యం. ధరిత్రీ దేవి
ముచ్చట్ల తో మైమరిపించి
కడగండ్లతో కన్నీటి ధారలు కురిపించి
మూడు వందల అరవై ఐదు రోజులు
మరో విధంగా పన్నెండు నెలలు...
పరుగుడి పరుగిడి...
సెలవు పుచ్చుకొంటున్నది
పాతబడ్డ కొత్త సంవత్సరం..
ప్రతినెలా దేనికదే ప్రత్యేకం
పరవశింపజేస్తూ ఒకసారి..
విషాదంలో ముంచేస్తూ మరోసారి..
జీవితమంటే పరిమళాలు వెదజల్లే
పూల తోట మాత్రమే కాదు..
గుచ్చుకునే పదునైన ముళ్ళు
పరచుకున్న రాళ్లబాట కూడా...
అంటూ గుణపాఠాలు నేర్పి
తీపి చేదు అనుభవాల జ్ఞాపకాల
దొంతరలను మదిని పేర్చి..
గతంలోకి జారుకుంటూ
కదిలి వెళుతూ చెప్తోంది వీడ్కోలు...
అదిగో..అడుగిడుతోంది
మరో నూతన సంవత్సరం..
వినూత్న రీతిని...!
తెలతెలవారుతుండగా..
మంచు తెరలను చీల్చుకుని..
మల్లెల సౌరభాలు వెదజల్లుతూ...
మన కోసమే..మనందరి కోసమే...
నడిచి నడిచి వస్తూ..అదిగో..అదిగో.!
కష్ట సుఖాలు కావడికుండలన్న నిజం
నమ్మేద్దాం..ఆశావాదంతో అడుగులు వేస్తూ
సాగుదాం..గతానికి వీడ్కోలు పలుకుతూ..
వర్తమానానికి చేతులు చాస్తూ..
మనసారా స్వాగతిద్దాం...
[ 'సంచిక' 11.1.26 వార పత్రికలో ప్రచురితమైన నా కవిత..]
No comments:
Post a Comment