Friday, October 31, 2025

ఆ నిశీధి వేళ...!!

 


                       ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ..
                       విధివిధానము తప్పించుటకై ఎవరు సాహసించెదరూ..

   ఎన్నో ఏళ్ల నాటి పాట.. అందులోని భావం.. కాలాలతో నిమిత్తం లేకుండా ఎప్పటికీ నిలిచిఉండే పచ్చి నిజం...24.10.25 తెల్లవారుజామున కర్నూలు జిల్లా, చిన్నటేకూరు శివార్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దీనికి ప్రత్యక్ష నిదర్శనం. కారణాలు ఏవైతేనేమి.. బాధ్యులు ఎవరైతేనేమి.. 19 నిండు ప్రాణాలు ఊహకందని విధంగా సజీవదహనం కావడం ప్రతి వారిని దిగ్భ్రమకులోను గావించిన విషయం. ఎంతో జీవితం ముందు పరచుకుని, ఉజ్వల భవిష్యత్తుకై కలలు కంటున్న యువత ఎక్కువమంది ఈ దుర్ఘటనలో బలి కావడం హృదయవిదారకమే ..
  బాధ్యతారహితమైన జీవనశైలి, నిర్లక్ష్యపు ఆలోచనాధోరణి.. చనిపోయిన వారినేగాక  ఎందరిని ఎన్ని విధాలుగా జీవచ్ఛవాలుగా మార్చివేసిందో ఈ దుస్సంఘటన నిరూపిస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు. గాఢనిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టడంతో... ఏం జరిగిందో.. ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి! కొందరు తప్పించుకునేందుకు ప్రయత్నించినా.. క్షణాల్లో చుట్టుముట్టిన అగ్నికీలలు, ఊపిరి సలపనివ్వని  దట్టమైన పొగ కారణంగా..ఎక్కడివాళ్ళక్కడ ఒరిగిపోయి, కాలి మాంసపు ముద్దలుగా స్లీపర్ బెర్తుల మధ్య శవాలుగా మిగిలిపోయారట!! ఓ మృతదేహం బస్సు కిటికీ నుంచి సగభాగం బయటకు వచ్చిన స్థితిలో కనిపించిందట! కిందకి దూకే ప్రయత్నంలో జరిగిన విషాదమిది! ఓ కుటుంబంలో నలుగురు( భార్య,భర్త, కొడుకు, కూతురు ) మరణించడం హృదయవిదారకం. మంటల్లో చిక్కుకున్న సమయంలో తల్లి తన కుమార్తెను గుండెలకు హత్తుకుని అదే స్థితిలో కాలిపోయి కనిపించడం!!19 మంది మృతుల్లో అత్యధికులు 30 ఏళ్ల లోపు వారే అని సమాచారం...
    అతివేగం, మద్యం సేవించి బండి నడపడం, నిర్లక్ష్యధోరణి, ఏమవుతుందిలే అన్న బాధ్యతారహిత భావన, మరోవైపు.. ప్రమాదం గమనించినా స్వీయ రక్షణకై ఆలోచించడం.. అన్వేషిస్తే ఇలాంటి కారణాలు మదిలో మెదులుతాయి...విశ్లేషణలూ అలాగే ఉంటున్నాయి.  అలా జరిగి ఉంటే బాగుండేది...అలా చేసి ఉంటే బాగుండు... అనుకుంటాం గానీ... ఆ సమయంలో... ఆ క్షణాల్లో... దిక్కుతోచని ఆ దుస్థితిలో... వారి మానసిక స్థితి అనుభవించిన వాళ్లకే తెలుస్తుంది  అన్నది గ్రహించాలి. ఏది ఏమైనా, బస్సులో ప్రయాణించిన ఏ ఒక్కరూ ఎంతమాత్రమూ ఊహించని దుర్ఘటన ఇది. అలాగే... అర్ధరాత్రి సమయాన బైక్ మీద ప్రయాణిస్తూ ప్రమాదానికి లోనైన అతను , అతని స్నేహితుడు, బస్సు డ్రైవర్ కూడా...! ఊహించని ఘటనలు జరగడమే విధి విలాసం అంటే అనిపిస్తుంది ఇలాంటివి జరిగినప్పుడు !! ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ స్పందించి 'అయ్యో' అనుకునేలా చేసిన విషాద ఉదంతమిది....
   ఎన్నో కుటుంబాల జీవితకాల వేదన..! పూడ్చలేని లోటు..! పరిహారమందుతుంది సరే..అయినవాళ్ళతో, కుటుంబసభ్యులతో,జీవితభాగస్వాములతో కన్నబిడ్డలతో పెనవేసుకున్న ఆ బంధాలు.. వాటి మాటేమిటి!? ఆ పరిహారమన్నది కుటుంబ పరిస్థితులు కొంతవరకు సర్దుకోవడానికి ఉపకరిస్తుందేమోగానీ... కనుమరుగైపోయిన ఆ మనుషులను సజీవంగా తిరిగి కళ్లెదుట నిలపడమన్నదైతే జరగదు కదా..! 
_____________________________________________________________________________________________

Sunday, October 26, 2025

'మనసు' చెప్పేది వినాలి...


  శారీరక ఆరోగ్యం గురించి అందరికీ తెలుసు. అవగాహన ఉంటుంది ప్రతి ఒక్కరికీ. మరి మానసిక ఆరోగ్యం సంగతేంటి? రెండింటికీ సమన్వయం కుదిరితేనే మనిషి ప్రవర్తన సవ్యంగా ఉంటుంది కచ్చితంగా. మనిషి మానసిక స్థితి అన్నది ఆ వ్యక్తి ఆలోచనా ధోరణిని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అది సవ్యంగా లేకున్నచో తీవ్రమైన ఇంకా విపరీత పరిణామాలూ చోటు చేసుకుంటాయి కూడా. అలా జరుగుతున్నవే...ఈమధ్యకాలంలో వెలుగుచూస్తున్న కొన్ని దుస్సంఘటనలు, అమానుషచర్యలు , అమానవీయకృత్యాలూ. నిత్యం వార్తాపత్రికల్లో, టీవీలో కానవస్తున్న ఈ వార్తలకు కొదువ ఉండటం లేదు.
   కారణాలు ఏవైనా కానీయండి... కన్నబిడ్డల్ని గొంతు కోసి చంపడాలూ, ఉరివేసి చంపడాలు.. అనుమానపిశాచంతో భార్యను కడతేర్చడం, ఆ శవాన్ని ముక్కలుగా నరికి పలుచోట్ల పారేయడం..! మద్యపానం కోసం డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లినే హతమార్చడం.. తండ్రి ఉద్యోగం తనకు రావాలనే దురుద్దేశంతో బ్రతికుండగానే తండ్రిని చంపడం..! వగైరాలు..! ఇలా రాస్తూపోతే ఈ దురంతాలకు అంతన్నది ఉండదంటే నమ్మాలి. కొంతకాలం వరకు స్త్రీలపై హింస, హత్యలు జరగడం వినేవాళ్ళం. కానీ విచిత్రం..! ఇటీవల భార్యలు కూడా ప్రియుడన్న వాడితో కలిసి భర్తల్ని చంపుతున్నారు అన్న శోచనీయమైన  వార్తల్ని  వినాల్సివస్తోంది. మరో విషాదం! వింటేనే ఒళ్ళు జలదరిస్తుంది.. వివాహేతర  సంబంధానికి అడ్డుగా ఉన్నారన్న కారణంతో కడుపున పుట్టిన పిల్లల్ని కన్నతల్లే చంపిందన్న వార్తలు!!
   ఇదిలాగుంటే..చిన్నపిల్లలు కూడా తల్లి మందలించిందనీ, స్కూల్లో టీచర్ తిట్టిందనీ ఆత్మహత్యలట!! సెల్ ఎక్కువగా చూడొద్దు అన్నారని ఉరేసుకొని చావడాలు!! టీనేజర్స్ ప్రేమ పురాణాలయితే  కోకొల్లలు! తనను ప్రేమించడానికి నిరాకరించిందని అమ్మాయి గొంతు బ్లేడుతో కోసి చంపేశాడట ఒక ప్రబుద్ధుడు. మరొకడెమో ఆ పిల్ల ఇంట్లో దూరి, కత్తితో పొడిచి అంతమొందించాడట! 
 ఈ భయానక కృత్యాలు వినడానికే భీతి గొల్పుతుంటాయి. ఈ చర్యలకు కారణాలేమిటి? వీళ్లంతా ఇలా తయారవ్వడానికి దారితీస్తున్న పరిస్థితులు ఏమిటి? ఆ మానసిక దౌర్బల్యానికి మూలమేది? కచ్చితంగా ఇది మానసిక అనారోగ్యం అనడంలో సందేహం లేదు. మరి ఎలా బాగుపడాలి ఇలాంటి మనస్తత్వాలు? 
  ఈ చర్యలు నివారిస్తూ కాస్తలో కాస్తయినా పరిస్థితి మెరుగుపరచడానికి ఏర్పడినదే ప్రపంచ మానసిక ఆరోగ్య దినం ( world health day ). ప్రతి సంవత్సరం అక్టోబరు 10వ తేదీన ఇది జరుపబడుతున్నది. మనిషి మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సలహాలు, సూచనలు చేస్తూ తోడ్పాటు నందించడానికి చేస్తున్న చిన్న ప్రయత్నమే ఇది. ప్రస్తుత సమాజానికి ఈ దిశానిర్దేశం (counselling ) చాలా చాలా అవసరం.
   ఈ దినోత్సవం లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్య సమస్యల గురించి జనాలకు అవగాహన పెంచడం. ఆ పరిజ్ఞానాన్ని మెరుగుపరచడం... కారణాలు అన్వేషిస్తే...
* విపరీతమైన మానసిక ఒత్తిడికి లోను కావడం..
* పుట్టి పెరిగిన వాతావరణం..
* తల్లిదండ్రుల మధ్య సఖ్యత లోపించడం..
* పేదరికంలో మగ్గిపోవడం...
* ఇతరులతో పోల్చుకోవడం..
* ఆత్మ న్యూనతకు లోనుకావడం..
* వీటన్నింటితో పాటు వెర్రి తలలు వేస్తున్న 
   సాంకేతిక  పరిజ్ఞానం...
* మంచి దారిలో నడవడానికి బదులుగా 
   దుర్వినియోగం బాట పడుతున్న యువత...
   ప్రస్తుతం అనూహ్యంగా పెరిగిపోయిన సాంకేతికత వల్ల లభ్యమవుతున్న అశ్లీల వీడియోలు, నేర ప్రవృత్తిని ప్రేరేపించే సన్నివేశాలు అరచేతిలోనే అయాచితంగా...క్లిక్ చేస్తే చాలు ప్రత్యక్షమయ్యే విపరీత దృశ్య పరంపరలూ...ఇవన్నీ యువతనేగాక చిన్నపిల్లలకు, పెద్దవారికి సైతం వక్రమార్గాలకు తలుపులు తీస్తున్నాయి. మనసు చెదిరిపోవడానికి దోహదం చేస్తున్న ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయవలసిన అవసరం ఎంతేని ఉన్నది.అలాగే గృహిణుల దగ్గర్నుండీ ఉద్యోగస్తులు,పిల్లలు...ప్రతి ఒక్కరూ రోజువారీ బాధ్యతల నుండి కాస్త విరామం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసమై... 
   మెదడుపై ఒత్తిడి తగ్గించుకోవాలి. విశ్రాంతి తీసుకుంటూ ఎప్పటికప్పుడు శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తగినంత నిద్ర లేకున్నా అది ఆరోగ్యం మీద తద్వారా మానసిక స్థితి మీద క్రమక్రమంగా తీవ్రప్రభావం చూపించే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఇదంతా ఆ వ్యక్తికి ఏమాత్రం తెలియకుండానే జరిగే ప్రక్రియ..,! కోపం,చిరాకు, విసుగు, గట్టి గట్టిగా అరవడాలు...ఇవన్నీ మనిషి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల ఎదురయ్యే ప్రవర్తనా లోపాలే...! కాలక్రమేణా మనిషి హిస్టీరికల్ గా  మారే ప్రమాదమూ పొంచి ఉంటుంది. అలాంటప్పుడు తనకుతానే తన సమస్యను  గుర్తించగలిగితే మంచిదే.. అలా లేనిపక్షాన తెలిసినవారు, సన్నిహితులు సలహాలివ్వడం, సరైన మార్గనిర్దేశం చేయడం పాటించాల్సిఉంటుంది. ఇందుకోసమే ఇలాంటి మానసిక ఆరోగ్య దినోత్సవాలు..
   అందుకే అవసరమైనప్పుడు మన మనసు చెప్పేది వినాలి. విశ్రాంతి తీసుకోవాలి. మానసిక భావోద్వేగ శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. ఇవన్నీ పాటిస్తే... మానసిక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మన ఆలోచనలూ సవ్యంగా ఉండి మనతోపాటు మన కుటుంబం కూడా బాగుంటుంది. తద్వారా...మన సమాజం యావత్  ప్రపంచం  సంతోషంగా నిశ్చింతగా ఉండగలదు.
    కాబట్టి చివరగా చెప్పొచ్చేదేమిటంటే... మన ఆరోగ్యం మన చేతుల్లోనే... అది గ్రహించుకుంటే మనకు అంతా మంచే జరుగుతుంది... చెప్పినంత తేలిక అయితే కాదు పాటించడం.. కానీ ప్రయత్నిస్తే సాధించలేనిది ఏముంది..!
____________________________________________

Tuesday, October 21, 2025

సంతోషం పంచుకుందాం....

💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐

పండగలంటే ఇష్టం...
దీపావళి మరీ ఇష్టం...
దీపాలు వెలిగించడం.. 
ఆ దీపకాంతి ఆస్వాదించడం..
మరీ మరీ ఇష్టం..
వెలిగే దీపాలు వెదజల్లే కాంతులిష్టం 
చీకటిని పారద్రోలే ఆ కాంతిపుంజాలు 
మదిలో రేపుతాయి ఎన్నో భావతరంగాలు
అవి వెలిగించే ఆశాజ్యోతులు
అందిస్తాయి అనిర్వచనీయ ఆనందాలు 
సాయంసంధ్యవేళల కాకరొత్తులు రాల్చే
ఆ వెలుగుల పూలు ఎంతో ఇష్టం 
పైకెగసే తారాజువ్వలు..
గుండ్రంగా తిరిగే భూచక్రాలు...
పైకి ఝుమ్మని ఎగసే చిచ్చుబుడ్లు...
తనివితీరా చూడ్డం ఇష్టం ...
ఆ క్షణాన పిల్లల కేరింతలు..
వెలకట్టలేని ఆ అనుభూతుల సంబరాలు
మదిలో నిక్షిప్తం చేయడం మహా ఇష్టం...

ఇన్ని ఇష్టాల మధ్య కొన్ని 
అయిష్టాలు మాత్రం కష్టం...!!
చెవులు చిల్లులు పడేలా 
టపాకాయల శబ్దం అయిష్టం..
అవి రేపే కాలుష్యం పర్యావరణానికి 
విషతుల్యం..అగ్ని ప్రమాదాలతో
ప్రాణ నష్టం..ఆస్తి నష్టం...!
జాగ్రత్తలు చాలా అవసరం..
పండగ సంబరాలు కాకూడదు కదా బాధాకరం!
ఆహ్లాదంగా జరుపుకోవడం ఆవశ్యకం..
అందరికీ ఆనందదాయకం...
పిల్లలూ.. పెద్దలూ..అందరం పాటిద్దాం..
పెద్దలు చెప్పే మంచి మాటలు
వినడం మన ధర్మం... నిర్లక్ష్యం వీడుదాం..
జాగ్రత్తలతో మెలుగుదాం...
పండగపూట మిఠాయిలు తింటూ
సంతోషం సరదాగా పంచుకుందాం...   
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐


 

Sunday, October 5, 2025

కాకమ్మ కబుర్లు


                                    ~~యం. ధరిత్రీ దేవి

కావు కావు మంటూ కాకమ్మ అదిగో...
కారునలుపు రంగుతో పదునైన 
ముక్కుతో...చురుకైన చూపుతో
కొమ్మచాటు నోసారి..కోటగోడ నొకసారి..
నింగికెగిరి ఒకసారి..నేలను దిగి ఓసారి...

స్నేహానికి ప్రతిరూపం ఈ కాకమ్మ..
పంచుకుని తినే స్నేహశీలి కదా..!
తనవి కాని కోయిల గుడ్లను తన గూటిలో 
పొదిగే పరోపకారి కాకమ్మే కదా!

అందం లేదనా..! అంతః సౌందర్యం
అపారమే కదా!సుగుణశీలి..సులక్షణాల
పక్షి ఇదే కదా..కాకి గోల.. కాకి బలగం..
కాకి బంగారం..పిల్లకాకికేం తెలుసు 
ఉండేలు దెబ్బ..అబ్బో! సామెతలు కోకొల్లలే!!

నేస్తం అస్తమించెనా..స్పందించునే తక్షణం..
చుట్టూ చేరి కాకులన్నీ కలిసి 
ప్రకటించునే సంతాపం..! మనిషిలో లేని
మానవత్వం కనగలం కాకిలో..

పరిసరాల్ని ప్రక్షాళనం చేసే సర్వభక్షకి..
పర్యావరణ హితం గోరు పక్షి..
ప్రకృతిని విస్తరింపజేయు సహాయకారి..
విపత్తులను పసిగట్టగల నేర్పరీ ఇదే కదా!!

పురాతన పక్షిరాజం...పురాణాల్లోనూ 
దర్శనం../పవిత్రమైనదీ వాయసం...
కాలజ్ఞాని..ఇది శనివాహనమే!!ఇక...
పోరాటసమయాన..ఇది సమైక్యతావాది..

సాయంసంధ్యకు గూటికి చేరే కుటుంబ జీవి..
అనాదిగా సాంకేతికత నెరిగిన జ్ఞాని..
అలనాడే అట్టడుగున కూజాలో 
నీళ్లు పైకి రప్పించిన మేధావి మరి!!

గతించిన పూర్వీకులకిది వారధి...
పిండం కాకి ముడితేనే కానీ తృప్తిజెందరే 
మరి పితృదేవతలు !! కాకి కరువైన..
ఆవేళ..పర్వదినం అసంపూర్ణమే..!!

కాకి అరిస్తే చుట్టాలొస్తారట ! 
శుభసూచనలూ అందిస్తుందట!! అయితే...
ఇంతటి చరితగల కాకమ్మ 
కనుమరుగై పోతున్నది ఏమిటమ్మ!!

పలు సుగుణాల కాకమ్మకు రక్షణ కల్పిద్దాం..
ఆశ్రయమిచ్చే చెట్లను పెంచుదాం..పలువిధాల 
పరోపకారికి పిసరంత ఉపకారం చేద్దాం... 
కాకిజాతి అంతరించకుండా కాపాడుకుందాం....
 
 





 

Friday, October 3, 2025

జాతిపిత ఒక్కడే...

    పల్లవి :
    జాతిపిత ఒక్కడే గాంధితాత ఒక్కడే 
    జాతిరత్నమతడే జగతి కీర్తి అతడే
    భరతమాత ముద్దుబిడ్డ అతడే
    భావితరం సందేశం అతడే అతడే            
                                                       //జాతిపిత//
    చరణం 1 :
    పోరుబందరున పుట్టినాడు
    పోరుబాట పట్టినాడు
    అహింస ఆయుధమన్నాడు
    అందరినీ ఒకతాటిని నడిపించినాడు
    కొల్లాయి గట్టిన ఒక సామాన్యుడు
    మహాత్ముడై ఇల వెలిసిన అసామాన్యుడు
    ఒక్కడే ఒక్కడే అతనొక్కడే 
                                                      //జాతిపిత//
    చరణం 2 
    తొలగిపొండి తెల్లోళ్లు అన్నాడు
    తెల్లవారి గుండెల్లో నిదురించినాడు 
    బానిసగా బ్రతకడం వద్దూ వద్దన్నాడు
    భరతభూమి మన సొంతం అన్నాడు 
    సత్యాగ్రహమే చేశాడు స్వతంత్రమే తెచ్చినాడు 
    చరిత్ర పుటలకెక్కి చరితార్థుడు అయినాడు 
    ఒక్కడే ఒక్కడే అతనొక్కడే 
                                                       //జాతిపిత//






                    

Tuesday, September 30, 2025

గులాబీ మొక్క హృదయస్పందన ! 🌷

ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ మొక్కలకు ప్రాణం ఉంటుందని కనుగొన్నాడు. వాటికి మనసనేది కూడా ఉండి, ఆలోచించే శక్తి కూడా ఉండి ఉంటే బహుశా ఇలాగే ఉంటుందేమో! ఓ ఇల్లాలు బజారుకెళ్లి తిరిగి వస్తూ దారిలో రోడ్డు వారన క్రోటన్లు, పూల మొక్కలు అమ్ముతున్న ఒకతని వద్ద ఆగిపోయి వాటిల్లోనుంచి ఓ గులాబీ మొక్క ను ఎంచుకుని, కొని ఇంటికి తీసుకు వచ్చింది. కొద్ది రోజులు గడిచాక ఆ మొక్క స్పందన చూడండి, ఎలా ఉందో  !
 రోడ్డువార రద్దీ కూడలిని 
 దుమ్ము ధూళి అద్దుకుని
 కళ తప్పిన నన్ను కొని తెచ్చి
 కుండీలో పెట్టి నాకంటూ
 ఓ సామ్రాజ్యాన్నిచ్చావు 
 నా అణువణువూ స్పృశిస్తూ
 నేల తల్లిని మరిపించావు 
 నా తల్లీ ! నీకు వందనం!
 గుప్పెడు నీళ్లకై తపించే నాకు
 గుప్పిళ్ళతో పోషకాలందించి 
 కంటికి రెప్పలా కాపాడావు 
 చీడపీడల దరిజేరనీక 
 ఏపుగ పెరిగేలా చేసి 
 ఎంతందంగా తీర్చిదిద్దావు  !
 నా తల్లీ ! మళ్లీ నీకు వందనం !
 దారీ తెన్నూ ఎరగని నన్ను
 ఓరీతిగ సరిజేసి 
 కొమ్మ కొమ్మనూ 
 చిరు మొగ్గలతో నింపేసి
 నా జన్మ ధన్యం చేసావు !
 నా తల్లీ ! మరల మరల 
 నీకు వందనం!
 ఇంత చేసిన నీకు
 తిరిగి నేనేమివ్వగలను? 
 నీ దోసిలి నిండుగ 
 విరబూసిన నారెమ్మల 
 చిట్టి గులాబీ బాలల్ని దప్ప !
 అర్పిస్తున్నా నా తల్లీ 
 స్వీకరించుమమ్మా !!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 పెంచిన వారి పట్ల మొక్కలు ఇలాగే కృతజ్ఞతలు చెల్లించుకుంటాయేమో !
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

Tuesday, September 23, 2025

నాకు నచ్చిన పద్యం


        తనిసిరే వేల్పులు దధి రత్నముల చేత 
        వెరచిరే ఘోర కాకోల విషము చేత
        విడిచిరే యత్న మమృతమ్ము వొడయు దనుక
        నిశ్చితార్థమ్ము వదలరు నిపుణమతులు

 అమృతం కోసం పాల సముద్రాన్ని మధిస్తున్న దేవతలు ఆ సమయంలో వారికి లభించిన రత్నాలకు సంతోషించలేదు...తృప్తిజెందలేదు. ఆ ప్రయత్నంలో వెలువడిన కాలకూటవిషానికీ ఏమాత్రం భీతి చెందలేదు. అమృతం లభించేదాకా తమ ప్రయత్నాన్నీ వీడలేదు. ధీరులు, కార్యసాధకులు తాము తలపెట్టిన కార్యం సఫలమయ్యేవరకు తమ ప్రయత్నాన్ని వదిలిపెట్టరు. అంటే సజ్జనులు తాము పూనిన కార్యాన్ని సాధించేవరకు ప్రయత్నం విడవరని ఈ పద్యం సారాంశం. చక్కటి భావంతో పాటు సందేశాన్ని కూడా ఇస్తూ, స్ఫూర్తిని కలిగించే ఈ పద్యం అంటే నాకు చాలా ఇష్టం. ఈ పద్యం ఏనుగు లక్ష్మణ కవి రచించిన భర్తృహరి నీతిశతకంలోనిది.