Tuesday, April 21, 2020

                           🌹🌺🌺
                      🌺  స్పందన  🌺
                            🌺🌹🌺
    
         నేటి సినీ కథానాయిక --దర్శకుల ధోరణి 
        ********************************


    చక్కటి అందం, అద్భుతమైన నటనాకౌశలం, అంతకుమించిన వాక్చాతుర్య ప్రతిభ---- వీటన్నింటి కలబోత నేటి సినీ కథానాయిక అంటే అతిశయోక్తి కాదు. భాష తెలియకపోయినా పాత్ర స్వభావాన్ని నూటికి నూరుపాళ్లు అర్థం చేసుకుని నటించడం, వివిధ నాట్య భంగిమలు అలవోకగా ఆకళింపు చేసుకుని నర్తించడం సామాన్యమైన విషయమేమీకాదు. కానీ, హృదయం కళుక్కుమనేలా చేసే విషయమేమిటంటే తెరపై వారి వస్త్రధారణ! ఇంతటి ప్రతిభ గల నటీమణుల్ని అరకొర దుస్తుల్లో చూపిస్తూ వారిపై సదభిప్రాయాన్ని తుడిచి వేయడం, కొన్నిసార్లు ఆయా పాత్రల ఔచిత్యాన్నే దెబ్బతీయడం విజ్ఞులైన సినీ దర్శకులకు భావ్యమేనా? 
    ఒకప్పుడు నాయిక అంటే చూడచక్కటి ఆహార్యంతో అందరికీ గౌరవభావం కలిగించేలా ఉండేది. హీరోయిన్, సైడ్ హీరోయిన్, వ్యాంప్ -- ఇలా వారికంటూ ప్రత్యేకించి పరిధులుండేవి. ఇప్పుడు నాయికే అన్నిరకాలూ భర్తీ చేస్తోంది మరి! 
     ఈమధ్య థియేటర్ కెళ్ళి ఓ సినిమా చూడటం తటస్థించింది. అందులో నాయిక పాత్రధారిణి ఆధునిక దుస్తులు అనబడే చిన్న గుడ్డ పీలికలు ధరించడం చూసి ముక్కున వేలేసుకోవాల్సి వచ్చింది. 
 కొద్ది రోజుల క్రితం ఇదే నటీమణిని చక్కటి చీరకట్టుతో ఓ దర్శకుడు తన చిత్రంలో నటింపజేసిన విషయం గుర్తొచ్చి, ఇద్దరు నటీమణులూ ఒకరేనా అన్న అనుమానం తో పాటు కించిత్ బాధ కూడా కలిగింది. 
    ఒక్కోసారి పిల్లలతో కలిసి థియేటర్లో అటుంచి, ఇంట్లో టి. వి లో సైతం చూడలేనంత జుగుప్సాకరమైన దుస్తుల్లో వారు కనిపిస్తూ ఉంటే
' హతవిధీ' ఏమిటీ ప్రారబ్ధం ! అనిపిస్తుంది. కథానాయిక పాత్రను మరీ ఇంతగా దిగజార్చి చూపించడం అవసరమా! అది ఎంతవరకు సమంజసం? ఇలాంటి ప్రశ్నలు వేధిస్తుంటాయి. 
      నాయిక పాత్రల్ని ఎంతో సమున్నతంగా చూపించిన విశ్వనాధ్, బాపు, బాలచందర్  లాంటి దర్శకుల చిత్రాలు అద్వితీయ కళాఖండాలుగా చిరస్థాయిగా అందరి మదిలో చెరగని ముద్ర వేశాయి. వ్యాంప్ పాత్రలకు మాత్రమే పరిమితమైపోయున్న మంజు భార్గవి ' కళా తపస్వి ' ' శంకరాభరణం '  ద్వారా పరిశ్రమలో గౌరవనీయమైన స్థాయిని చేరుకోవడం విధితమే కదా ! 
    కేవలం నాయికల అందాల ఆరబోతకే జనాలు సినిమా చూడ్డానికి వస్తారన్న అపోహ నేటి తరం దర్శకులు తొలగించుకుంటే మంచిది. అదేవిధంగా అందాల ప్రదర్శన చేస్తే అవకాశాలు వెల్లువెత్తుతాయన్న ధోరణి నేటి తరం నాయికలూ మానుకోవాలి. అది కేవలం తాత్కాలికమే. ప్రేక్షకుల మదిలో వారిపట్ల దురభిప్రాయం ఏర్పడి, అసలుకే మోసం వచ్చే ప్రమాదం పొంచి ఉంటుందని ఈ తారలు ఎందుకు గ్రహించరో మరి ! 
      చౌకబారు తనాన్ని ఇష్టపడే వర్గం ప్రేక్షకుల్లో అతి తక్కువ శాతం మాత్రమే ఉంటారు అన్న వాస్తవాన్ని దర్శకులు గ్రహించి తీరాలి, అదేమంటే--- అలా తీస్తే ఈ రోజుల్లో సినిమాలు ఆడతాయా? కోట్లు గుమ్మరించి, అంతకుమించి శ్రమకోర్చి మేం సినిమాలు తీసేది నష్టాల్ని మూట గట్టు కోడానికి కాదు కదా! పైగా, టి. వి లు వచ్చాక ప్రతి ఇల్లు ఓ మినీ థియేటర్ అయిపోయి, జనాలు బయట థియేటర్ల దాకా రావడమే గగనమై పోయిన ఈ రోజుల్లో యువతని ఆకర్షించాలంటే అన్ని హంగులు గుప్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది, అంటూ నిట్టూరుస్తారు దర్శక నిర్మాతలు. వాళ్ల కోణంలో అదీ కరెక్టే. వారి బాధలు వాళ్ళవి మరి!
     అయితే, ప్రస్తుతం ఈ ప్రభంజనంలో మంచి సినిమాలే రావడం లేదా అంటే అడపాదడపా వస్తున్నాయని ఒప్పుకోవాల్సిందే. చక్కటి కళాత్మక విలువలతో, ఒకింత సందేశాన్ని జోడిస్తూ తీస్తున్న దర్శకులూ లేకపోలేదు. వారి ప్రయత్నానికి జోహార్లు. ఏదేమైనా, వాస్తవ దృష్టితో ఆలోచిస్తే వాణిజ్యపరంగా తీసే సినిమాలు పది కాలాల పాటు మదిలో నిలిచిపోయే ప్రసక్తి ఎంత మాత్రమూ ఉండదు. విజ్ఞులైన దర్శకులు ఆ దిశగా ఆలోచించాలి. 

*****************************************
మళ్ళీ కలుద్దాం. 
యం. ధరిత్రీ దేవి 
***********

No comments:

Post a Comment