Monday, May 5, 2025

కార్మికులంటే... శ్రామికులేనా..!!



    పురాణగాథలు మార్చాయి 
    కొన్ని రోజుల్ని ఇంటికి  పర్వదినాలుగా...
    జాతీయ సంఘటనలు 
    కొన్ని మారాయి సమాజానికి
    పర్వదినాలుగా...అయితే...
    కొందరు మహనీయులు చిందించిన రక్తం 
    చారిత్రాత్మక రోజుగా మారిన 
    చైతన్యదినం..అదే మే డే !!
   "ప్రపంచ కార్మికులారా ఏకం కండి "
    కార్ల్ మార్క్స్ ఈ నినాదం 
    ప్రపంచ గమనాన్ని శాసించిన దినం!!
    కార్మికులంటే కర్మాగారాల్లో పనిచేసే 
    శ్రామికులేనా! అంటూ 
    ప్రశ్న ఉదయించిన మహత్తరక్షణం!                
    సమాజం కోసం చెమటోడ్చే వారు
    నిరంతర శ్రమజీవులు...
    కానేకాదు యంత్రాలు..ఇనుప పనిముట్లు...
    శక్తికీ పరిమితులు ఉంటాయి...   
    రోజులో.. పని..విశ్రాంతి..వినోదం..
    విభజనకై మొదలైన ఆ పోరాటం
    గెలిచి నిలిచిన దినం..అది మే డే!!
    అదే..అంతర్జాతీయ కార్మికదినోత్సవం 
    శ్రమైక జీవన సౌందర్యం 
    వెల్లి విరిసిన సుదినం !!
    కార్మిక లోకానికి పర్వదినం!!

                         ~ ధరిత్రీ దేవి
      
    






  

అమ్మకు వందనం... కథ

  

అందరికీ వందనం 🙏

 'విహంగ'  (మే నెల 2025)  అంతర్జాల మాసపత్రికలో మదర్స్ డే సందర్భంగా నా కథ...

 'అమ్మకు వందనం' ప్రచురించబడినది. వీక్షించగలరు. 



Friday, May 2, 2025

మండే ఎండల్లో మల్లెల సౌరభాలు !


            ~ యం. ధరిత్రీ దేవి ~
************************
వేసవి  వచ్చింది 
ఎండల్ని తెచ్చింది 
మల్లెల్ని ఇచ్చింది !
ముడుచుకున్న ఆకులన్నీ  
విప్పారినవి 
పండుటాకులు రాలి 
పచ్చని చివుళ్లు 
పలుకరిస్తున్నాయి 🙂
ఇన్నాళ్లూ ఎక్కడ 
దాక్కున్నాయో మరి !!
నిద్రించిన కొమ్మలు 
ఒక్కసారిగా మేల్కొన్నాయి !
అదిగో, మొదటి మొగ్గ  !!
విచ్చుకుంది మరునాటికి !
కనురెప్ప పాటులో 
కనువిందు చేస్తూ... 
కొమ్మకొమ్మనా చిట్టి మొగ్గలు !
చిరు నవ్వులు చిందిస్తూ... 
చెట్టంతా...విరిసిన మల్లెలు 
వారం గడిచేసరికి  !
నింగిని పరుచుకున్న 
నక్షత్రాల మాదిరి !!
పరిమళభరితాలు 
మల్లెలు...సన్నజాజులు 😊
ఋతురాగాలకు స్పందించే 
శ్వేతవర్ణ కుసుమాలు !
మండే ఎండల్లోనే కదా 
ఈ మల్లెల గుభాళింపులు !
ఆస్వాదించాలంటే
స్వాగతించాలి మరి 
వేసవి వడగాడ్పుల్ని  !! 
అందుకే...
వేసవి రావాలి 
ఎండల్ని తేవాలి 
మల్లెల్ని మనకివ్వాలి  🙂🙂
**************************
                 
                

Thursday, April 24, 2025

పుస్తకం... నా ప్రియ నేస్తం...

.                                          
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

                                            ~ యం. ధరిత్రీ దేవి 
   పుస్తకం నా ప్రియ నేస్తం...
   నాకు ప్రాణప్రదం...
   అలసిన వేళ సేదదీర్చే ఔషధం
   ఒంటరినైన...ఊరడించే నెచ్చెలి...
   తెరిస్తే చాలు... అక్షరాలు కావవి...
   అనంత కోటి ఆలోచనలు 
   కొలువుదీరిన కూటమి...!
   మేధావుల కలం నుండి జాలువారి
   చెక్కుచెదరక నిలిచిన 
   అక్షర శిల్పాలే మరి...!!
   అలరిస్తూ..మురిపిస్తూ ఒకసారి...
   నవ్విస్తూ..విషాదంలో ముంచేస్తూ
   మరోసారి... అంతలోనే...
   ఓదారుస్తూ.. నిద్రాణమైన శక్తిని 
   తట్టిలేపుతూ.. బద్ధకాన్ని వదిలిస్తూ...
   గమ్యం చూపిస్తూ.. ఆగకుమా 
   సాగిపొమ్మంటూ..వెన్నుతడుతూ 
   ముందుకు తోసే స్ఫూర్తిప్రదాతలు 
   ఆ అక్షర దీపాలు...!!
   హస్తభూషణం కాదు పుస్తకం...
   మస్తిష్కాన్ని మధించే 
   మహిమాన్విత ఉపకరణం..
   ఉజ్వల భవితకు సోపానాలు 
   వేసే ఉత్తమోత్తమ సాధనం...!
   విజ్ఞాన వినోదాల భాండాగారం...
   కాలక్షేపం కలగలసి..లభ్యం..
   మానసికోల్లాసం...!
   పుస్తకపఠనం..మెదడును
   పదును పెట్టే ఇంధనం...
   కావాలి దినచర్యలో అదో భాగం..
   నూతనోత్తేజానికి పడుతుందపుడే బీజం!!
   అందుకే... పుస్తకం నా ప్రియనేస్తం..
   నాకు ప్రాణప్రదం...!

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷








Thursday, April 17, 2025

ధన్యవాదాలు

 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

 అందరికీ నమస్కారం 🙏. 2020 వ సంవత్సరం 
( 20.4.2020 ) ఇదే రోజు బ్లాగు మొదలుపెట్టాను. ఇప్పటికి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయినాయి. క్రమం తప్పకుండా రాయడం అలవాటైపోయింది.అదో మంచి అలవాటు అలవడింది. నా ఆలోచనలు నలుగురితో పంచుకోవడానికి సరైన వేదిక లభించినందుకు సంతోషంగానూ ఉంది. నేనొక కవితగానీ, కథగానీ, వ్యాసంగానీ మరే రచనగానీ రాస్తే ఓ పదిమంది చదివినా చాలనుకుని మొదలెట్టాను. అనూహ్యంగానే వీక్షిస్తున్నందుకు సంతృప్తిగానూ ఉంది. ఇలాగే ఈ పయనం కొనసాగాలని కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు  🙏 మరియు ధన్యవాదాలు.

                                               ~ యం. ధరిత్రీ దేవి      

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐   

Tuesday, April 15, 2025

ఇదీ పరిష్కారం...కథ

 
                                  ~యం. ధరిత్రీ దేవి   
    
      "సౌమ్యా, ఇంకా ఏం చేస్తున్నావ్?"
 లాంగ్ బెల్లయి పది నిమిషాలైనా ఇంకా రాని సౌమ్య కోసం వెతుకుతూ  ఉన్న దుర్గకు క్లాస్ రూములో డెస్క్ మీద తలవాల్చి కూర్చున్న సౌమ్య కనిపించడంతో గట్టిగా పిలిచింది. తలెత్తి చూసింది గానీ సౌమ్య అక్కడినుంచి కదల్లేదు.
" ఏమిటి సౌమ్యా? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆర్ యూ ఓకే!"
 తనే లోనికి వెళ్లి సౌమ్య భుజం మీద చేయి వేసి కుదిపింది దుర్గ. లేచి నిలబడి, బ్యాగ్ తగిలించుకుంటూ,
"ఆ, ఓకే పద.."
 అంటూ కదిలింది సౌమ్య. కానీ దుర్గకు ఎందుకో సౌమ్య మామూలుగా లేదనిపించింది. బాగా ఏడ్చినట్టు మొహమంతా అదోలా ఉంది. మరీ బలవంతం చేస్తే బాగోదని దుర్గ తనతో కలిసి బయటకు దారితీసింది.
   అదో గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల. రెండంతస్తుల పాత భవనం. అందులో దుర్గ, సౌమ్య సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. దుర్గ హెచ్ఈసి గ్రూపు. సౌమ్య బైపీసీ గ్రూపు. ఇద్దరూ లాంగ్వేజ్ క్లాసుల్లో కలుస్తూ ఉంటారు. ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్. కానీ కొన్ని రోజులుగా సౌమ్య 'మూడీ'గా ఉండడం దుర్గ గమనిస్తూనే ఉంది. సౌమ్య స్వతహాగా చాలా నెమ్మదైన అమ్మాయి. ఎక్కువగా మాట్లాడదు. కానీ చదువులో చురుగ్గా ఉంటూ క్లాసులో మొదటి ఐదుగురిలో ఒకదానిగా ఉంటూ ఉంటుంది. దుర్గ స్వభావం పూర్తిగా విరుద్ధం. అందరితో గలగలా మాట్లాడుతూ అల్లరి కూడా బాగానే చేస్తూ ఉంటుంది.
" ఏమిటో, సౌమ్య ఇలా ఉండటం నాకు బొత్తిగా నచ్చడం లేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమో ఏమో..!"
 లోలోపల అనుకుంటూ కదిలింది దుర్గ.
                         **********
   వారం గడిచింది. సంవత్సరాంత పరీక్షలకు ముందు జరిగే ప్రిపరేషన్ పరీక్షలకు టైంటేబుల్ ఇచ్చారు. చివరి సంవత్సరం..పైగా పబ్లిక్ ఎగ్జామ్స్.. అందువల్ల లెక్చరర్స్ అంతా స్టూడెంట్స్ ను ప్రిపేర్ చేయడంలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులు అంటూ, స్టడీ అవర్స్ అంటూ తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారంతా.
   ఆరోజు శనివారం. సోమవారం నుండి పరీక్షలు మొదలు. క్లాసులన్నీ అయిపోయి, అమ్మాయిలంతా బిలబిలమంటూ క్లాసుల్లోంచి బయటపడ్డారు. తన క్లాసులో నుంచి ముందుగా బయటికి వచ్చిన దుర్గ సౌమ్య కోసం చూస్తూ నిలబడింది. కాసేపటికి వచ్చిన సౌమ్య,
" దుర్గా, నువ్వు వెళ్ళవే. నేను అర్జంటుగా టాయిలెట్స్ కి వెళ్ళాలి  "
అంది దుర్గతో.
, " సరేలే వెళ్లిరా. నేను వెయిట్ చేస్తూ ఉంటా బయట. త్వరగా వచ్చెయ్  "
 అంటూ వెళ్లబోయి,
"...అదేంటి సౌమ్యా పైకి వెళ్తున్నావ్, ఇక్కడే ఉన్నాయిగా టాయిలెట్స్..?"
 అప్ స్టైర్స్ వైపు వెళుతున్న సౌమ్యను ప్రశ్నించింది దుర్గ. తిరిగి చూడకుండానే,
" ఇక్కడ వాటర్ రావడం లేదులే దుర్గా "
 అనేసి పైకి దారి తీసింది సౌమ్య.
" అలాగా" అన్న దుర్గకు వెంటనే గుర్తొచ్చి,అదేంటి, ఇందాకే నేను వెళ్ళొచ్చాను, బాగా వస్తున్నాయే నీళ్లు..! అనుకుంటూ వెనుతిరగబోయిన ఆ పిల్లకు ఠక్కున ఏదో స్ఫురించి, మళ్లీ తిరిగి చూసింది. అప్పటికే పైకి వెళ్ళిపోయింది సౌమ్య. గుండె ఆగినంత పనైంది దుర్గకు . వెంటనే అప్ స్టైర్స్ వైపు పరిగెత్తింది. సౌమ్య బిల్డింగ్ టెర్రస్ మీద చివరికి గబగబా పరుగు లాంటి నడకతో నడుస్తూ పోతోంది. మరుక్షణంలో దూకేసేదే! శక్తినంతా కూడా తీసుకొని దుర్గ పరుగున వెళ్లి ఒక్క ఉదుటున సౌమ్యను చేయి పట్టి లాగేసింది. ఊహించని హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కింద పడిపోయింది సౌమ్య. అయినా వెంటనే లేచి,దుర్గ చేయి విడిపించుకొని ముందుకురకడానికి ప్రయత్నించింది. కానీ దుర్గ రెండు చేతులతో గట్టిగా సౌమ్యను వాటేసుకుని,
" బుద్ధుందా నీకు, ఏమిటీ పిచ్చి పని!!"
" దుర్గా, నన్ను వదిలేయ్ ప్లీజ్ "
" అసలేం జరిగింది? ముందు నాకు చెప్తావా లేదా? "
 అక్కడే కూలబడిపోయి,దుర్గను వాటేసుకుని  భోరున ఏడ్చేసింది సౌమ్య. మెల్లిగా ఆమె వీపు మీద తడుతూ, ఓదార్పుగా,
" ఊరుకో సౌమ్యా, ముందు ఇక్కడ నుంచి పదా, ఎవరైనా ఇక్కడ మనల్ని చూస్తే బాగోదు.. "
 అంటూ చేయి పట్టుకుని కిందికి తీసుకెళ్ళింది సౌమ్యను. అక్కడ ఎదురుగా వాచ్ మ్యాన్!
" ఏంటమ్మా ఏం చేస్తున్నారిక్కడ ? బెల్లయిపోయి ఎంత సేపయింది..! వెళ్లండి ఇక్కడి నుంచి.. "
 అంటూ అరిచాడు.
"వెళ్తున్నాం అన్నా, బుక్స్ కనిపించకపోతే వెతుక్కుంటున్నాము.. "
 అంటూ సౌమ్యతో పాటు దుర్గ బయటపడింది. పది నిమిషాల తర్వాత ఎవరూ లేని చోటు చూసుకుని ఓ చెట్టు కింద నిలబడ్డారు ఇద్దరూ. ఏడుస్తూ, సౌమ్య చెప్పిన విషయం వినేసరికి దుర్గ తల తిరిగిపోయింది. చాలా రోజులుగా సౌమ్య ముభావంగా ఉంటూ సరిగా మాట్లాడకపోవడం, పరీక్షల్లో మార్కులు కూడా తగ్గడం.. వీటన్నింటికీ కారణం ఇదన్న మాట!
  రాధాకృష్ణ ఆ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. ఇదే సంవత్సరం మొదట్లో వేరే కాలేజీ నుండి వచ్చి జాయిన్ అయ్యాడు. పాఠాలు బాగానే చెప్తాడు. ఎక్కువగా మాట్లాడడు ఎవరితో. డీసెంట్ గా కనిపిస్తాడు. అందరూ మంచివాడు అనుకునే ఈ అధ్యాపకుడి నైజం  ఇదా!!
" ఫిజిక్స్ సార్ ను చూస్తేనే భయమేస్తోంది దుర్గా. మొదటి రెండు నెలలు బాగానే ఉండేవాడు. కానీ మెల్లిగా అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించ సాగింది నాకు. కూర్చుని రాసుకుంటుంటే వెనక వీపు మీద చేయి వేయడం, భుజం మీద చేతులు వేసి మీదకు వంగి ఏదో డౌట్ క్లియర్ చేస్తున్నట్టు మాట్లాడడం...! మొదట్లో ఏదో పెద్దవాడులే అనుకొని పట్టించుకోకూడదనుకున్నా . కానీ రానురానూ ఆ చేష్టలు ఎక్కువైపోయాయి. పక్కన ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయం నన్ను మరీ బాధించసాగింది. "
 సౌమ్య చెబుతుంటే విస్తుబోయి వింటూ నిలబడిపోయింది దుర్గ. కన్నీళ్లు తుడుచుకుంటూ కొనసాగించింది సౌమ్య.
" నేను గమనించాను, నాతో మాత్రమే అలా ప్రవర్తిస్తున్న సంగతి. మిగతా వాళ్లంతా సార్ తో నవ్వుకుంటూ బాగా మాట్లాడుతుంటారు. ఎందుకు నాతోనే ఎందుకలా చేస్తున్నాడు! నాకే ఎందుకు ఇలా జరుగుతోంది!"
 ఏడుపు ఆపుకోలేక దుర్గ భుజం మీద తలవాల్చేసింది సౌమ్య .
"... ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఈ కొద్ది రోజులు ఎలాగోలా భరిద్దామనుకున్నా.నిన్న ఫిజిక్స్ క్లాస్ అయ్యాక బయటికి వస్తుంటే నన్ను దగ్గరికి రమ్మన్నాడు. ఏమిటీ, మార్కులు ఇంత తక్కువగా వచ్చాయి? అర్థం కావటం లేదా? రేపు ప్రాక్టికల్స్ అయ్యాక కాసేపు ఉండిపో. డౌట్స్ క్లియర్ చేస్తాను. అన్నాడు. మౌనంగా తలూపి వచ్చేశా. ఈరోజు ల్యాబ్ నుండి త్వరగా బయటపడదామని వచ్చేస్తున్నా. అందరూ బయటికి వెళ్లిపోయారు. ఈ లోపే వెనకగా వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని..."
 ఆపై మాటలు రాక వెక్కివెక్కి ఏడవసాగింది సౌమ్య. తనని ఎలా ఓదార్చాలో తెలియక దుర్గ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని  అనునయించసాగింది. రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.
" సౌమ్యా, వాడలా ప్రవర్తిస్తుంటే ఇన్నాళ్లుగా భరించడం పొరపాటు. ఇంకా చావాలనుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. ఇక చాలు, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాటివ్వాలి.. "
 చేయి చాపింది దుర్గ.
" లేదులే దుర్గా, ఏదో తట్టుకోలేక ఆ క్షణంలో అలా చేశాను గానీ ఇప్పుడు అనిపిస్తోంది నాకూ, అదెంత  పొరపాటో.. ప్రామిస్, ఇక ఎప్పటికీ అలా చేయను.."
దుర్గ చేతిలో చేయి వేసింది సౌమ్య.
                          ********
  మర్నాడు లంచ్ బ్రేక్ లో దుర్గ ఆలోచన ప్రకారం ఇద్దరూ వెళ్లి ఇంగ్లీష్ మేడం సాధన గారిని కలిశారు. జరిగిందంతా పూస గుచ్చినట్టు వివరించింది దుర్గ.
"వ్వాట్! రాధాకృష్ణ సర్ ఇలా చేస్తున్నాడా!అన్బిలీవబుల్. చూడ్డానికి ఎంతో మర్యాదస్తుడిలా కనిపిస్తాడే!.. "
 అంటూ సౌమ్య కేసి తిరిగి,
" ఇలా జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సమస్య చెప్పుకోవాలి. అలాకాక చచ్చిపోదామనుకుంటే ఎలా? తప్పు చేసింది అతనైతే శిక్ష నీవు వేసుకుంటావా! అలా మరికొందరు అమ్మాయిల్ని అతను టార్గెట్ చేయడా?"
 సున్నితంగానే మందలించింది సౌమ్యను.
"..పోతే, నీతోనే ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడన్నావు కదా...నెమ్మదిగా, కూల్ గా ఉండేవాళ్లు ఏమీ అనలేరనీ, ఎవరితోనూ చెప్పుకోలేరని ఇలాంటి వాళ్ళ ధైర్యం. అది నువ్వు బాగానే నిరూపించావు. కానీ దుర్గ పసిగట్టడం చాలా మంచిదయింది. సరే, దీని గురించి ఆలోచిస్తాను. మీరు క్లాస్ కి వెళ్ళండి"
 అని చెప్పి ఇద్దరినీ పంపించేసింది.
                                 ***********
 మరుసటి రోజు---
 సాధన చెప్పిందంతా విన్న ప్రిన్సిపల్ సుదేష్ణాదేవి కోపానికి అంతులేకపోయింది. కానీ,అంతలోనే ఇది సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం అన్న విచక్షణతో వెంటనే మరో ఇద్దరు లేడీ లెక్చరర్స్ ని, సివిక్స్ లెక్చరర్ శివశంకర్ ను కూడా పిలిపించి వాళ్లతో కూడా సంప్రదించి, వాళ్లందరికీ కొన్ని పనులు అప్పగించి పంపించేసి ఆలోచనలో పడింది.
   తను ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో దగ్గరి బంధువు ఒకతను  ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన భుజాలపై చేతులు వేయడం, బుగ్గల్ని సాగదీయడం లాంటి పనులు చేసేవాడు. రెండు మూడు సార్లు చూసి, కంపరంగా అనిపించి అమ్మతో చెప్పేసింది. యధాలాపంగా ఓరోజు ఇంటికి వచ్చిన అతన్ని పట్టుకుని అమ్మ చెడామడా దులిపేసింది. అంతే! అతను మళ్లీ ఇంటి గడప తొక్కితే ఒట్టు! ఆరోజు నుండీ అతనికీ, తమ ఇంటికీ సంబంధం పూర్తిగా తెగిపోయింది. అలాంటి ప్రబుద్ధులు, వికృత చేష్టల మృగాళ్లు అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటారన్నమాట !! అనుకుంటూ తల పంకించింది సుధేష్ణాదేవి.
                                 **********
   రెండు రోజుల వ్యవధి తీసుకుని పని పూర్తి చేసుకుని లెక్చరర్స్ అంతా వచ్చి కూర్చున్నారు ప్రిన్సిపల్ ఎదురుగా. వాళ్ళు చెప్పిన సమాచారం వినగానే సుదేష్ణాదేవి కాసేపు నిర్వికారంగా అయిపోయింది. ఇంతవరకూ సౌమ్య ఒక్కతే బాధితురాలు అనుకుంటున్నారు. కానీ, సైన్స్ గ్రూపుల వారందరినీ కూర్చోబెట్టి అనునయంగా వారిని ప్రశ్నించేసరికి ధైర్యం వచ్చి నోరు తెరిచారట! మొత్తం మీద బైపీసీలో ముగ్గురు, ఎంపీసీలో మరో ఇద్దరు ఇలాంటి చేదు అనుభవాలే తామూ ఎదుర్కొంటున్నట్లు బయటపడ్డారు. చెబితే అంతా తమను అదోలా చూస్తారని, ఇంట్లో తెలిస్తే కాలేజీ మాన్పించేస్తారని భయపడి  మిన్నకుండి పోయామని వాళ్ళనగానే విస్తుబోవడం  లెక్చరర్ల వంతయిందట!! ఆలోచిస్తే...ఇంకా బయటపడని వాళ్ళూ ఉండే ఉంటారని చెప్పారు లెక్చరర్స్.
     కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీలలిత ఎంక్వయిరీలో అతని వ్యక్తిగత సమాచారం కొంతవరకు తెలిసింది. నలభై దాటిన  రాధాకృష్ణ అనే ఈ అధ్యాపకునికి పెళ్లయింది. భార్య గృహిణి. పెద్దగా చదువుకోలేదు. ఇద్దరు కొడుకులు హైస్కూల్లో చదువుతున్నారు.
  తరువాత శివశంకర్ గతంలో రాధాకృష్ణ పని చేసిన కాలేజీ నుండి సేకరించిన సమాచారం తెలిపాడు. ఆ కాలేజీ కో ఎడ్యుకేషన్ . అక్కడ కూడా అమ్మాయిల నుండి ఇలాంటి ఆరోపణలు ప్రిన్సిపాల్ కు అందాయి. బ్రతిమాలి బామాలి పై అధికారుల దాకా పోకుండా చేసుకున్నాడు. అందుకే రెండేళ్ల గడువు దాటిపోగానే ఎలాగోలా ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికొచ్చి పడ్డాడు. కానీ కుక్క తోక వంకర పోయేది కాదు గదా! అలాగే ఇతని నైజమూ మారలేదన్నమాట! అనుకుంది సుదేష్ణాదేవి. వెంటనే,ఇక ఉపేక్షించడంలో అర్థం లేదు అని స్థిరంగా నిశ్చయించుకున్నారామె. గంట తర్వాత మళ్లీ కలుద్దామని చెప్పి వాళ్లను పంపించేసి, అటెండర్ తో చెప్పి రాధాకృష్ణను పిలిపించింది.ఏ ఉపోద్ఘాతమూ లేకుండా సూటిగానే విషయంలోకి వెళ్లారామె.
" మీ ప్రవర్తన వల్ల స్టూడెంట్స్ ఎంత మానసిక వేదనకు లోనవుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతోందా!గురువు తండ్రితో సమానమంటారు.
 మీ ఈ ప్రవర్తనకు మీ సంజాయిషీ ఏమిటి? "
"మేడం,వాళ్ళు చిన్న పిల్లలు. నన్ను అపార్థం చేసుకున్నారు. నేనలాంటి వాణ్ణి కాదు. ఏదో చిన్న వాళ్ళని చనువుకొద్దీ చేయి పట్టుకుంటే ఇలా వక్రీకరిస్తే ఎలా మేడం ? "
 దిగ్గున లేచింది సుదేష్ణాదేవి.
"ఆపండి, సీనియర్ ఇంటర్ చదువుతున్న టీనేజీ ఆడపిల్లలండీ వాళ్ళు. ఏది గుడ్ టచ్చో, ఏది బాడ్ టచ్చో తెలీని పసిపాపల వయసా వాళ్లది? నీ చేష్టల వల్ల ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది, తెలుసా నీకు?.. "
" సారీ మేడం, క్షమించండి ... "
" సారీతో సమసిపోయే సమస్య కాదిది. ఇక మీరు వెళ్ళవచ్చు.. "
మౌనంగా లేచి నిల్చున్నాడతను.
                          **********
  మరుదినమే స్టాఫ్ మీటింగ్ పెట్టి విషయం చర్చలో పెట్టారు సుదేష్ణాదేవి. అందరి అభిప్రాయం విన్నాక అందరి సమ్మతితో ఓ నిర్ణయం తీసుకుని ఎవరు ఏం చేయాలో చెప్పి పంపించేశారు.
   మరుసటి రోజు మధ్యాహ్నంకల్లా సైన్స్ స్టూడెంట్స్ రాధాకృష్ణ సర్ మీద కంప్లైంట్ రాసి "ఈ సార్ మాకొద్దు" అంటూ సంతకాలు చేశారు. తానూ ప్రిన్సిపల్ గా మరో కంప్లైంట్ రాసి ఆ రోజే పై అధికారులకు పంపించేశారు  సుదేష్ణాదేవి గారు.
   వారం రోజుల్లో ఎంక్వయిరీ కమిటీ వచ్చి విచారించింది. అంతా నిజమేనని తేల్చి రిపోర్ట్ రాసుకొని వెళ్లారు. రెండు రోజుల్లో రాధాకృష్ణకు సస్పెన్షన్  ఆర్డర్స్ చేతికి అందాయి. రెండు వారాల తర్వాత దూర ప్రాంతంలో మారుమూలనున్న ఓ బాలుర జూనియర్ కాలేజీకి బదిలీ జరిగిపోయింది.
                        *************
   ఆరోజు అసెంబ్లీ హాల్లో స్టాఫ్, స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ నూ సమావేశపరిచి అందరినీ ఉద్దేశిస్తూ ప్రసంగించారు సుదేష్ణాదేవి గారు.
" ఇలాంటి సంఘటనలు కాలేజీలో జరగడం చాలా బాధాకరం. కానీ, ఒక్క విషయం అందరం ఆలోచించాలి. సమస్యలు ఎలాంటివైనా సరే ఎప్పుడైనా,ఎక్కడైనా, ఎవరివల్లనైనా రావచ్చు. అలాంటప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ పిరికిగా భయపడకూడదు. తనకు తానుగా పరిష్కరించుకో లేనప్పుడు పక్కవారి సాయం తీసుకోవడంలో తప్పులేదు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. తప్పు నీదేనని మందలించడం, చదువు మానిపించడం పరిష్కారం కానే కాదు. వాళ్లకు ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టాలి. అమ్మాయిలందరికీ మరోసారి మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఇలాంటి సమస్య ఏదైనా మీకు ఎదురైనప్పుడు మీలో మీరే కుమిలిపోకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలి. ఈ సందర్భంగా దుర్గ అనే స్టూడెంట్ ను నేను మనసారా అభినందిస్తున్నాను. స్నేహితురాలి మనస్థితిని గమనించిన ఆ అమ్మాయి వయసుకు మించిన పరిణతి చూపించి సౌమ్యనే గాక మరెందరినో ఈ సమస్య నుండి బయట పడేయగలిగింది. ఆ అమ్మాయికి నా మనఃపూర్వక అభినందనలు. ఇంకా స్టూడెంట్స్ తమ వ్యక్తిగత సమస్యల్ని తనతో పంచుకునేలా వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకున్న సాధన మేడం గారినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను... "
హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
                          **********
" థాంక్యూ వెరీమచ్ దుర్గా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నన్నో పెద్ద ఉపద్రవం నుండి బయట పడేశావు.. "
 సమావేశం అయిపోయాక దుర్గ చేతులు పట్టుకుంటూ ఆర్ద్రంగా అంది సౌమ్య.
"ఛ! ఊరుకోవే, సరేగానీ, ఇప్పటికైనా పిరికితనం వదులుకుంటావా లేదా...!?"
" ఇంకానా! నీలా పదిమందికి ధైర్యం చెప్పే శక్తి వచ్చింది తెలుసా..? "
 ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని గలగలా నవ్వుకుంటూ గేటు దాటి ముందుకు కదిలారు.
              ****************************
  
   
    



  

Wednesday, April 9, 2025

పుట్టిల్లు...కథ...

🌺                                  ~~ యం.ధరిత్రీ దేవి ~~

  ఆరోజు అలివేలమ్మ పెద్దకూతురు అనసూయ కొడుకు నామకరణం. ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టాడు. అందుకని మరీ ప్రత్యేకం...ముఖ్యంగా అలివేలమ్మకు.
     బంధుమిత్రుల సమక్షంలో కార్యక్రమం పూర్తయి భోజనాలయేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. మూడు గంటల తర్వాత... అనసూయ, ప్రభాకరం ఇద్దరూ పీటల మీద కూర్చున్నారు. సుభద్ర ఇద్దరికీ బొట్టు పెట్టి కొత్త బట్టలు పెట్టింది. ఇద్దరూ వెళ్లి కట్టుకుని, తయారై వచ్చారు. ఇద్దరికీ ఒడి బియ్యం పెట్టాక ముత్తయిదువలందరూ ఆశీర్వదించి హారతి పాట పాడి ముగించారు. సాయంత్రానికంతా సందడి సద్దుమణిగింది. 
     అలివేలమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, పెద్ద కొడుకు నారాయణరెడ్డి భార్యే సుభద్ర.పెళ్లయి ఎనిమిదేళ్లయింది . ఆమె కోడలిగా ఇంట అడుగు పెట్టాక  నాలుగేళ్ల వ్యవధిలో మరిదికి, ఆడపడుచుకూ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరూ సంవత్సరం తిరిగేసరికల్లా బిడ్డల్ని ఎత్తుకున్నారు. కానీ అదేమిటో... సుభద్ర కడుపు మాత్రం పండలేదు. అందరు  దేవుళ్లకూ మొక్కుకుంది. పూజలు,  నోములూ నోచింది. డాక్టర్ల దగ్గరకెళ్ళి  ఇద్దరూ  చూపించుకున్నారు. ఏ లోపం లేదన్నారు. ఎదురు చూడాలి...అంతే.. అనుకున్నారు ఇద్దరూ. మనసులో ఏమీ పెట్టుకోక, ఇంట్లో తిరుగాడే పిల్లలతోనే అచ్చట ముచ్చటా తీర్చుకుంటూ కాలం గడుపుతూ ఉంది  సుభద్ర. 
     కానీ... అమ్మలక్కలూరుకుంటారా...! 
" ఏమిటో పాపం! సుభద్ర ! ఇన్నేళ్లయినా ఇంకా నీళ్లోసుకోలేదు... దేవుడింకా దయ తల్చలేదు మరి!!"
 సానుభూతులు చూపిస్తున్నట్టే ఉంటుంది. సుభద్రకు ముల్లు  గుచ్చినట్లుంటుంది. వినీ వినీ విసుగొచ్చి వాళ్ల మాటలు పట్టించుకోవడం మానేసింది... కానీ.. బయటి వాళ్ల పోరు బయటే  ఉంటుంది.. ఇంట్లో అత్తగారంటూ ఒకరున్నారాయె ! ఆవిడ ఎత్తి పొడుపులు, ఈసడింపులు ఈ మధ్య భరించడం ఆమె శక్యం గావడంలేదు. భర్త మంచివాడే. తనంటే ఇష్టమే. కానీ ఎప్పుడూ తల్లి కనుసన్నల్లోనే ! పెళ్లయ్యాక భార్య అన్నది కూడా మనిషేననీ, ఆమెకూ ఇష్టాఇష్టాలుంటాయనీ మనసుకు పట్టని వాడు. స్వయంగా ఏ నిర్ణయాలు తీసుకోలేని అశక్తుడై అన్నీ తల్లికే వదిలేస్తుంటాడు. తల్లిని గౌరవించడం మంచిదే. కానీ మరీ సొంత అభిప్రాయమన్నదే లేకపోవడం సుభద్రకు బాధ కలిగించే విషయం...
      సుభద్ర ఏడెనిమిదేళ్ళ వయసులోనే తల్లిని కోల్పోయింది. తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఆమెకో  కొడుకు. పెళ్లయిపోయింది. ఉన్న ఊర్లోనే ఉన్న పొలం చూసుకుంటూ ఉంటాడు. భార్య, ఇద్దరు పిల్లలు. బొటాబొటీగా వచ్చే ఆదాయం ! ఇటీవలే  సవతి తల్లి కూడా చనిపోయింది...అక్కడ పరిస్థితులు అలా ఉంటే...సుభద్రకు పుట్టింటి నుండి  పెట్టుబోతలు, జరుగుబాట్లు ఎలా సాగుతాయి ! చిన్న కోడలు కలిగినింటి  నుండి వచ్చింది. అనుక్షణం ఆమెతో పోలుస్తూ, పెద్ద కోడల్ని ఎద్దేవా చేయడం... సూటిపోటీ మాటలనడం...! వయసుకు పెద్దదే గానీ, పెద్దరికం ఏమాత్రం లేని ఆడది! అయినా.. అన్నీ చేయాల్సింది మాత్రం సుభద్రే ! చిన్న కోడలు ఎప్పుడూ పుట్టింట్లోనే ! ఏడాదిలో ఏ రెణ్ణెల్లో అత్తారింట్లో గడిపేస్తూ ఉంటుంది. ఏదో చేసే వాళ్ళకే మొట్టికాయలన్నట్టు... సుభద్రకు అత్తగారి పోట్లు తప్పడం లేదు. 
                  **            **          **
  కార్యక్రమాలన్నీ అయిపోయాయి. మరుసటి రోజు, 
" వెళ్లొస్తాం అత్తా, వస్తాం బావా , "
 ప్రభాకరం భార్యాపిల్లలతో తన ఊరికి బయలుదేరుతూ అందరికీ చెప్పాడు. సుభద్ర వైపుతిరిగి, 
" వెళ్ళొస్తామమ్మా  సుభద్రా.. "
 అంటూ ఆప్యాయంగా చూస్తూ, 
"...ఏమిటో బావా, చెల్లెమ్మను తీసుకుని మా ఇంటికి రమ్మని ఎన్నిసార్లు చెప్పినా ఇంతవరకూ  రాలేదు నువ్వు.. "
నారాయణతో నిష్టూరంగా అన్నాడు. మౌనమే నారాయణ సమాధానమైంది. చిన్నల్లుడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు. పెద్దగా మాట్లాడే స్వభావం కాదు. ప్రభాకరమేమో మంచి మాటకారి. 
    ప్రభాకరానికి సుభద్ర అంటే లోలోపల ఏదో తెలియని ఆపేక్ష. అతనికి అక్కాచెల్లెళ్లు లేరు. సుభద్ర కంటే ముందుగానే ఈఇంటి అల్లుడైనాడతను.తర్వాత కొన్ని నెలలకే అలివేలమ్మ పెద్దకొడుకు నారాయణరెడ్డికి పెళ్లయి సుభద్ర ఆఇంటి పెద్దకోడలయ్యింది. అప్పట్నుంచీ గమనిస్తున్నాడామెను...తను ముగ్గురు పిల్లల తండ్రయ్యాడు.. ప్రతీసారి తనకేకాకుండా చిన్నల్లుడికీ, చిన్నకూతురికీ అలివేలమ్మ ముత్తయిదువు కానందుకు సుభద్రే తన చేతుల్తో బట్టలు పెట్టడం,ఇంటి అల్లుళ్లుగా ఇతర అన్ని మర్యాదలూ చేయడం చూస్తున్నాడు. ఎప్పుడూ ఆమె తన పుట్టింటికి వెళ్లడం తను చూడలేదు ప్రభాకరం. ఇంట్లో బండెడు చాకిరీ ఆమె నెత్తిమీదే!అంత చేస్తున్నా ఏమాత్రం గుర్తింపుకు నోచుకోని వైనం కూడా అతని దృష్టికి రాకపోలేదు. తన పెళ్లయి, ఇంటికి అల్లుడైన కొద్దిరోజుల్లోనే అత్తగారి నైజం అతను గ్రహించాడు. ఏంచేయగలడు ! తనేమో ఇంటి అల్లుడు.ఇంటి కోడలి గురించి అత్తగారి వద్ద ప్రస్తావించలేడు గదా !!
    మరోసారి అత్తగారికి చెప్తూ కాళ్లకు దండం పెట్టి, సెలవు తీసుకున్నాడు.తర్వాత కాసేపటికి చిన్నకూతురు,అల్లుడు, టౌన్లో పనుందంటూ చిన్నకొడుకూ వాళ్ళవాళ్ళ కుటుంబాలతో వెళ్లిపోయారు. ఇంట్లో ముగ్గురే మిగిలారు. 
                 **            **           **
    రెండేళ్లు పరుగులు తీశాయి. అతిమామూలుగా సాగిపోతున్న సుభద్ర దినచర్యలో ఏదో చిన్న మార్పు గోచరించింది. వారం, పదిరోజులుగా ఒంట్లో నలతగా ఉంటూ తిండి సయించక ఇబ్బంది పడుతూ ఉంది. రెండు వారాలు గడిచినా తగ్గకపోవడంతో ఎప్పుడూ చూపించుకునే డాక్టరమ్మ దగ్గరికెళ్లింది....
" నిజమా ! కలగాని కంటున్నానా...!"
అన్ని వివరాలూ కనుక్కుని, పరీక్షించి డాక్టర్ చెప్పిన విషయం విని ఉబ్బి తబ్బిబ్బయిపోయింది సుభద్ర. అసలు ఈమాట వినడానికి నోచుకుంటానా అని ఎన్నోసార్లు అనుకుంటూ కుమిలిపోయిన ఆమె హృదయం ఆనందంతో పరవళ్లు తొక్కింది. వెంటనే వెళ్లి భర్తతో తన సంతోషం పంచుకోవడం కోసం ఆమె మనసు పరుగులు తీసింది. శుభవార్త విన్న నారాయణ సుభద్ర కళ్ళనుండి ధారలుగా కారుతున్న కన్నీళ్లను తుడుస్తూ,  
" మనం ఎదురుచూసిన రోజు వచ్చింది. ఇక కన్నీళ్ళన్నవి ఉండకూడదు..."
అంటూ దగ్గరకు తీసుకున్నాడు. 
              **             **           **
   విషయం అందరికీ తెలిసింది. అలివేలమ్మలో ఆశించినంత ఆనందమయితే కనిపించలేదు. బహుశా... ఆమె మనవళ్ళు, మనవరాళ్ల  ముచ్చట అప్పటికే తీరిపోయి ఉండడం కారణం కావచ్చునేమో ! మరోవైపు...పెద్దకొడుకు...ఇంటి భారమంతా మోస్తున్న వాడు.. ఇన్నేళ్లకి తండ్రి కాబోతున్నాడని తెలిసి ఓవైపు సంబరపడినా... కోడలి వల్ల వాడికి  ఏముచ్చట్లూ తీరవే అన్నది ఓ మూల ఆమె బాధ.
    ఐదవనెల వచ్చేసింది... సీమంతం చేయవలసిన సమయం! అత్తగారి నసుగుడు మొదలైంది. సుభద్ర ఏమి చేయగలదు! తండ్రిని చిన్నప్పటినుంచీ చూస్తోంది. ఏ బాధ్యతలూ  మోసుకోని మనిషి! తమ్ముణ్ణి నోరు విడిచి అడగలేదు కదా, నాకు సీమంతం చేయమని ! తనకు తెలిసి పుట్టింటి వారే కాదు... అత్తింటి వారూ కోడళ్ళకు సీమంతాలు చేయడం చూసింది...అత్తకు ఆ విషయం తెలియదా ఏమి ! కానీ.. తన అత్తకు ఆ  ఆలోచన రాకపోవడం తన ఖర్మ ! ఆమె నుంచి అంత ఆశించడమూ అత్యాశేలే... అనుకుంది తనలో తాను.
    చూస్తుండగానే తొమ్మిదోనెల  నెల ప్రవేశించింది. నిండుగా ఇంట్లో తిరుగుతున్న భార్యను చూస్తున్న నారాయణకు ఎంతో తృప్తిగా అనిపిస్తున్నా... ఏదో బాధ కూడా ఓవైపు తొలిచేయసాగింది. చిన్నప్పటినుంచీ తల్లికి ఎన్నడూ ఎదురు చెప్పే అలవాటులేదతనికి. పైగా... బొత్తిగా నోట్లో నాలుక లేని మనిషి ! 
      ఖర్చుకు వెనుకాడే రకం కాదు.  వాస్తవానికి...  భార్యను కాన్పుకు ఎక్కడికీ పంపడం ఇష్టం లేదతనికి. మొదటిసారి...అదీ ఎన్నో ఏళ్ళకి ! తానే దగ్గరుండి చూసుకోవడం అవసరం కూడా. కానీ...తల్లి ముభావం, ప్రవర్తన అతన్ని ఇరకాటంలో పడేస్తోంది. కాన్పులు, పురుళ్ళు అంటే పూర్తిగా ఆడవాళ్ళతో ముడివడిఉన్న వ్యవహారాలు మరి ! కొద్దిరోజులుగా రేయింబవళ్లు ఇదే ఆలోచిస్తూ సతమతమౌతూ ఉన్నాడు. 
     ఆసాయంత్రం...ఇంట్లో పనిలో ఉన్న సుభద్రకు బయట పొరుగింటి వాళ్ళతో అత్తగారంటున్న మాటలు ఎంత వద్దనుకున్నా వచ్చి చెవిలో పడ్డాయి. 
" ఏమిటోనమ్మా.. ! తొలికాన్పు పుట్టింట్లో పురుడు పోసుకోవడం ఆనవాయితీ...మాకా అదృష్టంఎక్కడిదీ!
మాకు తప్పేలా లేదు..."
ఆవిడ ఈసడింపు మాటలు అలవాటైనవైనా ఎందుకో ఈసారి మనసు చివుక్కుమంది సుభద్రకు. ఏదైతే అదయింది...అనుకుంటూ...ఆరాత్రి భర్త ఫోన్ తీసుకుని తమ్ముడితో మాట్లాడింది. 
"" కృష్ణా, నాన్న ఉన్నాడా? "
" లేడక్కా, పక్క ఊర్లో జాతర...వెళ్ళాడు.."
".............. "
" చెప్పక్కా "
తటపటాయిస్తూ, 
" ఏమిలేదు...నాకు తొమ్మిదోనెల వచ్చేసింది... "
".............."
" అదే...కాన్పుకు మనింటికి రావాలనుకుంటున్నా... "
ఆరెండు మాటలూ అనడానికి ఎక్కడలేని శక్తి పుంజుకోవాల్సి వచ్చింది సుభద్రకు...ఓవిధంగా మనసు చంపుకుని ! నవనాడులూ కుంగిపోయాయి. 
"ఔనక్కా...నేనూ అదే అనుకుంటున్నా...వారం పదిరోజుల్లో వీలు చూసుకుని వస్తా, నిన్ను పిల్చుకురావడానికి... "
ఊహించని జవాబు ! ఒక్కసారిగా నోట మాట రాలేదు సుభద్రకు ! 
"...ఒక్క నిమిషం... "
"..........."
"..ఆ...వచ్చే సోమవారం అక్కా..మంచిరోజు...వస్తా. రెడీగా ఉండు "
ఫోన్ పెట్టేశాడు. మూతి తిప్పుకుంది అలివేలమ్మ. తల్లి గొణుగుడు  నుంచి తాత్కాలికంగా కాస్త ఉపశమనం లభించినట్లయింది నారాయణకు. ఆరోజు కోసం ఎదురు చూడసాగింది సుభద్ర.
                **               **             **
  రానే వచ్చింది ఆరోజు.  ఉదయం తొందరగా లేచి, పనులన్నీ ముగించుకుంది. టిఫిన్ అయ్యాక, మధ్యాహ్నానికి వంట కూడా చేసేసింది. రాత్రే  బట్టలు సర్దేసుకుంది. పది  దాటింది. తమ్ముడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది.  భార్యలో  అంత సంతోషాన్ని ఎన్నడూ చూడని నారాయణ కూడా ఆమెను చూస్తూ సంబరపడ్డాడు.పన్నెండు దాటింది...ఒంటిగంట కూడా దాటింది. తమ్ముడు రాలేదు. సుభద్ర మొహంలో నీలినీడలు కమ్ముకున్నాయి. అంతా భోంచేశారు. సుభద్ర కూడా ఏదో తిన్నాననిపించి నీరసంగా పక్క మీద వాలిపోయింది. నాలుగు దాటుతుండగా ఫోన్ రింగయింది. దిగ్గున లేచింది సుభద్ర. వాడే...!తమ్ముడే...అనుకుంటూ..! నారాయణ ఫోన్ తీశాడు.
" హలో,  కృష్ణా.. "
" ఆ, బావా... "
"...చెప్పు "
"... మేము హాస్పిటల్ లో ఉన్నాము. మా మామకు.. అదే... రాజీ వాళ్ళ నాన్నకు హార్ట్ ఎటాక్! ఉదయం ఫోన్ వచ్చింది. అందరం వచ్చేశాం... మీరు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారని ఫోన్ చేస్తున్నా...అక్కకు కూడా  చెప్పు..."
ఫోన్ పెట్టేశాడు... మళ్లీ ఎప్పుడు వచ్చేది చెప్పలేదు. ఆ పరిస్థితుల్లో తాను అడగడం బాగుంటుందా ! నారాయణ సందిగ్ధం ! వాకిలి వద్ద నక్కి అంతా వింటున్న అలివేలమ్మ, 
" అనుకుంటూనే ఉన్నా.. అనుకున్నంతా అయింది..."
గొణుగుడు  మొదలైంది మళ్ళీ...ఉత్సాహంగా లేచిన సుభద్ర ఒక్కసారిగా మంచం మీద కూలబడిపోయింది. ఆమె వద్దకు రాబోయిన నారాయణకు ఇంటి ముందు ఆగిన ఆటో కనిపించింది. శబ్దం విని అలివేలమ్మ బయటకు తొంగి చూసింది. ఇద్దరికీ పెద్దల్లుడు ప్రభాకరం, అనసూయ ఆటో దిగుతూ కనిపించారు.
" ఇప్పుడెందుకొస్తున్నారబ్బా!"
 అనుకున్నారిద్దరూ వాళ్లను చూడగానే...
" బావా,  ఇంట్లోనే ఉన్నావా... మంచిదే."
అంటూ ప్రభాకరం లోపలికి వచ్చాడు. ఐదు నిమిషాల తర్వాత మంచినీళ్లు తాగుతూ, 
" ఏమీ లేదు బావా, ఇప్పుడిలా ఎందుకొచ్చామా... అనుకుంటున్నారు కదూ.. ! మరేమీ లేదు బావా మీరు అనుమతిస్తే సుభద్రను కాన్పుకు  మాఇంటికి పిల్చుకెళ్లాలనుకుంటున్నాము..."
అంటూ అత్తగారి  వైపు చూశాడు. ఆవిడ ఒక్కసారిగా వినకూడని మాటేదో విన్నట్లు మొహం పెట్టింది. నారాయణకు అతను అంటున్నదేమిటో వెంటనే అర్థం కాలేదు. అలివేలమ్మ తేరుకుని, 
" అదేంటయ్యా, మీరు పిల్చుకెళ్లడమేమిటి ! "
అంది ప్రశ్నార్థకంగా. 
" ఏమత్తా, నాకా అర్హత లేదా ! నన్ను అన్నా అని పిలుస్తుంది. నాకు చెల్లెలే  కదా మరి! అల్లుడంటే మర్యాదలు, పెట్టుబోతలూ స్వీకరించేవాడు మాత్రమేనా ! ఎన్నోసార్లు ఆమె చేత్తో నాకు కానుకలు అందించింది. ఆమెకీమాత్రం నేను చేయడం కూడదా!ఏమత్తా !"
".............."
 తనకూ, తన బిడ్డలకు, అల్లుళ్లకూ,వాళ్ళ  పిల్లలకూ కోడలు చేయాలి... కోడలిదాకా వచ్చేసరికి... మాకేం సంబంధం? పుట్టింటి వాళ్ళు కదా చూసుకోవాలి అవన్నీ...! అనే బాపతు ఆవిడ ! 
"...అది సంప్రదాయం కదా అనొచ్చు మీరు... నిజమే.. కానీ..అదే సంప్రదాయం కోడలికి ఎందుకు వర్తించదు !అల్లుడు, కోడలు...ఇద్దరూ పరాయింటి నుంచి వచ్చినవారే...ఈ బేధభావమెందుకు? "
"అవునమ్మా, నాతో చాలాసార్లు అన్నారీయన...సుభద్రకు కాన్పు మనమే చేద్దాం అనసూయా.. అని.. వదినకు మాత్రం ఎవరున్నారు!" 
 అనసూయ తల్లి వైపు చూస్తూ అంది.
" నువ్వుండవే,   అది కాదు బాబూ, తొలి కాన్పు పుట్టింట్లో చేయడం ఆనవాయితీ కదా అని..."
" చెల్లెలికి అన్న ఇల్లు పుట్టిల్లు అవదా అత్తా ! చెల్లెలి చేత అన్నీ పెట్టించుకోవడమేనా ఈ అన్న  పని! ఈ చెల్లెలికి నేనేమీ ఇవ్వకూడదా! చేయకూడదా!ఏమత్తా! అల్లుడు మర్యాదలందుకోవడానికీ...అదే ఇంటి కోడలు అందరికీ చాకిరీ  చేయడానికేనంటావా ! అయినా అత్తా, పుట్టిల్లు అంటే పుట్టి పెరిగిన ఇల్లే అవాలా!... ప్రేమ, అభిమానం ఉన్నచోటు ఏదైనా అది ఆడపిల్లకు పుట్టిల్లే అవుతుందత్తా.. అయినా, రక్తం పంచుకు పుడితేనే అన్నాచెల్లెళ్లా! నోరారా నన్ను అన్నా అని పిలుస్తుంది, నా ఇల్లు తనకు పుట్టిల్లు కాకూడదా!? ఏమత్తా!"
మధ్యలోనే అడ్డుకొని అన్నాడు ప్రభాకరం.అలివేలమ్మ ఇంకేం మాట్లాడగలదు !!
" ఏం బావా, చెప్పు. చెల్లెమ్మను నాతో పంపిస్తావా... "
దిగ్భ్రమ నుండి బయటపడ్డ నారాయణ, ఆలోచనలో పడిపోయాడు. కృష్ణ గుర్తొచ్చాడతనికి. అతను ఖచ్చితంగా వస్తాడా ! సందేహమే ! వచ్చినా...సుభద్ర కక్కడ ఆదరణ మనస్ఫూర్తిగా అయితే ఉండదు.  ఆతమ్ముణ్ణి నోరు తెరిచి అడిగింది సుభద్ర. కరుణాకరం బావ తనకుతానుగా భార్యతో కలిసివచ్చి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. భార్యకిప్పుడు కావలసింది ఇలాంటి మనుషులే. తన ఆసరా ఎలాగూ ఉంటుంది.ప్రసవ సమయంలో ఆడపిల్లకు తన వాళ్లంటూ ఉంటే అదో భరోసా.అయినా...కృష్ణ గురించి ఓమాట చెప్తే బాగుంటుందనిపించి, 
" అది కాదు బావా, ఈరోజు కృష్ణ వచ్చి పిల్చుకెళ్తానని చెప్పాడు. కానీ, అనుకోకుండా వాళ్ళ మామ ఆసుపత్రిలో చేరాడట ! అందుకని రాలేకపోయానని ఫోన్ చేశాడు....."
" మరేమీ పర్వాలేదులే బావా, కృష్ణకు నేను నచ్చజెప్తాను. నువ్వు మాత్రం నాకోరిక కాదనకు..."
"అలాగే బావా,తప్పకుండాతీసుకెళ్ళు..నీమాట కాదన లేను."
ఇంకా మాట్లాడితే ఆయన్ని బాధపెట్టినట్లవు తుందనుకుని సరే అన్నాడు నారాయణ.  ఏచిన్న పనైనా తల్లి అనుమతి లేనిదే చేయని నారాయణ...ఇప్పుడు కనీసం తల్లి వంక చూడనుకూడా చూడకుండా వెంటనే చెప్పేశాడు. సంతోషంతో, 
" ఈరోజు మంచిరోజు... ఇప్పుడే బయలుదేరుతాం బావా అమ్మా, సుభద్రా, పదమ్మా తయారవ్వు. అనసూయా, వెళ్ళు. చెల్లెమ్మ బట్టలవీ సర్దుకుని తీసుకురా... "
" వదినా, పద.. "
అంటూ సుభద్ర వద్దకొచ్చింది అనసూయ. సుభద్ర భర్త వైపు చూసింది. నారాయణ కళ్ళతోనే చెప్పాడు వెళ్ళమని. 
 ఆమె ఇంత ప్రేమను ఒక్కసారిగా కలలోనైనా ఊహించలేదు. ప్రభాకరం అన్నయ్యంటే ఓవిధమైన ప్రత్యేకాభిమానమైతే ఆమెకూ ఉంది. ఎన్నో ఏళ్లుగా చూస్తోంది. కల్మషమన్నది ఏకోశానా లేని మనిషి ! పరాయి మనిషన్న భావన తనకెప్పుడూ కలగలేదు. అనసూయ, తను దాదాపు ఒకే ఈడు వాళ్ళు...అదృష్టవశాత్తూ తల్లి స్వభావం రాలేదు.తనతో బాగానే ఉంటుంది. మొదట ఇక్కడికి వచ్చినప్పుడంతా తనను వాళ్ళింటికి రమ్మని పిలిచేవాడు. అత్త పడనిచ్చేది కాదు...ఇంట్లో ఇబ్బంది అంటూ. రానురానూ ఇక మానేశాడు పిలవడం. 
     అదంతా గుర్తొచ్చింది సుభద్రకు. ఈరోజు ఆప్రేమ తనను ఇంత స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తుందనుకోలేదు. తమ్ముణ్ణి నోరు తెరిచి అడిగింది. కానీ ఈ అన్న అడక్కుండానే వరమిస్తానంటున్నాడు...
" అనసూయా, నేను ఆటో తీసుకొస్తాను. తయారయ్యి రెడీగా ఉండండి.."
అని చెప్పి, నారాయణతో కలిసి బయటికి వెళ్ళాడు ప్రభాకరం. అలివేలమ్మకు ఎక్కడో ఏదో పట్టు తప్పుతున్న సంకేతాలు అందుతూ గుండెల్లో సన్నగా అలజడి మొదలై తన స్థానం కదులుతున్నట్లనిపించింది. ఈరోజు అల్లుడి ఊహించని   రాక, కోడలి ప్రవర్తన...ఒక ఎత్తయితే... తన అనుమతికై ఏమాత్రం చూడక ఏకంగా తనే నిర్ణయం తీసుకుని భార్యను వాళ్ళతో పంపించడం మరో ఎత్తయి,  ఆమెకు మింగుడు పడక నిశ్చేష్టయై చూస్తూ ఉండిపోయింది. మొట్టమొదటిసారిగా ఆమె చేతుల్లో నుండి కొడుకు జారిపోతున్నట్లు తోచిందామెకు !!
  అరగంట తర్వాత... 
ఆటో వచ్చింది. ఓ జిప్ బ్యాగు, చేతి సంచీ పట్టుకుని సుభద్ర, అనసూయ గది నుండి బయటకు వచ్చారు.
" వెళ్ళొస్తానత్తా, "
 అత్తగారి కాళ్లకు దండం పెట్టి, చెప్పేసి భర్తతో కలిసి బయట సిద్ధంగా ఉన్న ఆటో వద్దకెళ్ళింది సుభద్ర. ఎన్నో ఏళ్లుగా భర్త నుండి తను ఆశించింది ఎక్కడ మాయమైపోతుందో అన్న ఆతృతలో ఆమె కాసేపు అత్తగారిని లక్ష్యపెట్టడం  పక్కన పెట్టేసింది. దేవుడిచ్చిన అన్న, ఆడపడుచు మధ్యలో కూర్చుని, భర్తకు కళ్ళతోనే వెళ్ళొస్తానని చెప్పి చెయ్యి ఊపి, ఇరుగూ పొరుగంతా అబ్బురంగా చూస్తుండగా,  మదినిండా సంతోషం నింపుకుని,   పుట్టింటికి తరలివెళ్ళింది సుభద్ర....
                              *************
[ ప్రభాకరం లాంటి పెద్ద మనసు కలిగిన వ్యక్తులు మన సమాజంలో చాలా అరుదు. అలాంటి అన్న లందరికీ మనఃపూర్వక నమస్సులు ]