Monday, August 31, 2020

గురువంటే.....

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మరో నాలుగు రోజుల్లో గురు పూజోత్సవం. ఈ శుభ సందర్భంగా గురువులందరికీ ముందస్తుగా మన: పూర్వక నమస్సుమాంజలులు. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

 బ్రతకలేక బడిపంతులు కాదు
 బ్రతికించేవాడు
 బ్రతుకు నిచ్చే వాడు
 బడిపంతులు
 విద్య నర్థించే విద్యార్థి కోసం
 నిత్య విద్యార్థిగ మారే 
 నిరంతర శ్రామికుడు
 తరగతి గదిలో తన బోధన
 కలిగించే స్పందనే
 సంతోషతరంగాల ఉప్పెనగా 
 భావించే అవిశ్రాంత బోధకుడు 
 పిల్లల మనసుల గెలిచే 
ప్రక్రియలో అలుపెరుగని 
 మనసెరిగిన మహామనీషి !
 గురువు ఎదురైనచాలు 
 అప్రయత్నంగా జోడింపబడునే 
కరములు రెండూ 
 ఏ ఉన్నతాధికారీ పొందలేని
 అరుదైన గౌరవ మర్యాదలు
 పాఠాలు చెప్పే పంతుళ్ళకే ( పంతులమ్మలకే )
 సొంతమంటే కాదనే వారెవరు? 
 ఏ అవార్డులతో పొందలేరింతటి తృప్తి 
 పిల్లల అభిమానమన్న ధనమే 
వారల స్థిరాస్థి !

👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃👃

Saturday, August 29, 2020

అప్పట్లో దూరదర్శన్..... అదో అడ్మిరేషన్ !

  ఆదివారం. టీవీలో ఇటీవలే విడుదలైన కొత్త సినిమా త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల' అల వైకుంఠపురములో'  వస్తోంది. ఇంటిల్లిపాదిమీ చూస్తూ కథలో లీనమై ఉన్నాం. ఠక్కున బ్రేక్ వచ్చేసింది. హుష్, అనుకుంటూ స్టవ్ మీద పెట్టిన కర్రీ హఠాత్తుగా గుర్తొచ్చి వంటింట్లోకి పరుగు తీశాను. దాదాపు మాడిపోయే దశలో ఉంది. అమ్మయ్య ! అనుకుని కలియబెడ్తూ ఓ క్షణం అలా గతం లోకి వెళ్ళిపోయాను. ఈ కూరలు, అన్నాలూ మాడిపోవటాలు ఇప్పటివా !
   దాదాపునలభై, నలభై అయిదేళ్ల క్రితం అనుకుంటా, హైదరాబాదులో మా బంధువుల ఇంట్లో మొట్టమొదటిసారి ఈ దూరదర్శన్, అదేనండీ, టీవీ-- చూశాను. అదో  బ్లాక్ అండ్ వైట్ టీవీ. సాయంత్రం5.30 కి NTR, జమున నటించిన పాత తెలుగు సినిమా' రాము ' అప్పుడు అందులో నేను చూసిన మొట్టమొదటి టీవీ సినిమా! ఆ తర్వాత మరో ఏడెనిమిదేళ్ళకు కర్నూల్లో మా పొరుగింటాయన ఓ చిన్న ( portable )టీవీ, బ్లాక్ అండ్ వైట్ దే తీసుకొచ్చారు. చుట్టుపక్కల నాలుగైదు ఇళ్లవాళ్లమంతా పోగై చూసాము. అప్పటికి చాలా అరుదుగా అక్కడక్కడా కొందరిళ్లలో ప్రత్యక్షమయ్యాయి టీవీ లన్నవి. అంతే ! ఉన్నట్లుండి 
ఓ ప్రభంజనంలా వ్యాపించి చూస్తుండగానే చాలా ఇళ్లలో కొలువుదీరి పోయాయి.అప్పట్లో టీవీ లేని వాళ్లంతా ఉన్నవాళ్ళింటికి చేరుకుని ఇష్టమైన సీరియళ్లు, సినిమాలూ చూస్తూ ఆ ఇంటినో మినీ థియేటర్ చేసేవాళ్ళు. అలా అలా ఈ హవా కొన్నేళ్లు సాగాక బ్లాక్ &వైట్ టీవీ లు వైదొలగి కలర్ టీవీ లు దాని స్థానాన్ని ఆక్రమించేశాయి. వాటికలవాటు పడ్డ జనం ఇక బ్లాక్ &వైట్ బొమ్మలు చూస్తారా !అనతికాలంలోనే  కలర్ టీవీ తన మాయాజాలంతో ప్రతి ఇంటినీ శోభాయమానం చేసేసింది. అది మొదలు! రకరకాల మోడల్స్, సైజులు ఒకదాన్ని మించి ఒకటి పుట్టుకొచ్చి జనం వేలంవెర్రిగా కొనేయడం మొదలెట్టేశారు. ఒకేసారి కొనలేని వాళ్ళు వాయిదాల్లో కొనే వెసులుబాటు కూడా ఇచ్చేశారు కంపెనీ వాళ్ళు. కలర్ టీవీ లు మొదట్లో ఖరీదు ఎక్కువైనా పోటీ ఎక్కువైపోయి రాను రాను ధరలు తగ్గిపోయి ప్రతి వారికి అందుబాటులోకి వచ్చేశాయి. క్రమేపీ పాత తరం వాళ్లందరినీ ఎంతో మురిపించిన రేడియో అన్నది మూల పడిపోయి అనూహ్యంగా టీవీ అందరికీ ప్రియమై పోయింది!
    దూరదర్శన్ ప్రవేశించిన కొత్తల్లో ఒకే ఒక ఛానల్ వచ్చేది. పగలంతా జాతీయ కార్యక్రమాలు -- హిందీ సీరియల్స్, ఇంగ్లీష్ న్యూస్-- సాయంత్రం5.30 నుండి మాత్రమే తెలుగు ప్రసారాలు మొదలయ్యేవి. ఇక సందడే సందడి! ఇది తెలియనిదెవరికి లెండి ! ఆ సమయానికంతా పనులన్నీ ముగించుకొని గృహిణులు, పిల్లలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ టీవీ ముందు కూర్చునే వారు. మరీ ముఖ్యంగా శని ఆదివారాలు. శనివారం తెలుగు సినిమా, ఆదివారం హిందీ సినిమా! హిందీ కార్యక్రమాల పుణ్యమాని ఆ రోజుల్లో హిందీ సీరియల్స్, హిందీ సినిమాలు చూడడానికి బాగా అలవాటు పడిపోయాను నేను.
   బ్లాక్ అండ్ వైట్ టీవీ హవా బాగా కొనసాగుతున్న రోజుల్లోనే ఉదయం  9 గంటల కనుకుంటా,  రామానంద్ సాగర్ హిందీ 'రామాయణం' మొదలైంది అప్పటివరకూ మనతెలుగు హేమాహేమీలు, ఉద్దండులు నటించిన ఎన్నో పౌరాణిక సినీ కళాఖండాలు చూసి ఉన్నా, టీవీ లో చూడ్డం -- అదీ ఇంట్లో కూర్చుని! ఆ అనుభూతి పొందని వారు బహుశా ఉండరనే నా అభిప్రాయం. ఆ తర్వాత వచ్చిన హిందీ' మహాభారతం' కూడా దాదాపు అదే స్థాయిలో కొనసాగింది. ఈ రెండింటి గురించి అంతా చాలా గొప్పగా చెప్పుకునేవారు అప్పట్లో. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సీరియల్స్ వస్తున్నప్పుడు అలా వీధి లోకి తొంగి చూసా మంటే వీధులన్నీ నిర్మానుష్యంగా, అతి నిశ్శబ్దంగా కనిపించేవి అంటే ఊహించు కోవచ్చు, ప్రతి ఇంట్లో జనాలంతా ఎంతగా టీవీ లకు అతుక్కుపోయి ఉండేవారో !
   తెలుగు సీరియల్స్ వారానికి ఒక్కసారి అదీ కేవలం పదమూడు ఎపిసోడ్స్ మాత్రమే ఉండేవి. ప్రతి రోజు ఒక సీరియల్ తప్పనిసరిగా ఉండేది. ప్రతి శుక్రవారం వచ్చే' చిత్రలహరి' కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసేవాళ్లంతా కేవలం అరగంట కోసం!నెలకో, రెణ్ణెల్లకో ఓ సారి ' చిత్ర మాల' అని వస్తుండేది. 5, 6 భాషల చిత్రాలనుండి ఒక్కో పాట ప్రసారం చేసేవారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఈ కార్యక్రమం వస్తుండేది. అందులో మన తెలుగు పాట ఒకటి. ఆరోజు ఏ పాట వస్తుందోనన్న ఆసక్తితో చూసే వాళ్ళు కొందరు! అదో విచిత్రమైన ఆనందం!
   ఇక, ప్రస్తుతానికొస్తే -- ఇష్టమైన దేదైనా మితంగానే ఉండాలంటారు. లడ్డు ఇష్టమని ప్రతిరోజు పదే పదే అవే తింటే ఏదో ఒక రోజు మొహంమొత్తి పోయి అవంటేనే మొహం తిప్పుకునే దుస్థితి దాపురిస్తుంది. అలాగే అయ్యిందేమో అనిపిస్తుంది ప్రస్తుతం టీవీ కార్యక్రమాలు చూస్తోంటే ! 
   కుప్పతెప్పలుగా పుట్టుకొచ్చిన ఛానల్స్ -- ప్రతీ రోజూ లెక్కలేనన్ని సినిమాలు ! వందలకొద్దీ తెలుగు, హిందీ పాటలు !జీళ్ల పాకంలా సాగదీస్తూ సహనాన్ని పరీక్షించే సీరియల్స్ ! వీటికి తోడు పోటాపోటీగా వార్తా ఛానల్స్ !రియాలిటీ షోస్ !ఓహ్ ! మనిషన్నవాడు ఇవన్నీ చూడాలంటే అయ్యేపనేనా !మొదట్లో మితంగా ఉండేవి గాబట్టి అన్నింటి కోసం ఎదురుచూస్తూ ఆనందించేవాళ్ళం. ఇప్పుడు !ఇక చెప్పేదేముంది? 
  ఏదైనా కొత్తలో నవ్యత, నాణ్యత దేనికైనా సహజం. అందుకే అదో అడ్మిరేషన్ అన్నా ! అలాగే కొత్త వింత పాత రోత ! కొత్త నీరు వచ్చేకొద్దీ పాత నీరు కొట్టుకొని పోవడం అత్యంత సహజం. ప్రచార సాధనాలంటూ లేని రోజుల్లో రేడియో వచ్చింది. టీవీ వచ్చి దాన్ని తల దన్నేసింది. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వచ్చి టీవీ నీ  అధిగమించేస్తోంది. మనం ఎక్కడికెళ్లినా ప్రపంచమంతా మన అరచేతిలోనే ఉన్న ఫీలింగ్ తెప్పిస్తోంది మరి ! 
  కొంతకాలం క్రితం వంట చేసే ప్రాసెస్ లో పప్పు స్టవ్ మీద పెట్టి, అది ఉడికేలోగా కాస్త టీవీ చూద్దామనుకుని అందులో ఇమ్మర్స్ అయిపోయి, వంట కాస్తా మాడగొట్టేసే వాళ్ళు కొందరు మా ఆడవాళ్లు. ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లో ఏ వీడియో నో చూస్తూ అడపా దడపా నాలుక్కరుచుకుంటున్నారు !
ఇలాంటి అనుభవం ఇంట్లో వంట చేసే వాళ్లకు కనీసం ఒక్కటైనా ఉండితీరుతుందా లేదా? అలా లేని మహిళామణి ఎవరైనా ఉంటే నాకు చెప్పండి ప్లీజ్ ! 
   నేను వర్క్ చేసే రోజుల్లో స్టాఫ్ రూమ్ లో ఓసారి మహిళా ఉపాధ్యాయుల మధ్య ఈ టాపిక్ వచ్చింది. అందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాలు చెప్తూ ఈ విషయం లో ఏకీభవించారు. 
  మొత్తానికి కాలం గడిచే కొద్దీ AIDS అయితే మారుతున్నాయి గానీ వంటింటి అనుభవాలు COMMON గానే ఉంటున్నాయి. ఔనంటారా, కాదంటారా?  

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మళ్ళీ కలుసుకుందాం !
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
   

Sunday, August 23, 2020

తరతమ భేదాలు లేనిది........?

  తరతమ భేదాలు, కులమత భేదాలు, ప్రాంతీయ భేదాలు,భాషా భేదాలు, ఆస్తులూ అంతస్థుల తారతమ్యాలు -- ఇవేవీ ఎరగని, పట్టించుకోని ఇంకా చెప్పాలంటే వీటన్నింటికీ అతీతమైనదే జబ్బుఅన్నది.ప్రస్తుతం ' కరోనా ' వైరస్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ !ఇది మన దేశానికి పాకి ఆరు నెలలు కూడా పూర్తి కావస్తున్నది. మొదట్లో అతిసామాన్యుల్ని ఆవహించిన ఈ వైరస్ క్రమక్రమంగా ప్రముఖులకు కూడా వ్యాపించి దాని ఉనికిని మరింత ప్రస్ఫుటంగా, బాహాటంగా ప్రపంచానికి బహిర్గతపరచింది. 
  అలాంటి వారిలో ముఖ్యమంత్రులూ, మంత్రులు, MLA లూ ఇంకా సినీప్రముఖులూ, క్రికెటర్లు -- ఇలా ఈ లిస్టు రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీని బారినిబడి మరణించిన ప్రముఖులూ ఉన్నారు, అలాగే కోలుకుని ఇల్లు చేరినవారూ ఉన్నారు. 
   మొదట్లో -- అక్కడెక్కడో ఎవరికో ' కరోనా ' సోకిందట !అన్న వార్తలు విన్నవాళ్ళం రాన్రానూ ఇక్కడే, మన ఊర్లోనే మన వీధిలోనే ఫలానావాళ్ళకొచ్చిందంట ! అని వినే స్థాయికి ప్రస్తుతం ఈ మహమ్మారి మనల్ని లాక్కువచ్చి పడేసింది. 
  దీనికితోడు వర్షాకాలం ! ఎడతెరిపి లేని వర్షాలతో ' సీజనల్ ' వ్యాధులు ! తుమ్మినా, దగ్గినా, అతిమామూలుగా జలుబు చేసినా, స్వల్పంగా జ్వరం లాంటిదొచ్చినా 'ఆమ్మో'అని భీతిల్లాల్సిన పరిస్థితి !ఈ సీజనల్ వ్యాధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లకై ప్రభుత్వం హెచ్చరించిందని అంటున్నారుగానీ ఆ దాఖలాలేమీ వైద్యశాలల్లో కనిపిస్తున్నట్లుగా లేదు. కర్మగాలి ఏ జ్వరం బారినోబడి చూపించుకుందామంటే కూడా ఏ వైద్యులూ దగ్గరకు రానీయని దుస్థితి ! ఎవరి ప్రాణం వాళ్లకు తీపి మరి !
   న్యూస్ పేపర్లలో నేమో మరో రెండు నెలల్లో వైరస్ తగ్గుముఖం పడుతుందనే వార్తలు వెలువడుతున్నాయిగానీ, అదెంతవరకు జరిగే అవకాశం ఉందో చెప్పలేం. ఇవేమీ పట్టని కరోనా మాత్రం ఎవర్నీ వదిలేది లేదంటూ భీష్మించుకు కూర్చుండిపోయింది. 
   కరోనా సోకిన ప్రముఖుల్లో సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్ కోలుకుని ఇల్లు చేరారు. అలాగే దర్శకుడు రాజమౌళి కుటుంబం కూడా. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిస్థితి కూడా అదే. రెండు వారాల క్రితం వైరస్ బారినబడి హాస్పిటల్లో చేరిన ప్రముఖ గాయకుడు
S. P. బాల సుబ్రహ్మణ్యంగారి కోసం సంగీత దర్శకులు, గాయనీ గాయకులూ పాటలు పాడుతూ ప్రార్థనలు చేయడం ఎంతో బాగుంది. 
   ప్రముఖుల కోసమే కాక అతి సామాన్యుల కోసం కూడా ప్రార్థిస్తూ త్వరగా అందరూ కోలుకోవాలని కోరుకుందాం. 

Wednesday, August 19, 2020

మనసా, చలించకే.... !

      ఉలిక్కిపడి కళ్ళు తెరిచాను. గదిలో లైటు వెలుగుతూ కనిపించింది. ఒక్క క్షణం నేను ఎక్కడున్నానో అర్థం కాలేదు. కళ్ళు నులుముకుంటూ పక్కకు చూసాను. రాజమ్మ అమ్మను పొదివి పట్టుకుని ఏదో టాబ్లెట్ మింగిస్తోంది. అప్పుడు అర్థమైంది, అమ్మకు దగ్గు, ఆయాసంతో సీరియస్ అయిపోయి నిన్న రాత్రి నర్సింగ్ హోమ్ లో చేర్చాము. అమ్మకు తోడుగా రాజమ్మ ఇక్కడ ఉంటానంది, కానీ ఆమెనొక్కత్తినే అమ్మ దగ్గరుంచడం ఇష్టం లేక నేనూ ఉండిపోయాను. 
   అమ్మకు రెండు మూడు సంవత్సరాలుగా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు. ఉద్యోగరీత్యా అమ్మ దగ్గరే ఉండడం నాకుకుదరదు. నా వద్దకు వచ్చి ఉండమంటే తను వినదు. సొంత ఊరు, సొంత ఇల్లు విడిచి ఎక్కడికీ రానంటుంది. నాన్న పోయి ఏడెనిమిది సంవత్సరాలవుతోంది. ఇంట్లో ఇప్పుడు అమ్మ ఒక్కతే ఉంటోంది. ఇకపోతే, నా ఇల్లు, నా పిల్లలు, నా సంసారం, పైగా ఉద్యోగ బాధ్యతలు. వీటన్నింటితో సతమతమయ్యే నేను ఎప్పుడో గానీ అమ్మ దగ్గరకు రావడానికి కుదరదు. ఫోన్లలో క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా, అయిదారు నెలలకోసారైనా ఇలా వచ్చి వెళ్తే గానీ మనసు కుదుట పడదు మరి!
   ఇకపోతే రాజమ్మ ! తను మా ఇంట్లో పనిమనిషిగా చేరి చాలా ఏళ్లే అవుతోంది. ఇంట్లో ఆమె చేయని పనంటూ ఉండదు. ఇంటి పనులన్నింటితో పాటు బట్టలు ఉతకడమే కాక అడపాదడపా అమ్మకు చేత కానప్పుడు వంట పని చూడ్డం, ఇలా మంచం పట్టినప్పుడు ఆమెకు సేవలు చేయడం వరకూ కాదనకుండా అన్నీ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడూ అలాగే హాస్పిటల్ కు వచ్చింది. 
    రాజమ్మ అమ్మకు టాబ్లెట్ మింగించి, పడుకోబెట్టి లైట్ తీసేసింది. మంచానికి ఒక పక్కగా కింద పరుచుకున్న ఒక పాత దుప్పటి మీద నడుం వాల్చింది. రాజమ్మ ను చూస్తుంటే నాకు ఏమిటో గా అనిపించింది. అమ్మకు తోడుగా నేనిక్కడ పడుకోవడం వృధా అనుకున్నానోక్షణం. తనకు కావలసినవన్నీ రాజమ్మే చూస్తోంది. నేను చేస్తున్నది ఏమిటిక్కడ? డబల్ రూమ్ తీసుకుని అందులో నున్న మరో మంచం మీద హాయిగా పడుకుని, ఎక్కడున్నానో కూడా తెలియనంత గాఢంగా నిద్ర పోయాను. ఒక్క క్షణం సిగ్గనిపించించింది నాకు. 
   పాపం, రాజమ్మ అమ్మకు ఎంత సేవ చేస్తోంది! రాత్రంతా మేలుకొనే ఉంది. డాక్టర్ ఇచ్చిన మందులన్నీ వేళ తప్పకుండా వేసుకునేలా చూస్తోంది. ఆమె మీద ఒక్కసారిగా జాలి పుట్టుకొచ్చి, మనసంతా ఆర్ద్రతతో నిండిపోయింది. ఇంత చేస్తున్న రాజమ్మకు మేమిస్తున్నదేమిటి? ఇంటి చాకిరీ అంతా చేసి మిగిలిన అన్నం, కూరలు పట్టుకెళుతుంది. ఇంకా రెండు మూడు ఇళ్లలో పనిచేసి ఆ డబ్బుతో ఉన్న ఒక్కగానొక్క కొడుకును చదివించుకుంటోంది. చాలీచాలని తిండితో, ఒంటి నిండా సరైన బట్ట కూడా లేక ఎంత అవస్థ పడుతోంది! ఈ ఆలోచన రాగానే రాజమ్మ వైపు పరికించి చూశాను. చిరిగిపోయిన చీరను అక్కడ అక్కడా ముళ్ళు వేసుకుంది. కొన్నిచోట్ల దారంతో కుట్టుకుంది. ఎటూ వీలుగాని చోట అలాగే వదిలేసింది. రంగు వెలిసిపోయిన రవికె ! కడుపులో దేవి నట్లయింది. ఛీ ! ఇంత చాకిరీ చేయించుకుంటూ ఈ రాజమ్మకు మేమేం చేస్తున్నాం? ఒక్కసారిగా నిశ్చయించుకున్నాను. సెలవు అయిపోయి నేను వెళ్లే లోగా రాజమ్మకు నా చీర ల్లో ఓ రెండు ఆమె కట్ట దగినవి ఇచ్చి వెళ్ళాలి. రెండు మూడేళ్ళుగా కడుతున్నాను కాబట్టి కొత్తగా ఉన్నా అవి ఇచ్చేయడానికి నాకు అంత బాధగా అనిపించలేదు. ఇంటికెళ్లగానే అమ్మ తో కూడా ఒక మాట చెప్పి, వెంటనే రాజమ్మకిచ్చేయాలి అనుకున్నాను. ఆ తర్వాత నిద్ర పట్టడానికి నాకు ఎంతో సమయం పట్టలేదు. 
  నాలుగు రోజుల తర్వాత ఇల్లు చేరాము. హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రాజమ్మ అమ్మను కంటికి రెప్పలా చూసుకుంది. ఆమెపట్ల నేనొక నిర్ణయం తీసుకున్నాక ఆమె గురించీ, ఆమె చేస్తున్న సేవల గురించీ ఆలోచించడం మానేశాను, ఎలాగూ ఆమెకు ప్రతిఫలం ముట్ట చెప్పబోతున్నాను గనక. ఇంటికి రాగానే అమ్మతో నా ఆలోచన చెప్పాలనుకున్నాను. కానీ మిగతా పనుల ఒత్తిడిలో కుదరలేదు. రాజమ్మ పని మామూలుగానే ఉంది ఎప్పటిలా. ఎలాగైతేనేం, చివరికి ఓ రాత్రి అమ్మతో చెప్పానా సంగతి. అమ్మ విస్మయంగా నావేపు ఓ చూపు చూసి, " అదేమిటే! అది చేసిందేమిటి? నాలుగు దినాలు ఆసుపత్రిలో ఉన్నందుకు ముప్పూటలా దాని తిండి ఖర్చు భరించాము. నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో నేనొక్కర్తినే. నా ఒక్క దానికి ఎంతపని ఉంటుందని? అప్పుడు కూడా దానికి ఇంట్లో పొయ్యి వెలిగించకుండా మన ఇంట్లో నుండే పెట్టి పంపిస్తూఉంటానాయే, నేను అంత చేస్తే అది నాకామాత్రం చేయలేదా! ఆ పాటి దానికి నిక్షేపంలాంటి చీరలిస్తానంటావా !" అంటూ నా వైపు కొరకొరా చూసింది. 
   నాకు ఒక్క క్షణం ఏమనాలో తోచలేదు. ఆ రాత్రి భోంచేసిన తర్వాత ఆలోచిస్తూ పడుకున్నాను. 
" నిజమే! అమ్మ ఏమి రాజమ్మ తో ఊరికే చేయించుకోవడం లేదు. దానికి తగ్గ ప్రతిఫలం ముట్టజెబుతూనే ఉంది. ఇప్పుడామె ప్రత్యేకంగా చేసిందేముంది? ఎప్పుడు చేసేదేగా, ఆ మాత్రానికి చీరలు, సారెలూ ఇవ్వడం దేనికి? అనిపించింది. అంత బహుమానం అక్కర్లేకుండా ఏదో ఓ రెండు జాకెట్ గుడ్డలు ఇచ్చేస్తే  సరిపోతుంది, కుట్టించుకుంటుంది, " అనుకున్నాను. అంతే! అమ్మ చెప్పింది సబబుగానే తోచింది నాకు. 
  మర్నాడు నా దగ్గరున్న రవికగుడ్డలు ఓ రెండు తీసి, నా సూట్ కేస్ మీద పెట్టాను, రాజమ్మ ఇంటికి వెళ్లేటప్పుడు ఇవ్వవచ్చుననుకుని. ఏదో ఓ పని మీద గదిలోకి వెళ్ళిన అమ్మ, 
" విశాలీ, ఇదేమిటి, ఇవిక్కడ సూట్కేస్ మీద పెట్టావు, లోపల పెట్టేసుకోక? " అనడిగేసింది. 
 నేను నాన్చుతూ విషయం చెప్పాను. అంతే! కస్సుమంటూ మళ్లీ మొదలెట్టింది. 
" బాగానే ఉంది వరస, దీనికి లాగా నువ్వు నేర్పి వెళ్తే, ఇదిక పనిచేస్తుందా? చీటికీమాటికీ అవి ఇవి అడిగి నా ప్రాణం తీస్తుంది. ఈ పనోళ్లకు మనమై ఇట్లా నేర్పించి నట్లు అవుతుంది. ", అంటూ నా మీద విసుక్కుంటూ వెళ్ళిపోయింది. నా మనసంతా అదోలా అయిపోయింది. ఏమిటి, అమ్మ ఇలాగంటుంది? తన కష్టంలో అంతో ఇంతో సేవ చేసిన మనిషికి మనం కట్టి విడిచిన ఓ బట్ట ఇవ్వడానికి ఇంతగా సాధిస్తుందేమిటి ! ఒక్కోసారి అనవసరంగా ఎంతో ఖర్చు పెట్టేస్తూ ఉంటాం, ఏ అవసరం లేకున్నా. అలాంటిది ఓ పేదరాలికి అందునా ఇంటి సేవకురాలికి నేనివ్వాలనుకున్నది ఏపాటి? ఒక్కసారిగా అమ్మ మీద కోపం ముంచుకొచ్చేసింది. కానీ, చిన్నప్పట్నుంచీ ఆమెనెదిరించి, ఆమెకు వ్యతిరేకంగా ఏ చిన్న పనీ చేసి ఎరగని కారణంగా గట్టిగా చెప్పలేక, అలాగని ఆమెకు తెలియకుండా ఈ దానం చేయలేక సతమతమై పోతున్నాను. అంతే! ఆ తర్వాత ఇక ఏమాలోచించడానికీ నాకు మనస్కరించక మెదడంతా మొద్దుబారిపోయింది. 
                        **********
   నా సెలవు అయిపోవచ్చింది. వెళ్ళవలసిన రోజు దగ్గర పడుతోంది. రాజమ్మను చూస్తోంటే నా ఆరాటం అధికమవుతోంది. నేను అనుకున్నది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? అమ్మ మాటలకు మరీ ఇంతగా లొంగిపోయానేమిటి? నాలో చెప్పలేని వెళితి ఏర్పడిపోయింది. లాభం లేదు, ఏదో ఒకటి చేసెయ్యాలి.
   ఎలాగైతేనేమి, నా ప్రయాణం రోజు రానే వచ్చింది. ఆ రోజు పది గంటల బండికి వెళ్లాలని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాను. అమ్మ నాకు జాగ్రత్తలు చెప్పసాగింది. ట్రైన్ లో ఒంటరిగా ప్రయాణం కాబట్టి ఇది మామూలే ఎప్పుడూ. నా అంత కనిపించే ఆడపిల్లలకు కాలేజీలో పాఠాలు చెబుతున్నా అమ్మ నన్నింకా పసిపిల్లలాగే జమకడుతుంది. అమ్మ చెప్పే వాటి కంతా తలాడిస్తూన్నాను కానీ నా మనసంతా రాజమ్మ కోసమే ఎదురు చూస్తోంది. ఆరోజెందుకో తను ఇంకా రాలేదు. రోజు తెల్లారేసరికే వచ్చేది. ఆ మాటే అమ్మతో అంటే, " వస్తుందిలే తీరిగ్గా, దాంతో ఇప్పుడేమిటి నీకు పని? " అని ఎదురు ప్రశ్నించింది.
  ఇక రాజమ్మ ప్రసక్తి ఎత్తడం సుతరామూ మంచిది కాదనిపించింది. అంతే! క్షణాల్లో నేనో స్థిర నిర్ణయానికొచ్చేసాను. తొమ్మిది కావొస్తోంది. అన్నీ సర్దుకుని సూట్కేసు బయట పెట్టాను. ఈలోగా అమ్మ దేనికోసమో లోపలికి వెళ్ళింది. సరిగ్గా అప్పుడే రాజమ్మ వస్తూ కనిపించింది. నేనిక ఆలస్యం చేయదలచుకోలేదు. రాజమ్మ దగ్గరకు రాగానే, " ఊరు వెళ్తున్నాను రాజమ్మ, అమ్మను జాగ్రత్తగా చూసుకో, " అంటూ పర్సులో నుంచిఅయిదు వందల నోట్లు నాలుగు తీసి ఆమె చేతిలో పెట్టి మెల్లిగా అన్నాను, " ఏమిటో, నా సంతోషం రాజమ్మ, ఇది అమ్మకు చెప్పాల్సిన పని లేదు,... "
 రాజమ్మ గాబరాగా, " ఇదేంటమ్మా, వద్దు తల్లీ... " అంటూ మొహమాట పడిపోతూ తిరిగి ఇవ్వబోయింది. 
" పర్వాలేదు ఉంచు,  " అంటూ నోట్లను ఆమె చేతిలో అదిమిపెట్టి మరో వైపు తిరిగి ఇంట్లోకి చూస్తూ అమ్మను కేకేశాను. గత కొద్ది రోజులుగా నాలో రేగుతున్న అలజడి ఒక్కసారిగా సద్దుమణిగింది. అమ్మ రాగానే, రాజమ్మ సూట్ కేస్ తీసుకుంది. ఇద్దరూ కలిసి రోడ్డు దాకా వచ్చి, నన్ను ఆటో ఎక్కించారు. వెళ్తున్న ఆటోలోంచి ఓసారి వెనక్కి చూశాను. ఇద్దరూ చేతులూపుతూ కనిపించారు. నీళ్ళు నిండిన రాజమ్మ కళ్ళలో ఏదో భావం! నాకు మాత్రమే అర్థమయ్యేలా!
                              **********
   రైలు వేగం పుంజుకుంది. దాంతో నా ఆలోచనలు కూడా పరుగు పెట్టాయి. ఆ ఇద్దరి గురించి ఆలోచిస్తున్న నాకు అకస్మాత్తుగా ఓ పౌరాణిక గాధ లోని సంఘటన స్పురించింది. మహాభారతంలో గొప్ప దాతగా ప్రసిద్ధిగాంచిన కర్ణుడు ఎడమ చేతి నుండి కుడి చేతికి బంగారు పాత్ర మార్చి దానం చేసే లోగా ఎక్కడ తన మనసు మారిపోతుందోననే అనుమానంతో, ఎడమచేత్తో దానం చేయకూడదని తెలిసి కూడా ఆ చేత్తోనే యాచకుడికి ఆ పాత్ర దానం చేశాడట! కర్ణుడంతటి గొప్ప దాతకే తప్పలేదు ఈ చిత్తచాంచల్యానికి లొంగిపోవడం ! ఇక నేనెంత! అనిపించింది. 
    హాస్పిటల్లో నేను అనుకున్న వెంటనేరాజమ్మకు చీరలిచ్చి ఉంటే సరిపోయేది. కానీ, కొన్నిరోజుల అనంతరం ఇంటికి రావడం, అమ్మ అడ్డుపుల్లలు వేయడం -- ఇలాంటి అవాంతరాలతో నా నిర్ణయం సడలిపోవడం ! ప్చ్ ! నిజంగా ఈ మనసనేది ఎంత విచిత్రమైనది ! ఒకసారి ఉన్నట్లు మరోసారి ఉండదెందుకని?  
   ఏదేమైనా, నేను చేయాలనుకున్నది చేసేశాను. అందుకేనేమో ప్రస్తుతం మబ్బు విడిన ఆకాశం లా నా మనసంతా తృప్తితో నిండిపోయింది. మదిలో సుళ్ళు తిరిగే ఆలోచనల్ని వెనక్కి నెట్టేస్తూ రైలు ముందుకు సాగింది. 
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

Friday, August 14, 2020

కరోనా వచ్చింది... కాలం మారింది....

    నిజంగా కాలమెంతగా మారిపోయింది ! అనూహ్యంగా ఇలాంటి పరిస్థితి ఎదురయిందేమిటి?  ఔరా ! కరోనా !ఎంతపని చేసేసింది ! ఈ మహమ్మారి ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రంగాన్నీ కుదిపేసి వ్యవస్థ నంతటినీ అతలాకుతలం చేసి పారేసింది. నిజమే కదా, కలలోనైనా ఏనాడైనా ఊహించామా, అడుగు బయట పెడితే చాలు ఇలా మాస్క్ తగిలించుకోవాల్సివస్తుందని!దూరదూరంగా ఉండి పోవాల్సొస్తుందని !అనుక్షణం భయంభయంగా కాలం వెళ్లదీయాల్సొస్తుందని !
   దీనివల్ల అనూహ్యమైన మార్పులుసంతరించుకున్న వాటిల్లో విద్యా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఎన్నడైనా ఇలా జరిగిందా, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు జరపకుండానే ప్రతీ విద్యార్థినీ పాస్ చేసేసి పై తరగతికి ప్రమోట్ చేసేయడమన్నది !ఇదీ కరోనా మహిమ! అదలా ఉంటే ప్రస్తుతం అన్ని స్థాయిలలోనూ ఆన్లైన్ విద్య ప్రవేశపెట్టడం! పాఠశాలలూ, కళాశాలలూ తెరవకపోవడం! నామమాత్రంగా తెరచినా బోధనా సిబ్బంది వంతుల వారీగా హాజరవడం! ఇదంతా విద్యావ్యవస్థకు అశనిపాతం లాంటిదే మరి ! ఉపాధ్యాయుడు తరగతి గదిలో పాఠం చెప్తేనే అది సరైన బోధన అనిపించుకుంటుంది. అలా ముఖాముఖీ బోధించినా అర్థం చేసుకోలేని విద్యార్థులుండే పరిస్థితి! పదే పదే చెప్పినా విషయం బుర్రకెక్కని మంద బుద్దులూ ఉంటారు. అలాంటప్పుడు ఈ ఆన్లైన్ పాఠాలు ఎంతవరకు ఉపయోగపడతాయో అంచనా వేయలేము. అదీ రోజులో కొద్దిసేపే. తల్లిదండ్రులకు పిల్లలను స్థిరంగా కూర్చోబెట్టడం కత్తి మీద సామే! విద్యావంతులైన వారు పిల్లలకు కాస్తో కూస్తో పాఠాలు విశదీకరించగలరు. వాళ్లలో కూడా అన్ని సబ్జెక్టులపై ప్రావీణ్యం ఉంటుందా, అంటే అనుమానమే! పైగా" పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదనట్లు" ఇంట్లో అమ్మ నాన్నల మాటవిని నేర్చుకునే వాళ్ళు ఎందరు ఉంటారు? 
   పైగా దీనికోసం ప్రతీ విద్యార్థికీ స్మార్ట్ ఫోన్ తప్పనిసరి! మునుపు చూడొద్దన్న వాళ్లే ఇప్పుడు తప్పదంటున్నారు మరి ! అది ఎక్కువ సేపు వాడితే కళ్ళకు మంచిది కాదనీ దాని బదులు లాప్టాప్ వాడితే మంచిదనీ మరోపక్క చెబుతున్నారు. కానీ ఇవి ఎందరికి అందుబాటులో ఉండగలవు! అదీ ప్రశ్నే !
   ఏది ప్రవేశపెట్టినా ప్లస్ లూ, మైనస్ లు తప్పనిసరిగా ఉంటాయి. ఈ పరిస్థితి చూస్తోంటే దాదాపు ముప్ఫై సంవత్సరాల క్రితం విద్యాశాఖ ప్రవేశపెట్టి అమలుపరచాలనుకున్న ఓ పథకంగుర్తొస్తోంది. అప్పట్లో కొన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్ని ఎంపిక చేసుకుని వాటికిTV, VCP ఇచ్చారు. విద్యార్థుల్ని TV ఉండే గదిలో కూర్చోబెట్టి, అప్పుడు నిర్దేశించబడ్డ ఓ సమయంలో వచ్చే పాఠ్యాంశ బోధన వీడియోల్ని చూపించేవారు. ఇదేమిటో అన్న ఆసక్తితో పిల్లలు రెండు నిమిషాలపాటు చూశాక ఇక అంతే! అందరూ చూడడం మానేసి మాటలు, అల్లరీ ! అయినా, TV లో సినిమాలు, సినిమా పాటలు, ఇంకా సీరియల్సు చూడమంటే గుడ్లప్పగించీ, చెవులు రిక్కించీ చూస్తారు గానీ, పాఠాలు విన మంటే వింటారుటండీ ! అనుకునేవాళ్లంతా ! అనుకున్నట్లే ఈ పథకం కాస్తా నీరుగారిపోయి కొద్దికాలానికే ప్రభుత్వ ఆదేశాల మేరకుటీవీలు, vcp లు తిరిగి మండల కార్యాలయాల్లో అప్పగించేయడం జరిగింది. పైగా ఆ ఉపకరణాల బాధ్యత ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యులపైనే ఉంటంవల్ల శెలవు దినాల్లో వాటి సంరక్షణ బాధ్యత, దొంగల బారినుండి వాటిని కాపాడుకోవడం లాంటి సమస్యలతో పాటు మరికొన్ని చిన్ని చిన్ని చిరు చేదు అనుభవాలు కూడా వాళ్ళ ఖాతాల్లో ఉన్నాయంటే నమ్మాలి మరి !ఇదంతా విమర్శించే ధోరణి లో చెప్పడం లేదు, కొన్నింటి అమలు లో ఆచరణకు సంబంధించి సమస్యలు  (practical problems) ఎదురవుతాయని చెప్పడమే నా ఉద్దేశ్యం. 
   వీటిల్లో TV బోధన అన్నది ప్రయోగాత్మకం. Online బోధన అన్నది అనివార్యం. వీటిని ఒకదాంతో మరొక దాన్ని పోల్చడం కూడా సరికాదు. పైగా, ప్రభుత్వం కూడా ఎంతో ఆలోచించి, ఎందర్నో సంప్రదించి ఈ విధానం 




. ఎందుకంటే ముందు మనుషుల ప్రాణం, ఆరోగ్యం, క్షేమం ముఖ్యం!ఆ తర్వాతే చదువులూ, ఇంకా ఏవైనాగానీ. 
ఏదిఏమైనా, పరిస్థితుల కనుగుణంగా మార్పును స్వాగతించాల్సిందే. 
   ఈ ప్రయత్నం విజయవంతం కావాలని మనసారా కోరుకుందాం !అలాగే వచ్చే విద్యాసంవత్సరమన్నా విద్యార్థులతో, ఉపాధ్యాయులతో కళకళలాడుతూ మునుపటి వైభవం సంతరించుకుంటుందని ఆశిద్దాం!అలాగే కరోనా మహమ్మారి కూడా అంతరించిపోయి మళ్ళీ జనజీవనం 'నార్మల్ 'అయిపోవాలనీ ప్రతీ ఒక్కరం ప్రార్థిద్దాం !
   ఇప్పటికే కరోనాకు వ్యాక్సిన్ సిద్ధమైనదని మూడ్రోజుల క్రితం రష్యా ప్రకటించేసింది. ఇంకా మిగతా దేశాల నుండీ ఈ తీయని కబురు కోసం చూద్దాం !

Friday, August 7, 2020

వాగ్భూషణం భూషణం

   అలనాటి ' ఆకాశవాణి ' జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నకొద్దీ నిధిలోంచి బయట పడుతున్న వజ్ర వైడూర్యాల్లాగా ఎన్నెన్నో మరపురాని కార్యక్రమాలు ముందుకొచ్చి నిలుస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఈరోజు నేను ప్రస్తావించదలచుకున్న అంశం ఆ తరం వాళ్ళలో ఎంతోమందికి సుపరిచితమైన ఉదయం పూట ఓ కార్యక్రమానికి ముందుగా వచ్చే ఓ సుమధురమైన శ్లోకం! అది ' సంస్కృత పాఠం ' అన్న ఓ కార్యక్రమం. కార్యక్రమం ప్రారంభంలో ఈ శ్లోకం రేడియో ఉన్న ప్రతీ ఇంట్లో ప్రతిధ్వనించేది. దీని గురించి ఎందరో ఎన్ని సార్లో ప్రస్తావిస్తూ వారి అభిప్రాయాలు, జ్ఞాపకాలు వ్యక్తపరచినా ఎప్పటికప్పుడు కొత్త దనాన్ని సంతరించుకొని సరికొత్తగానే దర్శనమిస్తుంది. అంతటి గొప్పతనం సొంతం చేసుకున్న గణనీయమైన శ్లోకమిది. కాలాలతో ఏమాత్రం నిమిత్తం లేక అన్ని తరాలకూ చక్కటి సందేశాన్నిచ్చే సుభాషితాన్ని ఇముడ్చుకున్న ఆ శ్లోకం ----
   కేయూరా న విభూషయంతి పురుషం 
   హారా న చంద్రోజ్జ్వలా :
   న స్నానం న విలేపనం న కుసుమం 
   నా లంకృతా మూర్ధజా :
   వాణ్యేకా సమలంకరోతి పురుషం యా 
   సంస్కృతాధార్యతే 
   క్షీయంతే ఖలు భూషణాని సతతం 
   వాగ్భూషణం భూషణం ||
 రాగయుక్తంగానూ, మరింత భావయుక్తంగానూ సాగిపోయే ఈ శ్లోకం కొందరు గాయనీగాయకులు కలిసి మాధుర్యం ఉట్టిపడేలా ఆలపించారు. ఏమాత్రం సంగీతాసక్తి లేనివారిని సైతం ఓ క్షణం అలా నిలువరించేలా చేసే ఈ వీనుల విందైన శ్లోకపఠనం ఆరోజుల్లో నన్నెంతగానో ఆకర్షించేది. అప్పట్లో దీని భావమైతే అవగతమయ్యేది కాదు గానీ చివరి రెండు పదాలు ఇట్టే హత్తుకుపోయేవి. అవే ' వాగ్భూషణం భూషణం '
   పదే పదే వినడం మూలాన ఆ రాగమైతే సుపరిచితమయిపోయింది గానీ శ్లోకంలో మిగతా పదాలు గుర్తు ఉండేవి కావు. చాలా సంవత్సరాల తర్వాత అందుకోసమై ప్రయత్నించి నాలుగైదు చోట్ల ఆ శ్లోకం చూడగలిగాను. కానీ కొన్ని పదాలు, ఇంకా ఒత్తులు ఒక్కోచోట ఒక్కో విధంగా ఉండి ఏది తప్పో ఏది ఒప్పో తెలియని పరిస్థితి! చివరకు ఓ చోట శ్లోకం కింద ప్రతి పదార్థం ఇవ్వడంతో తృప్తి జెంది, అదే సరైనదని తలచి రాయడం మొదలెట్టాను. ఇది భర్తృహరి ' నీతి శతకం' సుభాషితాల్లోనిది. 
   భుజకీర్తులు, చంద్రహారాలు, మణిపూసలు లాంటి ఆభరణాలు, పన్నీటి స్నానాలు, చందన లేపనాలు, పుష్పాలు, నిగారింపుతో కూడిన కేశాలు--- ఇవేవీ మనిషిని( వ్యక్తిని  ) అలంకరించలేవు. ఎందుకంటే ఆభరణాలు శోభను కోల్పోతాయి, పూలు వాడిపోతాయి. కానీ చెక్కుచెదరక ఎప్పుడూ మనతో ఉండే చక్కటి సంస్కారంతో కూడిన మాటలే మనిషికి నిజమైన ఆభరణాలు! అలంకారాలు !
ఇదీ శ్లోకం సారాంశం. మాట తీరే మనిషికి అలంకారమన్న మహత్తర సందేశాన్ని అందించే విలక్షణమైన శ్లోకం. 
   ఇంతకీ, మాట తీరు అంటే ఏమిటి? ఎలా ఉండాలి? 
   మాట్లాడటం ఓ కళ! మృదుమధురంగా ఎదుటివారినీ, వినేవాళ్ళనీ ఆకట్టుకునేలా మాట్లాడటమన్నది మనిషికి చాలా అవసరం. కొట్టినట్టుగా, పుల్ల విరిచినట్లుగా మాట్లాడడం అభిలషణీయం కాదు. కొందరు ఆధిపత్య ధోరణిలో తీవ్రస్థాయిలో మాట్లాడుతూ' నా మాట తీరే ఇంత ' అంటుంటారు. మరికొందరు' నేను కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడతా ' అంటుంటారు. మనం మాట్లాడే తీరే మనకు మిత్రుల్ని, శత్రువుల్నీ తెచ్చిపెడుతుంది. ఆ తీరే కొన్ని సందర్భాల్లో మిత్రుల్ని శత్రువులుగా మార్చే ప్రమాదమూ లేకపోలేదు. 
   మనతో ఎదుటివారు ఏ విధంగా మాట్లాడితే బాధ పడతామో అలాగే ఏ విధంగా మాట్లాడితే సంతోష పడతామో మనం గుర్తించగలిగితే చాలు-- సున్నితంగా, సంస్కారయుతంగా మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలో స్వయానా మనకే అవగతమవుతుంది. సున్నితంగా చెప్పే మాటలు మొండి వైఖరి గల వారిలోనూ మార్పుతేగలవు. తీవ్రంగా మందలించడం, కటువుగా మాట్లాడటం వల్ల పరిస్థితి ఇంకా దిగజారే ప్రమాదం ఉంటుంది. ఆభరణం లాంటి వాక్కు యొక్క ప్రాధాన్యత అందరం గుర్తించడం చాలా అవసరం. 
  ఈ సందర్భంగా ఓ చిన్న పిట్ట కథ చెప్పాలనిపిస్తోంది. అందరికీ తెలిసిందే. 
  ఒకాయన తన స్వగ్రామం వదిలి మరో ఊరిలో స్థిరపడాలనుకుని ఓసారి ఆ వూరు చూద్దామని బయలుదేరాడట. ఊర్లో ప్రవేశిస్తూ ఉండగా పొలిమేరలో అతనికి ఓ పెద్దాయన ఎదురుగా వచ్చాడట. అప్పుడు ఆయన్ని ఇతను ఓ ప్రశ్న అడిగాడట. 
" అయ్యా, నేనీఊరిలో ఉండాలనుకుంటున్నాను, ఈ ఊరు మంచిదేనా?.. "
దానికాయన వెంటనే, 
" బాబూ, నీ నోరు మంచిదేనా? " అన్నాట్ట !
 అదీ సంగతి! మన పెద్దలు ఏనాడో చెప్పారు, " నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని !" 
  కాబట్టి శ్లోకంలోని భావాన్ని గ్రహించి మాట తీరే మనిషికి అలంకారమని తదనుగుణంగా మనల్ని మనం సంస్కరించు కోవడం ఎంతో ఉత్తమం. 

🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷