Monday, August 30, 2021

ఆ పాటలు స్ఫూర్తి నిస్తాయి, జీవితాల్నీ నిలబెడతాయి !

                                               🌺భువి భావనలు🐦🌷
                                                    *************


     చాలా ఏళ్ళ క్రితం ఓ ఆర్టికల్ చదివాను. అది  ఓ సినిమా పాట గురించి. అందులో నిజంగా జరిగిన ఓ సంఘటన  చెప్పడం విశేషం !దాని సారాంశం --
 జీవితంలో అన్ని విధాలా ఎదురు దెబ్బలు తిని, మనోధైర్యాన్ని కోల్పోయి, విరక్తి చెంది, విధిలేని పరిస్థితుల్లో ఓ వ్యక్తి తనకు ఆత్మహత్య తప్ప మరో దారి లేదని నిర్ణయించుకుని అందుకై ఉద్యుక్తుడవుతుండగా అల్లంత దూరంలో ఆకాశవాణి( రేడియో) నుండి ఓ పాట అతని చెవుల్ని తాకింది.. నిమిషాల వ్యవధిలోనే అది ఆతని గుండెల్నీ తాకింది. అంతే! ఎంతోకాలంగా అతన్ని వేధిస్తున్న గడ్డు సమస్యలు గడ్డిపరకలుగా తోచాయతనికి ! ఆశ్చర్యకరంగా మనసంతా తేలికై పోయి,  అతని నిర్ణయం సడలిపోయి అనూహ్యంగా మారిపోయింది.
 "చచ్చి సాధించేది ఏముంది, జీవితం అంతమైపోతుంది. సమస్యలు పరిష్కారం కావు కదా! ఏదైనా బ్రతికే సాధించుకోవాలి, "
 అన్న స్థిర నిశ్చయంతో మనసును సరైన దారిలోకి మళ్ళించుకున్నాడట ! ఆ విధంగా అతని జీవితం నిలబడింది. తర్వాత అతని సమస్యలు తీరాయా లేదా అన్నది వేరే సంగతి. దేహంలో ప్రాణం నిలబడటమన్నది అతి ముఖ్యం. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా సాధించగలం!
 ఇంతకీ ఆ పాట-- ' వెలుగునీడలు' చిత్రంలో శ్రీ శ్రీ గారిచే విరచితమై, పెండ్యాల నాగేశ్వరరావు గారి సంగీత సారథ్యంలో ఘంటసాల గారు అత్యద్భుతంగా ఎంతో ఆర్ద్రతతో ఆలపించిన ---
కలకానిదీ విలువైనదీ బ్రతుకు
 కన్నీటి ధారలలోనే బలి చేయకూ 
 *అలముకొన్న చీకటిలోనే అలమటించనేలా 
 కలతలకే లొంగిపోయి కలవరించనేల !
 సాహసమను  జ్యోతినీ చేకొని సాగిపో
* అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
 శోకాల మరుగున దాగీ సుఖమున్నదిలే
 ఏది తనంత తానై నీ దరికి రాదు
 శోధించి సాధించాలీ అదియే ధీర గుణం!
ఆరోజుల్లోనే కాదు ఇప్పుడూ ఎప్పుడూ అజరామరంగా నిలిచి ఎందరికో స్ఫూర్తి నిచ్చే అద్భుతమైన పాట ఇది ! ఇలాంటి  సినీ గీతాలు ఇంకా ఉన్నాయి. కేవలం కాలక్షేపాన్ని, మానసికానందాన్ని ఇచ్చే పాటలు లక్ష లాది ఉంటాయి కానీ, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన గీతాలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇవి మానవాళికి దివ్య వరాలనే  చెప్పాలి! అలాంటిదే మరొకటి ---
 ఘంటసాల గారు పాడినదే, కొసరాజు సాహిత్యం' శభాష్ రాముడు' చిత్రంలోనిది.
* కష్టాల కోర్చుకున్ననే సుఖాలు దక్కునూ 
 ఈ లోకమందు సోమరులై  ఉండకూడదూ 
 పవిత్రమైన ఆశయాలు మరువకూడదూ 
 * గాఢాంధకారమలముకొన్న భీతి  చెందకూ 
  సందేహ పడక వెలుగు చూపి   సాగు ముందుకు
  నిరాశలోన  జీవితాన్ని కృంగదీయకూ 
  జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా
  జంకు గొంకు లేక ముందు సాగిపొమ్మురా
తర్వాతి తరంలో వచ్చిన మరో రెండు మరపురాని గీతాలు - ఈ రెండూ  చంద్రబోస్ గారు రాసినవే !రెండింటికీ  కీరవాణి గారు చక్కటి బాణీలు కట్టడం మరో విశేషం! ఈ పాటలు నేటి తరాన్ని కర్తవ్యోన్ముఖుల్ని చేస్తాయనడంలో  ఎలాంటి సందేహం లేదు. అందులో ఒకటి -- ' నేనున్నాను' చిత్రంలోనిది. కీరవాణి,  సునీత గారలు గానం చేసినది. 
  తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని
  తరిమే వాళ్ళని  హితులుగ తలచి ముందుకెళ్లాలనీ 
  కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ 
  కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ 
  గుండెతో ధైర్యం చెప్పెను, చూపుతో మార్గం చెప్పెను
  అడుగుతో గమ్యం చెప్పెను
  నేనున్నాననీ నీకేం కాదనీ 
  నిన్నటి రాతని మార్చేస్తానని
--నా బ్రతుకింతే, నా తల రాతను ఎవరూ మార్చలేరు అనుకునేవాళ్లకు ఈపాట ఓ చక్కటి జవాబు. ఓ మార్గదర్శి." నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్" చిత్రంలోని ఈ పాట వినని వారు ఉండరేమో! 
  చెమట నీరు చిందగా నుదుటి  రాత మార్చుకో
  మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
  పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
  మారిపోని కథలే లేవని గమనించుకో
  తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
  నచ్చినట్టుగా నీ తలరాతను నువ్వే రాయాలీ 
  నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
  నీ అడుగుల్లో గుడికట్టి స్వర్గాలే తరియించగా 
  నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ 
  అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలి
 * మౌనంగానే ఎదగమనీ
    మొక్క నీకు చెబుతుంది
   ఎదిగిన కొద్దీ ఒదగమనే
   అర్థమందులో ఉంది
   అపజయాలు కలిగిన చోటే 
   గెలుపు పిలుపు వినిపిస్తుంది
   ఆకులన్ని రాలిన చోటే
   కొత్త చిగురు కనిపిస్తుంది 
--- ఈ పాట గురించి చంద్రబోస్ గారు స్వయానా చెప్పిన మాటలు ఓ  చోట చదివాను. ఓ పాఠశాలలో ఉదయం ప్రార్థనా  గీతంగా ఈ పాటను ప్రతిరోజూ విద్యార్థుల చేత పాడిస్తారట ! ఓ రచయిత లేదా కవికి ఇంతకుమించిన మహద్భాగ్యం బహుశా ఉండదేమో! ఏ పురస్కారం దీనితో సరితూగదు అంటే అతిశయోక్తి కానే కాదు.
  అలాగే ఈ చిత్ర దర్శకుడు, ప్రముఖ ఛాయాగ్రహకులు ఎస్. గోపాల్ రెడ్డి గారు ఓ ఇంటర్వ్యూలో ఈమధ్య చెప్పగా విన్నాను, కడప జిల్లాలోని ఓ గ్రామంలో ఈ పాటలోని పల్లవిని ఓ పెద్ద చెట్టు మొదట్లో బ్లాక్ బోర్డ్ మీద వ్రాసి ఉంచారట! వచ్చేపోయే వాళ్లు, ముఖ్యంగా  రైతులు ప్రతిరోజూ ఆ మాటలు  చదువుతూ స్ఫూర్తి పొందాలని వారి ఉద్దేశమట ! ఎంత గొప్ప ఆలోచన! ఓ పాట ఇంతలా ప్రాచుర్యం పొందడమే గాక ఎందరికో  స్ఫూర్తి నివ్వడం నిజంగా సర్వదా హర్షణీయం. రాసిన వారు, సంగీతకర్తలు, గాయని చిత్ర గారూ ధన్యులు! 
  --- ఇలాంటి పాటలు ఇప్పుడే కాదు, భావి  తరాలనూ ఉత్తేజపరుస్తాయి. నేను నాలుగింటిని  మాత్రమే ప్రస్తావించాను. ఇంకా ఉంటాయి, ఆ.... అదిగో... గుర్తుకొస్తోంది,... మరో మధుర గేయం... 
    కడలి నడుమ పడవ మునిగితే
    కడదాకా ఈదాలి
    నీళ్ళు లేని ఎడారిలో
    కన్నీళ్లయినతాగి బ్రతకాలి
    ఏ  తోడు లేని నాడు
     నీనీడే  నీకు తోడు
     జగమంతా దగా చేసినా 
     చిగురంత ఆశను చూడు 
     చిగురంత ఆశ జగమంత వెలుగు 
     గోరంతదీపం కొండంత వెలుగు. 
బాపుగారి 'గోరంతదీపం ' చిత్రం లో సుశీల, బాలసుబ్రహ్మణ్యం గారలు గానం చేసినది. సి. నారాయణ రెడ్డి గారి సాహిత్యం, కె. వి. మహదేవన్ సంగీతం. 
ఇవన్నీ నిరాశలో ఉన్నవారికే కాదు  ప్రతివారిలోనూ స్ఫూర్తి నింపుతాయి.సరైన దారిలో నడిచేలా పురికొల్పుతాయి  కర్తవ్యాన్ని బోధిస్తూ జీవితాల్నీ నిలబెడతాయి. 
   అద్భుతమైన ఆలోచనలకు అక్షరరూపమిచ్చిన ఆయా కవులకు,  ఉత్తేజపూరితమైన స్వరాలందించిన సంగీత దర్శకులకు, ప్రాణం పోసిన గాయనీగాయకులకు నమస్సులు 🙏

**********************************





No comments:

Post a Comment