Monday, May 8, 2023

రేపటికోసం... 'చిన్నారి'కథ

🙎🙋👷😅😇🙂 

"టీచర్స్, మనకోపని పడిందమ్మా...మండల కార్యాలయం నుండి ఆర్డర్స్! పిల్లల చేత బడి దగ్గర,  ఊరిలో అనువైన చోట్ల మొక్కలు నాటించాలట ! అందుకోసం రకరకాల మొక్కల్ని సప్లై చేస్తామని చెప్పారు. రేపు వాటిని తీసుకొస్తాను. ఈ విషయం పిల్లలకు తెలియజేసి, రేపు ఉదయానికంతా వాళ్లతో పాటు మీరూ  సిద్ధంగా ఉండండి. మీకు మన రమణ సార్  హెల్ప్ చేస్తారు... "
స్టాఫ్ రూమ్ కు  టీచర్లందరినీ  పిలిపించి, చేయవలసిన కార్యక్రమము గురించి వివరాలు తెలియజేశారు హెడ్మాస్టర్ మూర్తిగారు. రమణ ఆ ఊరి వాడే. డిగ్రీ దాకా చదివాడు. ఖాళీగా ఉండడం ఎందుకని స్కూలుకు వచ్చి  పాఠాలు  చెబుతుంటాడు. సాధన మిగతా టీచర్లతో కలిసి రమణతో కాసేపు మాట్లాడింది. ఊరిలో ఎక్కడెక్కడ మొక్కలు నాటాలో అనువైనచోట్లు  చూసే పని అతనికి అప్పగించి క్లాసులకు బయలుదేరారు.
                      **             **            **
   మరుసటి రోజు మొక్కలన్నీ వచ్చాయి. ముందే విషయం తెలిసిన పిల్లలు రెడీగా ఉన్నారు. మధ్యాహ్నం లంచ్ బెల్లయింది. పిల్లలంతా  భోజనాలు కానిచ్చి బడికి ఓ పక్కన కూర్చుని, పళ్ళు అమ్ముకునే కిట్టయ్య తాత దగ్గర చేరారు. అతను రకరకాల పండ్లు తెచ్చి ప్రతిరోజూ  అమ్ముతుంటాడు. వరుసగా పేర్చబడ్డ నర్సరీ మొక్కల్ని చూసి, 
" ఎందుకర్రా  ఇవన్నీ..? "
 అని అడిగాడు పిల్లల్ని.
" మేం నాటాలి తాతా... ఇవన్నీ రకరకాల మొక్కలు. చింత, వేప, నిమ్మ, సుంకేసుల, మందారం, జామ.. చాలా చాలా ఉన్నాయి తెలుసా...!"
 అన్నారు పిల్లలు.
" ఓశోశ్ ! ఇవన్నీ మీరు నాటితే... అవి ఎప్పుడు కాయలు కాయాలేంటి?  మీరు తింటారా పెడతారా? "
కిట్టయ్య పక్కపకా నవ్వి, అదో అనవసరశ్రమ అన్నట్టు తీసి పారేశాడు. కాస్త దూరంగా ఉన్న సాధన చెవిని ఆ సంభాషణ అంతా పడనే పడింది. కాసేపటి క్రితం కూరగాయలమ్ముకునే సూరమ్మ కూడా ఇదే మాట అంటూ వెళ్ళింది. విసుగొచ్చింది సాధనకు.. ఉండబట్టలేక మెల్లిగా అతని దగ్గరకు వచ్చి, 
" నువ్వు రోజూ  పండ్లు తెస్తున్నావు కదన్నా... అవి ఎక్కడ నుంచి వస్తున్నాయంటావ్? "
 అవాక్కయిన అతను, 
"... మార్కెట్లో కొనుక్కొచ్చి అమ్ముతానుగదమ్మ... !"
" కదా ! ఎవరో ఎప్పుడో నాటిన చెట్లకు కాసిన  కాయలు నీకు ఉపయోగపడుతున్నాయి. అప్పుడు వాళ్లు నాటినవి ఇప్పుడు నీకూ, నీలాంటి వాళ్లకు ఉపయోగపడుతున్నట్టే.. ఈరోజు ఈ పిల్లలు నాటేవి రేపు వేరే ఎందరికో ఉపయోగపడొచ్చు కదా...!"
" అవునమ్మోయ్... !", 
నాలిక్కరుచుకున్నాడు కిట్టయ్య. పిల్లలంతా నవ్వేశారు. ఓ అరగంట తర్వాత... మొక్కలు తీసుకుని,  రమణ సార్ తెచ్చిన చిన్న చిన్న పనిముట్లు పట్టుకొని టీచర్లతో కలిసి ఊర్లోకి బయలుదేరారు. రమణ ఎక్కడెక్కడ నాటాలో చెప్పి, అక్కడ పాదులు తవ్వించడం మొదలెట్టాడు. రచ్చబండ దగ్గర ఊర్లోని పెద్దలు కొందరు కూర్చుని,బాతాఖానీ  కొడుతున్నారు. పక్కనే పెద్ద వేప చెట్టు... దాని చుట్టూ పెద్ద అరుగు.... దానిమీద గుంపులు గుంపులుగా మరికొందరు కూర్చుని లోకాభిరామాయణం మొదలుకొని రాజకీయాల వరకు తీవ్రంగా చర్చించుకుంటున్నారు... మరోవైపు వీధిలో, టీనేజ్ నుండి పాతికేళ్ల వయసున్న వాళ్ళు ఏడెనిమిది మంది క్రికెట్ ఆడుతున్నారు. పిల్లలంతా ఒక్కసారిగా బిలలమంటూ సైన్యంలా వచ్చేసరికి అందరి దృష్టి వాళ్లపైనా, వెనకే వస్తున్న టీచర్లపైనా పడింది.
" ఏంటిరో.. ఏం చేస్తున్నారిక్కడ?... దేనికలా తవ్వుతున్నారు? "
ఒకాయన తలతిప్పి అడిగాడు పిల్లల్ని. రమణ వాళ్ల దగ్గరికి వెళ్లి విషయం చెప్పాడు.
" సరి సరి ! బాగుంది వరస! వీళ్లు నాటడం... అవి పెరిగి పెద్దవై చింతకాయలు, నిమ్మకాయలు, కాయడం!"
 అందరూ నసిగారు. క్రికెట్ ఆడుతున్న వాళ్లంతా గొల్లున నవ్వేశారు ఒక్కసారిగా. పిల్లల మొహాల్లో అసంతృప్తి చోటు చేసుకుంది. టీచర్లు అసహనంగా ఇంకా వాళ్ల ధోరణికి అవమానంగా ఫీలయ్యారు. రమణ వాళ్లకేదో సర్ది చెప్పబోయాడు. సాధనకు కోపం ముంచుకొచ్చింది. కిట్టయ్య, సూరమ్మ నిరక్షరాస్యులు.. వయసు పైబడ్డవారు... ఊర్లో పెద్దలూ వాళ్ల లాగే మాట్లాడడం ఆమెకు బాధ అనిపించింది. ఇక ఆగలేక ముందుకు కదిలింది.
" చూడండన్నా... ఈ వేప చెట్టు ఎవరు నాటారో ఎప్పుడు నాటారో మీకు తెలుసా? "
"................"
"... తెలీదు. కానీ ఈరోజు మీ అందరికీ నీడనిస్తోంది. చల్లటి, ఆరోగ్యకరమైన గాలి నిస్తోంది.ఆ నాటినవాళ్లు ఎవరూ  ఇప్పుడు లేరే ! మనం చేసే ప్రతి మంచి పని మనకే  ఉపయోగపడాలని ఉందా? ! చెప్పండి.."
అంతా మొహమొహాలు చూసుకున్నారు. ఒకాయన ముందుకొచ్చి, 
" ఇదివరకూ  కొందరు ఇలా వచ్చి నాటి పోయారమ్మా. కానీ మూడు రోజుల తర్వాత చూస్తే ఎండిపోయాయి. లాభమేముందీ  అని !"
అన్నాడు. 
" వాళ్లంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు.. వీటికి చుట్టూ కంచెలు  వేయిస్తాం. ఒక్కో విద్యార్థికీ మూడు నాలుగు మొక్కలు అప్పజెబుతాం. వాళ్లు రోజూ  నీళ్లు పోస్తారు. వాటి సంరక్షణ బాధ్యత ఇక వాళ్లదే... "
".............."
"... నాటినవన్నీ బ్రతకాలని లేదు కదా... కొన్ని నిలిచినా  మేలే కదన్నా... ప్రభుత్వం ఓ పని చేపట్టి మాకు అప్పగించింది. పెద్దలు మీరు మాతో సహకరించాలి. పిల్లల్ని ఇలా నిరుత్సాహపరిస్తే ఎలా"? సరేనమ్మా అంటూ పక్కకు తప్పుకున్నారు అంతా.వాళ్లలో మార్పు ఆశించలేదు సాధన. మౌనంగా ఉండి పోవటం మంచిది కాదనిపించి నోరు తెరిచింది, అంతే! కానీ పర్వాలేదు. వాళ్లు వాదనకు దిగలేదు.. అది చాలు అనుకుందామె. ఓ పక్క నిలబడి చోద్యం చూస్తున్న క్రికెట్ బ్యాచ్ వాళ్ళని చూస్తూ, 
" బాబూ,  మీరు ఈ తరం వాళ్లు.. పిల్లలకు చేయూత నివ్వాలి  కదా!హేళన చేయొచ్చా !"
అన్నది. వాళ్లు ఏమనుకున్నారో ఏమో... బ్యాట్స్ పక్కన పెట్టేసి, పిల్లల వైపు నడిచారు. సాధన మాటతీరుకు అచ్చెరువొందాడు రమణ. టీచర్లు ఆమెవైపు అభినందనగా చూశారు. పిల్లలు హుషారుగా పనుల్లో నిమగ్నమయ్యారు.సాధన చిరునవ్వుతో వెళ్లి తనూ వాళ్ళతో చేయి కలిపింది. 

🙂😇👧🙋😇🙂👧🙋🙆😇🙂👧🙎🙂👷👧🙂🙋



Wednesday, May 3, 2023

ప్రతీ జీవితం ఓ ప్రయాణమే-16-కవిత్రయం ..

🌺
  
     ఇంటర్ అయ్యాక డిగ్రీ ఫస్ట్ ఇయర్ విజయవాడ మేరీస్టెల్లా (Maris stella) కాలేజీలో చేర్పించారు మా నాన్నగారు. క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్.. అమ్మాయిల కోసమే. చాలా పెద్ద కాలేజీ. చుట్టూ పెద్ద కాంపౌండ్... ముందువైపు మూడంతస్తుల బిల్డింగ్. లోపల వెనకవైపు హాస్టల్.. అదీ మూడంతస్తులే. పటమట, బెంజి సర్కిల్ లో ఉండేది. మంచి పేరున్న కాలేజీ అని చేర్పించారు... కానీ, అక్కడి వాతావరణం నాకు అలవాటు కావడానికి కొంత సమయం పట్టింది. నెల రోజులు గడిచాక, కాలేజీలో, హాస్టల్లో నలుగురైదుగురు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. 
   ఉదయం బ్రేక్  ఫాస్ట్ అయ్యాక తొమ్మిదింటికి కాలేజీకి వెళ్లడం, మధ్యాహ్నం 12.30 కు లంచ్ కు హాస్టల్ కు రావడం ! డైనింగ్ హాల్ చాలా పెద్దదిగా, బాగా మోడర్న్ గా ఉండేది. పెద్దపెద్ద టేబుల్స్, చుట్టూ ఛైర్స్! దానికి తగ్గట్టే ఫుడ్ ! గంటలో తినడం, తిరిగి మధ్యాహ్నం క్లాసులకు పరుగులు తీయడం !నాలుగున్నరకనుకుంటా...క్లాసులవంగానే హాస్టల్ రూమ్ కి చేరుకోవడం..కాలేజీకి, హాస్టల్ కూ మధ్యలో ఓ కాంటీన్ ఉండేది. చాక్లెట్స్ దగ్గర్నుండి సమోసాలూ, అన్నీ తక్కువ ధరలకే ఇచ్చేవారు. స్టూడెంట్స్ కోసమే ఆ వెసులుబాటు ! పావలాకు ఓ పొట్లం నిండా మిక్చర్, రూపాయి, రెండు రూపాయలకు కేక్స్... అలా ఉండేవి ధరలు!మాకు నచ్చినవి కొనుక్కుని తింటూ రూమ్ కెళ్ళేవాళ్ళం. ఈ దినచర్య అలవాటయ్యాక బాగానే ఉందనిపించింది నాకు. ఆ తర్వాత రోజులు చకచకా జరిగిపోవడం కూడా జరిగింది.
   ఇంతకీ... ఇదంతా ఇప్పుడు ఎందుకు రాయాలని అనిపించింది అంటే... ఫస్ట్ ఇయర్ మొదట్లో క్లాసులో ఎదురైన ఓ చిన్న అనుభవం... ఇప్పటికీ  అలా నా మదిలో నిలిచిపోయింది. అది గుర్తొచ్చినప్పుడల్లా నాలో ఏదో ఆహ్లాదకరమైన భావన!
  చేరి వారమై ఉంటుందేమో! మెల్లి మెల్లిగా క్లాసులు మొదలై పుంజుకుంటున్నాయి. ఆరోజు మధ్యాహ్నం సెకండ్ పీరియడ్. తెలుగు క్లాసు మొదలవబోతోంది.లాంగ్వేజి క్లాస్ కాబట్టి అన్ని గ్రూపులవాళ్లూ కలుస్తారు. అలాగే మా గ్రూప్ వాళ్ళం కూడా వచ్చాము. అప్పటికే మిగతా గ్రూపులవాళ్లంతా వచ్చేసి, క్లాస్ రూమంతా ఆక్రమించేశారు. పెద్ద హాలు !గ్యాలరీస్ తో ! ముందంతా నిండిపోయిఉంది. వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెనక్కి వెళ్లి, అక్కడ మిగిలిపోయిన ఖాళీ సీట్లలో సర్దుక్కూర్చున్నాం. అసలే ఆడపిల్లలు ! గలగల మాటలు, కిలకిల నవ్వుల్తో క్లాసంతా గోలగోలగా ఉంది. అంత గోలా ఠక్కున ఆగి,  నిశ్శబ్దం అలుముకుంది  ఒక్క క్షణంపాటు ! మరుక్షణంలో.... ఒకావిడ నెమ్మదిగా నడుస్తూ వచ్చి స్టేజి ఎక్కి నిల్చుంది. మరీ  ఎత్తు మరీ పొడుగు కాక కాస్త బొద్దుగా ఉంది. గుండ్రటి ముఖం. ముడి వేసుకుని  చాలా హుందాగా ఉంది. అందర్నీ చూస్తూ చిన్నగా నవ్వి, 
" హాయ్! అమ్మాయిలూ, నా పేరు రమాదేవి. తెలుగు లెక్చరర్ని..."
 అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూ మొదలెట్టారావిడ. 
"... ఇది మన మొదటి క్లాసు. మిమ్మల్ని కొన్ని ప్రశ్నలడుగుతాను. ఎలా చెప్తారో చూద్దాం...ప్రశ్నలంటే భయపడకండే .అయితే  నేను అడిగిన వాళ్లు మాత్రమే చెప్పాలి..."
 అంటూ క్లాసంతా తేరిపారజూసింది.ఆచూపులు అటూ ఇటూ, ఇటూ అటూ కలయదిరిగి చివరికి  సరిగ్గా వచ్చి చిట్ట చివర్లో కూర్చున్న నా మీద పడ్డాయి. అంతే !వెంటనే, నావేపు వేలు చూపిస్తూ, 
" అమ్మాయ్, నువ్వు చెప్పు.. కవిత్రయం ఎవరు? "
ముందున్న వాళ్లంతా తలలు వెనక్కి తిప్పి ఎవరా అని నావేపు చూపులు సారించారు.  ఒక్కసారిగా గుండె దడదడలాడింది నాకు.మొదటి క్లాసు. అంతమందిలో లేచి చెప్పాలంటే బిడియంగా అనిపించింది. పైగా చివరిగా దూరంగా ఉన్నాను. జవాబు అయితే బాగా తెలిసినదే... కానీ తప్పదనుకుంటూ బెరుగ్గానే లేచాను. అందరికీ వినబడాలి కదా... ముఖ్యంగా మేడమ్ గారికి !నీళ్లు నములుతూ నిల్చోక,  గట్టిగా గడగడా చెప్పేశాను. (అలా ఎలా చెప్పగలిగానో.. ! తర్వాత నాకే  ఆశ్చర్యం కలిగింది). దీనికే అంత ధైర్యం కావాలా! అనిపించొచ్చు. కానీ ఆ వయసు... ఆ 'సిచువేషన్' అలాంటిది మరి నాకు!! 
" నన్నయ భట్టు , తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ "
చెప్పీచెప్పగానే, 
" గుడ్... వెరీ గుడ్.."
అనేసి, 
"... నీ పేరేంటమ్మాయ్? "
అనడిగారు. చెప్పాను. 
" చక్కటి పేరు..."
అని అందరి వైపు చూస్తూ, 
" ధరిత్రికి కవిత్రయం అంటే చాలా గౌరవంలాగా ఉంది. కవిత్రయం ఎవరు అనడిగితే  అందరూ నన్నయ, తిక్కన, ఎఱ్ఱన అని  సింపుల్ గా వాళ్లు ముగ్గురూ అదేదో వాళ్ల క్లోజ్ ఫ్రెండ్స్ అయినట్లు చెప్తుంటారు. కానీ ఈ అమ్మాయి నన్నయ భట్టు, తిక్కన సోమయాజి, ఎర్రాప్రగడ అని పూర్తిగా చెప్పేసింది. అలా ఉండాలి రెస్పెక్ట్ అంటే...!"
అని నవ్వేశారామె. క్లాస్ అంతా శృతి కలిపింది. 'అమ్మయ్య' అని నిట్టూర్చి చటుక్కున కూర్చుండిపోయాను. అనూహ్యంగా నాలో ఏదో తెలీని సంతోషం ! అలా  మొత్తం క్లాసంతా అనుకోని విధంగా మొదటి రోజే నా పేరు తెలిసిపోయింది. ఆ రోజు నుండీ క్లాసు బయట ఆ మేడంగారు ఎక్కడ కనిపించినా, నన్ను చూసి పలకరింపుగా నవ్వేవారు. అలా  ఆరోజు జరిగింది నా స్మృతిపథంలో చక్కటి జ్ఞాపకంలా నిలిచిపోయింది. నా  కాలేజీ రోజుల్లోని మరపురాని ఓ మధురస్మృతి అది !! కవిత్రయం అన్న మాట ఎవరి నోట విన్నా, ఎక్కడ చదివినా నాకదే గుర్తొస్తూ ఉంటుంది. 🙂
*****************************************








Friday, April 28, 2023

' ఆడ ' పిల్లలు కాదు.... ఆదుకునే పిల్లలు.... !

     అదో ప్రభుత్వ ఆసుపత్రి. సమయం సాయంత్రం అయిదు దాటింది. అక్కడే కాంపౌండ్ లో ఓ చెట్టు కింద ఉన్న బెంచీ మీద కూర్చునిఉన్నాడు శ్రీనివాసరావు. ఉన్నట్టుండి అతని దృష్టి హాస్పిటల్ నుండి విసవిసా పరుగులాంటి నడకతో వస్తున్న ఓ యువకుడి మీద పడింది. అతని వెనుకే ఓ పెద్దాయన, అరవై ఏళ్ళు పైబడి ఉండొచ్చేమో, ఆ యువకుణ్ణి బ్రతిమాలుతున్న ధోరణిలో గబగబా వస్తూ అతన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆ యువకుడు అదేమీ పట్టించుకోక ఆయన్ని విదిలించి మరింత వేగంగా గేటు వైపు వచ్చాడు. ఆ పెద్దాయన చేసేదేమీలేక అక్కడే మ్రాన్పడి నిలుచుండిపోయాడు.
       అతను తిన్నగా వచ్చి శ్రీనివాసరావుకు కాస్త దూరంలో ఉన్న మరో బెంచీ మీద కూర్చున్నాడు. అతని మోహంలో భరించలేని ఆందోళన,అసంతృప్తి!
ఎందుకో అతన్ని పలకరించాలనిపించింది శ్రీనివాసరావుకి. అతను కాస్త తటపటాయిస్తూ విసుగ్గానైనా విషయం టూకీగా చెప్పి మళ్ళీ అసహనంగా మారిపోయాడు. ఇంతకీ ---
    అతని భార్య ఈ మధ్యాహ్నం ఆడపిల్లను ప్రసవించింది. అంతకుముందే ఇద్దరు ఆడపిల్లల తండ్రి అతను. మూడోసారి తప్పక కొడుకే పుడతాడని ఎంతో నమ్మకంగా ఉన్నాడు, కానీ తీరా చూస్తే --మళ్ళీ పాప ! కనీసం పసిగుడ్డు ముఖమైనా చూడకుండా ఆ స్థితిలో ఉన్న భార్య అవస్థ ఏమాత్రం గమనించకుండా అత్తమామలపై విరుచుకుపడ్తూ, అదేదో వాళ్ళ తప్పిదమైనట్లు ధుమధుమలాడుతూ నానా హంగామా చేస్తూ, ఇదిగో ఇలా ఇప్పుడు బయట పడ్డాడన్నమాట !
    శ్రీనివాసరావు నింపాదిగా అతనివేపు చూస్తూ, "సరే, ఇంతకీ కొడుకు పుడితే ఏమయ్యేదట? "
   చివ్వున తలెత్తి చూసాడతను ఏమిటీ పిచ్చి ప్రశ్న అన్నట్లు !
    అతని మనసులో భావం కనిపెట్టి అనునయంగా మొదలెట్టాడు శ్రీనివాసరావు. 
    ". .. నిజమే, కొడుకు పుడితే బాగుండేది. కానీ పుట్టలేదు. ఏం చేయగలం? చూడు బాబూ, నీవు వింటానంటే ఓ సంగతి చెబుతాను... "
   అతను తల పంకించడం చూసి కొనసాగించాడు. 
"... నీలాగే నేనూ అనుకునేవాణ్ణి. కొడుకు పుడితే ఏదో ఉద్ధరిస్తాడనీ, అవసాన దశలో అండగా ఉంటాడనీ... ఆడపిల్లలయితే పెళ్లిళ్లు చేసుకుని వెళ్ళిపోయే వారేననీ...వాళ్ళవల్ల ఖర్చు తప్ప ప్రయోజనమన్నది ఉండదనీ... అలా అలా ఉండేవి నా ఆలోచనలు. ఇలాగే వరుసగా...అచ్చం నీలాగే  ముగ్గురు కూతుళ్ళు పుట్టారు. అయినా ఆశ చావక నాలుగో సారి చూద్దాం అనుకున్నా. నా ఆశ తీరింది. కొడుకు పుట్టాడు. వాణ్ని చూసుకుని మురిసిపోతూ ముందున్న ముగ్గురు ఆడ పిల్లల్నీ నిర్లక్ష్యం చేశాను. నా ఆశలకు తగినట్లుగానే నాకున్న చిన్నపాటి ప్రైవేటు ఉద్యోగంతోనే వాణ్ని బాగా చదివించాను. వాడూ బాగా కష్టపడి చదివి గవర్నమెంట్ ఆఫీసులో పెద్ద ఆఫీసర్ అయ్యాడు. అప్పుడే మొదలైంది అసలు అధ్యాయం! మా ప్రమేయం లేకుండా తన స్థాయికి తగ్గ మరో ఉద్యోగస్తురాలిని పెళ్లి చేసుకుని ఎక్కడో ముంబైలో స్థిరపడి పోయాడు. ఉద్యోగం ఉన్నన్నాళ్ళు ఉన్నదంతా వాడి చదువుకే పెట్టి ఏమీ వెనకేసుకోలేక పోయాను. ఇప్పుడు పెన్షన్ అన్నది లేదు. వాడికి నేను గాని తల్లి గానీ కనీసం గుర్తుకు కూడా రాము. కొడుకు వంశాన్ని ఉద్ధరిస్తాడనీ, చివరి దశలో చూసుకుంటాడనీ, తలకొరివి పెడతాడనీ, పున్నామ నరకం నుండి తప్పిస్తాడనీ ఏవేవో అనుకుంటారంతా. కానీ, అదంతా భ్రమే... " కాస్త ఆగాడాయన. 
    ఆయన్ని చూస్తూన్న ఆ యువకుడు తన అసహనం కాసేపు మర్చిపోయి ఆసక్తిగా వినసాగాడు. ఆయన మళ్లీ మొదలెట్టాడు. 
".... నేను చేసిన పెద్ద తప్పిదం.. నా కూతుళ్లను నిర్లక్ష్యం చేయడం. కానీ వాళ్ల గురించి నేను ఎంత మాత్రం పట్టించుకోకపోయినా వాళ్లు మాత్రం నా పట్ల ద్వేషం పెంచుకోలేదు. పెద్దది ఐదో క్లాస్ వరకు చదివినా టైలరింగ్ నేర్చుకుని ఓ షాపు పెట్టుకుంది. రెండోది పది దాకా చదివింది. ఓ షాపింగ్ మాల్ లో సేల్స్ గర్ల్ గా చేస్తోంది. ఇక మూడో పిల్ల, ఇంటర్ తర్వాత టీచర్ ట్రైనింగ్ చేసి ఏకంగా టీచర్ అయిపోయింది. వాళ్లకు పెళ్లి సంబంధాలు కూడా గొప్పగా ఏమీ చేయలేదు నేను. అయినా ఇప్పుడు ముగ్గురూ  చక్కగా స్థిరపడి పోయి పిల్లాపాపలతో సంసారాల్ని ఎంచక్కా నడుపు కుంటున్నారు. అంతేకాదు, అమ్మానాన్నల గురించి పట్టించుకుంటూ చేతనయినంత సాయం చేస్తూ, అవసరమైనప్పుడు మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయాసం ఎక్కువై హాస్పిటల్ లో చేర్పించిన వాళ్ళమ్మను ఒకరి తర్వాత ఒకరు వచ్చి చూసుకుంటున్నారు. ఈరోజు ఆదివారం కదా, అందుకని ముగ్గురూ ఇందాకే వచ్చారు.... " ఆయన మొహంలో సంతోషం ప్రస్ఫుటంగా కనిపించింది. 
".... చూడు బాబూ, ఆడపిల్ల అంటే ఎప్పుడూ 'ఆడ' పిల్లే  నంటూ చాలా తేలిగ్గా చూస్తాం. కాని ఆడపిల్లలు ఎప్పుడూ 'ఆడ ' పిల్లలు కాదు. వాళ్లే ఆదుకునే పిల్లలు.... ఎందుకో నిన్ను చూస్తే నా అనుభవం చెప్పాలనిపించింది. అయినా ఈ సమయంలో అండగా ఉండాల్సిన వాడివి... జరిగిందానికి భార్యను, అత్తమామల్ని బాధ్యుల్ని చేస్తూ ఇలా.... " 
 ఆయన్నే చూస్తూన్న ఆ యువకుడి ముఖంలో విచిత్రంగా ఇందాకటి అసహనం చాలా మటుకు మాయమైపోయింది.  ఆయన మాటలు అతనిపై ఏమాత్రం ప్రభావం చూపించాయో ఏమో గానీ, ఇంతలో ఆయన ముగ్గురు కూతుళ్ళు హాస్పిటల్ నుండి నవ్వుకుంటూ రావడం చూసి శ్రీనివాస రావు లేచి నిలబడ్డాడు. ఆ ముగ్గురిని చూడగానే ఆ యువకుడిలో ఏదో ప్రసన్నత! ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు శ్రీనివాసరావు. అయినా ఆయనలో ఏదో సందిగ్ధత! తన మాటలు ఇతన్ని ఆవగింజంత అయినా కదిలించాయా? అతని ముఖంలోకి చూస్తూ ఉన్నాడుగానీ అందులోని భావాలు చదవలేక పోతున్నాడాయన. ఓవైపు, అతని మామ గారు దూరంగా వరండాలో నిలుచుని దీనంగా ఇటువైపే చూస్తూ ఉన్నాడు. 
   ఆ అమ్మాయిల నుండి చూపు మరల్చుకుని లేచి, శ్రీనివాసరావు వేపు గౌరవపూర్వకంగా చూస్తూ కరచాలనం చేస్తూ ఉన్నట్టుండి ఆయన రెండు చేతులూ పట్టుకున్నాడు. ఏదో అనిర్వచనీయమైన భావం అతని కళ్ళలో ! బహుశా ఆయనపట్ల కృతజ్ఞత కావచ్చు !ఆవెంటనే వెనుదిరిగి, హాస్పిటల్ వేపు లోనికి నడుస్తూ అక్కడే ఆతృతగా ఎదురుచూస్తున్న అతని మామగార్ని సమీపించాడు. ఆ పెద్దాయన స్థిమితపడ్డం స్పష్టంగా కనిపించింది శ్రీనివాసరావుకు. ఇద్దరూ కలిసి లోపలికెళ్లడం చూసి తృప్తిగా నిట్టూర్చాడు. 
     ఈలోగా ఆ ముగ్గురు ఆడవాళ్లు  శ్రీనివాసరావును సమీపించి, ఆయన్ను దాటుకుని ముందుకెళ్లారు. ఆపిదప.. గేటుదాటి బయటికెళ్లి, అక్కడే ఉన్న ఓఆటో ఎక్కి ముగ్గురూ కనుమరుగయ్యారు. ఆయన్ను పలకరించనైనా లేదు. కనీసం కన్నెత్తి చూడలేదు. అదేమిటీ అంటే... వాళ్ళు ఆయన కూతుళ్లు అయితే గద !!
    కొందరికి ఎదుటివాళ్ళు ఏదైనా సమస్యల్లో  చిక్కుకుని, సతమతమౌతూ ఉంటే చూసి లోలోన ఆనందించడం తెగ సరదా. పైకిమాత్రం సానుభూతి నటిస్తూ ఉంటారు. శ్రీనివాసరావు తద్భిన్నం. వాళ్ళ సమస్య ఏమిటో తెలుసుకుని, తానేమైనా అది తీర్చగలనా అని మాత్రమే ఆలోచిస్తాడు. అది ఆయన స్వభావం. అరుదైన మనస్తత్వం. అదంతే !ఈరోజు జరిగిందదే !
   రెండ్రోజులక్రితం తన సమీపబంధువుకు బైక్ యాక్సిడెంట్ అయి, ఇదే హాస్పిటల్ లో చేరితే పరామర్శించి పోదామని వచ్చాడాయన ఈదినం. అదయ్యాక... వెంటనే ఇంటిదారి పట్టక చల్లగాలికి కాసేపు చెట్టు నీడన బెంచీ మీద కూర్చుండిపోయాడు. అదే సమయంలో ఎదురుగా కంటబడిందా  దృశ్యం !కోపంతో విసవిసా వచ్చిన ఆ యువకుడు గేటుదాటి వెళ్ళిపోయి ఉంటే ఈ కథ మరోలా ఉండేది.కానీ... అతనొచ్చి సరాసరి శ్రీనివాసరావు పక్కనే కూర్చున్నాడు మరి !
     శ్రీనివాసరావు రచయిత అయితే కాదు గానీ... ఆయనలోని ఊహాశక్తి అమోఘం ! నిమిషాల్లో పరిస్థితి గమనించి, అర్థం చేసుకుని, అప్పటికప్పుడు ఓ కల్పితకథ   అల్లేశాడు.అంతే !! నిజానికతనికి కూతుళ్లే లేరు. ఒక్కగానొక్క కొడుకు... పెళ్లయిపోయి ఇదే ఊర్లో ఉద్యోగం చేసుకుంటున్నాడు. శ్రీనివాసరావు ఓ చిరుద్యోగం చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం భార్యతో కొడుకువద్దే నిశ్చింతగా కాలం గడుపుతున్నాడు. 
  ఆయన ఆ యువకునితో మాట్లాడుతున్నప్పుడు.. సరిగ్గా అప్పుడే ఆ ముగ్గురు అమ్మాయిలు అలా వస్తూ  కనిపించడం కేవలం యాదృచ్ఛికం ! వాళ్ళు వీళ్ళను సమీపించకముందే అతను నిష్క్రమించడం శ్రీనివాసరావుకు  కలిసొచ్చిన మరో విషయం ! 
    మామాఅల్లుళ్లిద్దరూ నెమ్మదిగా లోనికెళ్ళడం చూసి తృప్తిగా నిట్టూర్చాడు శ్రీనివాసరావు. చీకట్లో తాను విసిరిన ఓ రాయి గురి తప్పలేదు. ఆయన మనసంతా సంతోషం అలుముకుంది. అబద్దం ఆడితేనేమిగాక... తన ఈ చర్య వల్ల... ఒకరి ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఓ ఆడపిల్ల జీవితం నిలబడింది. మరో ముగ్గురు ఆడపిల్లలు తండ్రి ప్రేమకు నోచుకోబోతున్నారు. మరీ ముఖ్యంగా... వృద్ధాప్యంలో  ఉన్న ఓ తండ్రి ప్రాణం కుదుటబడింది.  చాలు !
    నెమ్మదిగా   శ్రీనివాసరావు  అడుగులు ముందుకు సాగాయి.  

************************************************

Wednesday, April 12, 2023

అమ్మమ్మ..పూలజడ(కథ)చివరి భాగం

" అమ్మమ్మా, లే అమ్మమ్మా, టైం అవుతోంది. రా... నాకు జడ వేద్దువుగాని.. "
బంగారు జడ కుచ్చులు చేత్తో పట్టుకుని వచ్చిన అరవింద టీపాయ్ ముందు కుర్చీలో  కూర్చుని ఉన్న శ్రీదేవమ్మను భుజాలు పట్టి కుదుపుతూ పిలిచింది. అలా కూర్చుని ఉన్న శ్రీదేవమ్మ కుర్చీలోనే ఓ పక్కకు ఒరిగిపోయింది. 
" అమ్మమ్మా !"
కంగారుగా అరిచింది అరవింద. ఆ పక్కనే ఉన్న శ్రావణి ఒక్క ఉదుటున వచ్చేసింది. చుట్టూ ఉన్న ఆడవాళ్ళంతా గబగబా  లేచి వచ్చారు. ఒకావిడ వెంటనే గ్లాసుతో  నీళ్లు తెచ్చి మొహాన చిలకరించి, తుడిచింది
   సందడిగా ఉన్న అక్కడి వాతావరణమంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. మరు  నిమిషం అలజడి చోటు చేసుకుంది. ఓ నిమిషం తర్వాత మెల్లిగా కళ్ళు తెరిచింది శ్రీదేవమ్మ. కాస్త స్థిమితపడ్డ అరవింద, 
" ఏంటి అమ్మమ్మా ! ఏమైంది?.. "
అంది. పరిస్థితి గమనించిన శ్రీదేవమ్మ భయం భయంగా చూస్తూ అడుగుతున్న  మనవరాలితో, 
" ఏం లేదు చిట్టితల్లీ... కాస్త కళ్ళు తిరిగాయి.. అంతే.. పద పద.. లేటవుతుంది.. "
అంటూ లేచి,శ్రావణి, అరవింద  వారిస్తున్నా  వినక ముందుకు కదిలింది. అరవిందను  డ్రెస్సింగ్ టేబుల్ వద్ద కూర్చోబెట్టి, లేని ఓపిక, శక్తి కూడదీసుకుని, మల్లెలు,  కనకాంబరాలతో జడ వేసింది. అక్కడక్కడ గులాబీలు గుచ్చి, అందంగా అలంకరించింది. చంద్రబింబంలాంటి  మోమును ముద్దాడి, కళ్యాణతిలకం దిద్దింది. చుట్టూ ఉన్న కొందరు గుసగుసలాడుకున్నారు. కొందరు మూతి తిప్పుకున్నారు. మరి కొందరు వింతగా, ఒకింత సంతోషంగానూ చూశారు. అద్దంలో అందరినీ గమనిస్తున్న అరవింద కళ్లెగరేస్తూ పట్టించు కోవద్దన్నట్లు సైగ చేసింది. శ్రావణి ఓవైపు నిలబడి తల్లికన్నీ అందిస్తూఉంది. కుందనపు బొమ్మలాగున్న మనవరాలుని తనివి తీరా చూసుకుంటున్న తల్లి కళ్ళలో కాంతుల్ని చూసిన శ్రావణి.. తల్లికి తాను ఇవ్వలేకపోయిన ఆనందాన్ని తన కూతురైనా ఇస్తున్నందుకు సంతోషంతో ఆమె కళ్ళు చెమర్చాయి. పదేళ్ల వయసులో తాను కన్న ఓ కల.... ఈరోజు ఆరు పదుల వయసు దాటాక అరవింద రూపంలో తీరుతున్నందుకు శ్రీదేవమ్మ పులకించిపోయింది.
   అలా చూస్తున్న ఆమెలో సన్నగా గుండెల్లో ఏదో నొప్పి మొదలైంది. శరీరమంతా ఏదో అసౌకర్యంగా అనిపిస్తూ, తల తేలిపోతున్నట్లు అనిపించసాగింది. ఏదో శంకించిన ఆమె... శ్రావణిని పిలిచి, మెల్లిగా, 
" అరవిందను తీసుకుని నువ్వు,  చంద్రం బయలుదేరండి పెళ్లి మండపానికి... నేను వీళ్ళతో కలిసి వస్తాను..."
అంది. 
" అదేంటమ్మా, నువ్వూ  మాతోనే రావచ్చు కదా.."
అంటున్న శ్రావణికి, అరవిందకూ నచ్చజెప్పి, కిందికి పంపించేసింది. తర్వాత మెల్లిగా  లేచి, పక్క గదిలో నున్న మంచం మీదకి ఎలాగోలా చేరుకుంది. 
                   **              **         **
    కల్యాణమంటపమంతా కళకళలాడుతూ ఉంది. ఇరు కుటుంబాలవారూ చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. బంధువులంతా ఒకచోట కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు.అదంతా చూస్తున్న చంద్రశేఖర్ కు, 
  " కూతురి పెళ్లి చేస్తే ఇంత ఆనందంగా ఉంటుందా!"అనిపించింది. ఆ సందడి అంతా చూస్తూ ఉంటే చంద్రశేఖర్ కు ఓవైపు సంతోషం, మరో మూల తీవ్ర అసంతృప్తి !! లోలోపల తొలి చేయ సాగింది... అతనికి తన పెళ్లి జరిగిన వైనం గుర్తొచ్చింది ఆ క్షణంలో....! ఆరోజు శ్రావణిని ఆమె తండ్రి కొడుతూ ఉంటే. ఏమిటితను ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు...! అనుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థమవుతోంది ఆయన బాధ,ఆవేదన!
ప్రతి తండ్రీ తన కూతురి పెళ్లి గురించి ఎన్ని కలలు కంటాడో  కదా! అవన్నీ అడియాశలు చేస్తూ ఒక్కసారిగా ఆ  కూతురు అలా ప్రత్యక్షమైతే... ఏ తండ్రి తట్టుకోగలడు! అరవిందే  గనుక అలా చేసి ఉంటే.. అంతకన్నా ఉగ్రుడైపోయిఉండేవాడు తను ! 
   అరవింద కూడా ప్రేమించింది. కానీ తమలా చేయలేదు. శ్రీనాథ్ తనకన్నా రెండేళ్లు సీనియర్.ఓరోజు
ఇంటికి వచ్చి, 
" అంకుల్, నేను,  అరవింద ఒకరినొకరం ఇష్టపడుతున్నాము. మా ఇంట్లో అంతా ఓకే అంకుల్. మీరు కూడా ఒప్పుకుంటే... మా పెళ్లి జరుగుతుంది. లేదా మీరు సరే అనేదాకా వెయిట్ చేస్తాము. అలా జరగకుంటే... ఇద్దరం మౌనంగా విడిపోతాం..."
అని చెప్పాడు సూటిగా... తనతో,  శ్రావణి తో.
   ఆ సంస్కారానికి, అతని మాట తీరుకీ ముగ్ధులై పోయారిద్దరూ ! ముఖ్యంగా చివరి మాట...
" అలా జరగకుంటే మౌనంగా విడిపోతాం! "
అన్నది నేరుగా వచ్చి చంద్రశేఖర్ గుండెల్ని తాకింది. ఈ విచక్షణ, తెలివి అప్పట్లో తమకు లేకపోయింది. ఎంతసేపూ చెబితే ఇంట్లో ఒప్పుకోరు.. ఒప్పుకోరు.. అనే అనుకున్నారు గానీ, చెప్పి చూద్దాం, ఏమవుతుందో అన్న ఆలోచన మాత్రం రాలేదిద్దరికీ !తమ ప్రేమ, ఇష్టం గురించే గానీ.. దాని పర్యవసానం గురించిన ఆలోచన లేకపోయింది. ఫలితంగా... ఇరు కుటుంబాలకూ, బంధు వర్గానికీ శాశ్వతంగా దూరమైపోయారు...! తమవరకూ హ్యాపీగానే ఉన్నా లోలోపల ఏదో తీరని వెలితి !!
అలా  కాసేపు గతంలోకి వెళ్లి వ్యాకులపడుతున్న అతని వద్దకు శ్రావణి  వచ్చి, మెల్లిగా ఏదో చెప్పింది. ఆమె మొహంలో ఏదో ఆందోళన!
             **             **      **
    " ఏమిటి అరవిందా, ఎంతో అవగాహన ఉన్న నువ్వు కూడా ఇలా చేస్తున్నావు ! అవతల పెళ్లి పెట్టుకుని నువ్విలా  మొండికేస్తే ఎలా? అమ్మమ్మకు ఏమీ కాలేదు.. నా మాట విను."
ఏడుస్తూ కూర్చున్న అరవిందకు నచ్చజెప్ప ప్రయత్నించాడు చంద్రశేఖర్.
" అసలేమైంది డాడీ అమ్మమ్మకు.,, "
 ఏడుపు దిగమింగుకుంటూ అడిగింది.
" నిన్ను,  మీ అమ్మను ఇక్కడికి పంపించాక, అమ్మమ్మ మాట పలుకు లేకుండా అయిపోయింది. ప్రసాద్ బాబాయ్,  నేను, మరి కొందరు కలిసి వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లాము..."
"..........."
" మైల్డ్  హార్ట్ ఎటాక్ అట ! ప్రాణాపాయం  ఏమీ లేదు... రెండ్రోజుల్లో నార్మల్ అయిపోతుందని చెప్పారు డాక్టర్లు... ఇక్కడ పెళ్లి కార్యక్రమం ఆగకూడదని ప్రసాద్ బాబాయ్ వాళ్లు నాకు నచ్చజెప్పి పంపించారు. అక్కడ వాళ్లంతా ఉన్నారు, మరేమీ పర్వాలేదు.."
" అయ్యో, డాడీ ! ఏంటిది ! అమ్మమ్మ గురించి అమ్మ చెబితే వినడమే గానీ, ఇన్నేళ్లకు చూశాను. అదే పనిగా వెళ్లి తీసుకొచ్చాను.. తను లేకుండా నాకు పెళ్లేమిటి! "
" అరవిందా, మనకొక్కరికే చెందినది కాదిది. అవతల మగపెళ్లి  వాళ్ళ సంగతేమిటి! అసలు... అసలు.. శ్రీనాథ్ గురించి ఆలోచించవా..!"
 శ్రావణి కల్పించుకుంది."
"..............."
"... అదంతా సరే, ఇలా పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోతే ఎన్ని సమస్యలు ! అదేమైనా ఆలోచిస్తున్నావా..? "
కాస్త కోపంగానే మందలించింది. 
ఈలోగా చంద్రశేఖర్ కు ఏదో తట్టింది.
" శ్రావణీ, ఒక క్షణం..."
 అంటూ అవతలికెళ్ళాడు. 
                   **              **            **
  అంతదాకా పెళ్లి సందట్లో లోకాభిరామాయణంలో మునిగిన జనాల దృష్టి ఒక్కసారిగా మరలింది. ఓ విషయం... పదిమంది చెవుల్లో దూరి, పలు రకాలుగా విస్తరించి, చిలువలు పలువలై... చివరికది కొత్త రూపు సంతరించుకుని, సరికొత్తగా మారిపోవడం లోక సహజమేమో!! అదిగో తోక అంటే ఇదిగో పులి ! అన్న చందాన క్షణాల్లో ఆపందిట్లో ఆ వార్త గుప్పుమంది.
" పెళ్లికూతురుకి ఈ పెళ్లి ఇష్టం లేదట ! చేసుకోనంటూ ఏడుస్తోందట !!"
అందరి నోళ్ళలో నానుతూ, క్షణాల్లో ఫంక్షన్ హాలంతా వ్యాపించిపోయిందామాట. అందరూ చెవులు కొరుక్కోవడం మొదలైంది. అలా అలా పాకి, మంటపంలో ఏర్పాట్లు చూసుకుంటున్న పెళ్ళికొడుకు తండ్రి చెవిని  పడనే పడింది. పక్కనే ఉన్న భార్య, ఇతర బంధువులు మ్రాన్పడిపోయారు. 
      ముస్తాబు పూర్తి చేసుకుని, పీటల మీదకి రావడానికి సిద్ధమవుతున్న శ్రీనాథ్ వద్దకు అక్క వరుసయ్యే ఒకామె పరుగున వచ్చి  విషయం కాస్తా చేరవేసింది. మతి పోయినంతపనైందతనికి. 
" అక్కా,  ఊరుకో! విషయం తెలియకుండా మాట్లాడొద్దు.."
" నిజమేనంటరా, బయట అంతా  అదే చర్చ.!"
మరో ఇద్దరు  ముందుకొచ్చారు.ఇంకేముంది ! బిలబిలమంటూ అంతా అతని చుట్టూ మూగారు.
" ఆపండి!"
ఆ అరుపుకి ఓక్షణం  వెనక్కి తగ్గారంతా. 
అసలేమిటి! ఏమైంది అరవిందకు ! ఎందుకు ఏడుస్తోంది ! ఏం జరిగింది!
మెదడంతా మొద్దుబారిపోయిందతనికి  కాసేపు. అందర్నీ పక్కకు జరగమని చెప్పి, 
" నేను వెళ్లి కనుక్కుంటాను. అందాక ఎవరూ  నోరు విప్పొద్దు.సైలెట్ గా ఉండండి..."
అని హెచ్చరించి, లేచి గబగబా బయటికి నడిచాడు. సరిగ్గా అప్పుడే లోనికి వస్తూ తండ్రీ, తల్లీ వెనక బంధువులు ఎదురయ్యారు !!
                 **          **             **
శ్రావణిని వారించి, అవతలికెళ్ళిన చంద్రశేఖర్, రెండు నిమిషాల్లో తిరిగొచ్చి, 
" ప్రసాద్ బాబాయ్ తో మాట్లాడాను... ఇదిగో, అమ్మమ్మ మాట్లాడుతోంది చూడు.."
అంటూ సెల్ అరవింద చేతికిచ్చాడు. గబుక్కున సెల్ అందుకుని, దుఃఖం తో గొంతు పూడుకుపోతుండగా, 
" అమ్మమ్మా "
అంది. అవతల శ్రీదేవమ్మ గొంతు నీరసంగా పలికింది. 
" ఏంట్రా చిట్టితల్లీ... ! పెళ్లి వద్దంటున్నావట ! నాకేమైందని! రేపీపాటికి లేచి కూర్చోనూ... ! అప్పుడు నీ మెడలో తాళి కనిపించకపోతే నాప్రాణం నిలుస్తుందా !.."
' అమ్మమ్మా... '
" ఇన్నేళ్లకి మీ అందరినీ  చూసేసరికి సంతోషం పట్టలేక ఈ ముసలి గుండె తట్టుకోలేకపోయిందనుకుంటా..! నాతో పాటు మిమ్మల్నీ ఇబ్బంది పెడుతోంది..."
"................."
"... నువ్విలా బెంగపెట్టుకుంటే ఎలా? నీ  పెళ్ళికి నేను ఆటంకం కాకూడదురా చిట్టితల్లీ... అమ్మ నాన్నల్ని  ఇబ్బంది పెట్టకు. అవతల వాళ్లనూ బాధ పెట్టినదానవవుతావు. లే.. లేచి, వెళ్లి పెళ్లి పీటల మీద కూర్చో. రేపు మీ ఆయనతో కలిసి నా దగ్గరికి రావాలి. సరేనా! అమ్మమ్మ మాట వింటావు కదూ !... "
అమ్మమ్మ మాటలు మంత్రంలా  పనిచేశాయేమో అరవింద పై. దిగ్గున  లేచింది. కళ్ళు తుడుచుకుంటూ, 
" అమ్మా.. పదండి "
అంటూ ముందుకు కదిలింది. నాలుగు అడుగులు వేయగానే లోనికి వస్తూ శ్రీనాథ్ ! వెనక అతని తల్లిదండ్రులు, దగ్గర బంధువులు !! విషయం బోధపడ్డ అరవింద వెంటనే, 
" ఏంటి అంకుల్, ఇలా వచ్చారు? ముహూర్తానికి టైం అవుతోంది కదా ! పదండి..."
అనేసి, శ్రీనాథ్ చేయి పట్టుకుని, 
" పద, శ్రీ...వెళ్దాం.. అర్జెంటుగా అమ్మమ్మ గురించి నీకో విషయం చెప్పాలి"
అంటూ ముందుకు నడిచింది. ఏదో అడగబోయిన అందరి నోళ్లూ ఠక్కున మూతబడిపోయాయి. అయోమయంగా ఒకరి మొహాలొకరు చూసుకుంటూ, ముందు వెళ్తున్న ఆ ఇద్దర్నీ అనుసరించారు. ఆ వెనకే.. స్థిమితపడ్డ మనసుల్తో శ్రావణీ, చంద్రశేఖర్ లూనూ !!
                      **             **             **
  మూడు రోజుల తర్వాత... నూతన దంపతులు వచ్చి, శ్రీదేవమ్మ కాళ్లకు మొక్కారు. చిలకాగోరింకల్లా ఉన్న ఆ జంటను చూస్తూ, ఉప్పొంగిపోయింది శ్రీదేవమ్మ మనసు. అరవింద పెదాల మీద వెల్లివిరుస్తున్న చిరునవ్వులు చూస్తూ, తన పెళ్లి జరిగిన రోజు గుర్తొచ్చి, 
" ఏమిటో! చిన్నతనంలోపూలూ, పూలజడలంటూ తెలిసీ  తెలియక ఏవేవో పిచ్చి కలలు ఊహించుకుంది తను.. కానీ... పెళ్లి ఎంత ఘనంగా జరిగినా... దండలు మార్చుకుని సింపుల్ గా తాళి కట్టేసినా... సంతకాలు పెట్టి రిజిస్టర్ మ్యారేజి చేసుకున్నా... ఆతర్వాత ఆఇద్దరూ ఎంత సంతోషంగా, ఎంత అన్యోన్యంగా కలిసి జీవిస్తున్నారూ అన్నదే ముఖ్యం !! "
అనిపించిందామెకు . ఆ విషయం శ్రావణీచంద్రశేఖర్ లను చూసిన క్షణమే గ్రహింపుకొచ్చింది శ్రీదేవమ్మకు. ఇప్పుడు ఈ ఇద్దరినీ చూస్తుంటే అది ఇంకా బలపడిపోగా,  అక్షింతలు చల్లుతూ మనసారా ఆశీర్వదించింది. తల్లి ముఖంలో ప్రశాంతతను గమనిస్తూ, చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకుంది శ్రావణి. అమ్మనూ, అమ్మమ్మనూ చూస్తున్న అరవింద  వదనం ఆనందంతో విరిసిన అరవిందమే అయింది.
                           💐  శుభం 💐
 













Thursday, April 6, 2023

అమ్మమ్మ-పూలజడ--[మూడవ భాగం]

      వసంతాలు వచ్చి పోతున్నాయి. కాలగతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కూతురి విషయంలో వెంకటరమణ దృక్పథం మాత్రం చెక్కుచెదరలేదు. దశాబ్దకాలం గడిచింది. శ్రీదేవమ్మ పసుపు కుంకుమలకు దూరమైంది. ఎన్నో ఏళ్లుగా భర్త చాటున మరుగున పడ్డ కూతురుపై ప్రేమ ఆమెను నిలువనీయక తెలిసిన వాళ్ల ద్వారా వాకబు చేయించింది. శ్రావణికి కూతురు పుట్టిందనీ, ఉద్యోగరీత్యా వేరే రాష్ట్రానికి వెళ్లిపోయారని మాత్రమే తెలుసుకోగలిగింది. కానీ చిరునామా అయితే కనిపెట్టలేకపోయింది. ఒంటరి ఆడది... ఇక ఏమి చేయగలదు ! 
    చూస్తూ చూస్తూ ఉండగానే అలా మరో పదేళ్ళు దొరలిపోయాయి. ప్రేమగా పెంచుకున్న పూల మొక్కల్నే కన్నబిడ్డలుగా భావిస్తూ, ఆ పూలతోనే మాట్లాడుతూ బ్రతుకీడుస్తూ ఉంది శ్రీదేవమ్మ. 
        అలా ఉండగా ఓ సాయంకాలం... అరుగు మీద కూర్చుని గుండుమల్లెలు ముందు పోసుకుని మాల కడుతున్న ఆమె  ఇంటి ముందు ఓ కారు వచ్చి ఆగింది. ఎవరా అనుకుంటూ లేచి నిలబడింది. సన్నగా,  పొడుగ్గా, బారుజడతో చుడీదార్ వేసుకున్న ఓ అమ్మాయి డ్రైవింగ్ సీట్లో నుంచి డోర్ తీసుకుని దిగి, తిన్నగా ముందుకొచ్చింది. వేలితో శ్రీదేవమ్మ వైపు చూపిస్తూ, 
' శ్రీదేవమ్మ !'
అంది. ఎన్నడూ చూడని ఆ అమ్మాయి వైపు చూస్తూ, 
' ఆ... '
అంది శ్రీదేవమ్మ. వెంటనే వంగి కాళ్ళకు దండం పెడుతూ తల పైకెత్తి, 
" అమ్మమ్మా, నేను అరవింద... శ్రావణి మా అమ్మ... "
అనేసింది. ఆశ్చర్యంతో తలమునకలైన శ్రీదేవమ్మ చేతిలోని  మల్లెలు అప్రయత్నంగా కిందకి రాలాయి. వెంటనే లేచి అమ్మమ్మను హత్తుకుంది  అరవింద... !
    ఇరవై  సంవత్సరాలు దాటాక తొలిసారి మనవరాలిని చూస్తూ విపరీతమైన భావోద్వేగానికి లోనయిపోయిందా ముసలి ప్రాణం. ఊపిరి ఉండగా కన్నబిడ్డను  చూడగలనా అనుకుంటూ పరితపిస్తున్న ఆ తల్లికి అనుకోని వరంలా మనవరాలిని ఇలా ఈరోజు ఇంటికి పంపించిన దేవుడికి లోలోపలే దండం పెట్టుకుంది శ్రీదేవమ్మ. 
                  **               **              **
   ఇప్పటివరకూ తామిద్దరూ కోల్పోయిన అచ్చట్లు ముచ్చట్లు తనివితీరా తీర్చుకున్నారు అమ్మమ్మ, మనవరాలు ఇద్దరూ రెండు రోజులపాటు.. ! మాటల మధ్యలో తండ్రికి ట్రాన్స్ఫర్ అయి   ఇక్కడికే వచ్చేశారని, తనకు పెళ్లి కుదిరిందనీ చెప్పింది అరవింద శ్రీదేవమ్మతో. 
  ఆరాత్రి భోజనాలయ్యాక చల్లగాలిలో ఆరు బయట మంచం వేసుకుని అమ్మమ్మ ఒళ్లో  తల పెట్టుకుని ఆకాశంలో మిణుకుమిణుకుమంటూ వెలుగుతున్న దివ్వెల్లా ఉన్న నక్షత్రాల నడుమ ఎవరో పెట్టిన దీపంలా ప్రకాశిస్తూ వెన్నెల వెదజల్లుతున్న చందమామను తదేకంగా చూస్తున్న అరవింద. 
" అమ్మమ్మా, నీ బట్టలన్నీ సర్దేస్తాను... రేపు ఉదయం మనం ఊరికెళ్ళిపోతున్నాం... "
అంది ఠక్కున. 
" నేనెందుకురా చిట్టితల్లీ !? "
అరవింద నుదుటి మీది ముంగురులు సవరిస్తూ అడిగింది శ్రీదేవమ్మ. 
" ఎందుకేమిటి? నా పెళ్లి చూడవా... నాకు పూలజడ వేయవా..? కళ్యాణతిలకం దిద్దవా?... "
ఒక్కక్షణం విస్తుబోయినా, ఆ కళ్ళలో ఏవో మెరుపులు!! మరుక్షణం మరుగునబడ్డ జ్ఞాపకాలేవో గుర్తొచ్చి ఆమె ముఖం మ్లానమైంది. అదేదీ  గమనించని అరవింద, 
" అమ్మమ్మా, నీకు పూలజడ అంటే చాలా ఇష్టమట కదా!"
" నీకు ఎవరు చెప్పారే ? "
" మా అమ్మ చెప్పిందిలే... చిన్నప్పుడు తనకి వేయబోతే వద్దని పారిపోయేదటగా... !"
" ఇంకా ఏం చెప్పిందేమిటి మీ అమ్మ? "
" చాలా చాలా చెప్పిందిలే నీ గురించి.. అమ్మమ్మా, నాకూ  నీలా పూలజడంటే ఇష్టమే.. "
నేనూ నీ  పార్టీయే తెలుసా.... అన్నట్లు గారాలు పోయింది. 
" కానీ... నేనెలా  వేయగలను ! నీకు కళ్యాణ తిలకం ఎలా దిద్దను ? ఐదవతనం లేని దాన్ని... "
ఆమెలో నిరాశ ! వెంటనే ఒడిలోంచి లేచి, అమ్మమ్మ బుగ్గలు సాగదీస్తూ, 
" పిచ్చి అమ్మమ్మా, వాటిక్కావల్సింది ఐదోతనం కాదు. అదిగో... అలా పైకి చూడు.. ఆకాశమంత విశాలమైన మనసు ! అది  నీకుంది. నాకది చాలు..."
అనేసింది. అబ్బురంగా చూస్తూ, అంత లేత వయసులో అంతేసి సంస్కారానికి పరవశించిపోయింది శ్రీదేవమ్మ. 
               **                  **               **
    మరుసటిరోజు ఉదయం పదిగంటలవుతుండగా, ఇంటికి తాళం వేసి, కారు చుట్టూ మూగిన అందరికీ వెళ్ళొస్తానని చెప్తూ, మనవరాలి పక్కన కూర్చుని ఊరు దాటింది  శ్రీదేవమ్మ. మధ్యాహ్నానికంతా గమ్యం చేరుకున్నారిద్దరూ. 
      ఇంటి చుట్టూ పెద్ద కాంపౌండు. దగ్గరి  చుట్టాలు వచ్చినట్టున్నారు....  ఇల్లంతా సందడిగా ఉంది. కారు  డోర్ తీసి,  అమ్మమ్మకు ఆసరాగా చేయందించింది అరవింద. దిగి, చుట్టూ పరకాయించి చూస్తున్న ఆమె కాళ్ళకు వంగి నమస్కరిస్తున్న ఆ ఇద్దరినీ చూసి, శ్రీదేవమ్మ భృకుటి ముడివడింది. 
శ్రావణి !! ఇరవైరెండేళ్ల క్రితం ఇల్లు దాటిన తన కూతురు ! ఇప్పుడు పక్కన భర్తతో... !
" అమ్మా, చంద్రం.... చంద్రశేఖర్.. ! మా ఆయన !"
భర్తను చూపిస్తూ, తల్లితో చెప్పింది శ్రావణి. ఆరోజు తన భర్త కూతుర్ని కొడుతుంటే, అడ్డుకున్న ఓ అపరిచితుడు! అదే తన  అల్లుడు ! ఎన్నో ఏళ్ళుగా తన గురించి తల్లి పడ్డ ఆరాటానికి సాంత్వనగా, 
" నేనీయనతో అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నానమ్మా..." 
అన్నట్లు శ్రావణి వదనంలో ప్రశాంతతతో కూడిన చిరునవ్వు! అమాయకపు ఆడపిల్ల! లోకజ్ఞానం లేక ఎక్కడ మోసపోతుందో అని  తల్లడిల్లిన క్షణాలు గుర్తొచ్చాయామెకు. కానీ ఆరోజు పట్టుకున్న తన కూతురి చెయ్యి ఇప్పటికీ వదలక తోడుగా నిలిచే ఉన్నాడు...! రత్నం లాంటి ఇతన్నా...ఆరోజలా అవమానించి గెంటేశాడు తన భర్త !  తనూ మిన్నకుండిపోయింది. గతం క్షణకాలం ఆమె ముందు కదలాడి మనసంతా కుంచించుకుపోయింది. లోలోపల ఆమెలో పశ్చాత్తాపపు నీలినీడలు! కళ్ళలో నీరు ధారలుగా కారుతుండగా ఇద్దర్నీ దగ్గరికి తీసుకుని పొదువుకుంది.
                    **             **                **
        (చివరి భాగం తదుపరి పోస్ట్ లో )



Monday, April 3, 2023

అమ్మమ్మ...పూలజడ..(రెండవ భాగం)

    పదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. శ్రీదేవికి పెళ్లి కుదిరింది. పక్క ఊరే. తెలిసిన వాళ్ళే. కాస్తో కూస్తో స్థితిమంతులు. ఏదో పిల్ల సుఖపడుతుందిలే అనుకున్న శివమ్మ మరేమీ  ఆలోచించక సంబంధం ఖాయం చేసేసింది. కాకపోతే పెళ్ళికొడుకు వెంకటరమణ కాస్త ముదురు. 
    అదేమీ అంతగా పట్టించుకోలేదు శ్రీదేవి. పెళ్లిరోజు పెళ్లికూతురుకి పూలజడ తప్పనిసరి. తన స్నేహితురాళ్లకు జరిగిన పెళ్లిళ్లలో అందరూ పూల జడలు వేసుకున్నారు. ఇంతవరకూ  సరే... పెళ్లిరోజు అయినా తప్పదు కదా ! అమ్మ కాకపోయినా, స్నేహితురాళ్లు, బంధువులైనా వేసే తీరుతారు. అలా పూల జడలో తనను తాను ఊహించుకుంటూ కలల్లో తేలిపోసాగిందాపిల్ల.. !
    అంతా అనుకున్నట్లే  జరిగితే ఇక మనిషికి లోటేముంటుంది! ముహూర్తం వారంలోపే ! అదీ దూరంగా ఏదో చిన్న ఊర్లో ఉన్న ఏ వసతులూ  లేని చిన్న గుడిలో ! వచ్చిందే ఓ పదిమంది ఆడవాళ్లు! స్నేహితురాళ్ళ ఊసే లేదు.తెల్లారుజాము ముహూర్తం.
హడావుడిగా స్నానాలు అవీ పూర్తి చేయించి, గబగబా ఆరీఆరని  జుట్టుని బరబరా తుడిచేసి, జడలా అల్లి, ఓ పూలదండ తురిమి టైం అవుతోందంటూ పీటల మీద కూర్చోబెట్టేశారు.  తల్లికి తెలుసు కూతురి కోరిక. కానీ, ఏం లాభం! కూతుర్ని అలంకరించి పెళ్లి కూతురిగా కళ్లారా చూసుకోవాలన్న తపన, కోరిక లేని తల్లి కడుపున పుట్టిందాయే ! మొదటిసారిగా తల్లి  మీద చెప్పలేనంత కోపం, ద్వేషం కలిగాయి శ్రీదేవికి. ఏం చేయగలదు ! సిగ్గు విడిచి, నోరు తెరిచి అడగలేదెవ్వరినీ. గుడ్లనీరు కుక్కుకుంటూ తలవంచుకుని, శిలలా కూర్చుండి పోయింది. మెడలో తాళి పడింది.  
    పెళ్లి నాలుగు రోజులు ఉందనగా వచ్చిన తండ్రి తతంగమంతా పూర్తయ్యేదాకా ఉండి బాధ్యత తీరిందనుకుని వెళ్లిపోయాడు మళ్ళీ. శ్రీదేవి అత్తగారింటికి తరలి వెళ్లిపోయింది. తల్లి ఒంటరిగా మిగిలింది. 
                 **              **             **
   కాలం ఎవరికోసం ఆగదుగా... మరో పదేళ్లు పరుగులు తీశాయి. శ్రీదేవి ఓ బిడ్డ తల్లయి, శ్రీదేవమ్మ అయింది. శ్రావణ మాసంలో పుట్టిందని శ్రావణి అని పేరు పెట్టుకుంది. పూల మీద ఇష్టం పోగొట్టుకోలేక ఇంటి చుట్టూ రకరకాల పూల మొక్కలు వేసింది. అవి కాసే పూలతో  చక్కగా మాల కట్టడం నేర్చుకుంది. రోజూ విరబూసే మందారాలు, మల్లెలు, గులాబీలు అణగారిన కోరికను రేపుతున్నా పెరిగిన వయసు అంగీకరించక  పూలజడ  ముచ్చట కూతురు శ్రావణి ద్వారానైనా తీర్చుకోవాలని పరితపించేది. కానీ విచిత్రం ! తల్లికి పూర్తి విరుద్ధం ఆ పిల్ల ! పూలు అంటే ఆమడ దూరం జరిగేది. జడలో  ఓ గులాబీ పెడితే చాలు.. వెంటనే తీసి విసిరి పారేసేది. శ్రీదేవమ్మకు అర్థం అయ్యేది కాదా పిల్ల మనస్తత్వం ! స్వతహాగా ఆడపిల్లలు పూలంటే ఇష్టపడతారు. కానీ ఇదేమిటి? వయసొస్తే మారుతుందిలే అనుకుందిగానీ కాలేజీ చదువుకి వెళ్ళినా ... అదే పరిస్థితి !!
" పోమ్మా, ఇలా పూలూ, పూలదండలతో వెళ్తే మా ఫ్రెండ్స్ అంతా పల్లెటూరి గబ్బిలాయిలా చూస్తారు... నవ్వుతారు తెలుసా... "
 అంటూ వెళ్ళిపోయేది. 
" సరేలే, ఇప్పుడలా అంటోంది... రేపు పెళ్లి కుదిరాక అప్పుడైనా తప్పదు కదా.. ! ఎలా వద్దంటుందో చూస్తా... !"
 అనుకునేది శ్రీదేవమ్మ. కానీ విధి  రాత ! డిగ్రీ ఆఖరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఆరోజు చివరి పరీక్ష. రోజూ పరీక్షవంగానే మూడింటికంతా  ఇల్లు చేరే శ్రావణి.... ఐదైనా రాలేదు. చీకటి పడింది. జాడలేదు...! ఏమైందోనని కంగారుపడుతూ పొలం నుండి వచ్చిన భర్తతో చెప్పింది. అక్కడక్కడా వాకబు చేశాడాయన. ఫలితం లేదు. ! పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే... నలుగురికీ తెలిస్తే బాగోదని ఆగిపోయారు. మరుసటి  రోజు మధ్యాహ్నం దాకా చూసి, ఇక తప్పదని బయలుదేరుతుండగా... ఇంటి ముందు ఆటో ఆగింది. అందులో నుండి శ్రావణి దిగింది.. ఒంటరిగా కాదు... జంటగా... పక్కన మరొకతనితో.. మెడలో తాళితో !!
    ఉగ్రుడై పోయాడు వెంకటరమణ. శ్రీదేవమ్మ తల్లడిల్లిపోయింది. గడప దాటి లోనికి రాబోతున్న కూతుర్ని పట్టుకుని రెండు చెంపలూ చెడామడా వాయించాడు. అడ్డుకోబోయిన అతన్ని పక్కకు తోసేశాడు. చుట్టుపక్కలంతా పోగై చోద్యం చూడసాగారు. గడపలో కాలు పెడితే ఛస్తానంటూ తలుపులు వేసేసి, భార్యను లోపలికి తోసేశాడు. చేసేదేమీ లేక తల దించుకుని వచ్చిన ఆటోలోనే తిరుగు ముఖం పట్టింది శ్రావణి భర్తతో. 
    ఊహించని ఉత్పాతానికి కన్నీరు మున్నీరై పోయింది శ్రీదేవమ్మ. భర్త తత్వం తనకు బాగా తెలుసు. పరువు మర్యాదలకు ప్రాణం పెట్టే రకం. కూతురు ఇలా చెప్పా  పెట్టకుండా, ఎవరో ముక్కు ముఖం తెలియని వాణ్ణి పెళ్ళాడి ఉన్నట్టుండి ప్రత్యక్షమైతే... తట్టుకోగలడా !
    తనకు దక్కని అదృష్టం కూతురిలో వెతుక్కోవాలనుకుంది. ! పెళ్లికూతురుగా ముస్తాబు చేసి, కల్యాణతిలకం దిద్ది తనివితీరా కూతుర్ని చూసుకోవాలనుకున్న ఆమె ఆశ మరోసారి అడియాశే అయింది. అదంతా పక్కన బెడితే... ప్రస్తుతం వచ్చి పడ్డ ఉపద్రవం ఆమెను అతలాకుతలం చేసేసింది. 
                   **             **            **
   ఆనోటా ఈనోటా కూతురి గురించి వివరాలు చెవిని పడుతూనే ఉన్నాయి వారికి. అతనిది తమ కులం కాదనీ, తెలిస్తే తండ్రి ఒప్పుకోడనీ, మరోదారి లేదనుకుని శ్రావణి ఇంతపనికి ఒడిగట్టిందని గ్రహించింది విషయం తెలిసిన శ్రీదేవమ్మ. కులమింటి కోతి అయినా సరే.. సమ్మతమని భావించే భర్తకు తను ఎదురు  చెప్పలేక, కూతురితో బంధాన్ని తెంచుకోలేక లోలోన కుమిలిపోయిందా తల్లి  !
                  **              **                **
           [ మూడవ భాగం తదుపరి పోస్ట్ లో  ]

Saturday, April 1, 2023

అమ్మమ్మ... పూలజడ..!(కథ)--మొదటి భాగం

🌷
       
     విశాలంగా ఉన్న ఆ గది సువాసనలతో ఇంకా పట్టుచీరల గరగరలతో, అమ్మలక్కల ముచ్చట్లతో సందడిసందడిగా ఉంది. గది మధ్యలో టీపాయ్ మీదున్న ట్రేలల్లో గుండుమల్లెలు, సన్నజాజులు, గులాబీలు, కనకాంబరాలు రాశులుగా పోసిఉన్నాయి. వాటికెదురుగా కూర్చుని తదేకంగా వాటివేపు చూస్తున్న శ్రీదేవమ్మలో ఏవేవో జ్ఞాపకాలు గతంలో నుండి మెల్లిగా తొంగిచూడసాగాయి. ఆమె ఆలోచనలు దాదాపు యాభై ఏళ్ళు వెనక్కి వెళ్లి, తన బాల్యాన్ని స్పృశించాయి. 
                       **               **              **
" అమ్మా, కనకాంబరాలు, గుండుమల్లెలు... రంగయ్య తాత దగ్గర కొనుక్కొచ్చా... ఎంత బాగున్నాయో చూడు.... "
పరికిణీలో పోయించుకొచ్చిన తాజా పూలని తల్లికి చూపిస్తూ సంబరపడిపోతూ చెప్పింది శ్రీదేవి. 
" అయ్యో అయ్యో! డబ్బులెక్కడివే నీకు ఇన్ని పూలు కొనడానికి? ". 
గయ్యిమంటూ  లేచింది శివమ్మ. 
"... అప్పుడప్పుడూ నువ్వు ఇస్తుంటావే.. పావలా, అర్ధ రూపాయి.,,  అవి దాచుకున్నా.. వాటితోనే కొనుక్కున్నా .. "
అంటూ, కాస్త దగ్గరగా జరిగి, 
" అమ్మా,.. వీటితో నాకు పూలజడ వేయవా..."
 భయం భయంగా తల్లిని చూస్తూ సందేహిస్తూనే మెల్లిగా కోరిక బయట పెట్టింది శ్రీదేవి.
" చాల్లే సంబడం... బాగానే ఉంది. తినడానికి గతి లేదు గానీ పూలజడంట..  పూలజడ! పద పద. వెళ్లి అంట్లు తోమి పడేయ్.. పనులు చాలా ఉన్నాయి నాకు.."
విసుక్కుంటూ విసవిసా పక్కకెళ్ళిపోయింది శివమ్మ.
     శ్రీదేవి పదేళ్ల పిల్ల. ఆ పల్లెటూర్లో దిగువ మధ్య తరగతికి చెందిన కుటుంబంలో తల్లిదండ్రులతో పాటు ఉంటుంది. తండ్రి ఎప్పుడు ఇంట్లో ఉంటాడో తెలియని పరిస్థితి ! అసలేంచేస్తాడోకూడా తెలియదాపిల్లకి !  ఏ నెలకో ఓసారి ఇంటికి చుట్టంలా  రావడం,  భార్య ఏదో ఇంత పెడితే తినడం, మళ్లీ వెళ్ళిపోవడం ! తండ్రి తనతో ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడడమే ఎరుగదాపిల్ల ! ఇక తల్లి ! బాధ్యత లేని మగని ఇంట్లో ఇల్లాలికి సుఖశాంతులన్నవి ఎలా ఉంటాయి? ఇల్లు గడవడానికి ఏవో చిన్నచిన్న  పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండే తల్లికి బిడ్డ అచ్చట్లు ముచ్చట్లు ఏం పడతాయి ! పట్టినా తీర్చే దారేది? కడుపులోకి నాలుగు మెతుకులుంటే చాలు అనుకునే పరిస్థితామెది మరి !
     శ్రీదేవి కడిగిన ముత్యంలాగుంటుంది. చెంగుచెంగున దూకుతూ ఆడుకునే వయసు. చుట్టుపక్కల ఆడపిల్లల్ని చూస్తూ తానూ అలాగుండాలని ఆశపడేది. కానీ... ఇంట్లో పరిస్థితులు కళ్లెం వేస్తుంటే డీలా పడిపోయేది. చేసేదేమీలేక పట్టించుకోవడం మానేసింది. ఏమున్నా లేకపోయినా ఆపిల్లకీమధ్య ఓ కోరిక పుట్టుకొచ్చింది. పోయినేడు సంక్రాతి పండక్కి చుట్టుపక్కల అమ్మాయిలంతా ఎంచక్కా కొత్త పరికిణీ, జాకెట్టు వేసుకుని, ఊరంతా తిరుగుతూ తెగ ముచ్చట్లాడుకున్నారు. వాళ్ళను చూశాక శ్రీదేవికి, 
" అబ్బ ! ఎంత బాగుందో కదా పూలజడ !నేనూ వేయించుకుంటా మా అమ్మ నడిగి "
అనుకుంది. అలాఅలా మొదలైన ఆ కోరిక మళ్ళీ సంక్రాతి వచ్చిపోయినా తీరలేదు. ఒకరోజు పక్కవీధిలో ఉంటున్న రాజ్యం అక్కతో తన కోరిక చెప్పుకుంది. రాజ్యం రెండేళ్లక్రితం పెళ్లి చేసుకుని పక్క ఊరి నుండి ఈ ఊరికొచ్చింది. ఆమెకోబాబు. ఆడపిల్లలకు రకరకాల జడలు వేయడం, అలంకరించడం ఆమెకు సరదా. అందుకే శ్రీదేవికి రాజ్యం అక్క అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం తోనే ఒకరోజు అడిగేసింది, 
" అదేం భాగ్యమే శ్రీదేవీ...పూలు తీసుకొనిరా.. వేసేస్తాను.. "
అని వెంటనే హామీ ఇచ్చేసింది రాజ్యం . శ్రీదేవి ఆనందం అవధులు దాటింది. 
" నిజమా అక్కా ! వేస్తావా.. తప్పకుండా తెస్తా పూలు.. "
అని తెగ  సంబరపడిపోయింది. ఆ రోజు నుండీ  మొదలు... తల్లికి తనమీద ఎప్పుడైనా ప్రేమ పుట్టి, ఇచ్చే అర్ధ రూపాయి, రూపాయి తినడానికి కాకుండా కూడబెట్టుకుంది. ఊరి తిరుణాలలో జడ కుప్పెలు  కొనుక్కుని పెట్టెలో దాచుకుంది. ఇంకాస్త  పోగు పడ్డాక.. ఇదిగో, ఈరోజిలా... పట్నం నుండి రకరకాల పూలు తెచ్చి ఊళ్లో అమ్ముకునే రంగయ్య తాత దగ్గరికి వెళ్లి తాజా పూలుకొని, అట్నుంచటే రాజ్యం అక్క ఇంటికి దారి తీసింది ఆలస్యం చేయకుండా. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఇంటికి తాళం కప్ప వేలాడుతూ కనిపించింది.ఆ పిల్ల ఆశ నీరుగారిపోయిందొక్కసారిగా!
"అక్కఎక్కడికెళ్ళిందబ్బా?ఛ ! నేను ముందు చూసుకుని వెళ్లి ఉండాల్సింది.."
అనుకుంటూ చేసేదేమీ లేక కాళ్ళీడ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది. దారిలో మళ్లీ ఏదో ఆశ ! సరే, అమ్మని అడిగి చూస్తా.. పూలున్నాయిగా... అందుకోసమైనా ఒప్పుకొని వేస్తుంది పూలజడ..!"
 ఆ ఆలోచన రాగానే, నడక వేగం పెంచి రెండు నిమిషాల్లో ఇంటి ముందు వాలిపోయింది. వంటింట్లో పొయ్యి సరిగా మండక సతమతమవుతున్న తల్లిని చూడగానే నీరసం ముంచుకొచ్చినా, తప్పనిసరై మెల్లిగా వెనకజేరి అడిగేసింది. ఫలితమే...! ఈ తిట్లు!!"
   ఇప్పుడేమి చేయాలి? పూలన్నీ వాడిపోతున్నాయి. వాటికేసి  దిగాలుగా చూస్తున్న శ్రీదేవి బుర్రలో తళుక్కున ఏదో మెరిసింది. 
"రాజ్యం అక్క ఏదైనా పనిమీద బయటికి వెళ్లిందేమో! ఈ పాటికి వచ్చేసి ఉంటుందేమో !! వెళ్లి చూస్తే..! "
 వెంటనే పూలన్నీ ప్లాస్టిక్ కవర్లో పోసేసుకుని బయటపడింది. అంతలో ఏదో గుర్తొచ్చి, గిర్రున వెనక్కొచ్చి, పెట్టెలో  దాచిన జడ కుప్పెలు పట్టుకొని రివ్వుమని పరిగెత్తింది రాజ్యం ఇంటివైపు. ఆశ్చర్యం!ఆనందం !! ఆపిల్లలో ! ఆ ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. సంతోషంతో ఉప్పొంగిపోతూ, లోపల అడుగుపెట్టిన శ్రీదేవికి అయిదారుగురు ఆడవాళ్లు కూర్చుని కబుర్లాడుకుంటున్న దృశ్యం కంటపడింది. ఆ పక్కనే ఓవైపు రాజ్యం కూర్చుని పిల్లాడికి పాలిస్తూ ఉంది. శ్రీదేవిని చూడగానే, 
" ఏంటే, ఇలా వచ్చావు? "
అంది. 
" అక్కా, పూలు తెచ్చాను.. పూలజడ కోసం..."
 పక్కనున్న వాళ్లను బిడియంగా చూస్తూ, పూల కవర్ చూపిస్తూ చెప్పింది.
" ఇప్పుడా ! ఏంటి శ్రీదేవీ... చూడూ... చుట్టాలొచ్చారు. వంట కూడా చేయాలి.. ఎలా కుదురుతుంది చెప్పు...? "అక్కా, పూలు... "
 చేతులు చాచి, పూలు, జడ కుప్పెలు  చూపించింది. 
" ముందు నన్నడక్కుండా ఇలా తెస్తే ఎలాగే ? సరే,  ఓ పని చెయ్.. ఇంటికి వెళ్లి, వీటన్నింటినీ మాల కట్టి, సాయంత్రం తీసుకుని రా. జడకు చుట్టేస్తాను.."
అని, పిల్లాణ్ణి ఎత్తుకొని వంటింట్లోకి నడిచింది...ఇప్పుడు ఏమాత్రం కుదరదని తేల్చేస్తూ..
      శ్రీదేవి మోహంలో చీకటి అలుముకుంది. బిక్క మొహం వేసుకుని తిరుగు ముఖం పట్టింది. ఆ పిల్లకు ఇప్పుడు మరో సమస్య ! తనకు పూలు మాల కట్టడం రాదు. అమ్మ సంగతి సరే సరి ! ఇక ఎవరిని బ్రతిమాలు కోవాలి ? నీరసం ఆవహించి, ఇల్లు చేరి, ఓ మూల కూలబడింది. చూస్తుండగానే సాయంత్రం దాటింది. కవరు తెరిచి చూస్తే.. సగం వాడిన పూలు ఆ పిల్లకేసి దీనంగా చూశాయి. విసురుగా వాటినో  మూలకు విసిరేసి చేతుల్లో ముఖం దాచుకుంది. 
    ఆడపిల్లలకు పూలజడ అన్నది అతి  సామాన్యమైన కోరిక.. కానీ, శ్రీదేవి లాంటి కొందరికి అది  కూడా గొంతెమ్మ కోరికే !!
              **               **                **
           [ రెండవ భాగం తర్వాత పోస్టులో ]