ఇటీవల ( 12.6.25 ) అహ్మదాబాదులో చోటు చేసుకున్న ఘోర విమాన ప్రమాదం నుండి ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడటం నిజంగా అద్భుతమే! మొత్తం 242 మంది ప్రయాణిస్తున్న ఆ విమానం నుండి అనూహ్యంగా స్వల్ప గాయాలతో బయటపడి మృత్యుంజయుడుగా నిలిచిన బ్రిటిష్ జాతీయుడైన నలభై ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ తాను ఎలా ప్రమాదం నుండి ప్రాణాల్ని దక్కించుకున్నాడో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెలియజేశాడని సమాచారం. తాను కూర్చున్న సీటుకు కాస్త ముందు భాగంలో అత్యవసర ద్వారం ఉండడం..ప్రమాదం జరిగే క్షణాల్లో ఆ ద్వారం తెరుచుకోవడంవల్ల సమయస్ఫూర్తితో వెంటనే స్పందించి సీటు బెల్టు తొలగించుకుని ఆ ద్వారం గుండా బయటకు దూకడం జరిగిందనీ, తన సీటుతో సహా మెడికల్ కాలేజీ వసతి గృహం మీద ఓ సురక్షిత ప్రదేశంలో పడ్డాననీ చెప్పాడట!!
వందల మంది ప్రయాణికుల్లో ఒక్కడు మాత్రం సజీవంగా బయటపడటం ఊహకందని వాస్తవ ఘటన కాక మరేమిటి! భారతదేశ వైమానిక చరిత్రలో ఇదొక అత్యంత విషాదకరమైన ఘట్టం అయితే... మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన మరొకటి ఈ దుస్సంఘటనతో ముడివడి ఉండడం మనసును మెలిపెట్టే మరొక బాధాకర విషయం... అదేమిటంటే....
ఈ సంఘటనతో గానీ, ఈ విమానంతో గానీ, అందులోని ప్రయాణికులతో గానీ ఏ మాత్రం సంబంధం లేకున్నా..వైద్య కళాశాల వసతి గృహంలో యధాలాపంగా మధ్యాహ్నం భోజనం చేస్తూ అనూహ్యంగా దుర్మరణం పాలైన అమాయక వైద్య విద్యార్థులు విధి వంచితులుగా మారడం !! వారి కుటుంబాలకే గాక యావత్తు ప్రజానీకానికి ఇది తీరని వేదనను మిగిల్చింది. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో!!
--- అలాగే ఇదే విమానంలో లండన్ కు ప్రయాణించాల్సిన భూమి చౌహాన్ అనే మహిళ ఆలస్యంగా బయలుదేరడం వల్ల విమానం అందుకోలేక తనకు తెలియకుండానే మరణం బారి నుండి తప్పించుకోవడం కేవలం యాదృచ్ఛికమే.. ఇది కూడా కథ కాదు.. వాస్తవమే !
No comments:
Post a Comment