Thursday, February 29, 2024

పెద్దకొడుకు....కథ

 జూన్, 2022 మాలిక పత్రికలో కథ : పెద్దకొడుకు 

రచన : యం. ధరిత్రీ దేవి 

Monday, February 26, 2024

మళ్ళీ వస్తుంది....

🥀
                                               ~~ యం. ధరిత్రీ దేవి   


ఆకులన్నీ రాలుతున్నవేళ...చింతించనేల...!
కొత్త చివురులు వస్తాయి...మురిపిస్తాయి...
మది నిండుగ మోదము కురిపిస్తాయి...
మోడు మోడుగానే మిగిలిపోదు... 
మళ్ళీ వస్తుందిగా వసంత శోభ.... 🥀🙂
జీవితానికి మాత్రం...వర్తించదా ఏమి ఈ సూత్రం!
ప్రయత్నించి చూద్దాం...పొందగలమేమో ఉపశమనం!!

🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦🐦




 

Sunday, February 18, 2024

తనదాకా వస్తేగానీ..... ( కథ )

     మధ్యాహ్నం భోంచేసి, వంటిల్లు సర్దేసుకుని ఉస్సురంటూ అలా వెళ్లి నడుం వాల్చింది రాగిణి. భర్త గిరిబాబు, పాప, బాబు ఉదయం క్యారేజీలు తీసుకునే వెళ్తారు. సాయంత్రానిగ్గానీ తిరిగి రారు. పడుకుని కాస్త రిలాక్స్ అవుదామని కళ్ళు మూసుకున్న రాగిణి.. గేటు చప్పుడై విసుగ్గా లేచింది. 
రాఘవమ్మ ! ఇంటి ఓనరు. ఈసారి మూడింటికే దిగిందేమిటీవిడ ! అనుకుంటూ ముఖాన నవ్వు పులుముకుంటూ, 
" రండి రండి.. "
అంటూ ఆహ్వానించింది. ఆవిడో రిటైర్డ్ హెడ్ మిస్ట్రెస్. తప్పులెంచడం నా జన్మహక్కు అన్నట్లుంటుంది ఆవిడ వాలకం ! ప్రతి నెలా రెండో తారీఖు ఇంటి అద్దె కోసం స్వయానా తనే  వస్తుంది. 
" మీకెందుకండీ శ్రమ ! నేనే తెచ్చిస్తాను గదా, "
అని గిరిబాబు మొదటి నెలే అన్నాడు... కానీ ఆవిడ, 
" అయ్యో పర్వాలేదండి.. ఈ పక్క వీధిలోనే మా అమ్మాయి వాళ్ళు ఉంటున్నారు. నెలకోసారి వాళ్లనీ చూసినట్టు ఉంటుంది... "
అనేసింది. కానీ కొద్ది నెలలకే ఆవిడ ఆంతర్యం అవగతమైపోయింది గిరిబాబు దంపతులకు... అద్దె వసూలు చేసుకునే నెపంతో,  ఇల్లు ఎలా ఉంచుకుంటున్నారో చూడాలన్న  ఆదుర్దాతోనే ఆవిడ వస్తోందని !
    వచ్చినప్పుడల్లా ఇల్లంతా ఓ సారి కలయదిరుగుతుంది. ఏదో ఒకటి పట్టేస్తుంది. 
" గోడ మీద ఈ  గీతలేంటి రాగిణి గారూ ! పిల్లలకు కాస్త చెప్పుకోరాదూ... !" 
అని ఓ సలహా పారేస్తుంది. 
" పనిమనిషిని పెట్టుకోలేదా? "
అంటూ పైన వేలాడుతున్న బూజులు చూస్తుంది. అలా ఏదోఒకటి అనకుండా బయట అడుగు పెట్టదు. ఈసారి ఏం లాగుతుందో... అనుకుంటూ ఆవిణ్ణి కూర్చోమని చెప్పి, టీ తెస్తానంటూ లోపలికెళ్ళింది రాగిణి. పది నిమిషాల తర్వాత అద్దె  డబ్బు పుచ్చుకుని బయలుదేరింది రాఘవమ్మ. 
" అమ్మయ్య! ఈరోజు ఈవిడ కంట ఏదీ పడలేదు... "
నిట్టూర్పు విడవబోయింది రాగిణి. అంతలోనే... 
" అయ్యో.. అయ్యో.. పెయింట్ కొట్టించి సంవత్సరం తిరగలేదు. అప్పుడే గేటు ఇలా తయారయిందేంటి !ఎంతలా గీసుకుపోయిందో చూడు... !"
రాగిణి వైపు అదోలా చూస్తూ అంది. ఏమనాలో తోచక వెర్రి నవ్వు నవ్వింది రాగిణి. విసుగ్గా మొగం  పెట్టి వెళ్ళిపోయిందావిడ. అలసట రెట్టింపై నీరసం కమ్ముకొచ్చింది రాగిణికి. 
                     **          **          **
  " ఏమిటే, బాబూ.. ఈ పన్నెండేళ్లలో ఆరు ఇళ్లు మారాము. నీళ్లు సరిగా రావంటూ ఒకటి ! పిల్లలకు బడి దూరమని ఒకటి ! ఇరుగుపొరుగు బాగా లేరంటూ మరొకటి! అసలు ఓనర్సే మంచి వాళ్లు కాదని ఇంకొకటి ! ఎన్నని  మారతాము? ఎలాగోలా సర్దుకుపోవాలి గానీ.... "
అసహనంగా అన్నాడు గిరిబాబు ఆ రాత్రి భార్య చెప్పిందంతా విని.
" అది  కాదండీ, వచ్చినప్పుడంతా ఆవిడ నసుగుడు, అనుమానం చూపులూ... మరీ అతి అనిపిస్తోంది.."
".. పక్కనే ఉంటే ఎప్పుడూ ఇబ్బంది పెడుతుంటారనే కదా... ఓనరు ఎక్కడో దూరంగా ఉండే ఇల్లని దీంట్లో చేరాము..!"
".. అవునండీ.. కానీ దూరంగా ఉన్నదన్న మాటే గానీ... పక్కనున్న వాళ్ళకంటే ఎక్కువ చేస్తోందండీ ఈవిడ !"
రెండు మూడు సార్లు గిరిబాబున్నప్పుడు  కూడావచ్చింది రాఘవమ్మ. ఆమె తీరు అతనికీ నచ్చడం లేదు. కానీ ఏం చేయగలడు  ! మధ్యతరగతి జీవి! సొంతిల్లు అన్నది  వాళ్ళకి గగన కుసుమమే ! తప్పదు. నెట్టుకు రావాలి ఎలాగోలా.. భార్యకు సర్ది చెప్పాడు.. కొంతకాలం ఓపిక పట్టమని !
               **            **           **
   పదేళ్ళు గడిచిపోయాయి. ఆరోజు  గిరిబాబు చాలా ఆనందంగా ఉన్నాడు. ఎన్నాళ్లుగానో నిరీక్షిస్తున్న ప్రమోషన్ వచ్చేసింది అతనికి UDC గా .ఆర్డర్ కాగితాలు పదేపదే చూసుకుంటూ సంబరపడిపోయాడు తన కల ఇన్నాళ్లకు నెరవేరినందుకు! వెంటనే అతనికి మరో కల గుర్తొచ్చింది.అదే ! సొంతింటి కల ! ఇప్పుడు జీతం పెరుగుతుంది.. లోన్ కు అప్లై చేయాలి. ఇన్కమ్ టాక్స్ మినహాయింపు ఉండనే ఉంటుంది. ఎలాగైనా సరే ఇల్లు కట్టుకోవడమో, కొనడమో చేయాలి... భార్య గుర్తొచ్చి, 
" పాపం,  పిచ్చిది ! ఎన్నాళ్ళుగా ఎదురుచూస్తూ ఉందో కదా సొంతింటి కోసం! "
అనుకుంటూ ఆనందంగా ఇల్లు చేరాడు.
                  **          **             **
   మరుసటి రోజు నుండే తన ఆలోచన అమల్లో పెట్టడం మొదలెట్టాడు.  ఆఫీసులో కొలీగ్స్ నీ, తెలిసినవాళ్లనీ సంప్రదించాడు. కట్టించడం అంటే రిస్క్ తో  కూడిన పని. ఆల్రెడీ కట్టినది తీసుకోవడం బెటర్ అని చాలామంది అభిప్రాయం వెలిబుచ్చారు. ఓ రోజు కొలీగ్ భాస్కర్ ద్వారా ఓ ఇంటి గురించి తెలిసింది. మరుసటి రోజు అతన్ని  వెంట పెట్టుకుని, రాగిణిని కూడా తీసుకుని వెళ్లి చూశాడు. రెండు పోర్షన్ల ఇల్లు ! బాగానే ఉంది. కట్టి రెండు  సంవత్సరాలే అయిందట! లొకాలిటీ కూడా పరవాలేదు. పిల్లలు కాలేజీ చదువులకొచ్చారుగాబట్టి... తనకూ వాళ్లకూ కాస్త దూరం అనిపించినా తిరగ్గలరు. రాగిణికి కూడా తెగ నచ్చేసింది. భాస్కర్ కూడా వంత పాడాడు. ధర కూడా వారికి అందుబాటులోనే ఉంది. ఇంకెందుకు ఆలస్యం అనుకుని, ఓనర్ ను కలిసి... ముగ్గురూ బేరసారాలు జరిపి చెప్పిన దానికంటే ఓ ఐదు లక్షలు తగ్గించుచేసుకుని... మరో వారానికంతా రాతకోతలు పూర్తి చేసుకున్నారు. ఇంకేముంది! గృహం గిరిబాబు దంపతుల సొంతమై స్వగృహం యజమానులై పోయారు. మరో నెలకంతా... గృహప్రవేశం.. పాలు పొంగించడం...అన్నీ పూర్తయిపోయి, ఒక పోర్షన్ లో చేరిపోయారు. ఆరోజు రాత్రి మొదటిసారిగా సొంతింట్లో  నిద్రిస్తూ, 
" అమ్మయ్య ! ఇంతకాలానికి మన సొంతింటి కల నెరవేరింది"
అనుకుని సంతోష పడిపోయింది రాగిణి . అసలు కష్టాలు స్వాగతం పలకబోతున్నాయని ఎరగని ఆ ఇల్లాలు  ఆదమరచి నిద్రపోయింది ప్రశాంతంగా..
                 **               **             **
      టులెట్ బోర్డు చూసి, అద్దె  ఇంటి కోసం అడగడం మొదలైంది  . కానీ,  కాస్త ఆలస్యమైనా.. సరైన వాళ్ళకి ఇచ్చుకోవాలని చూస్తున్నారిద్దరూ. ఓ నెలకంతా ఓ ఫ్యామిలీ దిగిపోయింది. భార్య,  భర్త, ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు.. ఓకే అనుకున్నారు.
  ఓ నెల గడిచింది. బయట శుభ్రం చేసుకోవడం, నీళ్లు జల్లి ముగ్గులు పెట్టుకోవడం.. పర్వాలేదు, పద్ధతిగానే ఉన్నారు.. అనుకుంది  రాగిణి. ఆమెకు వాళ్ళు దిగిన పోర్షన్ లోకి వెళ్లి ఒకసారి  చూడాలనిపించినా, ఏమనుకుంటారోనన్న మొహమాటంతో మిన్నకుండి పోయింది. అయినా ఉండబట్టలేక ఓ రోజు పలకరించే నెపంతో లోపల అడుగుపెట్టింది. అలా వెళ్ళిన రాగిణికి... అర్థమైపోయింది.. వాళ్ల శుభ్రత ఏమిటో! హాలంతా చెల్లాచెదురుగా వస్తువులు! ఊడ్చిన కసవు ఓ మూలన అలాగే ఉంది. దాంతోపాటే నిలబడ్డ చీపురుకట్ట ! వంటింట్లో సింకు నిండా అంట్ల  గిన్నెలు.. అది సరే! అందరిళ్లలో దర్శనమిచ్చేదే అని సరిపెట్టుకుని ముందుకెళ్లింది. అక్కడ ఓ మంచం, దానిమీద పడుకుని పెద్దాయన! పక్కనే కూర్చుని ఆయన భార్య! ఆమె చూపులు  పక్కకు తిరిగాయి. అక్కడ గోడలు చూసి ఒక్కసారిగా షాకయింది. తాంబూలం సేవించి, అదంతా ఊసిన ఎర్రటి మరకలు! 
"దేవుడా ! ఏమిటిదంతా!"
 రాగిణి  ముఖకవళికలు గమనించిన ఆమె, 
" ఈయనకి తాంబూలం అలవాటమ్మా, అది  లేకపోతే తోచదాయనకు.. ఏదైనా డబ్బా ఇచ్చినా అది వాడడు.. "
అంది సంజాయిషీగా. 
" ఆయన అలవాటు మాకు గ్రహపాటులా ఉంది"
అని  లోపల అనుకుని, నీరసంగా కదిలింది బయటకు. అద్దె  ఇంట్లో ఉన్నా తానెంత నీట్ గా ఉంచుకునేది! ఆ రాత్రి భర్త తో  విషయం చెబితే. విని  తలాడించాడు, అంతే!
   మొదట్లో సఖ్యంగా ఉన్నవాళ్లు రాను రాను ముభావంగా తయారైపోయారు రాగిణితో.  ఆర్నెల్లు తిరిగేసరికి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతారా అని ఎదురు చూడసాగింది రాగిణి. అదృష్టవశాత్తు త్వరలోనే  అతనికి ట్రాన్స్ఫర్ అయి  వెళ్లిపోయారు.టులెట్ బోర్డు మళ్లీ ప్రత్యక్షం!
     ఈసారి ఎలాంటి వారు వస్తారో అన్న బెంగతో ఉంది రాగిణి. అద్దె  తక్కువైనా పర్వాలేదు, ఇల్లు జాగ్రత్తగా పెట్టుకుంటే చాలు దేవుడా అని  కోరుకుంది పదే పదే. నెల రోజులు అయ్యాక మరో జంట దిగింది. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఓ బాబు. చేరేటప్పుడు అన్నీ చూసుకునే ఓకే అన్నారు. కానీ చేరిన  వారం నుండీ అన్నీ ఫిర్యాదులే!
" ఏంటండీ, బెడ్ రూమ్  లో ఫ్యాన్ సరిగా తిరగడం లేదు. బాత్రూంలో నీళ్ళూ అంతే !..."
" టాయిలెట్ సరిగా పనిచేయడం లేదండీ.. రిపేరు చేయించండి."
" గీజర్ లేకపోతే ఎలాగండీ? పెట్టించండి.."
అంటూ ఒకటే నస! రాగిణి  బయట కనిపించినప్పుడల్లా! తల పట్టుకుంది ! మళ్ళీ మొదలైంది లోపల రొద !
" అబ్బ ! వీళ్ళతో మరో రకం బాధ! ఎప్పుడు పోతారో  ఏమిటో! అయినా అద్దె ఇంట్లో ఉన్నప్పుడే బాగుండేది బాబూ, సొంతిల్లు వచ్చాక అన్నీ తిప్పలే !"
              **           **             **
     గిరిబాబు ఓ క్షణం విచిత్రంగా భార్య వైపు చూసి, మరుక్షణం పకపకా నవ్వేశాడు. ఉడుక్కుంది రాగిణి. ఆమె కోపం చూసి,
 " లేకపోతే ఏమిటే, అద్దె ఇంట్లో ఉన్నన్నాళ్లూ.. సొంత ఇల్లు సొంత ఇల్లు అంటూ కలవరించావు. అది కాస్తా  వచ్చాక...అద్దిల్లే బాగుంది అంటున్నావు... "
" అది కాదండీ, మనమిలాగే ఉండేవాళ్ళమా చెప్పండి. ఎంత బాగా చూసుకునేవాళ్ళం ఇంటిని సొంతింటిలాగా!ఓనర్లతో ఎంత మర్యాదగా ఉండేవాళ్ళం!ఇప్పుడున్నవాళ్లయితే... చెప్పానుగా వాళ్ళ ఫిర్యాదులూ,  వగైరాలూ...ఇంతకుముందున్న వాళ్ళూ... ఇల్లంతా పాడుచేసి పోయారు చూస్తూ ఎలా ఉండాలి? "
" ఉండాలి,  తప్పదు. చూడు, మన ఒంట్లో బాగా లేకపోతే ఏం చేస్తాం? డాక్టర్ దగ్గరికెళతాం. మందు వాడతాం. బాగుచేసుకుంటాం. కాస్త ఖర్చవుతుంది.. ఔనా ! అలాగే ఇల్లు కూడా.. ఇప్పుడున్నవాళ్ళు వెళ్ళిపోతే, మరొకరికిచ్చేలోగా పాడయినచోట బాగు చేయించుకుంటే సరి ! దానికీ అంతో ఇంతో ఖర్చవుతుంది.. అంతేగా ! ఆమాత్రం దానికి.. ఎందుకు టెన్షన్ పడుతూ.. ఆలోచిస్తూ.. మనసంతా పాడుచేసుకోవడం ..!"
చిత్రంగా చూసింది భర్త వేపు రాగిణి.
" అద్దె ఇంట్లో ఉన్నప్పుడు, ఓనర్ వస్తే.. నువ్వెంత విసుక్కునే దానివి!గుర్తు తెచ్చుకో. ఇప్పుడు వీళ్లూ అంతే అనుకోరాదూ.. తన దాకా వస్తే గానీ ఆ నొప్పి, దాని తీవ్రత తెలియదంటారు  అన్నట్లుంది నీ ధోరణి !"
"................."
"...పోతే, ఇప్పుడున్న వాళ్ళు ఏవైనా కావాలంటే చేయిద్దాం. లేదా వాళ్లనే చేయించుకోమందాం. అద్దె డబ్బుల్లో పట్టుకోమందాం. అంతేగా !"
"... సమస్య ప్రతీ చోటా ఉంటుందే పిచ్చి మొహమా !తమాషా ఏంటంటే... దాని పక్కనే పరిష్కారం కూడా ఉంటూ ఉంటుంది . అదే.. ఇప్పుడు నేను చెప్పినట్టన్నమాట ! అది తెలుసుకోలేక ఒకటే గుంజాటన పడుతుంటాం... "
కళ్ళు విప్పార్చుకుని చూస్తోంది రాగిణి. 
" అందుకే.. నేచెప్పొచ్చేదేంటంటే.. అటువేపు చూడకు. వాళ్ళ మానాన వాళ్ళని వదిలెయ్. వాళ్ళు ఖాళీ చేసిన రోజు వెళ్లి.... అంతా తనిఖీ చేసుకుని... అవసరమైన చోట రిపేర్లు చేయించుకుందాం. ఖర్చంటావా !అవుతుంది !భరిద్దాం. ఈ టెన్షన్ తో వచ్చే మనస్తాపం కంటే అది ఎక్కువేమీ కాదులే.. కాబట్టి నా సలహా పాటించి నిశ్చింతగా ఉండు.. "
చెప్పడం ఆపి, సుదీర్ఘంగా నిట్టూర్చి,చిద్విలాసంగా  నవ్వాడు గిరిబాబు. రాగిణి కళ్ళు మెరిశాయి.
" అవును కదా! చిదంబర రహస్యం చిటికెలో ఎంత సూక్ష్మంగా చెప్పేశాడు! పాటించడం కాస్త కష్టమే! కానీ అసాధ్యమయితే కాదు!"
అనుకుంటూ వెళ్లి భర్త పక్కన కూర్చుంది. ఆక్షణంలో గిరిబాబు ఆమెకు జ్ఞాన బోధ చేస్తున్న గౌతమ బుద్ధుడిలా గోచరించాడు. 

******************************************










ప్రతీ జీవితం ఓ ప్రయాణమే.. 8.. ' వైద్యో నారాయణో హరిః '

 🌺

        "వైద్యో నారాయణో హరిః"  -- ఈ మాటకు నూటికిి  నూరు పాళ్లూ సరిపోయే ఇద్దరు వైద్య నారాయణులు నా జీవనయానంలో నేనున్నంత వరకూ చెరగని గురుతులే. 
    అది నా మొదటి డెలివరీ సమయం. అప్పుడు నేను ఓ ప్రైవేట్ స్కూల్ లో టీచర్ గా చేస్తుండేదాన్ని. కర్నూల్లో అప్పట్లో బాలాంబ గారనే గైనకాలజిస్ట్ ఉండేవారు. నెల నెలా చెకప్ కు ఆమె వద్దకే వెళ్లేదాన్ని. ఐదవ నెల నడుస్తుండగా కొన్ని టెస్ట్ లు చేయించమన్నారావిడ. ఆ పరీక్షల్లో RH ఫాక్టర్ నెగటివ్ గా వచ్చింది. అలా వస్తే డెలివరీ అయ్యాక 48 గంటల్లో పల ఓ ఇంజక్షన్ తప్పనిసరిగా వేయించుకోవాలని చెప్పారామె. మరో రెండు నెలలు గడిచాక ఆ డాక్టర్ గారికి హైదరాబాద్ బదిలీ జరిగింది. వెళ్తూ వెళ్తూ నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, డెలివరీ తర్వాత ఇంజక్షన్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలంటూ దాని పేరు కూడా నాకు రాసి ఇచ్చారు. మంచి డాక్టర్ వెళ్లి పోతున్నందుకు చాలా బాధపడ్డానారోజు.
    నెలలు గడిచి, మరో డాక్టర్ పర్యవేక్షణలో సిజేరియన్ అయింది నాకు. పాప పుట్టింది. బాలాంబ గారు చెప్పినట్లు గానే ఇంజక్షన్ ఇవ్వడం కూడా జరిగింది.  ఐదారు నెలల తర్వాతనుకుంటా... ఓ రోజు నేను స్కూల్లో క్లాసులో ఉండగా... ప్రిన్సిపాల్ గారు పిలిపిస్తే ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్లాను.
  ఆశ్చర్యం! సంతోషం ! రెండూ  ఒకేసారి నాలో ! అక్కడ బాలాంబగారు !! నా పేరు గుర్తు పెట్టుకుని పిలిపించి, పరామర్శించి డెలివరీ గురించి అడిగారు. ఆవిడ నన్నంత  బాగా గుర్తుపెట్టుకోవడానికి మరో కారణం కూడా ఉంది. నేను చెకప్ కు తనవద్దకు  వెళ్తున్నప్పుడు డాక్టర్ గారి కుమారుడు అప్పుడు నేను పని చేస్తున్న ఈ స్కూల్లోనే రెండవ తరగతి చదువుతూ ఉండేవాడు. ఆ క్లాస్ టీచర్ నేనే. మొదటిసారి నేను చెకప్ కి వెళ్ళినప్పుడు నా గురించి వివరాలడిగారామె.పరీక్షించాక ఫీజు  ఇవ్వబోతే, 
" మా వాడి టీచర్ నువ్వు. నీ దగ్గర ఫీజు తీసుకుంటానా... "
 అంటూ సున్నితంగా వద్దనేశారు. ఓ పెద్ద పేరున్న డాక్టర్ చాలా రోజుల తర్వాత నన్ను పేరుతో సహా గుర్తు పెట్టుకుని నన్ను చూడాలని ఇలా పిలిపించడం ! మనసంతా సంతోషంతో నిండిపోయింది. ఇది జరిగి చాలా సంవత్సరాలయింది. ఈరోజు నేను వారికి గుర్తు ఉండకపోవచ్చు. కానీ నాకు మాత్రం నిన్నా మొన్నా జరిగినట్లుగా అనిపిస్తూ ఉంటుంది.
    అలాగే బాలాంబ గారు హైదరాబాద్ వెళ్ళాక, మరో డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యానని చెప్పాను కదా,  ఆయన డాక్టర్ శ్రీనివాసన్  గారు. గైనకాలజిస్ట్. ఎంత నైపుణ్యం కలిగిన వైద్యుడంటే... మాటల్లో చెప్పలేను.  అప్పట్లో వారిగురించి అక్కడి పేషంట్లే కాక  హాస్పిటల్లో పనిచేసే ఇతర  డాక్టర్లు, నర్సులు  కూడా   చాలా గొప్పగా చెప్పేవారు.ఆతర్వాత డాక్టర్ గారిని   ఎప్పుడు కలిసినా  నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు. ఆరోగ్యం గురించి అడిగే వారు. నేను నాకు తెలిసిన వాళ్ళనూ, బంధువుల పిల్లల్ని ఆయన వద్దకు పిలుచుకొని వెళ్లి చూపించేదాన్ని కూడా. నన్ను చూసి,  ఫీజు వాళ్ళు ఇవ్వబోయినా తీసుకునేవారు కాదు. ఇప్పుడా  డాక్టర్ గారు లేరు. కానీ నా స్మృతిపథంలో ఎప్పటికీ సజీవంగా  నిలిచే  ఉంటారు. . వీరంతా పెద్ద పెద్ద డాక్టర్లు.. కానీ ఈ సందర్భంగా మరొకరి గురించి చెప్పాలి నేను.
---నా చిన్నతనంలో  మా ఊర్లో శివయ్య గారని ఉండేవారు. అప్పుడు నేను స్కూల్లో చదువుతుండేదాన్ని. ఆయనకు యాభై  పైనే ఉండేది వయసు. ఎంబిబిఎస్ డాక్టర్ కాదాయన. కానీ ఏ  చిన్న అనారోగ్యం ఎవరికి  పొడసూపినా వెంటనే ఆయన కోసం కబురు పెట్టేవారు ఊర్లో ప్రతి ఒక్కరూ. ఆయనేమో క్షణాల్లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. అల్లోపతి,  హోమియోపతి మందులు ఆయనే  ఇచ్చేవారు. ఆయన వచ్చి  చేయి పట్టి చూసి, వెంటనే తన వద్ద ఉన్న  టాబ్లెట్స్ చేతిలో పెట్టి వేసుకోమనేవారు. అంతే ! మరుసటి రోజుకంతా నార్మల్ అయిపోయేది  పరిస్థితి ! అంత గొప్ప హస్తవాసి ఆయనది  !! ఆ ఊరి జనాలకు ఆయనే తిరుగులేని వైద్యుడు ! పైసా ఆశించడు. అలా నిస్వార్ధంగా సేవలందించే వాళ్లని ఈరోజుల్లో చూడగలమా ! అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు !  నా మస్తిష్కంలో మరపురాని గొప్ప వ్యక్తులువీరంతా🙏
     వీరి గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావించానంటే --
 ఇటీవలి కాలంలో కొందరు డాక్టర్ల తీరు చూస్తే చాలా బాధపడాల్సివస్తోంది. అప్పుడప్పుడు కాదు సరికదా.. రెగ్యులర్ గా  చెకప్ కు వెళ్లే పేషంట్లను కూడా అప్పుడే కొత్తగా చూస్తున్నట్లుగా ప్రవర్తించడం! ఏదో మొక్కుబడిగా చూడడం. అవసరం లేకున్నా ఏవేవో పరీక్షలు చేయించండంటూ రాయడం.. అవసరానికి మించి రకరకాల టాబ్లెట్స్ రాసేయడం.. అవి వేసుకుని రోగి హరాయించుకోగలడా అని ఏమాత్రం  ఆలోచించక పోవడం..! చిన్న అనారోగ్యాన్ని కూడా పెద్దదిగా చూపిస్తూ మానసికంగా భయభ్రాంతుల్ని చేయడం ! 
     డాక్టర్ ను చూడగానే... వారి  చక్కని మాటతీరు వల్లే సగం జబ్బు నయం అవుతుందంటారు. ఆ పరిస్థితి ప్రస్తుత రోజుల్లో చాలా అరుదుగా గోచరిస్తోంది. వ్యాపార ధోరణి బాగా పెరిగిపోయింది కూడా.వైద్యరంగంలో ఇలాంటి ధోరణి సమంజసం కాదు కదా !!
                      *****************

                    

      





Monday, February 12, 2024

ఓటుకు నోటు ( చిన్న కథ )


🌷

    సాయంత్రం  ఆరు దాటిపోయింది. శీతాకాలం. చీకట్లు నెమ్మదిగా ముసురుకుంటున్నాయి. ఆఫీసులో పని ఒత్తిడి వల్ల ఈ రోజు కాస్త ఆలస్యం అయిపోయింది. అదిగో, ఆ మలుపు తిరిగి నాలుగడుగులు వేస్తే మా ఇల్లు. ఆటో దిగి వడివడిగా నడుస్తున్న నేను సరిగ్గా మలుపు దగ్గర ఠక్కున ఆగిపోయాను. అటువైపు చివర కొన్ని గుడిసెల్లో చిన్నాచితక పనులు చేసుకునే వాళ్లు కాపురముంటున్నారు. ఈ రోజెందుకో అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారు. సాధారణంగా పదిమంది కూడారంటే కలకలం రేగుతుంది. అలాంటిది ఎందుకో ఈ రోజు అక్కడ వాతావరణం చాలా గంభీరంగా ఉంది. సహజమైన కుతూహలంతో విషయం ఏమై ఉంటుందా అన్న ఆలోచనతో ఓ క్షణం ఆగిపోయాను. ఇంతలోనే మరో ఐదారుగురు గుంపుగా నా ముందు నుండే అటువైపు వెళ్లిపోయారు. నాలో మరింత ఆత్రుత! అక్కడికైతే వెళ్ళలేను, కానీ, తెలుసుకోవాలన్న ఉత్సుకత ! ఏం చేయాలో పాలుబోక అటూ ఇటూ దృష్టి సారించాను. సరిగ్గా అప్పుడే భాగ్యమ్మ హడావుడిగా వస్తూ కనిపించింది. తను మా వెనక వీధిలో మూడిళ్లలో పాచి పనులు చేస్తూ ఉంటుంది. అవసరమున్నా లేకున్నా కల్పించుకుని మాట్లాడే రకం. ఆ గుడిసెల్లో ఒకదాంట్లో ఆమె నివాసం. నేను నిలబడ్డం చూసి, 

" ఏందమ్మా, నిలబడి పోయావు? "అని అడిగేసింది. వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లయి, 

" ఆ, ఏమీ లేదు, అక్కడేదో జనాలు గుంపులుగా ఉంటే ఏమిటాని చూస్తున్నాను. " అన్నా. ఖచ్చితంగా ఆమె నుండి ' ఇన్ఫర్మేషన్ ' లభిస్తుందని నా ప్రగాఢ నమ్మకం. ఎందుకంటే ఇక్కడుండే మూడు నాలుగు వీధుల సమాచారమంతా ఈ కాలనీకంతా డప్పు వేసేది ఈ భాగ్యమే కనక! 

" అదా, ", అంటూ, నాకు దగ్గరగా జరిగి,"ఎలచ్చన్లు గదమ్మా, పార్టీవోల్లు గుడిసెలోళ్ళకి డబ్బులు పంచుతున్నార్లెండి. నిన్న సాయంత్రం వేరే పార్టీవోల్లు పంచెల్లారు. ఈరోజు వీళ్లు. రేపు ఇంకొకరు కూడా రావచ్చేమో మరి!.... " అంది చేతులూపుకుంటూ. 

' అదేంటీ? ' అన్నా విస్తుబోతూ. 

" అవునమ్మా, ఈళ్ళు పోటీలుబడి ఇస్తా ఉండారు మరి!"

' ఎంతేమిటీ? '

 నాకు మరింత దగ్గరగా జరిగి గుసగుసగా అన్నట్లు చేతి వేళ్ళు ఐదు చూపించింది. ఇంకా దగ్గరగా జరిగి, 

" ఈళ్ళు ఇంకాస్త ఎక్కువిచ్చినా ఇస్తారు..." అంది. 

" అదేమిటి, అందరి వద్దా తీసుకుని ఓటెవరికేస్తారట? 

నాది అమాయకత్వమనుకుందేమో లోపల, పైకి మాత్రం

" భలేగుండావమ్మా, అదిసెప్తారా ఏంటి? మా లెక్కలు మాకు ఉంటాయ్ మరి ! అయినాలచ్చింతల్లి నేరుగా ఇంట్లోకి నడిసొస్తావుంటే ఎల్లిపొమ్మంటారామ్మా ఎవరైనా? " 

 ప్రశ్నార్థకంగా మొహం పెట్టిన నన్ను సూటిగా చూడకుండా,

"....పోతానమ్మ, నా ఇంట్లో అయిదు ఓట్లుండాయ్ మరి !జల్దీ ఎల్లాలి... " 

 అంటూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.

     కొద్దిరోజులుగా ఆనోటా ఈనోటా ఈ వార్త చెవిని బడుతూనే ఉంది. కానీ ఇంత బాహాటంగా చూస్తున్నది ఇప్పుడే. చూస్తుండగానే అటూ ఇటూ దారుల నుండి పదిహేను మంది దాకా గబగబా నడుచుకుంటూ అటువైపే వెళ్ళిపోయారు. నిట్టూర్పు విడిచి ఇంటి దారి పట్టాను. 

   రాత్రి పడుకున్నానన్న మాటే గానీ సాయంత్రం జరిగినదే పదేపదే గుర్తొస్తూ ఓ పట్టాన నిద్ర పట్టడం లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రజా నాయకులన్న వాళ్లకు స్వచ్ఛందంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా తమకు నచ్చిన వారికీ, నిజాయితీపరులకూ ఓట్లేసి గెలిపించేవారట ! అలా ఎన్నుకున్న వారే నిస్వార్ధంగా తమ సమస్యల్ని పట్టించుకుంటారన్న కొండంత నమ్మకం వాళ్లపై ఉండేదని విన్నాను. రాను రాను పరిస్థితి దారుణంగా మారిపోయి కేవలం అధికారం కోసమే పదవులాశించే వాళ్ళు తయారైపోయారు. ఇప్పుడేమో ఈ పెనుమార్పు! ఇంటింటికీ డబ్బులు పంచి ఓట్లను కొనేసుకోవడం ! పోనీ, అలా డబ్బిచ్చిన వాళ్ళకే ఓటేస్తున్నారా అంటే ప్రశ్నార్థకమే! అన్ని పార్టీల వద్దా తీసుకోవడం తీరా ఆ సమయానికి వాళ్ల నిర్ణయం ప్రకారం వాళ్ళు అనుకున్న వాళ్లకు వేసేయడం! మరి ఇచ్చేవాళ్ళ నమ్మకమేమిటో అర్థం కాదు. ఇది కేవలం పేదలకూ, నిరక్షరాస్యులకు మాత్రమే పరిమితం కావడం లేదు. కొద్దో గొప్పో చదువుకుని అవగాహన ఉన్న వాళ్లు కూడా ఈ ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారంటే ' ఔరా' అనిపిస్తుంది. ఫలితం! ఎన్నికల్లో నిలబడాలంటే డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టగలిగే వాళ్లకే సాధ్యం అన్న రీతిగా మారిపోయింది. అలాంటప్పుడు నిజాయితీకి స్థానమెక్కడ? 

  మరి ఇలా ఓట్లను నోట్లతో కొనడం ఎంతవరకూ భావ్యం? ఈ వ్యవస్థ ఇలా భ్రష్టుపట్టి ఇలాగే కొనసాగుతూ పోతే రేపటి భవితవ్యం ఏమిటి? జవాబైతే దొరక లేదు గానీ, ఎప్పుడో అర్ధరాత్రి దాటాక నిద్ర లోకి మాత్రం జారిపోయాను.

******************************************

       



Monday, February 5, 2024

మౌనరాగం...కవిత

 
🥀

మే 2022 మాలిక పత్రికలో కవిత....మౌనరాగం 
రచన : యం. ధరిత్రీ దేవి 
                                                              🐦

Friday, February 2, 2024

ఒక వంటకం వండి చూడు..(కథ)

                                        ~~ రచన : యం. ధరిత్రీ దేవి 

" ఏంటిది సుమీ, ఏం కూర ఇది? రుచీ  పచీ లేదు.. "
" బీరకాయ కూరండి.. "
" ఛ ఛ ! ఏదీ  ఆ పచ్చడి ఇలా పడెయ్.. అదైనా తిన బుద్ధవుతుందేమో.. "
 సుమిత్ర మనసంతా అదోలా అయిపోయింది. పెళ్లయి మూడు నెలలు పూర్తి కావస్తోంది. పెళ్లికి ముందు వంటింటి మొహం చూసి ఎరగదు. భర్త సురేష్ కు రుచిగా లేకుంటే ముద్ద దిగదు. పైగా... రోజుకోరకం కావాలంటాడు. ప్రతి పూటా  ఇదే గొడవ!
   సెల్ ఓపెన్ చేసి, యూట్యూబ్ లో వంటల వీడియోలన్నీ చూసేసింది. చేయగలిగినవి.. ఓ నాలుగైదు సెలెక్ట్ చేసుకుని, ట్రై చేసింది. కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక  ఊడిందన్నట్లు అయింది ఆమె పరిస్థితి. ! విసుక్కోవడం ముదిరిపోయి చేయి కడుక్కుని లేచిపోవడం మొదలైంది. 
    గుడ్ల నీరు కుక్కుకుంటూ పక్కింటి ప్రభావతి ఆంటీతో  మొరపెట్టుకుంది ఆ పిల్ల తన గోడు. ఆవిడ ఓదార్చి, పెళ్లయిన కొత్తలో ఇలాంటివి మామూలేనంటూ ఆరోజు తను చేసిన వంకాయ కూర ఓ గిన్నెలో పెట్టి ఇచ్చింది. లొట్టలేసుకుంటూ తిన్నాడు సురేష్. అంతటితో ఊరుకోక, 
" సుమీ, నువ్వూ ఇలా చేయడం నేర్చుకోవా.. "
 అంటూ ఓ సలహా పారేశాడు. మరుసటి రోజు చిన్న సీసాలో టమోటా చట్నీ ఇస్తూ, దాంతోపాటు బంగాళాదుంప వేపుడూ ఇచ్చింది ప్రభాతమ్మ. 
" ఎంత బాగుందో... ఎంత బాగుందో! "
 అనుకుంటూ... భార్యను కాదు... ప్రభావతి ఆంటీని మెచ్చుకున్నాడు సురేష్. ఆంటీ నడిగి తెలుసుకుని, రెండు రోజుల తర్వాత అచ్చం అదే పద్ధతిలో చేసి పెట్టింది సుమిత్ర. 
" అబ్బా ఏంటి సుమీ.. ఆంటీ కూర ఎంత బాగుండింది!"
 అంటూ మళ్లీ నసుగుడు, విసుగు! ఆంటీ చెప్పినట్లే తుచ  తప్పకుండా చేసింది.. కానీ ఆ  రుచి రాలేదట అయ్యగారికి!! ఏముంది! ఏడుపు ఒక్కటే తక్కువ సుమిత్రకు.
"ఛఛ...! వంట ఆడవాళ్లే చేయాలని నియమం ఎందుకు పెట్టారో ఏంటో ! ఆ రోజుల్లో అయితే ఓకే. కానీ ఇప్పుడు ఆడవాళ్లు కూడా మగవాళ్లతో సమానంగా బయటపడి ఉద్యోగాలు చేస్తున్నారు కదా! మరి.. అలాగే మగాళ్లు కూడా వంట పనులు చేయడం లేదేమిటి! ఎందుకని ఈ వివక్ష !! ఆ మాట అన్నామంటే గయ్యిమని మీదపడి తన్నినంత పని చేస్తారీ మగాళ్లు.."
 తల పట్టుకుంది సుమిత్ర. అయినా.. ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు...అన్నట్లు "ఓ వంటకం వండి  చూడు" అని చెప్పాలి ఈ మగాళ్ళందరికీ. ! ఒళ్ళు మండిపోయి తలనొప్పి వచ్చేసిందా పిల్లకి...ఆ ఊపుతో రాత్రంతా ఆలోచించింది. అలా వరుసగా వారం రోజులు పాటు ఆలోచిస్తూనే గడిపేసింది. ఆ మరుసటి రోజు, ఆంటీ ఇచ్చిందండీ అంటూ బంగాళాదుంప వేపుడు, మజ్జిగ పులుసు వడ్డించింది. 
" అబ్బ ! ఆంటీ చేతి వంటే వంట !! ఆ చేతిలో ఏముందో గానీ,  అద్భుతం! ఎంత బాగుందో!"
 లొట్టలేసుకుంటూ మళ్లీ మళ్లీ కలుపుకొని తిన్నాడు సురేష్ తృప్తిగా. సుమిత్ర తల పంకించింది. అలా వరుసగా నాలుగైదు రోజులు పక్కింటి ఆంటీ ఇచ్చిందనీ, ఎదురింటి అక్కయ్య రుచి చూడమందనీ రకరకాల కర్రీస్ వడ్డించింది సురేష్ కు. ఏముంది...వాళ్ళను పొగడడం, భార్యను తెగడడం...అలాగే చెయ్యాలంటూ పోరుపెట్టడం..!కొత్త బాధ మొదలైంది సుమిత్రకు.మూడు రోజులు గడిచాయి. ఆరోజు మధ్యాహ్నం మామూలుగా భోజనానికొచ్చాడు సురేష్. 
" చూడండి. ఆంటీలాగే చేశాను.. వంకాయ కూర.. "
అంటూ వడ్డించింది. అతను మొహం అదోలా పెట్టి , 
" అస్సలు కుదర్లేదు సుమీ, ఆ రుచే రాలేదు.ప్చ్ !"
పెదవి విరిచాడు. 
"తెలివి అఘోరించినట్టే ఉంది. మొన్న ఇదే కూర బ్రహ్మాండంగా ఉందంటూ లొట్టలేసుకుంటూ తిన్నారు...!"
"అవునూ.. అది ఆంటీ చేసినది కదా !"
" మహాశయా, ఆ కూరా ఈ కూరా చేసింది నేనే. అంతేకాదు, వరుసగా మూడు రోజులు వాళ్ళూ వీళ్లూ ఇచ్చారని మీకు చెప్పి వడ్డించిందీ నేను వండినవే. పక్కింటి ఆంటీవి కాదు, ఎదురింటి అప్పలమ్మవీ కావు... "
"..అదేంటే !వాళ్లిచ్చారని చెప్పావ్ !"
" ఆ, అలా చెప్తేగానీ తమరి నోటకెక్కదాయె.. ఏంచేయను మరి !నేను చేస్తే చేదా !వాళ్ళూ వీళ్లూ చేస్తే అమోఘమూ, అద్భుతమూనా !! అయినా, రోజూ కూరలు గీరలూ నాకు సప్లై చేయడానికి నేనేమన్నా వాళ్ల అమ్మ చుట్టాన్నా, అబ్బ చుట్టాన్నా.. !" 
" సుమీ, నిజమా ! నిజంగా నిజమా! అవి కూడా నువ్వే చేశావా..!"
" లేకపోతే... "
" సారీ రా. నువ్వు కూడా వాళ్లంత బాగా చేయాలని అలా అంటుంటాను గానీ..."
".. అదేమీ కాదు లెండి, పొరుగింటి పుల్ల కూర రుచి ఎవరికైనా.."
 ఉడుక్కుంది  సుమిత్ర. అతని వైపు ఓరగా చూస్తూ, గిన్నెలు సర్దుతూ, 
" అయినా, అప్పుడప్పుడైనా పెళ్ళాం వంటల్ని మెచ్చుకోకపోతే అసలుకే మోసం వస్తుందండీ శ్రీవారు.."
దెప్పిపొడిచింది. ఆ రోజు నుండీ సురేష్ భార్య వంటలకు వంకలు పెడితే ఒట్టు! అని అంటాను అనుకుంటున్నారా ఏంటి !! అయ్యో రామ! ఇప్పటికి  పదేళ్లయిపోయింది పెళ్లయిపోయి.. ఇద్దరు పిల్లలు ఇంట్లోకి ఎక్స్ట్రాగా వచ్చారు. సుమిత్ర కష్టపడి ఓపిగ్గా చేస్తూనే ఉంది. ఆయన గారు కడుపారా తింటూనే ఉన్నారు. వంకలు పెడుతూనే ఉన్నారు.. నైజం ఎక్కడికి పోతుందండీ  బాబు! సుమిత్ర మాత్రం తక్కువ తిందా! భర్త మెప్పు కోసం తన వంతు ప్రయత్నం మళ్లీ మళ్లీ చేస్తూనే ఉంది.. అది ఆమె నైజం!అది మాత్రం ఎక్కడికి పోతుంది పాపం!! పుట్టుకతో వచ్చిన బుద్ధులు మరి !!   
  కాకపోతే... ఓ చిన్న మార్పయితే జరిగిందండోయ్.! ఇది వరకు ప్లేటు  ముందు కూర్చోగానే వంకలు వెదికే భర్త గారి జోరు మాత్రం కాస్తలో కాస్త తగ్గింది. కారణం..! ఆయన గారు నోరు తెరిస్తే చాలు.. బ్రేకులు వేసే సుమిత్ర కస్సుబుస్సులే !! thank god! కనీసం అదైనా అలవడింది ఆ ఇల్లాలికి.. !

******************************************