Thursday, May 15, 2025

నీలాల నింగిలో తిరిగేటి జాబిల్లి నింగికేమిస్తుంది ఓలి?

                                         ~ యం. ధరిత్రీ దేవి

 ప్రేమతో తమకుతామే ఇష్టపూర్వకంగా ఎదుటివారికిచ్చేది 'కానుక'. పీడించి, బలవంతంగా తీసుకునేది కానుక ఎలా అవుతుంది? కట్నకానుకలనేవి పరస్పరం ప్రేమాభిమానాలతో ఇచ్చిపుచ్చుకునేవిగా ఉండాలి.  అంతేగానీ మనసుల్ని గుచ్చేలా ఉండకూడదు.  ఈ అంశం గురించి కాసేపు ---
 అదనపు కట్నం కోసం భార్యను వేధించి చివరికి హత్య చేసిన ఓ భర్తకు ఉరి శిక్ష విధించారంటూ కొద్దిరోజులక్రితం ఓ వార్త వచ్చింది. హత్యానంతరం మూడు సంవత్సరాలకు ఈ తీర్పు ఇచ్చారంటూ కథనం !
  పెళ్లయి మూణ్ణెళ్లు తిరక్కుండానే అదనపు కట్నం తేవాలంటూ భర్త, అత్తమామలు హింసిస్తూ కోడల్ని పుట్టింటికి తరిమేశారంటూ ఒక చోట, ఇద్దరు పిల్లల తల్లిని కట్నం కోసం వేధిస్తూ తల్లిదండ్రుల వద్దకు పంపారంటూ మరో ఘనుడి ఘనత గురించి మరోచోట! వరుసగా ముగ్గురు ఆడపిల్లల్ని కన్నావని దూషించి, వారి ఖర్చులు పుట్టింటి వారే భరించాలంటూ ఇంటి నుంచి గెంటేసిన భర్త-- అంటూ ఇంకోచోట !  ఇలా రకరకాల వార్తాకథనాలు ! ప్రదేశాలు వేరైనా దాని అంతర్లీన సారాంశం ఒక్కటే !
  వరకట్నమే  నేరమని ప్రభుత్వం నిషేధిస్తే, మరి ఈ అదనపు కట్నం గోలేమిటి? సంసారమనే బండికి భార్య, భర్త రెండు చక్రాల వంటివారు అంటారు . రెండూ సజావుగా సాగితేనే బండి కదులుతుంది అంటారు.. భర్తలో సగం భార్య అనీ, జీవితభాగస్వామి అనీ అంటారు. కష్టసుఖాల్లో ప్రతిక్షణం భాగం పంచుకునే అలాంటి ఇల్లాలికి ఎంత విలువ ఇవ్వాలి! ఎలా గౌరవించాలి! 
  పెళ్లి తర్వాత పుట్టి పెరిగిన ఇంటినీ, ఊరిని, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తల్లిదండ్రుల్నీ వదలిపెట్టి, ముక్కూ మొహం తెలీని ఓ మగాడి  చేయిపట్టుకుని అమాయకంగా అతని వెంట నడిచి మరో ఇంటికి ఓ ఆడపిల్ల తరలివెళ్తోందంటే కేవలం అతని పై నమ్మకం! అన్ని వేళలా తనకు తోడునీడగా, రక్షణగా ఉంటాడన్న కొండంత నమ్మకం! ఆ భరోసా ఆమెకు కల్గించడం భర్తగా అతని  బాధ్యత. ఒకప్పుడైతే కుటుంబ విలువలు ఎంతో ఉన్నతంగా ఉండేవి. చిన్న వాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్లు సర్ది చెప్పేవాళ్లు. కానీ, కాలక్రమేణా విలువలన్నవి పతనావస్థకు చేరుకుని మనుషుల్ని దిగజార్చేశాయి. 
  భార్య అంటే ఏమిటో  ఓ చక్కటి నిర్వచనం ఓ చలనచిత్రంలో బహు చక్కగా తెలియజేశారు.
* కొడుకన్న వాడికి కష్టం వస్తే అతని కోసం తల్లీ, తండ్రి, తోబుట్టువులు బాధపడటం, విపరీతంగా ఆవేదన చెందడం అత్యంత సహజం. ఎందుకంటే వారి మధ్య రక్త సంబంధమన్నది ఉంటుంది కాబట్టి. కానీ, ఏ సంబంధం లేకుండా తనతో మూడుముళ్ల బంధం మాత్రమే ఉన్న మనిషి భర్త అన్న వాడికోసం బాధపడ్డం, అతనితోనే తన జీవితం అనుకోవడం,  తన సర్వస్వం  ధారపోయడమన్నది చాలా గొప్ప విషయం! అదే భార్య అంటే!" 
నిజంగా ఎంత గొప్పగా చెప్పారు భార్య స్థానం గురించి! 
   అలాగే -- వరుసగా ఆడపిల్లల్ని కన్నదని భార్యను పుట్టింట్లో దిగబెట్టిన ఓ బావగారితో అంటాడు ఓ బావమరిది, 
* నీకు జన్మనివ్వడానికి ఓ ఆడది కావాలి. నీకు భార్యగా  ఓ ఆడది కావాలి. నీకు తండ్రి హోదా ఇవ్వాలంటే మళ్ళీ ఓ ఆడదే కావాలి. కానీ నీ కూతురిగా మాత్రం ఆడపిల్లవద్దా"
   -- సిగ్గుతో తలవంచుకుంటాడా బావగారు. 
  ఎన్ని సినిమాల్లో ఎన్ని సందేశాలిచ్చినా మారుతున్నారా  జనాలు! ఎన్ని చట్టాలు, శాసనాలు చేసినా మారుతున్నారా? ఎవరి ధోరణి వారిదే ! 
  ఇంతకీ, ఈ అదనపు కట్నం ఎలా పుట్టుకొచ్చిందో ఆలోచిస్తే ఒకటే బోధపడుతుంది. పెళ్లి సమయంలో ఇచ్చినది  వారికి సరిపోయినట్లు అనిపించకపోయినా లేక ఇతరులతో పోల్చుకున్నా కొన్ని అసంతృప్తులు బయలుదేరుతాయి వారిలో. ఫలితంగా, అసహనంతో అదంతా భార్యమీద చూపించడం మొదలెడతారు. ఆమె స్థానానికున్న విలువ, ప్రత్యేకత తెలిసినా కట్నకానుకల కోసం వేధించడం, హింసించడం, హతమార్చడం చేస్తున్న కొందరి అమానుష ప్రవర్తన ఎంత హేయమైన చర్య!  నేటి సమాజంలో ఇలాంటి వారి శాతం పెరిగిపోవడానికి కారణమేమిటి? 
   పూర్వం పెళ్లయిన కొత్త జంటకు అవసరాల కోసమై కొంత పైకం, వస్తు సామాగ్రి అమ్మాయి తరపు వారు తమకు తాముగా ఇష్టపూర్వకంగా ఇవ్వడం మొదలైనదని చెప్తూ ఉంటారు. అదే క్రమక్రమంగా కాలక్రమేణా ఓ  ఆచారమై రాన్రానూ  ఓ దుష్ట సాంప్రదాయంగా రూపాంతరం చెంది ఇలా ఆడపిల్లల పాలిటి శాపంగా పరిణమించిపోయింది. ఇరు కుటుంబాలవారూ ఇష్టపూర్వకంగా ఏ బలవంతం లేకుండా కట్నకానుకలు ఇచ్చుకునేవాళ్లు లేకపోలేదు. పరస్పరం గౌరవించుకుంటూ, ప్రేమాభిమానాలు పంచుకుంటూ ఎంతో సఖ్యంగా, సంస్కారయుతంగా ఉండే కుటుంబాలూ ఉంటున్నాయి, కానీ అలాంటి వారి శాతం బాగా తగ్గిందని చెప్పక తప్పదు.
   పూర్వం కన్యాశుల్కం ( ఓలి  ) పేరిట ఆడపిల్లల తల్లిదండ్రులకు డబ్బులు ఇచ్చి ముక్కుపచ్చలారని బాలికల్ని వయసు మీరినవారు  వివాహం చేసుకునేవారట ! అమ్మాయికి  కట్నం ఇచ్చినా, అబ్బాయికి కట్నం ఇచ్చినా -- అప్పుడూ, ఇప్పుడూ అమ్మాయే బలి  పశువు  కావడం గమనార్హం !  
    అప్పట్లో ఆడపిల్లలకు చదువే అవసరం లేదనీ,  పెళ్లయ్యాక మొగుడనే వాడికి ఓ ఉత్తరంముక్క రాసుకునే పాటి అక్షరజ్ఞానం ఉంటే చాలనీ ఆడపిల్లల్ని ఇంటికే పరిమితం చేయడం జరిగేది.ఆడపిల్లకు వంటా వార్పు వస్తే చాలని అనుకునే రోజులవి. కాలక్రమేణా స్త్రీవిద్య ప్రాముఖ్యత పెరిగిపోయి ఉన్నత చదువులు చదవడమే గాక అమ్మాయిలూ ఉద్యోగాల కోసం గడప దాటే రోజులు వచ్చేశాయి. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, కళాశాలలు కూడా వెలిశాయి. తల్లిదండ్రుల్లో కూడా గణనీయంగా మార్పు వచ్చి కొడుకులతో సమానంగా కూతుళ్లను కూడా  చదివించడం మొదలైంది. అంతవరకు బాగానే ఉంది. ఈ మార్పు అభిలషణీయమూ, సంతోషదాయకము కూడాను.
    కానీ అందువల్ల కొత్త చిక్కులు చాప కింద నీరులా వచ్చేసి, దరిమిలా అమ్మాయిల పెళ్లిళ్లు సమస్యగా మారిపోయాయి. ఒకప్పుడు అంతగా చదువు లేని ఆడపిల్లలకు ఏదో గంతకు తగ్గ బొంత అని సంబంధాలు ఖా చేసుకొని చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపేసి బాధ్యత దించేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడేమో బాగా చదివిన అమ్మాయిలకు  అంతకంటే పెద్ద చదువు చదివిన లేదా కనీసం సమానంగానయినా చదివిన అబ్బాయిని వెతకడం పెద్ద సమస్య అయి కూర్చుంది. పైగా, ఎంత చదివించినా, ఉద్యోగాలు చేస్తూ సంపాదనాపరులైనా కట్నాలు మాత్రం అమ్మాయిలకు ఇచ్చుకోవాల్సిందేనన్న సంప్రదాయం జనాల నరనరానా జీర్ణించుకుపోయి ఉండనే ఉంది!!
   ఓవైపు చదివించడానికి ఖర్చు, మరోవైపు వరకట్నాల ఖర్చు, అది చాలదన్నట్లు పెళ్లి ఖర్చు... తడిసి మోపెడై ఆడపిల్లల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది అంటే అతిశయోక్తి కానే కాదు. కొందరైతే ఎందుకు చదివించాంరా బాబు వీళ్ళని... అనుకునే దుస్థితిలో కూడా పడిపోతున్నారు. ఇవన్నీ అక్షర సత్యాలు అంటే నమ్మితీరాలి.
     మరోవైపు...మగ పిల్లలకు పెళ్లి చేసుకోవడానికి పిల్ల దొరకడం లేదంటూ సర్వే నివేదికలు !! అందులో నిజమెంతో ప్రస్తుత సమాజపోకడ క్షుణ్ణంగా  గమనిస్తే పరిస్థితి అవగతమవుతుంది. అమ్మాయిలు కూడా తమ స్థాయికి తగిన సంబంధం కుదిరే వరకు వేచి చూడడంతో వివాహ వయస్సు దాటిపోతోంది...అది మరో సమస్య! తల్లిదండ్రులకే కాదు అమ్మాయిలకు కూడా...!! 
 ఇంతకీ--- అసలు విషయానికొస్తే..ఈ కట్నమన్నది వరునికి ఎందుకు ఇవ్వాలి? 
 భార్యవిలువ తెలిసీ సంప్రదాయాల పేరిట ఈ ఆచారాలు ఎందుకు కొనసాగాలి ? ఇద్దరూ సమానమే అయినప్పుడు, సంసారరథానికి ఇద్దరూ అవసరమే అయినప్పుడు పెళ్లి సమయంలో స్త్రీయే ఎందుకు కట్నమివ్వాలి? ఇది ఏ ఒక్కరి ప్రశ్నో కాదు, అనాదిగా ఎందరో...ఎందరెందరో స్త్రీల ఆవేదనతో కూడిన ప్రశ్న. 
  ఎప్పుడో, ఎన్నో ఏళ్ళ క్రితం రేడియో లలిత సంగీతంలో విన్న ఓ పాట ఈ సందర్భంగా తలపుకొస్తోంది. ఈ పాటను గమనిస్తే, ఏళ్లకు ఏళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు ఎంత మాత్రమూ రాలేదని స్పష్టంగా తెలిసిపోతుంది.. ఆలోచించండి...

               " నీలాల నింగిలో తిరిగేటి జాబిల్లి 
                  నింగికేమిస్తుంది ఓలి...
                  బ్రతుకులో వెన్నెలై వెలిగేటి మగనాలి 
                  ఎందుకివ్వాలి ఓలి...?!
  ------------------------------------------------------------------
 
                   






  






 





Tuesday, May 13, 2025

పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు...

                                  యం.ధరిత్రీ దేవి    


     తల్లి గర్భంలో జీవం పోసుకున్న ప్రాణి జన్మించిన పిదప క్రమక్రమంగా ఎదుగుతూ, ఆ జీవనగమనంలో ఎన్నో సాధిస్తూ చివరకు ఏదో ఒక రోజు ఆ జీవమన్నది ( అదే ప్రాణమన్నది ) తన దేహం నుండి వేరై ఆ దేహం నిర్జీవంగా మారిపోతుంది.

  ప్రాణానికి ఇంత విలువ ఉందా! అది ఉన్నంత వరకేనా మనిషి మనుగడ ! ఆ తర్వాత ఎంతటి వారలైనా కాటికి చేరాల్సిందేనా !

* మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ! ఈ పేరు వినని వాళ్లు ఏ తరంలోనైనా ఉంటారా? ఓ బక్కపలుచని వ్యక్తి కొల్లాయి గట్టి కనీసం వంటిమీద చొక్కా అయినా లేకుండా అతి నిరాడంబరంగా కనిపిస్తూ అందర్నీ తన కనుసన్నల్లో నిలుపుకుని మొత్తం భారతావనికే తలమానికంగా నిలిచిన ఓ మహామనీషి! భరతమాత దాస్యశృంఖలాలను తెంచాలన్న దృఢ సంకల్పంతో సకల జనావళినీ తన వెన్నంటి నడిచేలా చేయగలిగిన ధీశాలి. స్వాతంత్ర్యం సాధించి బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టే దాకా నిద్రించని పట్టువదలని నిత్య శ్రామికుడు! 

 అంతటి మహోన్నత వ్యక్తి చివరకో తూటాకు బలై నేలకొరిగి ప్రాణమన్నది అనంత వాయువుల్లో కలిసిపోయి అచేతనుడై పోయాడు. యావత్తు దేశాన్ని తన వెంట నడిపించిన ఆ మహోన్నత వ్యక్తి దేహం నిర్జీవమై పోయి పిడికెడు బూడిదగా మారి మట్టిలో కలిసిపోయింది. ప్రాణం ఉన్నంత వరకు అంతటి శక్తివంతమైన ఆ కాయం అది కాస్తా మాయమవగానే కూలిపోయింది ! ఇంతకూ ఆ ప్రాణమన్నదెక్కడ? 

* ఇందిరాగాంధీ. ధీరవనిత! శక్తివంతమైన మహిళ! మేధోసంపత్తి, చాకచక్యం పుష్కలంగా కలిగి దేశ ప్రధానిగా తిరుగులేని విధంగా భాసిల్లి 'ఇందిర అంటే ఇండియా' అన్న విధంగా కీర్తింప బడ్డ అద్వితీయ నారీమణి! చక్కటి చీర కట్టుతో, ఒత్తయిన తలకట్టుతో ఎంతో హుందాగా కనిపించే ఇందిరమ్మ కంచే చేను మేసిన రీతిని  తన ఇంటి ప్రాంగణంలో అండగా నిలవాల్సిన అంగరక్షకుల తూటాలకే బలై పోయింది. దేశాన్ని తిరుగులేని విధంగా ఏలిన ఆ గొప్ప మహిళ కూడా ప్రాణం దేహాన్ని వీడగానే ఒక్కసారిగా ఆమె జీవనయానం స్తంభించిపోయి నిస్సహాయురాలై పోయింది. 

* చక్కటి రూపం, అంతకుమించిన అద్భుత నటనా కౌశలం, గంభీరమైన స్వరం -- ఆయన సొంతం. పౌరాణిక చిత్రాల్లో రాముడు, కృష్ణుడు, రావణాసురుడు, భీముడు, అర్జునుడు, కర్ణుడు, దుర్యోధనుడు. భీష్ముడు ఆయనే! ఇంకా ఇంకా ఎన్నో సాంఘిక చిత్రాల్లోని పాత్రల్లోనూ జీవించిన నందమూరి తారక రామారావు అశేష తెలుగు ప్రజానీకానికి ఆరాధ్య దైవం. రాజకీయాల్లోనూ ముఖ్యమంత్రిగా వెలుగొంది కాలిడిన ప్రతీ రంగంలో తనకు తానే సాటి అనిపించుకున్న కారణజన్ముడు! అంతటి ధీరోదాత్తచరిత ప్రాణం ఉన్నంత వరకే!-- ప్రాణం అంటే ఏమిటి? 

* ఒకటి కాదు, వంద కాదు, వెయ్యి కాదు --ఏకంగా నలభై వేల పాటలు --అదీ పదహారు భాషల్లో పాడిన ఘనత సాధించి రికార్డు సొంతం చేసుకుని 'గానగంధర్వుడి' గా కీర్తింపబడ్డ ఎస్. పి. బాలసుబ్రమణ్యంగారు..ఏరీ, ఎక్కడ? నిండైన ఆ విగ్రహం, చిరునవ్వులు చిందించే ఆ మోము, గళం విప్పితే చాలు  జాలువారే మధుర గీతాలు, పెదవి విప్పితే చాలు అనర్గళంగా సాగిపోయే ఆ వాక్ప్రవాహం.. అన్నీ ఎక్కడ? జీవం కోల్పోయి అలా  గాజుపెట్టెలో అచేతనంగా !! తేనెల వానలు కురిపించే ఆగళం, ఆ పెదవులు నిర్జీవంగా...! ప్రాణం లేనందుకేగా!

  దేహంలో ప్రాణమన్నదానికి ఇంతటి ప్రాధాన్యత ఉందన్నమాట! అది వీడిన మరుక్షణం దేహానికి విలువ లేదు. మట్టిలో కలిసి పోవాల్సిందే. ఊపిరి ఉన్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు, బాధలూ, బాధ్యతలూ --- అది కాస్తా ఆగాక అంతా శూన్యం, శూన్యం. 

  ఏమిటీ, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి, సెలబ్రిటీల గురించే చెబుతున్నావు, వాళ్లంతా జగమెరిగిన వాల్లనా ! నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటేమిటి?  వాళ్లు సెలబ్రెటీలు కారా? 

 ఎంత మాట! ప్రతీ వ్యక్తికీ అమ్మ నాన్నలను మించిన వారెవరుంటారు? 

గుడ్లురిమినా నీపైనే 

గుండెలకదుముకున్నా నిన్నే  --- అనే అమ్మ 

వేలెడంత వయసు నుంచీ 

వేలు పట్టి నడిపించి 

లోకం చూపించి, లోకజ్ఞానం 

తెలిసేలా చేసి, విలువలు నేర్పించి 

దారి చూపిన నాన్న !

--- మేము లేకున్నా ఇక నీవు బ్రతుకు బాటలో నిర్భీతిగా  సాగిపోగలవులే -- అన్న భరోసా వచ్చాక నిష్క్రమించిన ఇరువురూ కట్టెల్లో కట్టెగా మారి కాలిపోతున్న క్షణాన చూడలేక తల తిప్పుకున్న క్షణాలు ఇప్పటికీ గుర్తే ! 

  ఇంతకీ నేచెప్పాలనుకున్నది దేహంలో ఈ ప్రాణం గురించి--

 అసలు ప్రాణం అంటే ఏమిటి?  ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకు మరణం ఉండదంటారు. మనిషి మరణించాక శరీరం నుండి ఆత్మ వేరై పోతుంది అనడం వింటుంటాం. అయితే దానికి మరణం తర్వాత తన భౌతికకాయానికి జరిగే తతంగాలన్నీ తెలుస్తూ ఉంటాయా?  ఇవన్నీ వేధించే ప్రశ్నలే. జవాబులు మాత్రం దొరకడం లేదు. 

     ఏది ఏమైనా...పుట్టిన ప్రతివారూ గిట్టక తప్పదు. ఈ గీతాసారం వంటబట్టించుకుంటే బాధ అన్నది ఉండదు... అంతే కదా!! 'కరోనా' ఉదృతంగా ఉన్న రోజుల్లో ఎందరో ప్రముఖులతో పాటు మనకు బాగా దగ్గర బంధువులు, ఆప్తమిత్రులు కూడా దూరమైపోయారు. కొందరైతే కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఇప్పటికీ తేరుకోలేని స్థితిలో కుమిలిపోతుండడం చూస్తూనే ఉన్నాము. గుండె దిటవు  పరుచుకోవాలి, తప్పదు. 

    అలాగే...మరణం అన్నది ఏ రూపంలో ఎప్పుడు వచ్చినా విధివిలాసమే ! కొందరు ఎంతో చేరువగా వచ్చి అనతికాలంలోనే అంతులేని ఆత్మీయతను పంచి, అకస్మాత్తుగా కనుమరుగై పోతూ ఉంటారు. కానీ, వారితో గడిపిన క్షణాలు, అనుభూతులు జ్ఞాపకాల రూపంలో ఎప్పటికీ అలా నిలిచే ఉంటూ ఆ స్నేహ బంధాలను గుర్తుకు తెస్తూనే ఉంటాయి. ఆ విధంగా  మనుషులు కనుమరుగైనా ఆ మనసు పంచిన జ్ఞాపకాల తడి మాత్రం ఆరదు. అందుకేనేమో మనసుకవి ఆచార్య ఆత్రేయ గారు ఎప్పుడో రాసేసి, అందరి మనసుల్ని ఆర్ద్రతతో నింపేశారు...!

      మనిషి పోతెమాత్రమేమి మనసు ఉంటది

      మనసు తోటి మనసెపుడో కలిసిపోతది 

      సావు పుటక లేనిదమ్మ నేస్తమన్నది 

      జనమ జనమ కది మరీ  గట్టిపడతది 

      పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు 

      ఉన్నోళ్లు పోయినోళ్ళ తీపిగురుతులు..

ఈమాటలు ఎప్పటికీ మాసిపోనివి...మరణం లేనివి 

                           ________________

 



    



Saturday, May 10, 2025

ఎవరు ? ఎవరామె ?!

🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀🥀

🤱
                          ~ యం.ధరిత్రీ దేవి ~

     బిడ్డ బోసినవ్వుకు 
     పులకరిస్తుంది..
     తప్పటడుగులనాడు 
     పరవశిస్తుంది...
     తప్పుటడుగులు 
     సవరిస్తుంది...
     ఎవరు ? ఎవరామె ?

     పరులు తన పిల్లల్ని 
     పల్లెత్తు మాటన్నా పడదు..
     పోట్లాడుతుంది...
     వెన్నుదన్నుగా నిలబడుతుంది

     తన ఆకలి ఎరుగనిది...
     తన పిల్లల కడుపులు నింపేది...
     తన ఆశల పునాదిపై 
     వారి కలల సౌధం నిర్మించేది !!

     చేవగలిగినన్నాళ్లు సేవకు 
     సిద్ధమంటుంది..
     వయసుడిగిననాడు
     మాటలు పడుతుంది... 
     మౌనంగా రోదిస్తుంది 

     ఎవరు  ?  ఎవరామె  ?
     త్యాగానికి ప్రతిరూపం...
     నడిచే వెన్నెల దీపం...
     ఇలపై 'అమ్మ' కాక  
     ఆమె మరెవరు ?    🤱

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
                               11.5.2025
      అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

గుర్తించి గౌరవిద్దాం...

                         ~యం. ధరిత్రీ దేవి

 అహరహం శ్రమించే అమ్మలు 
 అలుపెరుగని శ్రమజీవులు...
 స్వార్థం ఎరుగరు..అంతటి అమాయకులు!
 పిల్లలే ప్రపంచమనుకునే ప్రేమమూర్తులు 
 
 కర్మాగారాల్లో పనిచేస్తేనే శ్రామికులా..
 కుటుంబం కోసం నిరంతరం కష్టించే 
 గృహిణులు కారా శ్రామికులు!గుర్తింపు ఎక్కడ?
 ఆ శ్రమజీవి చిందించే చెమటకు..!
 
 ధన్యజీవులని పొగడ్తలు!
 త్యాగమూర్తులని బిరుదులు!!
 ఇవన్నీ బయట వినపడే నోటి మాటలు..
 నిజానికి..వాస్తవ దూరాలు..

 ప్రతిఫలం ఆశించని అమ్మలు..ఇంటిల్లిపాదికీ
 అందించే సౌకర్యాలు వెలకట్టగలరా!
 ఊహకు అందదు ఆ మొత్తం..అవగలదు
 మనిషన్నవాడు మోయలేనంత !! 

 సింహాసనం కోరదు.. కిరీటం ఆశించదు..
'అమ్మ' ఆమె!అన్నింటా సమర్థురాలు...
 జీతభత్యాలు లేని ఇంటి దేవత! ప్రేమిద్దాం..
 గుర్తించి గౌరవిద్దాం..అదే ఆమెకు అద్భుతమైన
 మాతృదినోత్సవ బహుమానం 
  


Monday, May 5, 2025

కార్మికులంటే... శ్రామికులేనా..!!



    పురాణగాథలు మార్చాయి 
    కొన్ని రోజుల్ని ఇంటికి  పర్వదినాలుగా...
    జాతీయ సంఘటనలు 
    కొన్ని మారాయి సమాజానికి
    పర్వదినాలుగా...అయితే...
    కొందరు మహనీయులు చిందించిన రక్తం 
    చారిత్రాత్మక రోజుగా మారిన 
    చైతన్యదినం..అదే మే డే !!
   "ప్రపంచ కార్మికులారా ఏకం కండి "
    కార్ల్ మార్క్స్ ఈ నినాదం 
    ప్రపంచ గమనాన్ని శాసించిన దినం!!
    కార్మికులంటే కర్మాగారాల్లో పనిచేసే 
    శ్రామికులేనా! అంటూ 
    ప్రశ్న ఉదయించిన మహత్తరక్షణం!                
    సమాజం కోసం చెమటోడ్చే వారు
    నిరంతర శ్రమజీవులు...
    కానేకాదు యంత్రాలు..ఇనుప పనిముట్లు...
    శక్తికీ పరిమితులు ఉంటాయి...   
    రోజులో.. పని..విశ్రాంతి..వినోదం..
    విభజనకై మొదలైన ఆ పోరాటం
    గెలిచి నిలిచిన దినం..అది మే డే!!
    అదే..అంతర్జాతీయ కార్మికదినోత్సవం 
    శ్రమైక జీవన సౌందర్యం 
    వెల్లి విరిసిన సుదినం !!
    కార్మిక లోకానికి పర్వదినం!!

                         ~ ధరిత్రీ దేవి
      
    






  

అమ్మకు వందనం... కథ

  

అందరికీ వందనం 🙏

 'విహంగ'  (మే నెల 2025)  అంతర్జాల మాసపత్రికలో మదర్స్ డే సందర్భంగా నా కథ...

 'అమ్మకు వందనం' ప్రచురించబడినది. వీక్షించగలరు. 



Friday, May 2, 2025

మండే ఎండల్లో మల్లెల సౌరభాలు !


            ~ యం. ధరిత్రీ దేవి ~
************************
వేసవి  వచ్చింది 
ఎండల్ని తెచ్చింది 
మల్లెల్ని ఇచ్చింది !
ముడుచుకున్న ఆకులన్నీ  
విప్పారినవి 
పండుటాకులు రాలి 
పచ్చని చివుళ్లు 
పలుకరిస్తున్నాయి 🙂
ఇన్నాళ్లూ ఎక్కడ 
దాక్కున్నాయో మరి !!
నిద్రించిన కొమ్మలు 
ఒక్కసారిగా మేల్కొన్నాయి !
అదిగో, మొదటి మొగ్గ  !!
విచ్చుకుంది మరునాటికి !
కనురెప్ప పాటులో 
కనువిందు చేస్తూ... 
కొమ్మకొమ్మనా చిట్టి మొగ్గలు !
చిరు నవ్వులు చిందిస్తూ... 
చెట్టంతా...విరిసిన మల్లెలు 
వారం గడిచేసరికి  !
నింగిని పరుచుకున్న 
నక్షత్రాల మాదిరి !!
పరిమళభరితాలు 
మల్లెలు...సన్నజాజులు 😊
ఋతురాగాలకు స్పందించే 
శ్వేతవర్ణ కుసుమాలు !
మండే ఎండల్లోనే కదా 
ఈ మల్లెల గుభాళింపులు !
ఆస్వాదించాలంటే
స్వాగతించాలి మరి 
వేసవి వడగాడ్పుల్ని  !! 
అందుకే...
వేసవి రావాలి 
ఎండల్ని తేవాలి 
మల్లెల్ని మనకివ్వాలి  🙂🙂
**************************