Tuesday, April 15, 2025

ఇదీ పరిష్కారం...కథ

 
                                  ~యం. ధరిత్రీ దేవి   
    
      "సౌమ్యా, ఇంకా ఏం చేస్తున్నావ్?"
 లాంగ్ బెల్లయి పది నిమిషాలైనా ఇంకా రాని సౌమ్య కోసం వెతుకుతూ  ఉన్న దుర్గకు క్లాస్ రూములో డెస్క్ మీద తలవాల్చి కూర్చున్న సౌమ్య కనిపించడంతో గట్టిగా పిలిచింది. తలెత్తి చూసింది గానీ సౌమ్య అక్కడినుంచి కదల్లేదు.
" ఏమిటి సౌమ్యా? ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఆర్ యూ ఓకే!"
 తనే లోనికి వెళ్లి సౌమ్య భుజం మీద చేయి వేసి కుదిపింది దుర్గ. లేచి నిలబడి, బ్యాగ్ తగిలించుకుంటూ,
"ఆ, ఓకే పద.."
 అంటూ కదిలింది సౌమ్య. కానీ దుర్గకు ఎందుకో సౌమ్య మామూలుగా లేదనిపించింది. బాగా ఏడ్చినట్టు మొహమంతా అదోలా ఉంది. మరీ బలవంతం చేస్తే బాగోదని దుర్గ తనతో కలిసి బయటకు దారితీసింది.
   అదో గవర్నమెంట్ బాలికల జూనియర్ కళాశాల. రెండంతస్తుల పాత భవనం. అందులో దుర్గ, సౌమ్య సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. దుర్గ హెచ్ఈసి గ్రూపు. సౌమ్య బైపీసీ గ్రూపు. ఇద్దరూ లాంగ్వేజ్ క్లాసుల్లో కలుస్తూ ఉంటారు. ఒకరికొకరు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేంత మంచి ఫ్రెండ్స్. కానీ కొన్ని రోజులుగా సౌమ్య 'మూడీ'గా ఉండడం దుర్గ గమనిస్తూనే ఉంది. సౌమ్య స్వతహాగా చాలా నెమ్మదైన అమ్మాయి. ఎక్కువగా మాట్లాడదు. కానీ చదువులో చురుగ్గా ఉంటూ క్లాసులో మొదటి ఐదుగురిలో ఒకదానిగా ఉంటూ ఉంటుంది. దుర్గ స్వభావం పూర్తిగా విరుద్ధం. అందరితో గలగలా మాట్లాడుతూ అల్లరి కూడా బాగానే చేస్తూ ఉంటుంది.
" ఏమిటో, సౌమ్య ఇలా ఉండటం నాకు బొత్తిగా నచ్చడం లేదు. ఇంట్లో ఏదైనా ప్రాబ్లమో ఏమో..!"
 లోలోపల అనుకుంటూ కదిలింది దుర్గ.
                         **********
   వారం గడిచింది. సంవత్సరాంత పరీక్షలకు ముందు జరిగే ప్రిపరేషన్ పరీక్షలకు టైంటేబుల్ ఇచ్చారు. చివరి సంవత్సరం..పైగా పబ్లిక్ ఎగ్జామ్స్.. అందువల్ల లెక్చరర్స్ అంతా స్టూడెంట్స్ ను ప్రిపేర్ చేయడంలో నిమగ్నమయ్యారు. ఉదయం, సాయంత్రం కూడా స్పెషల్ క్లాసులు అంటూ, స్టడీ అవర్స్ అంటూ తీరిక లేకుండా పరుగులు తీస్తున్నారంతా.
   ఆరోజు శనివారం. సోమవారం నుండి పరీక్షలు మొదలు. క్లాసులన్నీ అయిపోయి, అమ్మాయిలంతా బిలబిలమంటూ క్లాసుల్లోంచి బయటపడ్డారు. తన క్లాసులో నుంచి ముందుగా బయటికి వచ్చిన దుర్గ సౌమ్య కోసం చూస్తూ నిలబడింది. కాసేపటికి వచ్చిన సౌమ్య,
" దుర్గా, నువ్వు వెళ్ళవే. నేను అర్జంటుగా టాయిలెట్స్ కి వెళ్ళాలి  "
అంది దుర్గతో.
, " సరేలే వెళ్లిరా. నేను వెయిట్ చేస్తూ ఉంటా బయట. త్వరగా వచ్చెయ్  "
 అంటూ వెళ్లబోయి,
"...అదేంటి సౌమ్యా పైకి వెళ్తున్నావ్, ఇక్కడే ఉన్నాయిగా టాయిలెట్స్..?"
 అప్ స్టైర్స్ వైపు వెళుతున్న సౌమ్యను ప్రశ్నించింది దుర్గ. తిరిగి చూడకుండానే,
" ఇక్కడ వాటర్ రావడం లేదులే దుర్గా "
 అనేసి పైకి దారి తీసింది సౌమ్య.
" అలాగా" అన్న దుర్గకు వెంటనే గుర్తొచ్చి,అదేంటి, ఇందాకే నేను వెళ్ళొచ్చాను, బాగా వస్తున్నాయే నీళ్లు..! అనుకుంటూ వెనుతిరగబోయిన ఆ పిల్లకు ఠక్కున ఏదో స్ఫురించి, మళ్లీ తిరిగి చూసింది. అప్పటికే పైకి వెళ్ళిపోయింది సౌమ్య. గుండె ఆగినంత పనైంది దుర్గకు . వెంటనే అప్ స్టైర్స్ వైపు పరిగెత్తింది. సౌమ్య బిల్డింగ్ టెర్రస్ మీద చివరికి గబగబా పరుగు లాంటి నడకతో నడుస్తూ పోతోంది. మరుక్షణంలో దూకేసేదే! శక్తినంతా కూడా తీసుకొని దుర్గ పరుగున వెళ్లి ఒక్క ఉదుటున సౌమ్యను చేయి పట్టి లాగేసింది. ఊహించని హఠాత్పరిణామానికి ఒక్కసారిగా కింద పడిపోయింది సౌమ్య. అయినా వెంటనే లేచి,దుర్గ చేయి విడిపించుకొని ముందుకురకడానికి ప్రయత్నించింది. కానీ దుర్గ రెండు చేతులతో గట్టిగా సౌమ్యను వాటేసుకుని,
" బుద్ధుందా నీకు, ఏమిటీ పిచ్చి పని!!"
" దుర్గా, నన్ను వదిలేయ్ ప్లీజ్ "
" అసలేం జరిగింది? ముందు నాకు చెప్తావా లేదా? "
 అక్కడే కూలబడిపోయి,దుర్గను వాటేసుకుని  భోరున ఏడ్చేసింది సౌమ్య. మెల్లిగా ఆమె వీపు మీద తడుతూ, ఓదార్పుగా,
" ఊరుకో సౌమ్యా, ముందు ఇక్కడ నుంచి పదా, ఎవరైనా ఇక్కడ మనల్ని చూస్తే బాగోదు.. "
 అంటూ చేయి పట్టుకుని కిందికి తీసుకెళ్ళింది సౌమ్యను. అక్కడ ఎదురుగా వాచ్ మ్యాన్!
" ఏంటమ్మా ఏం చేస్తున్నారిక్కడ ? బెల్లయిపోయి ఎంత సేపయింది..! వెళ్లండి ఇక్కడి నుంచి.. "
 అంటూ అరిచాడు.
"వెళ్తున్నాం అన్నా, బుక్స్ కనిపించకపోతే వెతుక్కుంటున్నాము.. "
 అంటూ సౌమ్యతో పాటు దుర్గ బయటపడింది. పది నిమిషాల తర్వాత ఎవరూ లేని చోటు చూసుకుని ఓ చెట్టు కింద నిలబడ్డారు ఇద్దరూ. ఏడుస్తూ, సౌమ్య చెప్పిన విషయం వినేసరికి దుర్గ తల తిరిగిపోయింది. చాలా రోజులుగా సౌమ్య ముభావంగా ఉంటూ సరిగా మాట్లాడకపోవడం, పరీక్షల్లో మార్కులు కూడా తగ్గడం.. వీటన్నింటికీ కారణం ఇదన్న మాట!
  రాధాకృష్ణ ఆ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. ఇదే సంవత్సరం మొదట్లో వేరే కాలేజీ నుండి వచ్చి జాయిన్ అయ్యాడు. పాఠాలు బాగానే చెప్తాడు. ఎక్కువగా మాట్లాడడు ఎవరితో. డీసెంట్ గా కనిపిస్తాడు. అందరూ మంచివాడు అనుకునే ఈ అధ్యాపకుడి నైజం  ఇదా!!
" ఫిజిక్స్ సార్ ను చూస్తేనే భయమేస్తోంది దుర్గా. మొదటి రెండు నెలలు బాగానే ఉండేవాడు. కానీ మెల్లిగా అతని ప్రవర్తనలో ఏదో తేడా కనిపించ సాగింది నాకు. కూర్చుని రాసుకుంటుంటే వెనక వీపు మీద చేయి వేయడం, భుజం మీద చేతులు వేసి మీదకు వంగి ఏదో డౌట్ క్లియర్ చేస్తున్నట్టు మాట్లాడడం...! మొదట్లో ఏదో పెద్దవాడులే అనుకొని పట్టించుకోకూడదనుకున్నా . కానీ రానురానూ ఆ చేష్టలు ఎక్కువైపోయాయి. పక్కన ఎవరైనా చూస్తే ఏమనుకుంటారోనన్న భయం నన్ను మరీ బాధించసాగింది. "
 సౌమ్య చెబుతుంటే విస్తుబోయి వింటూ నిలబడిపోయింది దుర్గ. కన్నీళ్లు తుడుచుకుంటూ కొనసాగించింది సౌమ్య.
" నేను గమనించాను, నాతో మాత్రమే అలా ప్రవర్తిస్తున్న సంగతి. మిగతా వాళ్లంతా సార్ తో నవ్వుకుంటూ బాగా మాట్లాడుతుంటారు. ఎందుకు నాతోనే ఎందుకలా చేస్తున్నాడు! నాకే ఎందుకు ఇలా జరుగుతోంది!"
 ఏడుపు ఆపుకోలేక దుర్గ భుజం మీద తలవాల్చేసింది సౌమ్య .
"... ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి, ఈ కొద్ది రోజులు ఎలాగోలా భరిద్దామనుకున్నా.నిన్న ఫిజిక్స్ క్లాస్ అయ్యాక బయటికి వస్తుంటే నన్ను దగ్గరికి రమ్మన్నాడు. ఏమిటీ, మార్కులు ఇంత తక్కువగా వచ్చాయి? అర్థం కావటం లేదా? రేపు ప్రాక్టికల్స్ అయ్యాక కాసేపు ఉండిపో. డౌట్స్ క్లియర్ చేస్తాను. అన్నాడు. మౌనంగా తలూపి వచ్చేశా. ఈరోజు ల్యాబ్ నుండి త్వరగా బయటపడదామని వచ్చేస్తున్నా. అందరూ బయటికి వెళ్లిపోయారు. ఈ లోపే వెనకగా వచ్చి గట్టిగా నన్ను పట్టుకొని..."
 ఆపై మాటలు రాక వెక్కివెక్కి ఏడవసాగింది సౌమ్య. తనని ఎలా ఓదార్చాలో తెలియక దుర్గ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని  అనునయించసాగింది. రెండు నిమిషాల తర్వాత ఇద్దరూ తేరుకున్నారు.
" సౌమ్యా, వాడలా ప్రవర్తిస్తుంటే ఇన్నాళ్లుగా భరించడం పొరపాటు. ఇంకా చావాలనుకోవడం అంతకన్నా పెద్ద తప్పు. ఇక చాలు, ఏం చేయాలో నేను ఆలోచిస్తాను. కానీ నువ్వు మళ్ళీ ఇలాంటి పిచ్చి పని చేయనని నాకు మాటివ్వాలి.. "
 చేయి చాపింది దుర్గ.
" లేదులే దుర్గా, ఏదో తట్టుకోలేక ఆ క్షణంలో అలా చేశాను గానీ ఇప్పుడు అనిపిస్తోంది నాకూ, అదెంత  పొరపాటో.. ప్రామిస్, ఇక ఎప్పటికీ అలా చేయను.."
దుర్గ చేతిలో చేయి వేసింది సౌమ్య.
                          ********
  మర్నాడు లంచ్ బ్రేక్ లో దుర్గ ఆలోచన ప్రకారం ఇద్దరూ వెళ్లి ఇంగ్లీష్ మేడం సాధన గారిని కలిశారు. జరిగిందంతా పూస గుచ్చినట్టు వివరించింది దుర్గ.
"వ్వాట్! రాధాకృష్ణ సర్ ఇలా చేస్తున్నాడా!అన్బిలీవబుల్. చూడ్డానికి ఎంతో మర్యాదస్తుడిలా కనిపిస్తాడే!.. "
 అంటూ సౌమ్య కేసి తిరిగి,
" ఇలా జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళతో సమస్య చెప్పుకోవాలి. అలాకాక చచ్చిపోదామనుకుంటే ఎలా? తప్పు చేసింది అతనైతే శిక్ష నీవు వేసుకుంటావా! అలా మరికొందరు అమ్మాయిల్ని అతను టార్గెట్ చేయడా?"
 సున్నితంగానే మందలించింది సౌమ్యను.
"..పోతే, నీతోనే ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడన్నావు కదా...నెమ్మదిగా, కూల్ గా ఉండేవాళ్లు ఏమీ అనలేరనీ, ఎవరితోనూ చెప్పుకోలేరని ఇలాంటి వాళ్ళ ధైర్యం. అది నువ్వు బాగానే నిరూపించావు. కానీ దుర్గ పసిగట్టడం చాలా మంచిదయింది. సరే, దీని గురించి ఆలోచిస్తాను. మీరు క్లాస్ కి వెళ్ళండి"
 అని చెప్పి ఇద్దరినీ పంపించేసింది.
                                 ***********
 మరుసటి రోజు---
 సాధన చెప్పిందంతా విన్న ప్రిన్సిపల్ సుదేష్ణాదేవి కోపానికి అంతులేకపోయింది. కానీ,అంతలోనే ఇది సున్నితంగా పరిష్కరించాల్సిన విషయం అన్న విచక్షణతో వెంటనే మరో ఇద్దరు లేడీ లెక్చరర్స్ ని, సివిక్స్ లెక్చరర్ శివశంకర్ ను కూడా పిలిపించి వాళ్లతో కూడా సంప్రదించి, వాళ్లందరికీ కొన్ని పనులు అప్పగించి పంపించేసి ఆలోచనలో పడింది.
   తను ఆరవ తరగతి చదువుతున్న రోజుల్లో దగ్గరి బంధువు ఒకతను  ఇంటికి అప్పుడప్పుడు వస్తుండేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి తన భుజాలపై చేతులు వేయడం, బుగ్గల్ని సాగదీయడం లాంటి పనులు చేసేవాడు. రెండు మూడు సార్లు చూసి, కంపరంగా అనిపించి అమ్మతో చెప్పేసింది. యధాలాపంగా ఓరోజు ఇంటికి వచ్చిన అతన్ని పట్టుకుని అమ్మ చెడామడా దులిపేసింది. అంతే! అతను మళ్లీ ఇంటి గడప తొక్కితే ఒట్టు! ఆరోజు నుండీ అతనికీ, తమ ఇంటికీ సంబంధం పూర్తిగా తెగిపోయింది. అలాంటి ప్రబుద్ధులు, వికృత చేష్టల మృగాళ్లు అన్ని కాలాల్లోనూ ఉంటూనే ఉంటారన్నమాట !! అనుకుంటూ తల పంకించింది సుధేష్ణాదేవి.
                                 **********
   రెండు రోజుల వ్యవధి తీసుకుని పని పూర్తి చేసుకుని లెక్చరర్స్ అంతా వచ్చి కూర్చున్నారు ప్రిన్సిపల్ ఎదురుగా. వాళ్ళు చెప్పిన సమాచారం వినగానే సుదేష్ణాదేవి కాసేపు నిర్వికారంగా అయిపోయింది. ఇంతవరకూ సౌమ్య ఒక్కతే బాధితురాలు అనుకుంటున్నారు. కానీ, సైన్స్ గ్రూపుల వారందరినీ కూర్చోబెట్టి అనునయంగా వారిని ప్రశ్నించేసరికి ధైర్యం వచ్చి నోరు తెరిచారట! మొత్తం మీద బైపీసీలో ముగ్గురు, ఎంపీసీలో మరో ఇద్దరు ఇలాంటి చేదు అనుభవాలే తామూ ఎదుర్కొంటున్నట్లు బయటపడ్డారు. చెబితే అంతా తమను అదోలా చూస్తారని, ఇంట్లో తెలిస్తే కాలేజీ మాన్పించేస్తారని భయపడి  మిన్నకుండి పోయామని వాళ్ళనగానే విస్తుబోవడం  లెక్చరర్ల వంతయిందట!! ఆలోచిస్తే...ఇంకా బయటపడని వాళ్ళూ ఉండే ఉంటారని చెప్పారు లెక్చరర్స్.
     కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీలలిత ఎంక్వయిరీలో అతని వ్యక్తిగత సమాచారం కొంతవరకు తెలిసింది. నలభై దాటిన  రాధాకృష్ణ అనే ఈ అధ్యాపకునికి పెళ్లయింది. భార్య గృహిణి. పెద్దగా చదువుకోలేదు. ఇద్దరు కొడుకులు హైస్కూల్లో చదువుతున్నారు.
  తరువాత శివశంకర్ గతంలో రాధాకృష్ణ పని చేసిన కాలేజీ నుండి సేకరించిన సమాచారం తెలిపాడు. ఆ కాలేజీ కో ఎడ్యుకేషన్ . అక్కడ కూడా అమ్మాయిల నుండి ఇలాంటి ఆరోపణలు ప్రిన్సిపాల్ కు అందాయి. బ్రతిమాలి బామాలి పై అధికారుల దాకా పోకుండా చేసుకున్నాడు. అందుకే రెండేళ్ల గడువు దాటిపోగానే ఎలాగోలా ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఇక్కడికొచ్చి పడ్డాడు. కానీ కుక్క తోక వంకర పోయేది కాదు గదా! అలాగే ఇతని నైజమూ మారలేదన్నమాట! అనుకుంది సుదేష్ణాదేవి. వెంటనే,ఇక ఉపేక్షించడంలో అర్థం లేదు అని స్థిరంగా నిశ్చయించుకున్నారామె. గంట తర్వాత మళ్లీ కలుద్దామని చెప్పి వాళ్లను పంపించేసి, అటెండర్ తో చెప్పి రాధాకృష్ణను పిలిపించింది.ఏ ఉపోద్ఘాతమూ లేకుండా సూటిగానే విషయంలోకి వెళ్లారామె.
" మీ ప్రవర్తన వల్ల స్టూడెంట్స్ ఎంత మానసిక వేదనకు లోనవుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతోందా!గురువు తండ్రితో సమానమంటారు.
 మీ ఈ ప్రవర్తనకు మీ సంజాయిషీ ఏమిటి? "
"మేడం,వాళ్ళు చిన్న పిల్లలు. నన్ను అపార్థం చేసుకున్నారు. నేనలాంటి వాణ్ణి కాదు. ఏదో చిన్న వాళ్ళని చనువుకొద్దీ చేయి పట్టుకుంటే ఇలా వక్రీకరిస్తే ఎలా మేడం ? "
 దిగ్గున లేచింది సుదేష్ణాదేవి.
"ఆపండి, సీనియర్ ఇంటర్ చదువుతున్న టీనేజీ ఆడపిల్లలండీ వాళ్ళు. ఏది గుడ్ టచ్చో, ఏది బాడ్ టచ్చో తెలీని పసిపాపల వయసా వాళ్లది? నీ చేష్టల వల్ల ఓ అమ్మాయి ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడింది, తెలుసా నీకు?.. "
" సారీ మేడం, క్షమించండి ... "
" సారీతో సమసిపోయే సమస్య కాదిది. ఇక మీరు వెళ్ళవచ్చు.. "
మౌనంగా లేచి నిల్చున్నాడతను.
                          **********
  మరుదినమే స్టాఫ్ మీటింగ్ పెట్టి విషయం చర్చలో పెట్టారు సుదేష్ణాదేవి. అందరి అభిప్రాయం విన్నాక అందరి సమ్మతితో ఓ నిర్ణయం తీసుకుని ఎవరు ఏం చేయాలో చెప్పి పంపించేశారు.
   మరుసటి రోజు మధ్యాహ్నంకల్లా సైన్స్ స్టూడెంట్స్ రాధాకృష్ణ సర్ మీద కంప్లైంట్ రాసి "ఈ సార్ మాకొద్దు" అంటూ సంతకాలు చేశారు. తానూ ప్రిన్సిపల్ గా మరో కంప్లైంట్ రాసి ఆ రోజే పై అధికారులకు పంపించేశారు  సుదేష్ణాదేవి గారు.
   వారం రోజుల్లో ఎంక్వయిరీ కమిటీ వచ్చి విచారించింది. అంతా నిజమేనని తేల్చి రిపోర్ట్ రాసుకొని వెళ్లారు. రెండు రోజుల్లో రాధాకృష్ణకు సస్పెన్షన్  ఆర్డర్స్ చేతికి అందాయి. రెండు వారాల తర్వాత దూర ప్రాంతంలో మారుమూలనున్న ఓ బాలుర జూనియర్ కాలేజీకి బదిలీ జరిగిపోయింది.
                        *************
   ఆరోజు అసెంబ్లీ హాల్లో స్టాఫ్, స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ నూ సమావేశపరిచి అందరినీ ఉద్దేశిస్తూ ప్రసంగించారు సుదేష్ణాదేవి గారు.
" ఇలాంటి సంఘటనలు కాలేజీలో జరగడం చాలా బాధాకరం. కానీ, ఒక్క విషయం అందరం ఆలోచించాలి. సమస్యలు ఎలాంటివైనా సరే ఎప్పుడైనా,ఎక్కడైనా, ఎవరివల్లనైనా రావచ్చు. అలాంటప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి గానీ పిరికిగా భయపడకూడదు. తనకు తానుగా పరిష్కరించుకో లేనప్పుడు పక్కవారి సాయం తీసుకోవడంలో తప్పులేదు. ఈ విషయంలో తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలి. తప్పు నీదేనని మందలించడం, చదువు మానిపించడం పరిష్కారం కానే కాదు. వాళ్లకు ధైర్యం చెప్పి భయాన్ని పోగొట్టాలి. అమ్మాయిలందరికీ మరోసారి మళ్లీ మళ్లీ చెప్తున్నాను. ఇలాంటి సమస్య ఏదైనా మీకు ఎదురైనప్పుడు మీలో మీరే కుమిలిపోకుండా పరిష్కారం దిశగా ఆలోచించాలి. ఈ సందర్భంగా దుర్గ అనే స్టూడెంట్ ను నేను మనసారా అభినందిస్తున్నాను. స్నేహితురాలి మనస్థితిని గమనించిన ఆ అమ్మాయి వయసుకు మించిన పరిణతి చూపించి సౌమ్యనే గాక మరెందరినో ఈ సమస్య నుండి బయట పడేయగలిగింది. ఆ అమ్మాయికి నా మనఃపూర్వక అభినందనలు. ఇంకా స్టూడెంట్స్ తమ వ్యక్తిగత సమస్యల్ని తనతో పంచుకునేలా వాళ్ళతో అనుబంధాన్ని పెంచుకున్న సాధన మేడం గారినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను... "
హాలంతా చప్పట్లతో మార్మోగిపోయింది.
                          **********
" థాంక్యూ వెరీమచ్ దుర్గా, నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. నన్నో పెద్ద ఉపద్రవం నుండి బయట పడేశావు.. "
 సమావేశం అయిపోయాక దుర్గ చేతులు పట్టుకుంటూ ఆర్ద్రంగా అంది సౌమ్య.
"ఛ! ఊరుకోవే, సరేగానీ, ఇప్పటికైనా పిరికితనం వదులుకుంటావా లేదా...!?"
" ఇంకానా! నీలా పదిమందికి ధైర్యం చెప్పే శక్తి వచ్చింది తెలుసా..? "
 ఇద్దరూ భుజాల మీద చేతులు వేసుకుని గలగలా నవ్వుకుంటూ గేటు దాటి ముందుకు కదిలారు.
              ****************************
  
   
    



  

No comments:

Post a Comment