ప్రభాతవేళ...
నులివెచ్చని ఉషాకిరణాల
అనిర్వచనీయ స్పర్శ నాస్వాదిస్తూ...
పాదచారినై సాగుతున్న క్షణాన...
తుషార బిందువుల తడిసి
అరవిచ్చిన ఎర్రని ఓ గులాబి
నిండుగ నవ్వింది ననుజూసి...
"జీవితం పరిమళభరితం...
అవగతమైతే అద్వితీయం..!"
ఆ నవ్వు రువ్వింది...
ఓ మౌనసంకేతం..!
మరుక్షణమే అయింది
నా మానసం సంతోషతరంగం !!
పొద్దు వాలింది...
గులాబీ వాడింది...
తల్లిని వీడి..నేలతల్లి
పాదాల వాలింది..!
"జీవితం క్షణభంగురం
వేదనతో రోదనతో
బలి పెట్టకు నేస్తం...
ఉన్నంతకాలం..ఉన్నంతలో
తృప్తిగా మనుగడ సాగించు.."
అందింది మరో సంకేతం..!
ఉదయం అందంతో మురిపించింది..
సాయంసంధ్య.. పోతూ పోతూ..
మైమరపిస్తూ..మదిని కదిలిస్తూ...
హృదయాన్ని తాకింది...
మూల్యం లేని మౌనసందేశం..🌹
['సంచిక' అంతర్జాల వారపత్రికలో ప్రచురింపబడ్డ నా కవిత ]
No comments:
Post a Comment