చినుకు రాలందే భూమి తడవదు. భూమి తడవందే గింజ మొలవదు. పంటలు పండవు. అవి లేకపోతే జనాలకి తిండిగింజలుండవు. ఆకలి తీరే మార్గం లేక అలమటించాల్సిందే!
నిజమే ! చినుకులు వర్షపు ధారలై అందర్నీ పరవశింపజేయాలి. బీడు భూముల్ని సస్యశ్యామలం చేయాలి. రైతన్నల కలల్ని పండించాలి. కానీ -- ఆ చినుకులన్నవి వరదలయితే ! భీభత్సాల్ని సృష్టిస్తే !
ప్రస్తుతం విపరీత వర్షాలు, వరదలు సృష్టిస్తున్న అల్లకల్లోలం చూస్తుంటే ఏమిటీ ప్రకృతి వైపరీత్యం ! అనిపించక మానదు ఎవరికైనా. అసలే చలి కాలం. రెండు మూడు రోజులు ఎడతెగకుండా వర్షం కురిస్తేనే తట్టుకోలేని పరిస్థితి ! అలాంటిది రోజుల తరబడి ఈ కురిసే వానలతో, తుఫాన్ వాతావరణం తో కొన్ని ప్రాంతాల ప్రజలు పడుతున్న పాట్లు చూస్తుంటే చాలా బాధనిపిస్తుంది. చూసేవాళ్ళకే ఇలా ఉంటే అనుభవిస్తున్న వాళ్ల సంగతేమిటి ?
పక్కాగా కట్టుకున్న కాంక్రీటు భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు, వరద నీళ్లలో ఇళ్లన్నీ జలమయమై వస్తు వాహనాలు సైతం కొట్టుకు పోతున్న దృశ్యాలు టీవీల్లో చూస్తున్నాం. గుడిసె వాసుల దైన్యం సరే సరి ! ఊహించడమూ దుర్భరమే! అంతా కోలుకుని, మళ్లీ కూడగట్టుకొని స్థిరపడడానికి ఎంత కాలం పడుతుందో ఏమో !
మరోపక్క రైతన్నల దుస్థితి! పంట చేతికి వచ్చిన తరుణం. అంతా ఆరబోసుకున్న ధాన్యం రాశులు నీటి పాలై కొట్టుకుపోతుంటే కన్నీళ్ళ పర్యంతమై చేష్టలుడిగి చూస్తున్న తీరు బాధాకరం. పంట చేలన్నీ నీట మునిగి కడుపు తరుక్కుపోయి విలవిలలాడుతూ దిక్కు తోచక ఆకాశం వైపు చూస్తున్నారు రైతు సోదరులు !
నీరు ప్రాణాధారం అంటాం.గుక్కెడు నీటికై తహ తహ లాడి పోతుంటాం. గుప్పెడు నీరు ప్రాణాల్ని నిలబెడుతుంది కూడా. కానీ అదే నీరు ఇలా విజృంభించి వరదలై పారితే మనిషి పరిస్థితి ఇంత భయానకంగా, దారుణంగా, దయనీయంగాఉంటుందా!
అందమైన జలపాతాలను, నదులను చూసి ఆనందిస్తాం. జల జల పారే జలపాతాల్ని, ఆ హోరునీ ఎంతగానో ఆస్వాదిస్తారు జనం ! కానీ శృతి మించితే అది ఘోషగా,కర్ణకఠోరంగా కూడా అనిపిస్తుందని ప్రస్తుత వరద బీభత్సాలు నిరూపిస్తున్నాయి.ఏది ఏమైనా బాధిత ప్రజలు త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
*******************************
*తెలుగు కథలు కవితలు వ్యాసాలు *
*******************************
No comments:
Post a Comment