమీ ఆశించకుండా సాయంత్రాలు వాళ్ళ ఇంటి వద్ద పిల్లలకు పాఠాలు చెప్తూ ఉండేవారు. అలా ట్యూషన్  చెప్పే ఓ మాస్టర్ గారి వద్దకు నేనూ  వెళ్లేదాన్ని. ఎక్కాల పుస్తకాలు ప్రింట్ చేసినవి అప్పట్లో విరివిగా దొరికేవి కావు. అందువల్ల ఆయన, తెల్ల కాగితాలతో చిన్న పుస్తకాలు కుట్టి, వాటిలో ఎక్కాలు  సొంతంగా చేత్తో రాసి పిల్లలకు ఇచ్చే వారు. ఓ సారి ఆయన ఇచ్చిన ఎక్కాల పుస్తకం పోగొట్టుకుని ట్యూషన్ కెళ్ళా. మాస్టారు బాగా కోప్పడతాడేమో అనుకుని బిక్క మొహం వేసుకుని భయపడుతూ ఓ మూల కూర్చున్నాను. విషయం తెలిసిన ఆయన నన్ను పల్లెత్తు మాట కూడా అనక వెంటనే మరో పుస్తకం తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఆ సహనమూర్తి ఆనాటి నా జ్ఞాపకాల్లో ఓ చెరగని ముద్ర. ఆయన పేరు సుబ్బన్న గారు.
   ఐదవ తరగతి దాకా నేను స్కూల్లో  నేర్చుకున్న ఇంగ్లీషు కంటే ఇంటి వద్ద మా నాన్నగారు యం.వి. సుబ్బారెడ్డి (గామాగో) నేర్పించినదే చాలా ఎక్కువ. చార్టులు, స్కెచ్ పెన్నులు లేని    కాలమది. ప్రింటెడ్ చార్టులు  కూడా ఉండేవి  కాదు. అందువల్ల నాకు ఆంగ్ల అక్షరాలు నేర్పించడానికి ఆయన చేసిన పని ఒకటుంది. ఇంట్లో ఏదో ఒక ప్యాకేజీకి  వచ్చిన అట్టపెట్టెను  కత్తిరించి దానిపై తెల్లకాగితాలు అంటించారు. ఓ పుల్లను బ్రష్ లా   మలిచి దాన్ని సిరాలో అద్ది ఆ అట్టపై నాలుగు తరహాలు ABCD లు వ్రాశారు. దాన్ని  గోడకు తగిలించి, ప్రతిరోజు నాతో పలికిస్తూ రాయించేవారు. అదేవిధంగా ఆంగ్ల పాఠాలన్నీ స్కూల్లో కంటే ముందుగా ఇంట్లోనే బోధించేవారు. ఆ విధంగా తొలి రోజుల్లో మా నాన్నగారే నా తొలి ఆంగ్ల ఉపాధ్యాయుడయ్యాడు. 
   6, 7 తరగతులు చదివేటప్పుడు ఆ పాఠశాల హెడ్మాస్టర్ గారు ఇంటింటికీ  తిరిగి కథల పుస్తకాలు, మ్యాగజైన్ లు సేకరించి స్కూల్లో ఓ  అలమరలో వాటిని ఉంచి చిన్న సైజు లైబ్రరీ తయారు చేశారు. ప్రతీరోజూ  సాయంత్రం మమ్మల్ని కూర్చోబెట్టి  చదివించేవారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకునేవారు. ఆయన సుబ్బారాయుడు మాస్టర్ గారు. ఇంట్లో మా నాన్నగారు కూడా ' చందమామ' తెలుగు, ఇంగ్లీష్ పిల్లల మాస పత్రికలు చందా కట్టి తెప్పించి నాతో చదివించేవారు. అలా పుస్తక పఠనం బాగా అలవాటైపో యింది.
   హైస్కూల్లో చేరాక అక్కడ విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. అలాగే ఉపాధ్యాయులు కూడా. సుశీలమ్మ గారని సైన్స్ టీచర్ ఉండేవారు అక్కడ.. ఆవిడ అంటే  అందరికీ హడల్.  ఆ  ఉపాధ్యాయిని  బోధించిన సైన్స్ పాఠాలు ఇప్పటికీ నాకు గుర్తే! ఎందుకో అప్పట్లో ఆమెను చూసి నాకూ టీచర్ అయితే బాగుండేది అనిపించేది.
    ఇంటర్లో శ్రీరాములు గారని తెలుగు లెక్చరర్ పద్య పఠనం, బోధన అమోఘంగా ఉండేవి. తెలుగు భాషపై మమకారం నాకు ఏర్పడింది ఆరోజుల్లోనే  ! చిన్న చిన్న కవితలు, కథలూ వ్రాసుకుంటూ ఉండేదాన్ని, కానీ ఎవరికీ చూపించేదాన్ని మాత్రం కాదు.
        మూడేళ్ల డిగ్రీ చదువు చకచకా ముగిసిపోయింది. ఆ పీరియడ్ లో ఒకరని కాదు గానీ లెక్చరర్స్ ను  చూసినప్పుడు భవిష్యత్ లో నాకూ లెక్చరర్ కావాలన్న కోరిక మాత్రం కలిగేది. డిగ్రీ తర్వాత అనుకోని విధంగా BEd  లో చేరి  పోయాను. అలా అలా ఉపాధ్యాయ వృత్తి నన్నాహ్వానించి క్రమంగా అదే నా బ్రతుకు తెరువైపోయింది. క్రమంగా నా  ఉద్యోగం మీద ఇష్టం బాగా పెరిగిపోయి అది  విద్యార్థులపై అవ్యాజానురాగంగా మారిన సందర్భాలూ లేకపోలేదు. తర్వాతికాలంలో  క్వాలిఫికేషన్ పెంచుకుని లెక్చరర్నీ అయిపోయాను. 
     ఎందుకో, ఈ గురు పూజోత్సవం రోజు వచ్చిందంటే చాలు..ఆ రోజులూ, దాంతోపాటు  నాకు చదువు చెప్పిన నా  గురువులు గుర్తుకొస్తూఉంటారు. అందుకనే ఈ నాలుగు మాటలు రాయాలనిపించింది. 

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
             గురుపూజోత్సవం సందర్భంగా
          ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

                                                        
                                      

Wednesday, September 3, 2025

పాఠశాల గేయం

పల్లవి :
మా పాఠశాల ఓ పర్ణశాల 
ఇది మాకు ఆలయం /ఇదియే మా భవితవ్యం 
మా మంచిగురువులు దైవస్వరూపాలు 
మా మార్గదర్శులు నడయాడు దేవతలు 
                                                   //మా పాఠశాల//
చరణం 1 : 
ఉదయాన ప్రార్థనలు / సందేశపాఠాలు 
తరగతిగది బోధనలు / నీతిసుధా కథనాలు
మరపురాని అనుభవాలు / మదినిండా జ్ఞాపకాలు 
మాకోసమే తరలివచ్చి మాకు దిశామార్గమిచ్చి 
చీకట్లను తొలగించి చిరుదివ్వెలు వెలిగించి 
చేయి పట్టి నడిపించీ  తలరాతను మార్చేసే 
మా మంచిగురువులు దైవస్వరూపాలు 
మా మార్గదర్శులు నడయాడే దేవతలు 
                                                      //మా పాఠశాల//
చరణం 2 :
బోధించు వేళల వారు మాకు గురువులు 
ఆటాడు సమయాన మా తోటి నేస్తాలు 
మా కష్టకాలాన భుజం తట్టు బాంధవులు 
నిత్య విద్యార్థులు / స్ఫూర్తికి నిదర్శనాలు
విద్యార్థి ఉన్నతే ఎనలేని సంతృప్తి వారికి
వారి చేత మా భవిత పొంది తీరు ఘనకీర్తి
మా మంచి గురువులు దైవస్వరూపాలు 
మా మార్గదర్శులు కనిపించే దేవతలు 
                                                      //మా పాఠశాల//





Monday, September 1, 2025

తెలతెలవారుతోంది...

 *****************************************
తెలతెలవారుతోంది..తలుపు తీసింది...
సూర్యోదయం పలకరించింది చిరునవ్వుతో..
ముంగిలి ఊడ్చింది...కల్లాపి జల్లింది..
భూమాత పరవశించింది..
ముత్యాలముగ్గు పెట్టింది..
మహలక్ష్మి గడపలో అడుగు పెట్టింది...
దేవుని ముందు దీపం వెలిగించింది.. 
గంటలు మ్రోగాయి...పనులు మొదలయ్యాయి..
గోడ మీద గడియారం ముల్లు సాగుతూ ఉంది..
తోడుగా పరుగులు తీస్తూ ఆమె !! 
అందర్నీ సిద్ధపరిచి సాగనంపింది..ఎవరామె ?
ఆ ఇంటి ఇల్లాలు..అలా అలా..
ఉదయం..మధ్యాహ్నం..సాయంత్రం..
దాటిపోయాయి..పనులకు కొదవలేదు ..
తీరిక..!క్షణం లేదు..! రాత్రీ గడిచింది..
తెల్లారింది..మళ్లీ మొదలు ! 
ఇది గృహిణి దినచర్య !!
" ఏం చేస్తావు నువ్వు? " అనడిగితే.. 
ఏమీ చేయనంటుంది...ఎదురు ప్రశ్నించదు..
"గడప దాటి పని చేస్తేనే ఉద్యోగమా?"అనదు...
ఆ తలపే రాదు మరి !!
సంపాదన నోచుకోని..పదవీ విరమణ ఎరుగని 
జీవితకాల 'ఉద్యోగం!'…వెల కట్టలేము...
ధర చెల్లించలేము...అది అమూల్యం!!  
అలసట దరిజేరినా..చిరునవ్వుతో తరిమేస్తుంది..
విసుగొచ్చినా ఓపిక కొని తెచ్చుకుంటుంది ! 
స్వార్థ చింతన..స్వీయ రక్షణ...
తలవని తరుణి...! తనకు మారుగా దైవం
ఇలకు పంపిన దైవ స్వరూపిణి !!
గృహాన్ని స్వర్గసీమగా మార్చి...
అలవోకగా నడిపే మంత్రిణి !!
ప్రతి ఇంటా తిరుగాడే ఆ ఇంటి దీపం...
అనునిత్యం నడయాడే వెన్నెల కెరటం !!
*********************************              ఆగస్ట్ 2025' విహంగ' మహిళా 
                 మాసపత్రికలో  ప్రచురితం            
*********************************






   

Saturday, August 30, 2025

అమ్మ భాష విశిష్టత...

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మన గిడుగు రామ్మూర్తి గారి జన్మదినం నేడు 
తెలుగును వాడుక భాషగా ప్రోత్సహించిన ఘనుడు
తెలుగుభాషా దినోత్సవ శుభ సందర్భం ఈనాడు
ఇది కేవలం వేడుక మాత్రమే కాదు 
భాషాభివృద్ధి..సంస్కృతీ పరిరక్షణల 
నిరంతర కృషికై స్ఫూర్తినిచ్చు శుభదినం...
అనాదిగా ఘనచరిత గలిగిన బాష మనది...
ఆదికవిగా తెలుగు భాషకు పునాది వేసిన నన్నయ... 
సంఘ సంస్కరణల భావాల వెల్లువతో
చిరస్మరణీయుడైన కందుకూరి..
దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..
అంటూ సామాజికస్పృహ రగిలించిన గురజాడ...
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా..అంటూ ఎలుగెత్తి చాటిన వేములపల్లి...
తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా.. అంటూ
గేయాల వెల్లువ కురిపించిన ఆత్రేయ... 
దేశభాషలందు తెలుగు లెస్సయని
పలికిన కృష్ణదేవరాయల అభిమానధనం...
భాషావైభవాన్ని చాటి చెప్పిన బమ్మెర పోతన భాగవతం... అంతేనా... వేమన శతకం..
సుమతీ శతకం అందించిన నీతులు..సూక్తులు
నాడూ..నేడూ ఏనాడైనా..పరిమళం కోల్పోని 
సుగంధ భరిత నిత్య స్ఫూర్తి కిరణాలు...
మహామహులను స్మరించుకుంటున్న
ఈ మహత్తర క్షణాన..మాతృభాష విశిష్టత 
మననం చేసుకుందాం... అమ్మ భాష గొప్పదనాన్ని
నలుచెరగులా విస్తరింపజేద్దాం... 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
        తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹








 

Wednesday, August 27, 2025

చందమామ అందినరోజు...చందమామ పాటలు విందామా... .

  🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌝


  చంద్రయాన్ - 3 చంద్రునిపై దిగింది. భారతదేశ పతాకం ఎగురవేసింది. చరిత్రాత్మక విజయం !! 

  ఈ సందర్భంగా...మూడు సంవత్సరాల క్రితం "వెండితెర వీడని బంధం... అందాల చందమామ" అనే పోస్ట్ ను   నా బ్లాగు లో ప్రచురించిన నాకు... ఓసారి అందులోకి తొంగి చూడాలనిపించింది... అలాగే...అందాల జాబిల్లి..చందమామపై వచ్చిన సినీ గీతాల్నిమరోసారి...అందరితోపంచుకోవాలనిపించింది. అందుకే ... 

 వెండితెరతో గొప్ప అనుబంధాన్ని పెనవేసుకున్న వెన్నెల రేడు, జాబిల్లిగా చిరపరిచితుడు, జగమంతటికీ అందాల చందమామ-- ఈ చల్లని రాజుపై వచ్చిన మధురాతి మధురమైన సినీ గీతాలెన్నో, ఎన్నెన్నో. అసలు జాబిల్లిపై ఇలా పాటలల్లాలని కవులకు ఎందుకనిపించిందో గానీ అవన్నీ తరాలు మారుతున్నా అజరామరమై అందరి మదిలో మెదుల్తూ, జనాల నోళ్ళలో నానుతూ భాసిల్లుతూనే ఉన్నాయి. వారి కలాల నుండి అద్భుత పదజాలం జాలువారగా, దిగ్గజాలైన సంగీత దర్శకులు అత్యంత మాధుర్యం ఒలికించే స్వరాలు కూర్చగా, అంతకుమించిన మాధుర్యంతో తేనెలు చిందిస్తూ ఆలపించిన గాయనీ గాయకులు ధన్యజీవులు. ఆ మహత్తరమైన సృష్టికర్తల అద్భుత సృష్టి ఓసారి మననం చేసుకుందాం మనసారా--

   వెన్నెల రాత్రి. పది గంటలు దాటినవేళ... ఆరుబయట మంచం మీద వెల్లకిలా పడుకుని ఆకాశం వైపు చూస్తుంటే బంగారు వర్ణంలో గుండ్రంగా మెరిసిపోతూ అందాల చందమామ ఆహ్లాదకరంగా దర్శనమిచ్చి మనసంతా పులకించిపోతూఉంటుంది . అదలా ఉంటే...చల్ల గాలి మెల్లగా కదిలి,  వస్తూ వస్తూ దూరాన ఎక్కడనుండో మృదుమధురంగా సాగిపోతున్న తీయని రాగాల ఓ గీతాన్ని మోసుకొచ్చి వీనులకు విందు సమకూరుస్తూ ఉంటుంది . అలాంటి పాటల్లో ఓ  పాట ఇదిగో--

  🌷 చల్లని రాజా ఓ చందమామా

       నీ కథలన్నీ తెలిశాయి 

       ఓ చందమామ ఓ చందమామ 

అంతేనా --- అలా అలా...ఒకటా...రెండా..! ఒకదానితో ఒకటి పోటీలు పడుతూ, రకరకాలుగా సంభాషణలు జరుపుతూ, చిత్ర విచిత్రమైన భావనలతో మది నుక్కిరిబిక్కిరి చేసే మధుర గీతాలు మరెన్నో !! ఓసారి మననం చేసుకుంటే చాలు....మరుక్షణం ఆ పాట మన మనోఫలకం మీద ప్రత్యక్షమైపోతుంది.. కావాలంటే... ఈ పాటల్ని చూడండి మరి !

 మిస్సమ్మ సినిమా లో ఏ. ఎం. రాజా, లీలగారలు పాడిన ఈ పాట చూడండి. 

🌷  నాతో తగవులు పడుటే

      అతనికి ముచ్చట లేమో 

      ఈ విధి కాపురమెటులో 

      నీవొక కంటను గనుమా

      రావోయి చందమామ 

      మా వింత గాధ వినుమా!

-- భార్యాభర్తల మధ్య తగవులు తీర్చటానికి కూడా ఆకాశంలోని చందమామను పిలుస్తారన్న మాట !పాట వింటూ ఉంటే ఆ పాటలో నటించిన...కాదు కాదు జీవించిన...మన అన్న ఎన్టీఆర్, మహానటి సావిత్రి కనులముందు సాక్షాత్కరించకమానరు. అప్పుడు టీనీజీలో ఉన్న సావిత్రిని, ఆ అమాయకపు ముఖారవిందాన్ని ఓసారి  గుర్తుకు తెచ్చుకోండి...

🌷   చక్కనయ్యా చందమామ ఎక్కడున్నావూ 

       నీవు లేక చుక్కలన్నీ బిక్కు మన్నాయి

-- చందమామ కనిపించక బిక్కమొహం వేశాయి చుక్కలన్నీ...  భార్యాబిడ్డలు చిత్రంలో చిన్నపిల్లలు వాళ్ళ అన్నయ్యను వెతుకుతూ పాడే పాట అన్న మాట. చిన్నపిల్లలకు సైతం చందమామే గుర్తొచ్చాడు చూశారా..!

🌷  చందమామా... అందాల మామ 

      నీ ఎదుట నేను... నా యెదుట నీవు

      మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావో? 

-- ఒకరినొకరం మనమిద్దరమే చూసుకుంటున్నాం గానీ... మా ఇద్దరి ఎదుట నీవు ఎప్పుడు ఉంటావు? అని ప్రశ్నిస్తున్న ఓ కన్నె మనసు. గాయని సుశీల గారు... ఆ కోకిల స్వరం ఆమెకే సొంతం.. అందుకే గానకోకిల అయింది మరి!!

🌷   చందమామ బాగుంది చూడు

        చల్ల గాలి వీస్తోంది చూడు

        ఆపైన.. ఆపైన.....

        నువ్వు నా కళ్ళలో తొంగి చూడు..

-- నాయిక అమాయకుడైన కథానాయకుని ఆటపట్టిస్తూ ఇలా పాడుతుంది మరి! గానము: ఘంటసాల, సుశీల. అప్పటికి ఎంతో సీనియర్ నటి అయిన జమున గారు కృష్ణగారితో నటించడతో ఆయన మోములో సహజంగానే అమాయకత్వం కనిపించడం గమనించవచ్చు..

🌷   చందమామ వస్తున్నాడూ 

       చందమామ వచ్చేను.. 

       నిన్ను నన్ను చూసేను 

       ఎక్కడైన దాగుందామా 

       చక్కనైన చిన్నదానా.... 

--తమని చూసే చందమామ చూపుల్ని తప్పించుకోవడానికి ఎక్కడైనా దాగుందామంటూ నాయకుడు నాయికతో చిలిపిగా అనడం - గానం: ఘంటసాల, సుశీల

 ---అంతేనా...! తమ బాధల్ని, సమస్యల్ని సైతం చందమామతో చెప్పుకునే వారు ఉంటారన్నమాట ఈ విధంగా--

 🌷  మామా.. చందమామా.. వినరావా నా కథ

       వింటే.. మనసు ఉంటే... కలిసేవూ నా జత

-- సంబరాల రాంబాబు-- లోని ఈ పాట విని తీరాల్సిందే. 

🌷    నిండు చందమామ.. నిగనిగలా భామ 

         ఒంటరిగా సాగలేవు... కలసిమెలసి పోదామా.. ఓ.. 

-- జేసుదాస్ పాడిన ఈ పాట ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. విన్న వాళ్లకు తెలుస్తుంది ఆ స్వరంలోని మాధుర్యం..

🌷    చందమామ రావే... జాబిల్లి రావే

         అమ్మాయి అలిగింది... అలక తీర్చి పోవే....

-- చెలి అలక తీర్చడానికి కూడా చందమామ రావాల్సిందే నా? బలిపీఠం లో శోభన్ బాబు, శారద గుర్తొచ్చారా..!

-- గానం: సుశీల, రామకృష్ణ

----  తను ప్రేమించిన వాడు ఎంతో ఉన్నతుడు. తానేమో కడు బీద. ఈ పాట చూడండి--

 🌷   నీలాల నింగి మెరిసి పడే నిండు చందురుడా

        నిరుపేద కలువ వేచెననీ మరిచిపోకుమా 

-- గానం: పి. సుశీల చిత్రం.. గండికోట రహస్యం

🌷   చందమామ రావే జాబిల్లి రావే

        కొండెక్కి రావే గోగుపూలు తేవే...

-- ఓ చిన్నపాప రాత్రివేళ చందమామను పిలుస్తూ ఆనందంగా పాడుతుంది సిరివెన్నెల సినిమాలో. ఆతర్వాత ఆ చిన్నపాపే సీతారామయ్యగారి మనవరాలై పెద్ద హీరోయిన్ ఐపోయిందిమరి!!

🌷   చందురుని మించు అందమొలికించు 

       చిట్టిపాపాయి జో... నిన్ను కన్నవారింట

       కష్టముల నీడ తొలగిపోయేనులే... 

-- చందమామను మించిన అందం నీదంటూ పాపకు పాడే జోల. రక్తసంబంధం-- సినిమాలో సుశీల ఆలపించిన విషాద గీతిక...

---- జానపదసొగసులు రంగరిస్తూ లయబద్ధంగా సాగే ఈ పాట భక్త కన్నప్పలో సుశీల, రామకృష్ణ పాడారు.

🌷  అత్తారింటికి దారేదమ్మ సందమామ 

       ఆమడ దూరం ఉందోలమ్మా సందమామ 

       ఆమడదూరం అయినా గానీ ఎల్లాలమ్మా..  వుయ్.. 

       ఎన్నీయల్లో ఎన్నీయల్లో సందమామ.. 

       సిన్నాదానీ మనువూ సెయ్యి సందమామ... 

 --- చందమామకు మరో పేరు జాబిల్లి. అలా సంబోధిస్తూ వచ్చిన పాటలకూ కొదవలేదు. 

🌷   జాబిల్లి చూసేను నిన్ను నన్నూ 

       ఓయమ్మో, నీకింత సిగ్గేల బాలా రావా...

       నను చేర రావా......

-- మహాకవి క్షేత్రయ్య లోని ఈ పాట సుశీల, రామకృష్ణ మధురాతి మధురంగా గానం చేశారు. 

🌷   జాబిలమ్మ నీకు అంత కోపమా

        జాజిపూల మీద జాలి చూపవా.....

-- అంటూ ఓ ప్రియుడు తన ప్రేయసిని జాబిలిగా వర్ణిస్తూ పాడుతున్నాడన్నమాట!

-- పెళ్లి చిత్రంలో ఎస్. పీ. బాల సుబ్రహ్మణ్యం గానం చేసిన పాట ఇది.

🌷   జాబిల్లి వచ్చాడే పిల్ల నిన్నెంతో మెచ్చాడే

       నీకూ మనసిచ్చా డే, ఎదురుచూస్తున్నాడే పిల్లా... 

-- తననే జాబిల్లిగా అనుకుంటూ మరదలితో సరసాలాడుతున్నాడు ఓ చిలిపి బావ....

-- అల్లుడే మేనల్లుడు-- సినిమాలో  ఘంటసాల పాడిన పాట ఇది. 

🌷   జాబిలితో చెప్పనా...జామురాతిరి

       నీవు చేసిన అల్లరి, రోజా...

--వేటగాడు--చిత్రంలో సుశీల, బాలసుబ్రమణ్యం హుషారుగా పాడిన ఈ పాట అప్పట్లో జనాల్ని ఎంతగా ఉర్రూతలూగించిందో ఆ తరం ప్రేక్షకులకందరికీ విదితమే.  ఇందులో ఎన్టీఆర్, శ్రీదేవి స్టెప్పులు స్పెషల్ ! ఆ డ్యూయట్ కోసమే పదేపదే సినిమా చూసినవాళ్ళున్నారంటే నమ్మితీరాలి..!

 🌷 అలా మండిపడకే జాబిలీ

      చలీ ఎండ కాసే రాతిరీ 

      దాహమైన వెన్నెల రేయి

      దాయలేను ఇంతటి హాయి 

      ఎలా తెలుపుకోనూ ప్రేమనీ 

      ఎలా పిలుచుకోనూ రమ్మనీ..... 

-- ఓ అమ్మాయి తన ప్రేమను సఖునికి ఎలా  తెలుపుకోవాలో తెలియడం లేదంటూ జాబిలితో మొర పెట్టుకునే ఈ పాట 'జాకీ ' చిత్రంలో జానకి పాడినది. 

🌷   పగడాల జాబిలి చూడు

       గగనాన దాగెను నేడు

       కోటి అందాల నా రాణి

       అందిన ఈ రేయి... 

       ఎందుకులే నెలరేడు...

-- ఇక్కడ నాయకుడు ఘటికుడు. మరెంతో చతురుడు. 

 చెలి చెంతనుండగా నీవెందుకు అంటున్నాడు జాబిలితో. 

అక్కినేని నాగేశ్వరరావు, జమునల కాంబినేషన్లో ఈ మెలోడియస్ సాంగ్ అప్పట్లో సూపర్ హిట్... 

-🌷  చందమామ అందినరోజు ...

        బృందావని నవ్విన రోజు.... 

        తొలివలపులు చిలికిన రోజు...

        కులదైవం పలికిన రోజు....  

        భలేమంచిరోజు...పసందైన రోజు... 

        వసంతాలు పూచే నేటిరోజు.... 

 --- జరిగిన కథ లో ఘంటసాల గానం మరువగలమా !   

 చందమామతో ఈ కబుర్ల పాటలు పాత సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తాయి( వినిపిస్తాయి). కొత్త సినిమాల్లో అయితే...'మురారి' లో...

        చందామామ చందామామ కిందికి చూడమ్మా 

        ఈ నేల మీద నెలరాజును చూసి నివ్వెరపోకమ్మా.. 

 అందులో మహేష్ బాబును చూసి నిజంగానే చందమామ నివ్వెరపోతాడేమో అన్నట్లుగా ఉంటుంది ఆ దృశ్యం..ఆ అద్భుత చిత్రీకరణ...!

      తారలు దిగివచ్చిన వేళ.. మల్లెలు నడిచొచ్చిన వేళ..

      చందమామతో ఒక మాట చెప్పాలి..ఒక పాట పాడాలి

 ప్రేమాభిషేకంలో ఈ పాట శ్రీదేవిని మరోసారి తలపిస్తుంది కదా!

--- ఇలా చెప్తూ పోతుంటే కోకొల్లలుగా తడుతూనే ఉంటాయి అందాల చందమామ కబుర్లు, పాటలు.  ఏదేమైనా ఈ పాటలన్నీ చూస్తుంటే, వెండితెరకూ ఆకాశంలో చందమామకూ  ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్టుగా అనిపించడం లేదూ.....

  చంద్రయాన్ విజయం తర్వాత... ఈ పాటలన్నీ గుర్తొచ్చాయి...నేను ప్రస్తావించనివి ఇంకెన్నో ఉంటాయి.. ఈపాటికి మీకు మరికొన్ని మదిలో మెదిలే ఉంటాయి..

  చివరగా రాసిన కవులకు, స్వరపరిచిన సంగీత దర్శకులకు ఇంకా వారి మధుర గానంతో చరితార్థులు, చిరస్మరణీయులు అయిన గాయకులకు మనఃపూర్వక నమస్సుమాంజలులు. 🙏

🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝🌛🌜🌝🌛


            

Monday, August 25, 2025

నాకు నచ్చిన పద్యం

             
            
ఒకచో నేలను బవ్వళించు, నొకచో నొప్పారు బూసెజ్జపై
నొకచో శాకము లారగించు, నొకచో నుత్క్రుష్ట శాల్యోదనం 
బొకచో బొంత ధరించు,నొక్కొక్క తరిన్ యోగ్యంబరశ్రేణి లె 
క్కకు రానీయడు కార్యసాధకుడు దుఃఖంబున్ సుఖంబున్ మదిన్ 

 కార్యసాధకులు సుఖదుఃఖాలను లెక్క చేయకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సహిస్తూ ఉంటారు. అలాంటివారు కుదరనప్పుడు ఒక్కోసారి నేలపైనే పడుకుంటారు. మరోసారి పూలపాన్పుపై పడుకుంటారు..అలాంటి అవకాశం వారికి రావచ్చు. ఒకసారి కేవలం కాయగూరలతో  భోజనం చేస్తాడు. మరోసారి.. మృష్టాన్నభోజనంతో  విందారగిస్తాడు. ఒకసారి ముతకబట్టలు అంటే ఏమాత్రం బాగులేని బొంత లాంటి వస్త్రాలు ధరిస్తాడు. పరిస్థితి బాగున్నప్పుడు పట్టువస్త్రాలే ధరిస్తాడు. ఆ విధంగా కష్టాలకు కృంగిపోకుండా, సుఖాలకు పొంగిపోకుండా లక్ష్యసాధనకై ఓర్పు వహిస్తూ కృషిచేయడమే ఉత్తముల లక్షణం. ఇదీ ఈ పద్య భావం. పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడం మంచిది అని కవి ఎంత చక్కగా తెలియజేశాడో కదా ఈ పద్యంలో...!
   భర్తృహరి సంస్కృతంలో రాసిన పద్యాన్ని ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి అనువదించిన చక్కటి భావయుక్తమైన ఈ పద్యం నాకెంతగానో నచ్చిన పద్యాల్లో ఒకటి.

Sunday, August 24, 2025

అరచేతిలో అద్భుతం...


    🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺   

  రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతూ విస్తరిస్తూ ఉన్నటెక్నాలజీ  ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసిన సంగతి మనందరికీ తెలుసు. జనజీవన స్రవంతి లోనికి అనూహ్యంగా చొచ్చుకొని వచ్చిన ఆ అద్భుతం గురించి నాలుగు మాటలు చెప్పుకుందాం...🫡👇


        
 పావురాలతో వర్తమానాలు పంపిన రోజులు... 
      నేడవి మరుగున పడ్డ ఒకనాటి జ్ఞాపకాలు...!

      కార్డు ముక్కపై కబుర్లు రాసుకున్న జనాలు...
      నేడు రాయడమన్నదే మరిచిన వైనాలు..!
      తంతితపాలా శాఖ తలపులలోనే...!

                                టెలిగ్రామ్   

     
                     ఇన్ ల్యాండ్ కవర్
      ఎన్వెలప్ కవర్, ఇన్ ల్యాండ్ కవర్,కార్డు 


           ' ల్యాండ్ ఫోన్ '...అంటారా...!
             నట్టింట బందీ అయిపోయే!

🙂
 అన్నింటినీ తలదన్నుతూ అరచేతిలో 
 ఆవిర్భవించిందిగా ఓ అద్భుతం..!!
 అనూహ్యంగా అయిపోయింది 
 అందరికీ అమూల్య ఆభరణం..!
 అది చేతనుండగా...
 కరమున సువర్ణ కంకణమేల!
 అదో తిరుగులేని ఆయుధం 
 అనునిత్యం అత్యవసరం...!

 తాకితే చాలు... సమస్త భూగోళం ప్రత్యక్షం..!!
'క్లిక్ ' చేస్తే చాలు... సిద్ధం... ఛాయాచిత్రం!
 అందరం 'కెమెరా మెన్ 'లమే..
 అందరం 'వీడియో గ్రాఫర్ 'లమే...!
 చిత్రం ! భళారే ! విచిత్రమే !! 🤗
 మధురస్మృతులు...పదిలం పదిలం...
 మరల మరల వీక్షణం...మధురం సుమధురం..

 ఇక..వద్దన్నా వచ్చి పడే 
 వీడియోలు... వినోదాలు.... 
 అవి నిరంతర ప్రవాహాలు...!!
 సరికొత్త లోకానికి 
 తీస్తాయి తలుపులు..

 అంతేనా !!
 అదో అచ్చు యంత్రం..!!
 సృజనకు ప్రియ నేస్తం 🤗
 కవిత రాయాలా...
 కథ చెప్పాలా...!
 పాట పాడాలా...!
 అంతా  మన ఇష్టం..

 పలుకుతుంది ఆహ్వానం 🤗
 ఇక మనదే ఆలస్యం...
 నిరుద్యోగులకు ఇదో దివ్యవరం 
 ఇంటినుండే చేయమంటుంది ఉద్యోగం !
 సంపాదనకు తెరుస్తుంది సింహద్వారం...!

ఇంకా..............    
కాళ్లరిగేలా తిరగడం ఎందుకు?
ఆన్లైన్ షాపింగ్ లు... 
ఆన్లైన్ పేమెంట్లు...!!
ఒక్క 'కాల్ ' చాలు మనకు...
గుమ్మం ముందు మోగుతుంది 
'కాలింగ్ బెల్ '!
శ్రమ ఖర్చు...! 'నిల్ ' !!





సినిమా టికెట్ కావాలా..!

ఆన్లైన్ బుకింగ్...!
ఫ్లైట్ టికెట్ కావాలా...
ఆన్లైన్ బుకింగ్...!
వృద్ధులకు..నిస్సహాయులకు 
ఉపయోగపడే ఊతకర్ర...
ఏదైనా సమాచారం కావాలా...?
ఉందిగా గూగులు...🫲
చెప్పుకుంటూ పోతే 
అన్నీ ఇన్నీ కాదు...
లెక్కపెట్టలేనన్ని లావాదేవీలు!
కదలక కూర్చుని ఇంటి నుండే 
చక్కబెట్టగల సౌలభ్యాలు..సేవలు...


ఆగండి... అయిపోలేదింకా... 🙂

 దూరాభారం సమస్య...
 అస్సలు లేదు..
 అమెరికా అయినా... 
 ఆస్ట్రేలియా అయినా...
 ఫేస్ టు ఫేస్... చిట్ చాట్...!!

 ఇంతకీ...అదీ ... అదేమిటీ...?!
 ఇంకా వేరే చెప్పాలా... 🙂

 ONE AND ONLY...

 SMART phone 👌

All in One..👌


ఆధునికతకు అసలైన 'సింబల్'
పెడదారి పట్టారో...! తప్పదు 
'డేంజర్ బెల్ '....!!
' టెక్నాలజీ' నీకు జోహార్లు...
 నీ సృష్టికి...సృష్టి సమస్తం
 చేస్తోంది 'సెల్యూట్' !!👃🫡


నిజమే కదండీ... టెక్నాలజీ ప్రసాదించిన సౌలభ్యాన్ని సద్వినియోగం చేసుకుంటే అందరికీ బాగుంటుంది. కానీ ఈ మధ్య దుర్వినియోగం  చేస్తూ పెడదారులు పట్టిస్తున్నారు కొందరు. అలా సైబర్ నేరాలకు పాల్పడకుండా ఉంటే... నిజంగా స్మార్ట్ ఫోన్ అన్నది అరచేతిలో అత్యద్భుతమే..!! కాదంటారా... 🙂

*****************************************
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺









Thursday, August 14, 2025

నేడు స్వాతంత్ర్యదినోత్సవం


  1947 ఆగస్టు 15 న ఆంగ్లేయులు భరతగడ్డను విడిచిపెట్టి భారతీయులకు స్వతంత్రదేశాన్ని స్థాపించే అధికారాన్ని ఇచ్చినందున మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము . ఇది జాతీయ పర్వదినం. కొన్ని పండుగలు కొన్ని మతాలు మాత్రమే జరుపుకుంటాయి. మరికొన్ని పండుగల్ని ప్రాంతాలవారీగా జరుపుకుంటారు. వివిధ రాష్ట్రాలు వారి వారి సంప్రదాయాలకనుగుణంగా పండుగలు జరుపుకోవడం  విదితమే. కానీ, జాతీయ పర్వదినాలు అందుకు పూర్తిగా భిన్నం. ఇవి కేవలం ఒక ప్రాంతానికో, ఒక మతానికో సంబంధించినవి కావు. అందులోనూ..ఆగస్టు 15 ప్రత్యేకత తెలియని భారతీయుడు ఉండడు. ఆనాటి నిస్వార్థ దేశ నాయకులు కలిసికట్టుగా నడుం బిగించి, ప్రాణాలను సైతం లెక్కచేయక పోరాడి పరపీడన నుండి భరతమాత దాస్య శృంఖలాలను పగులగొట్టి దేశ ప్రజలందరూ స్వేచ్ఛావాయువులు పీల్చుకొనేలా చేయగా పొందిన ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వతంత్రభారతం..!
   ఆ త్యాగధనులు, అమరజీవుల త్యాగనిరతిని గుర్తుచేసుకోవడం.. వారి సేవాభావాన్ని, స్వాభిమానాన్ని స్మరించుకుంటూ స్వాతంత్ర్యం సిద్ధించిన ఈ ప్రత్యేక దినాన జాతీయపతాకాన్ని ఎగురవేయడం స్వదేశం పట్ల, భరతమాత పట్ల మనం చూపుతున్న గౌరవాభిమానాలకు నిదర్శనం.
   కాలమెప్పుడూ ఒకేలా ఉండదన్నది వాస్తవమే అయినా... ప్రాంతీయ దురభిమానాలు, కులమత విద్వేషాలు, స్వార్థపూరిత రాజకీయాలు, ఉగ్రవాదాలు నేడు దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఉండడం బాధాకరము, శోచనీయము కూడా. ఇవన్నీ దేశ ప్రగతికి అవరోధాలు కాకుండా అడ్డుకోవడం ప్రతి పౌరుని కనీస ధర్మం, కర్తవ్యంగా భావించవలసిన అవసరం ఎంతేని ఉంది. రేపటి తరాన్ని కాపాడుకుంటూ విలువలుగల చక్కటి పౌరులుగా తీర్చిదిద్దాలి. ఆ విధంగా దేశ సౌభాగ్యాన్ని పదిలంగా ఉంచే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయవలసి ఉంది. అది భారతీయపౌరులుగా అందరి బాధ్యత.
    ఏది ఏమైనా.. దేశాన్ని సుభిక్షంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం అత్యవసరం. 78 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ విషయం మననం చేసుకుంటూ జాతీయపతాకం ఎగురవేద్దాం.

   💐అందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు💐

Saturday, August 9, 2025

మమ్మీ, 'ఉత్తరం' అంటే...!?

                                     ~ యం. ధరిత్రీ దేవి 

 సాయంత్రం ఆరు గంటలవుతోంది. వైదేహి, శ్రీధరమూర్తి తేనీరు సేవించడం పూర్తయి, విశ్రాంతిగా కూర్చుని, ఆ రోజు న్యూస్ పేపర్ లో విశేషాలు ముచ్చటించుకుంటూ ఉన్నారు. మరోవైపు కొడుకు, కోడలు సోఫాలో కూర్చుని టీవీ చూస్తున్నారు. వారిద్దరి మధ్యలో ఏడో తరగతి చదువుతున్న మనవరాలు శ్రావ్య ! పుస్తకాల సంచీ  పక్కన పెట్టుకొని, హోంవర్క్ చేసుకుంటోంది. 
   అంతలో వైదేహి ఫోన్ నుండి ఏదో మెసేజ్ సౌండ్ వచ్చింది. తీసి చూసింది. స్నేహితురాలు పావని... శ్రావణమాసం.. వరలక్ష్మీ వ్రతం శుభాకాంక్షలు ఉన్న ఓ కార్డు  ఫోటో ఫార్వర్డ్ చేసింది. నిట్టూర్చింది  వైదేహి ! ఆ చెప్పేదేదో ఓ ఫోన్ కాల్ చేసి చెప్పి ఉండొచ్చు కదా! పోనీ కనీసం తన స్వహస్తాలతో టైపు చేసి, విషెస్ పంపినా సంతోషించేది. ఇదే కాదు... ఈమధ్య ప్రతీ సందర్భానికీ  ఇలాగే రెడీమేడ్ శుభాకాంక్షలు అందించడానికి బాగా  అలవాటు పడిపోయారంతా. ముఖా ముఖీ కలుసుకోకపోతే పోయె...ఎంచక్కా ఫోనులో రెండు మాటలు మాట్లాడుకుంటే ఎంత తృప్తిగా, సంతోషంగా ఉంటుంది ! వైదేహికి రెండు రోజుల క్రితం జరిగిన ఓ సంభాషణ గుర్తుకు వచ్చింది.
" ఏమిటో వైదేహీ...కాలం ఇలా మారిపోయింది ! పెళ్లి పిలుపులు కూడా వాట్సాప్ లో శుభలేఖ పెట్టి కానిచ్చేస్తున్నారు..."
 పక్కింటి శార్వరి వాపోయింది వైదేహి దగ్గర. వెంటనే పక్కనే ఉన్న వసుంధర,
" మంచిదే కదా,రేపు మనం కూడా అదే ఫాలో అయితే సరి ! శ్రమ, ఖర్చు రెండూ ఆదా... !"
అనేసి, నవ్వింది.
" నిజంగానే రోజులు బాగా మారిపోయాయి సుమా ! శుభకార్యాలంటే ఎంత హంగామా! ఎంత సందడిగా ఉండేది ! పిలుపులకే కొన్ని రోజులు కేటాయించుకునేవాళ్లు."
మళ్లీ అందుకుంది శార్వరి.
"...ఇప్పుడన్నీ సులభ పద్ధతులొచ్చేశాయండీ... అంతా ఈపాడు  సెల్ ఫోన్లొచ్చాకే !! "
సాగదీస్తూ నిష్టూరంగా అంది వసుంధర. అలా మాట్లాడుకుంటూ ఉన్నారా ! తమాషా ఏంటంటే... అప్పుడు ఆ ముగ్గురి చేతుల్లోనూ స్మార్ట్ ఫోన్ లు తళతళలాడుతూ ఒకదాన్ని మించి ఒకటి మెరిసిపోతున్నాయి..! వాళ్ళ మాటలు విని, అవి మూడూ పరస్పరం చూసుకుని... తెల్లబోయి, తర్వాత చిన్నబోయి .. ఆ వెంటనే తెప్పరిల్లి... 
" ఏం మనుషులు ! మనం లేకపోతే  క్షణం కూడా తోచని స్థితికి వచ్చారు ఈ జనాలంతా ! కానీ ప్రతిక్షణం తిట్టడం మాత్రం మానరు ! ఎప్పుడైనా బ్యాలెన్స్ లేకనో..ఇంకే లోపం వల్లనో... కాసేపు మనం పని చేయకపోతే..పిచ్చెక్కిపోతుంది వీళ్ళకి !! చేతిలో ఆభరణమే అయిపోయాం కదా ! అయినా ఎందుకో ఈ నిందలు మన మీద ! "
అనుకుంటూ నొచ్చుకున్నాయి కూడా. అంతలోనే శార్వరి కొనసాగిస్తూ...కాస్త  పాజిటివ్ ధోరణిలోకి వచ్చింది.
"... అయినా...నిజం చెప్పొద్దూ.. వయసు మీద పడి తిరగలేని వాళ్లకు ఓ విధంగా ఇది సౌలభ్యమే కదా! కాకపోతే అవతల అర్థం చేసుకోవాలి బంధుజనం మరి!.. "
 వసుంధర అందుకుని , 
"...ఆ..ఇప్పుడంతా ఫోన్ పిలుపులకు అలవాటుపడిపోయారు లెండి. ఏ ఫంక్షన్ కైనా  ఆ పిలుపులే! ఇది పరస్పర అవగాహన. అందులోనూ టెక్నాలజీ బాగా అందుబాటులోకి వచ్చి, అందరికీ అదే ప్రాణానికి హాయిగా అనిపిస్తోంది. అందుకే ఏ అపార్థాలూ, అలగటాలూ ఉండక హ్యాపీగానే ఫీలవుతున్నారు  లెండి.."
( సెల్ ఫోన్ లు కాస్త స్థిమితపడ్డాయి. )
మళ్లీ శార్వరి మొదలెట్టింది. 
"...అయినా, ఈ ఫోన్లు వచ్చాక వార్తలు చేరవేయడాలు ఎంత ఈజీ అయిపోయిందో కదా ! ఒకప్పుడు ఉత్తరాలు రాసుకోవడం, అర్జెంటయితే టెలిగ్రామ్ ఇచ్చుకోవడం ! ఇప్పుడు.. క్షణాల్లో.. ఎంత దూరాలకైనా, విదేశాలకైనా.. !"
" ఔను మరి ! అసలిప్పుడు ఉత్తరాలు రాసుకునేవారున్నారా అని ! నేను డిగ్రీ చదివే రోజుల్లో హాస్టల్లో ఉండేదాన్ని. క్షేమ సమాచారాలు తెలియజేసుకోడానికి ఉత్తరాలే  దిక్కు అప్పుడు! హాస్టల్ ఎంట్రన్స్ దగ్గర ఓ టేబుల్ వేసి, దానిపై ఓ ట్రే పెట్టి, స్టూడెంట్స్ కు వచ్చిన లెటర్స్ అన్నీ మధ్యాహ్నం వేళ అందులో ఉంచేవారు మా వార్డెన్. ఆటైమ్ లో చూడాలి...మా అమ్మాయిల కోలాహలం ! లెటర్ వచ్చిన వాళ్ళ ఆనందం! అబ్బో ! వర్ణనాతీతం ! అదేదో పెద్ద నిధి దొరికినట్టు !! సంతోషం పట్టలేక పరుగులు తీస్తూ రూములోకి ఉరికే వారు."
వైదేహి ఒక్క క్షణం కాలేజీ రోజుల్లోకి వెళ్ళింది.
" నిజమే! ఇప్పుడు ఉత్తరాల ఊసేలేదు.. అంతా ఫోన్ లో మెసేజీలే కదా !.."
శార్వరి అంది. 
  అలా,వైదేహికి రెండ్రోజుల క్రితం ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ మదిలో మెదిలి, చిన్నగా నవ్వుకుంది. ఇంతలో ఉన్నట్లుండి...
" మమ్మీ, ఇలా చూడు.. 'ఉత్తరం' అంటే ఏంటి మమ్మీ? మన  వీధిలో వినాయక చవితి పూజ, నిమజ్జనం ఎలా జరిగాయో వివరంగా మా ఫ్రెండ్ కు ఉత్తరం రాయాలట! సొంత వాక్యాల్లో...! రేపటికంతా రాసి తీసుకు రమ్మంది మా తెలుగు మిస్.. అసలు ఉత్తరం ఏంటి? ఎలా రాయాలి? డాడీ చెప్పవా..!"
కొడుకు, కోడలూ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు కూతురి ప్రశ్నకు ! వైదేహి కిసుక్కున నవ్వింది. శ్రీధరమూర్తి  కూడా శృతి కలుపుతూ, 
" శ్రావ్యా, ఇలా రా, ఉత్తరం అంటే ఏమిటో, ఎలా రాయాలో నేను చెప్తాను..."
అంటూ పిలిచాడు. పరుగున వచ్చిన శ్రావ్యను పక్కనే కూర్చోబెట్టుకుని, 
" ఉత్తరం అంటే...లేఖ  అని కూడా అంటారు దీన్ని.. అదెలా రాయాలంటే...."
కొనసాగించాడు శ్రీధరమూర్తి.
*****************************************






Sunday, August 3, 2025

కలిమిని మించిన చెలిమి...


 బంధాలకు అతీతమైనది...
 అన్ని బంధాల్లో శ్రేష్టమైనది..
 ఏ రక్తసంబంధం లేనిదీ..సృష్టిలో తీయనిదీ... 
 అపురూపమైనదీ..స్నేహ బంధమే నోయి...

 బీదా గొప్పా..ఆస్తీ..అంతస్తు చూడనిదీ
 కుల మతాలకు కడు దూరం అనేది...
 ప్రతిఫలం ఆశించని పవిత్ర భావనకు
 ప్రతిరూపమైనది..! స్వార్థ చింతన ఎరుగని 
 స్వచ్ఛమైన ప్రేమనందించేదీ స్నేహమేనోయి !!

 అమ్మకు చెప్పుకోలేనిది...నాన్నతో పంచుకోలేనిది...
 తోబుట్టువులతో మనసు విప్పలేనిది..
 కష్టం సుఖం..కబుర్లతో కాలక్షేపం...అది ఏదైనా..
 అరమరికలు లేని స్నేహంతోనే కదా సాధ్యం...!

 బాధలో భుజం తట్టి ధైర్యాన్నిచ్చేది...
 కష్టకాలంలో చేయూత నిచ్చేది...
 కలకాలం నిలిచేది..పేగుబంధం కన్నా 
 పదిలమైనది..! నిరాశలో ఊపిరి పోసి 
 దారి చూపించేది..కల్మషరహితమైన
 స్నేహమంటే  అదేనోయి..!
 అది వెదజల్లే సుగంధ పరిమళం 
 అనిర్వచనీయమోయి...!
 
 ఇలపై ఇంతకు మించిన బంధముండునా!?
 అటువంటి చెలిమిని మించిన కలిమి ఉండునా!!

 
 
 
 

Tuesday, July 22, 2025

రోజు గడిచిందిలా...

   🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅🌅

 ఉషోదయాన...రవికిరణాలు తొలిసారి 
 నేలతల్లిని తాకుతున్న క్షణాన..
 కొమ్మల చాటున కనిపించక 
 వినిపిస్తూ కోయిల గానం !!
 పులకరించిన ప్రకృతిమాత పలకరింపుతో...
 స్వచ్ఛమైన చిరుగాలి lస్వాగత గీతికలతో.
 కన్నాను సూర్యోదయం  మైమరచి...!

 నీలాకాశం...పులుముకుంది శ్వేతవర్ణం 
 చల్లగాలి సోకి పరుగులు తీస్తూ 
 వెండి మబ్బు జల్లై...కురిసింది మల్లెల వర్షం!
 ఎండిన నేల తడిసి...మట్టి సువాసన ఎగసి 
 నను చుట్టేసిన అపరాహ్నవేళ...పరవశించింది 
 నా మది ప్రకృతి స్పర్శతో మరోసారి..!

 పగలంతా మానవాళిని జాగృతి చేసి 
 అలసి సొలసినాడేమో దినకరుడు...!
 దిగిపోతున్నాడు పడమటి దిక్కున 
 సంధ్యారాగం వినిపిస్తూ...
 ఈరోజుకి సెలవంటూ...నింగిని 
 అద్భుత వర్ణ చిత్రమొకటి 
 ప్రకృతికి కానుకగా ఇస్తూ...

 నల్లటి తివాసీపై మెరిసే చుక్కల సందడి..
 పండు వెన్నెల కురిపిస్తూ రేరాజు...!
 అద్భుతం! ఆ దృశ్య సోయగం !!
 పగలంతా ఏమాయెనో మరి..ఈ మాయ..!
 రేయి ఆగమనంతో నిదరోయింది జగతి...
 నిదురమ్మ ఒడిలో నిశ్చింతగా సేదదీరింది !
 రోజు గడిచింది...మళ్లీ తెల్లారింది...
 అదిగో భానుడు..! తూర్పున ఉదయిస్తూ...
 మరో రోజుకు ప్రాణం పోస్తూ....

🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄🌄

 


Tuesday, July 15, 2025

ఈ గమనం...ఈ పయనం...అనివార్యం..

🌄🌞🌄🌞🌄🌞🌅🌞🌄🌞🌄🌞🌄🌞🌄🌞

                               ~~ యం.ధరిత్రీ దేవి ~~

తెల్లవారింది...
సూరీడు పలకరించాడు...
మది...పులకరించలేదు...
పక్క వదలనంది...
తట్టిలేపింది నీరెండ...!
తప్పుతుందా...!
మెదిలింది కర్తవ్యపాలన... 
పారిపోయాయి బద్ధకం..బడలిక...
మొదలయ్యాయి పరుగులు...
అంతే ! దినచర్య ఆరంభం...
ఆగమన్నా ఆగదే సమయం !
నేనాగుదామన్నా...కుదరదుగా.. 
కదలక తప్పదే...ప్రతీక్షణం !
అలసిపోతూ ఈ దేహం...
అడగనైనా అడగదే విరామం !
అడిగితేమాత్రం....
అందుతుందా ప్రియనేస్తం...!
ఆందోళనలు...అలజడులు...
ఆపసోపాలు...అన్నింటి నడుమ 
నలుగుతూ...నలుగుతూ...
పూర్తయింది...విద్యుక్తధర్మం... 
పొద్దువాలింది...
సూరీడు నిద్దరోయాడు... 
అందర్నీ నిద్రబుచ్చాడు...
రోజు గడిచింది...ఆ రోజుకి...
మళ్ళీ తెల్లారింది..సూరీడొచ్చాడు..
మళ్ళీ మొదలైంది రోజు !! 
రోజూలాగే..!అయినా...
ప్రతీరోజూ సరికొత్తగానే.. !!
అలా అలా..గడుస్తూనే ఉంటుంది..
మళ్ళీ...మళ్ళీ మళ్ళీ....
తెల్లవారుతూనే ఉంటుంది... 
కదిలిపోతూనే ఉంటుంది..కాలగమనం.....
దానితోపాటు జీవనరథం... 
ఉరుకులూ పరుగులతో సహజీవనం !
వద్దూవద్దంటూనే అందిస్తాం ఆహ్వానం...
అందులోని ఆనందం అనిర్వచనీయం !!
ఏదో ఒక దినం...ఏదో ఒక క్షణం... 
అనుకోని కుదుపులు...
ఊహించని మలుపులు..!!
అవుతాయి ప్రత్యక్షం... 
ఎదురై విసురుతాయి సవాళ్లు..!!
విషాదవీచికలతో కొన్ని... 
వినూత్న ఆనందకెరటాలతో కొన్ని...!
అన్నింటి కలబోతతో.. 
సాగుతూ...సాగుతూ... 
ఈ గమనం...ఈ పయనం.. 
అనివార్యం !పిలుపు అందేదాకా... 
కొనఊపిరి ఆగేదాకా...!!

🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦🥀🐦









Wednesday, July 9, 2025

' చిన్నారి' కథ... తానొకటి తలిస్తే...

 
    రాత్రి పన్నెండు దాటింది. నిద్రపట్టని రాజారావు పక్క మీద అటూ ఇటూ దొర్లుతున్నాడు. వారం రోజుల నుండి ఇదే వరుస! దానికి కారణం లేకపోలేదు...ఎదురింటి  రంగనాథానికి తాను  ఊహించిన దానికంటే రెట్టింపు పంట పండటమే. అదొక్కటే కాదు.. ఆ ఊర్లో మరెన్నో విషయాల్లో రాజారావు కంటే ఓ మెట్టు పైనే ఉంటున్నాడు రంగనాథం.
    చాలా ఏళ్లుగా అదంతా గమనిస్తున్న రాజారావుకు అంతకంతకూ రంగనాథం మీద ఓ విధమైన అసూయ అంతరాంతరాల్లో పేరుకుపోయింది. ఏ విధంగానైనా అతను నష్టపోతే చూడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. కానీ,అలాంటిదేమీ జరగకపోగా మరింతగా దినదినాభివృద్ధి పొందటం చూసి అతని రక్తం ఉడికెత్తిపోతోంది.
    దానికి తోడు అతని కొడుకు శ్రీరామ్ తన కొడుకు సురేష్ కంటే బాగా చదువుతూ అన్నింట్లో మొదటివాడుగా ఉంటున్నాడు. అది మరో దెబ్బ రాజారావుకి. అందుకే ఈనాడిలా అసహనంగా ఉన్నాడు. ఏమైనా సరే, ఏదో ఒకటి చేసి, అతనికి తీరని నష్టం కలిగించాలని తీర్మానించుకున్నాడు. అలా అనుకున్న తర్వాతే అతని మనసు ప్రశాంతత పొంది, మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు.
   ఆ క్షణం నుండి బాగా ఆలోచించి, రెండు రోజుల తర్వాత ఓ పన్నాగం పన్నాడు రాజారావు. ఆరోజు ధాన్యం బస్తాల్ని ఎడ్ల బండి మీద ఎక్కించుకొని పట్నం తీసుకుపోబోతున్నాడు రంగనాథం. అదును చూసుకొని రాజారావు ఎవరూ చూడకుండా ఆ బండి చక్రం ఒక దానికి ఆధారంగా ఉండే పెద్ద మేకును తొలగించేశాడు. అదేమీ గమనించని రంగనాథం పాలేరును తోడు తీసుకుని బండి తోలుకుంటూ పట్నం బయలుదేరి వెళ్ళాడు.
  ఆ మధ్యాహ్నం రాజారావు బంధువొకాయన రొప్పుకుంటూ వచ్చి  ఓ దుర్వార్త రాజారావుకు చేరవేశాడు.దాని సారాంశం...రాజారావు కొడుకు సురేష్ ఎడ్ల బండి మీద నుండి కింద పడి, తలకు బాగా దెబ్బ తగిలి ఆసుపత్రిలో ఉన్నాడని..! లబోదిబోమంటూ రాజారావు ఆసుపత్రికి పరుగెత్తాడు. అక్కడ రంగనాథం ఎదురుపడేసరికి ఒక్కసారిగా  అవాక్కైపోయాడు రాజారావు. తీరా విషయం తెలిసేసరికి అతనికి తల కొట్టేసినట్లయింది.
    రంగనాథం ఎడ్లబండి తోలుకొని పోతుండగా   అదే దారిన పట్నం వెళ్తున్న సురేష్ అనుకోకుండా అతని బండి ఎక్కి కూర్చున్నాడట! అంతే! కొంత దూరం వెళ్లేసరికి రాజారావు చేసిన పనికిమాలిన పని ఫలితంగా బండి చక్రం దబ్బున ఊడి, బండి కాస్తా ఉన్నట్టుండి ఒకవైపు ఒరిగిపోయింది. అటువైపే కూర్చున్న సురేష్ విసురుగా కిందపడి దొర్లుకుంటూ వెళ్లడంతో తల అక్కడున్న ఓ పెద్ద రాతికి బలంగా తగిలింది. అదృష్టవశాత్తు రంగనాధానికి, అతని పాలేరుకూ పెద్దగా దెబ్బ లేమీ తగలలేదు. వెంటనే అటువైపుగా వెళుతున్న ఓ ఆటోను ఆపి, సురేష్ ను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు రంగనాథం. విషయం అంతా వివరించి, సమయానికి తీసుకురావడం వల్ల ప్రాణాపాయం తప్పిందని డాక్టరు చెప్పాడని రంగనాథం రాజారావును ఓదార్చాడు. రాజారావు సిగ్గుతో చితికిపోయాడు.
    రంగనానికి హాని  చేయబోతే తిరిగి అతనే తనకు అనుకోని రీతిలో సాయపడడం అతనికి మింగుడు పడలేదు. తాను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఇదే కాబోలు అనుకుంటూ తల పట్టుకున్నాడు.

నీతి : చెడపకురా చెడేవు.

( ఆంధ్రభూమి  వారపత్రికలో 'ఫలితం' పేరుతో ప్రచురితం )





Tuesday, July 1, 2025

కనిపించే దేవుళ్ళు...

   
" వైద్యో నారాయణో హరిః" అంటారు. డాక్టర్లు దేవుళ్ళనీ అంటారు. పోతున్న ప్రాణాలు సైతం నిలబెట్టి మనిషికి ఆయుష్షు పోసే శక్తి ఒక్క వైద్యులకే సొంతం అన్నది నిర్వివాదాంశం. కానీ.. ప్రస్తుత రోజుల్లో వైద్యులు మునుపటి గౌరవాన్ని పొందడం లేదన్నది వాస్తవ దూరమైతే కాదు. ఒకప్పటిలా డాక్టర్ల సేవాతత్పరత నేడు కానరావడం లేదు.. ఎందుకని!
   వృత్తి పట్ల అంకితభావం లోపిస్తోంది. ఎంతో కష్టపడి మెడిసిన్లో సీటు సంపాదించి ఏడెనిమిదేళ్లు శ్రమకోర్చి తెచ్చుకున్న డిగ్రీ..! అంత కష్టంతో డాక్టర్ అయ్యాక.. అసలు తానెందుకు ఆ చదువే ఏరి కోరి ఎంచుకున్నాడో మరిచిపోతే ఎలా!!
   శారీరక బాధలు,అనారోగ్యాలు వేధిస్తున్నప్పుడు ఎవరికైనా తక్షణమే గుర్తుకొచ్చేది డాక్టరే...! ఎంతో నమ్మకంతో,ధైర్యంతో వెళ్లి డాక్టర్ ముందు కూర్చున్న రోగి డాక్టర్ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పేషెంట్ చెప్పే సమస్యను పూర్తిగా సహనంతో వినడం ఆ వైద్యుని కనీస ధర్మం. అలాగే ప్రసన్నంగా కనిపించడం, చిరునవ్వుతో తన ముందున్న రోగిని పలకరిస్తూ సమస్యను సందేహించక తనతో చెప్పేలా చేయడం ఓ డాక్టర్ కు ఉండాల్సిన ప్రథమ లక్షణం.
    ప్రస్తుతం ఎందరు డాక్టర్లు ఈ విధంగా ఉంటున్నారనేది ప్రశ్నార్థకమే! రోజుకు లెక్కలేనంతమంది రోగులు వస్తుంటారు.. అందరితో అలా అంత ఓర్పుగా, వ్యవహరించడం ప్రతి ఒక్కరికి అంత సమయం కేటాయించడం..సాధ్యమేనా! అన్నది ప్రశ్న! అది కొంతవరకు నిజమే అయినా.. వైద్యులకు ఉండాల్సిన ప్రాథమిక లక్ష్యాన్ని విస్మరించడం మాత్రం తగదని చెప్పాలి.
   మరో విషయం.. ఎందరో డాక్టర్లున్నా, కేవలం కొందరికి మాత్రమే మంచి డాక్టర్ అన్న పేరు వస్తూ ఉంటుంది. దానికి కారణం రోగులతో ఆ డాక్టర్స్ ప్రవర్తిస్తున్న తీరు మాత్రమే..! వైద్య రంగంలో రాణించడం, రాణించకపోవడం అన్నది ప్రధానంగా ఆ వైద్యుల చక్కటి ప్రవర్తనా తీరుపై ఆధారపడి ఉంటుంది. కొందరికి చక్కటి నైపుణ్యాలున్నా కోపం, చిరాకు,విసుక్కోవడం, వ్యంగ్య ధోరణిలో మాట్లాడటం, రోగి చెప్పేది పూర్తిగా వినకుండానే మందులు రాసేయడం, టెస్టులు చేయించమనడం.. ఇలాంటి లక్షణాల వల్ల రోగులు అలాంటి డాక్టర్ల వద్దకు వెళ్లడానికి అంతగా ఇష్టపడరు.
   ఒకప్పుడు ఫ్యామిలీ డాక్టర్లుండే వారేమో గానీ.. ఇప్పుడా అవకాశం ఉండడం లేదు. ఈ సందర్భంగా..  ఓ విషయం ప్రస్తావించాలనుకుంటున్నాను. నా చిన్నతనంలో మా గ్రామంలో ఒకాయన ఉండేవారు.యాభై ఏళ్ళు ఉంటాయి. ఆయన ఎంబీబీఎస్ డాక్టర్ కాదు..అయినా ఎంతో అనుభవజ్ఞుడైన డాక్టర్ కున్న పరిజ్ఞానం ఉండేది . ఊర్లో ఎవరికి ఏ అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే ఆయనకు కబురు పంపేవారు. ఆయన కూడా ఏ భేషజం లేకుండా తక్షణమే వచ్చి రోగిని పరామర్శించి తన వద్ద ఉన్న టాబ్లెట్స్ ఇచ్చేవాడు. అందులో అలోపతితో పాటు హోమియోపతి, ఆయుర్వేదం కూడా ఉండేవి. ఆయన హస్తవాసి ఏమోగానీ  మరుసటి దినానికంతా సమస్య సద్దుమణిగి మనిషి నార్మల్ అయిపోయేవాడు. ఆ ఊరికి ఆయనే తిరుగులేని డాక్టర్ !! నయాపైసా ఆశించక ప్రతివారికీ అందుబాటులో ఉండేవాడు.
  అంతటి సేవాతత్పరత ఈరోజుల్లో  ఎందరు డాక్టర్లకు ఉందంటారు! ఎంతటి ప్రమాద స్థితిలో ఉన్న పేషెంట్ నైనా.. పక్క ఇంటిలోనే ఉన్న డాక్టర్ కూడా పిలిచినా రాడు..! పేషెంట్ నే అతని వద్దకు తీసుకొని పోవాల్సి వస్తోంది. అలాగే కొద్ది సంవత్సరాల క్రితం ఏదైనా అస్వస్థతకు లోనై డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షించి మందులు మాత్రం రాసిచ్చేవారు. ఇప్పుడు వెంటనే టెస్టులు కూడా రాసిస్తున్నారు.! అందరూ ఇలాగే ఉంటున్నారు అని మాత్రం చెప్పడం లేదు.. కానీ ఎక్కువ శాతం జరుగుతున్నది ఇదే! అందుకేనేమో.. చిన్న చిన్న అనారోగ్యాలకు డాక్టర్ల దగ్గరకు వెళ్లడం మానేస్తున్నారు చాలామంది.
    ఏది ఏమైనా డాక్టర్లు దేవుళ్ళు అనే పేరు ప్రజల్లో నిలిచిపోవాలంటే డాక్టర్లకు సేవాభావం, రోగుల పట్ల దయ తప్పక ఉండాల్సిందే. అప్పుడే మంచి డాక్టర్ అనిపించుకుంటాడు. ప్రస్తుతం వృత్తి పట్ల అంకితభావం లేని వాళ్ళు అసలు లేరని చెప్పడం కూడా భావ్యం కాదు. కాలాలతో నిమిత్తం లేకుండా అప్పుడూ ఇప్పుడూ మంచి డాక్టర్స్ ఉంటూనే ఉన్నారు. సంపాదనే ధ్యేయం కాకుండా ఉచిత వైద్యం చేస్తూ, మందులు కూడా ఉచితంగానే అందిస్తూ రోగులను ఎంతో ఆప్యాయంగా, ప్రేమగా చూసుకునే వారూ ఉంటున్నారు. వారు నిజంగా వైద్య నారాయణులే..! వారందరికీ హృదయపూర్వక నమస్సులు. డాక్టర్స్ ని విమర్శించరాదు. ఎందుకంటే ఏ అనారోగ్యం పొడసూపినా వారే దిక్కు మరి!! వ్యాధుల బాధలు బాపే అపరధన్వంతరులు రోగుల పట్ల శ్రద్ధ చూపడం ఎంతైనా అవసరం. అప్పుడే వారు కనిపించే దేవుళ్ళు అవుతారు...🙏 

                 ( నేడు 1.7.25 డాక్టర్స్ డే )

Thursday, June 19, 2025

స్ఫూర్తి ప్రదాత... అబ్దుల్ కలాం

 

   భారత రాష్ట్రపతిగా వినుతికెక్కిన A. P. J. అబ్దుల్ కలాం గారు మహోన్నత వ్యక్తిత్వం కలిగిన విశిష్ట వ్యక్తి. Missile Man of India గా పిలువబడ్డ వీరి పూర్తి పేరు Avul Pakir Jainulabdeen Abdul Kalam. అక్టోబర్ 15  1931 న రామేశ్వరంలో జన్మించారు. యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చిన వీరి కీర్తి అజరామరం. 2015 జూలై 27 న ఓ సమావేశంలో విద్యార్థుల సమక్షంలో ప్రసంగిస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఈ మహనీయుని స్ఫూర్తిదాయకమైన సూక్తులు, మాటలు ఓసారి మననం చేసుకుందాం...

మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది.   కానీ, ఏదైనా గాయమైతే  మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తం ఉంటుంది, కానీ... మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లు బయటకు వస్తాయి.
*
కల అంటే  నిద్రలో వచ్చేది కాదు... నిద్రపోనివ్వకుండా చేసేది. నిజమైన కల దాన్ని సాకారం చేసుకునేవరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు.
*
ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది. ఒక పనిని నాటితే..అది అలవాటుగా ఎదుగుతుంది.. ఒక వ్యక్తిత్వాన్ని నాటితే...అది తలరాతగా ఎదుగుతుంది...కాబట్టి మన తలరాతను సృష్టించుకునేది మనమే...!!
*
హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు అందం వ్యక్తిత్వంలో కనబడుతుంది.

*********************************
       

Monday, June 16, 2025

కథలు కాదు వాస్తవాలు

 

 ఇటీవల ( 12.6.25 ) అహ్మదాబాదులో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం నుండి ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతమే! మొత్తం 242 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం నుండి అనూహ్యంగా స్వల్ప గాయాలతో బయటపడి మృత్యుంజయుడుగా నిలిచిన బ్రిటిష్ జాతీయుడైన నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ తాను ఎలా ప్రమాదం నుండి ప్రాణాల్ని దక్కించుకున్నాడో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలియజేశాడని సమాచారం. తాను కూర్చున్న సీటుకు కాస్త ముందు భాగంలో అత్యవసర ద్వారం ఉండడం..ప్రమాదం జరిగే క్షణాల్లో ఆ ద్వారం తెరుచుకోవడంవల్ల సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి సీటు బెల్టు తొలగించుకుని ఆ ద్వారం గుండా బయటకు దూకడం జరిగిందనీ, తన సీటుతో సహా మెడికల్ కాలేజీ వసతి గృహం మీద ఓ సురక్షిత ప్రదేశంలో పడ్డాననీ చెప్పాడట!!
    వందల మంది ప్రయాణికుల్లో ఒక్కడు మాత్రం సజీవంగా బయటపడటం ఊహకందని వాస్తవ ఘటన కాక మరేమిటి! భారతదేశ వైమానిక చరిత్రలో ఇదొక అత్యంత విషాదకరమైన  ఘట్టం అయితే... మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన మరొకటి ఈ దుస్సంఘటనతో ముడివడి ఉండడం మనసును మెలిపెట్టే మరొక బాధాకర విషయం... అదేమిటంటే....
   ఈ సంఘటనతో గానీ, ఈ విమానంతో గానీ, అందులోని ప్రయాణికులతో గానీ ఏ మాత్రం సంబంధం లేకున్నా..వైద్య కళాశాల వసతి గృహంలో యధాలాపంగా మధ్యాహ్నం భోజనం చేస్తూ అనూహ్యంగా దుర్మరణం పాలైన అమాయక వైద్య విద్యార్థులు విధి వంచితులుగా మారడం !! వారి కుటుంబాలకే గాక యావత్తు ప్రజానీకానికి ఇది తీరని వేదనను మిగిల్చింది. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో!!
    --- అలాగే ఇదే విమానంలో లండన్ కు ప్రయాణించాల్సిన భూమి చౌహాన్ అనే మహిళ ఆలస్యంగా బయలుదేరడం వల్ల విమానం అందుకోలేక తనకు తెలియకుండానే మరణం బారి నుండి తప్పించుకోవడం కేవలం యాదృచ్ఛికమే.. ఇది కూడా కథ కాదు.. వాస్తవమే !

Saturday, June 14, 2025

'చిన్నారి'... అమ్మా తేవే నా పలక...బాలగేయం

🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠
                                                ~ యం. ధరిత్రీ దేవి

 బాలగేయాలు చిన్నపిల్లల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎప్పుడూ పాఠాలే కాకుండా వారికి పాటలు కూడా నేర్పిస్తే చక్కగా నేర్చుకుంటారు. అలాగే పాటల ద్వారా అంతర్లీనంగా చక్కటి సందేశాలనూ పిల్లలకు అందించవచ్చు.పాటలకు అభినయం జోడిస్తే అభినయ గీతాలవుతాయి కూడా. అలాగే ఉపాధ్యాయులకు పిల్లలకూ మధ్య చక్కటి అనుబంధం ఈ పాటల ద్వారా ఏర్పడుతుంది. ఈ క్రింది బాల గేయానికి చక్కటి రాగం కట్టి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నేర్పించవచ్చు...

అ ఆ ఇ ఈ అమ్మా తేవే నా పలక 
ఆడుతు పాడుతు పరుగున 
నేనూ బడికెళతా
                                                               //అఆ// 
అన్నతో నేనూ పోటీ పడతా 
చెల్లికి నేనూ పాఠం చెబుతా
బడిలో నేనూ బుద్ధిగ ఉంటా
తరగతి లీడర్ నేనే అవుతా 
                                                              //అఆ//
ఒకట్లు పదులు వందలు వేలు 
వారాలు నెలలు సంవత్సరాలూ
తెలుగు ఆంగ్లం గణితం జ్ఞానం
చకచక అన్నీ నేర్చుకుంటా

                                                              //అఆ//
గురువులు మాకు దైవాలు
భవితకు  దారులు వేస్తారు
నా తోటి పిల్లలు నా నేస్తాలు
మానేస్తాము కలహాలు
 
                                                            //అఆ// 
🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠🫠

                                                

Thursday, June 12, 2025


      ప్రపంచ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం 
                   Stop Child Labour
                   ````````````````
                                  ~ యం. ధరిత్రీ దేవి

    కొద్ది రోజుల క్రితం ఓ వార్త వచ్చింది. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పు తీర్చలేక తల్లిదండ్రులు తొమ్మిది సంవత్సరాల వారి కొడుకును అప్పిచ్చిన వారి వెంట పనికి పెట్టారనీ, అక్కడ పని భారం మోయలేక వారు పెట్టే చిత్రహింసలు భరించలేక ఆ పిల్లవాడు మృతి చెందాడన్నది ఆ వార్త సారాంశం. ఇలాంటి ఉదంతాలు కొత్తేమీ కాదు..తరచూ వింటూనే ఉంటాం...
    చాలా ఏళ్ల క్రితం.. అంటే దాదాపు నాలుగైదు దశాబ్దాల క్రితం వెట్టి చాకిరీ ( bonded labour ) అనే మాట ఎక్కువగా వినవస్తూ ఉండేది. తీసుకున్న అప్పుకు వడ్డీ కింద అప్పిచ్చిన వారి వద్ద కుటుంబంలో నుంచి ఎవరో ఒకరు పనులు చేయడం..! సంవత్సరాలు గడిచినా..ఆ 'అసలు'తీరడం అన్నది ఎప్పటికీ ఉండనే ఉండదు. తరాలు మారినా ఆ అప్పు తీరదు. చేస్తున్న చాకిరీకి వడ్డీ జమ చేయడమే!! పెద్దలకు కుదరనప్పుడు చిన్నపిల్లలనే ఆ పనికి కుదిర్చేవారు. అది అసమంజసమైనా ఆ నిరుపేదలకు తప్పని దుస్థితి. ఇది బాలల హక్కుల్ని కాలరాయడం కాక మరేమిటి!?
తండ్రి చేసిన అప్పు తీర్చే మిష మీద పసివారి బాల్యాన్ని తాకట్టు పెట్టడం! ఇంతకంటే శోచనీయం ఉంటుందా !
   5 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలు హాయిగా తల్లిదండ్రుల చాటున ఉంటూ ఆటపాటలతో కాలం గడిపే ఆహ్లాదకరమైన, అపురూపమైన బాల్యమది. పైగా.. చక్కగా చదువుకుని భవిష్యత్తుకు పునాదులు వేసుకునే వయసు కూడా.అది వారి జన్మ హక్కు. ప్రాథమిక హక్కు కూడా. అలాంటి వారి హక్కుల్ని అపహరిస్తూ వారి భావి జీవితాన్ని కాలరాసే హక్కు కన్న తల్లిదండ్రులకు కూడా ఉండదు గాక ఉండదు. కుటుంబం కోసం పెద్దలు చేసిన అప్పులకు అభం శుభం ఎరుగని పసివాళ్లను బలిపెట్టడం ఎంతవరకు భావ్యం!? ఇది ఖచ్చితంగా పిల్లల శ్రమను దోపిడీ చేయడమే...
   ఏళ్లుగా సాగుతున్న ఈ దుశ్చర్యల్ని అరికట్టడానికి ఆవిర్భవించినదే ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం. ఈరోజు కోసం ప్రతి సంవత్సరం జూన్ 12వ తారీకు నిర్ణయించబడినది. International Labour organization ( ILO ) 2002 లో ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది .
 ఇంతకీ... ఈ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
* ఈ సమస్యపై శ్రద్ధ చూపడం...
* దానిని నిర్మూలించడానికి మార్గాలను కనుగొనడం..
* ప్రపంచవ్యాప్తంగా బలవంతంగా బాల కార్మికులుగా 
   పిల్లలు ఎదుర్కొంటున్న,మానసిక,శారీరక సమస్యల
   గురించి తెలియజేయడం...
* బాల కార్మికులను అరికట్టడానికి అవసరమైన
   చర్యలు చేపట్టడం...
* ఆదిశగా అభివృద్ధి సాధించడం...
---- ఇంతకీ బాల కార్మికులు అంటే ఎవరు ?
18 సంవత్సరాల లోపు పిల్లలు... వీరిని పనుల్లో పెట్టడం ద్వారా వారి శారీరక, మానసిక, సామాజిక ఇంకా విద్యాభివృద్ధికి హాని కలిగించడం జరుగుతుంది. ప్రమాదకర కార్యకలాపాల్లో వీరి శ్రమను ఉపయోగించుకోవడం వల్ల వీరి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎన్నో విధాలుగా ప్రభావితమవుతుంది. తద్వారా వారి చక్కటి భవిష్యత్తు  అగమ్య గోచరంగా మారిపోతుంది. లేత వయసులో వారి మానసిక స్థితి వక్రమార్గం పట్టే దిశగా పయనించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందరిపై అకారణ ద్వేషాలు, సమాజంపై ఒక రకమైన  కసి పెరిగిపోతాయి. ఆ విధంగా మొత్తం సమాజానికి వీరు చేటు తెచ్చే దుష్ట శక్తులుగా మారే ప్రమాదం పొంచి ఉంటుందన్నది నిర్వివాదాంశం.
   రేపటి తరం పౌరులు అలాంటి విద్రోహులుగా మారడం... దేశ భవిష్యత్తును అనూహ్యమైన సమస్యల విష వలయంలోకి నెట్టి వేయగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.
   దీనికి ముఖ్య కారణం.. బాల్యంలో వారికి విద్యాబుద్ధులు అలవడకపోవడమే. హాయిగా చదువుకోవలసిన వయసులో ఆ లేత చేతులు, పాదాలు కార్ఖానాల్లో, కర్మాగారాల్లో, ఇళ్లల్లో వెట్టి చాకిరీతో సతమతమవుతూ కునారిల్లుతుంటే ఆ పసి మనసులకు సంతోషం అన్నది ఉండడం సంభవమా! ఆటపాటలతో ఉల్లాసంగా తల్లిదండ్రుల ప్రేమాదరణలో సేదదీరాల్సిన ఆ బాల్యం పనీపాటలతో బండబారిపోవలసినదేనా !! ఇలాంటి వాతావరణంలో విపరీత, విపత్కర పరిస్థితులతో రాజీపడుతూ.. బాల్యాన్ని బలి పెడుతూ, పెరుగుతూ ఆ దశ దాటిపోయాక గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ బ్రతుకంతా భారంగా వెళ్లదీయడానికి కారకులెవరు ? 
 --- తల్లిదండ్రులా ? బాల కార్మిక వ్యవస్థను పెంచి పోషిస్తున్న యాజమాన్యాలా ? లేక వారిపై శ్రద్ధ చూపని ప్రభుత్వాలా  ?
 ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని ఆవిర్భవించినదే బాల కార్మిక వ్యతిరేక దినం. అందుకోసం నిర్ణయించబడ్డ, పాటించాల్సిన కొన్ని ముఖ్యంశాలు...
* పిల్లల హక్కుల్ని కాపాడాలి...
* పిల్లలు పని చేయకూడదు. వారితో పనులు 
   చేయించరాదు.
* బడి ఈడు పిల్లలంతా బడిలోనే ఉండాలి.
* ప్రభుత్వాలు, వ్యాపారస్తులు, కర్మాగారాలు 
    పిల్లల హక్కుల్ని కాపాడాలి.
--- ఇందుకోసం ఆచరించవలసిన విషయాలు..
* బాల కార్మిక వ్యవస్థ యొక్క మూల కారణాలను 
   కనుగొనడం,పరిష్కరించడం, నిర్మూలించడం..
--- బడి ఈడు పిల్లలు బడి బయట కాదు.. బడిలోనే ఉండాలి అన్న భావన ముఖ్యంగా తల్లిదండ్రుల్లో కలిగించాలి. ఇందులో ఉపాధ్యాయుల పాత్ర ప్రధానమైనదిగా చెప్పవచ్చు. పెద్దలు చేసిన అప్పులకు,వారు మోయవలసిన బాధ్యతలకు కన్నబిడ్డల్ని బాధ్యులుగా చేయడం సమంజసం కాదని తల్లిదండ్రులకు నచ్చ చెప్పడం జరగాలి.
  అశాంతికి, అభద్రతకూ లోనైన పిల్లలు సంఘ విద్రోహ శక్తులుగా మారి, సమాజానికి, దేశానికి హాని కలిగించే కారకాలుగా అయ్యే అవకాశాల్ని పెద్దలకు వివరించాలి. తద్వారా వ్యక్తిగత కుటుంబాలకే కాక సమాజం, దేశం అలజడికి లోనయ్యే పరిస్థితులు వారి ముందుంచడం అతి ముఖ్యం.
 పేదరికంలో మగ్గిపోతూ, పిల్లల్ని చదివించలేకపోతున్న వారికి ఎన్నో విధాలుగా ప్రభుత్వం చేయూతనందించడం హర్షణీయం. అందులో మధ్యాహ్న భోజన పథకాలు, ఉచిత పుస్తకాలు, యూనిఫాంలు, ఫీజులు రద్దు చేయడాలు, ఇంకా స్కాలర్షిప్  మంజూరు చేయడాలు మొదలైనవి పేదవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి. ఈ సౌకర్యాలన్నీ కాలేజీ చదువుల దాకా విస్తరింప చేయడంలో ప్రభుత్వాలు చేస్తున్న కృషి ఎంతేని అభినందనీయం..
    ఏది ఏమైనా... ఆటపాటలతో బాల్యాన్ని ఆస్వాదిస్తూ, చదువుకోవాల్సిన పిల్లలను బాల కార్మిక వ్యవస్థ నుండి కాపాడడానికి ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినాన్ని ప్రవేశపెట్టి, జూన్ 12 వ తేదీని  ఆ దినోత్సవానికి కేటాయించడం ఎంతో సంతోషించాల్సిన విషయం. అలాగే ఆచరణపై కూడా అన్ని యాజమాన్యాలు దృష్టి పెట్టడం చాలా అవసరం.
   మనం గమనిస్తూ ఉంటాం.. ఇళ్లల్లో పని మనుషులుగా 10 నుండి 15 సంవత్సరాల అమ్మాయిలు చేస్తూ ఉండడం.. అదే వారి ఆర్థిక దుస్థితి కావచ్చు.. కానీ ప్రోత్సహించకపోవడం మంచిది. ఆ పిల్లల తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారిని పాఠశాలకు పంపేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ప్రభుత్వమే వారికి కావలసిన అవసరాలన్నీ తీరుస్తుందని తెలియజెప్పాలి.
   ఇవన్నీ అమలు చేయడం ద్వారా కొంతలో కొంతవరకైనా ఈ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించగలం. జూన్ 12న బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం గురించి అందరికీ అవగాహన కలిగిద్దాం. ప్రతి ఒక్కరం అందులో భాగస్వాములమవుదాం. అది మనందరి కనీస బాధ్యతగా పరిగణిద్దాం...
                          __________________