Tuesday, March 2, 2021

ఎన్నికలు... ఎన్ని కలలు... !

 దాదాపు పది రోజుల క్రితం దినపత్రిక తిరగేస్తుంటే ఓ హెడ్డింగ్ నన్నాకర్షించింది. కాస్తంత తమాషాగా, మరింత ఆసక్తికరంగా ఉండడంతో వెంటనే గబగబా చదివేశాను. దాని సారాంశం --
 గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎన్నికలు ముమ్మరంగా జరుగుతున్న సందర్భంగా ఓ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిని ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థిస్తూ ప్రతీ ఇంటికి ఒక కోడిని బహుమతిగా ఇచ్చిందట ! వాళ్లేమో దాన్ని కోసుకుని చికెన్ వండుకుని తినేశారట ! మరుసటి రోజు ఆ సంగతి తెలిసిన ప్రత్యర్థి వెంటనే ఇంటికి రెండు కోళ్ల చొప్పున పంపిణీ చేసేసిందట! ఇంకేముంది ! కోళ్లను ఇచ్చారు సరే, అవి తిన్న రుణం ఎలా తీర్చుకోవాలో, ఓటెవరికెయ్యాలో తెలీక సందిగ్ధంలో పడిపోయి జనాలంతా బుర్ర గోక్కోవడం మొదలెట్టారట ! మరో రోజు మరో వార్త ! ఓ అభ్యర్థి ఇంటింటికీ చీర సమర్పిస్తూ ప్రచారం సాగించిందట ! అంతేనా! ఓటుకింత అని లెక్కగట్టి ఇంటింటికీ పంచుతూ లక్షలు లక్షలు గుమ్మరిస్తున్నారని చెవులు కొరుక్కోవడం ! అందులో నిజమెంతో తెలియదు గానీ అలా చెప్పుకుంటున్నది మాత్రం వాస్తవం. గ్రామ సర్పంచ్ లాంటి చిన్న పదవి కోసం ఇంత పెనుగులాట, ఆర్భాటం అవసరమా అంటే అది'ప్రిస్టేజ్ ' ఇష్యూ గా తీసుకుంటున్నట్లు సమాచారం ! 
   ఇంతా చేసి ఆఖరికి అతి తక్కువ మెజారిటీ తో గెలవటం ! రెండు, మూడు ఓట్ల తేడాతో గెలిచారు అన్న వార్తలూ చదివాం. ఈ సందర్భాల్లో గెలిచిన వాళ్లకు 'గెలిచాంరా దేవుడా 'అనుకోవడం తప్ప పెద్దగా సంతోషించాల్సినదేమీ కూడా ఉండదేమో ! ఇకపోతే, జయాపజయాలు దైవాధీనాలు. గెలుపన్నది ఏ ఒక్కరికో దక్కుతుందన్నది తెలిసిందే. అయినా రెండు మూడు ఓట్ల తేడాతో ఓటమిపాలైన వారి పరిస్థితి ఊహించుకోవడానికే బాధాకరం. ఇక వాళ్లకి ఎలా ఉంటుందో వేరే చెప్పాలా! ఎలెక్షన్ల ఊసు మొదలైన క్షణం నుండి పోలింగ్ పూర్తయిన క్షణం దాకా ఎన్నెన్ని కలలు కని ఉంటారో కదా! ఎవరి పిచ్చి వాళ్ళ కానందం అన్నట్లు ఒక్కొక్కరి టేస్ట్ ఒకలా గుంటదేమో ! ఇది పాలిటిక్స్ పిచ్చి అనుకోవచ్చు అనుకుంటా. ఏదో ఒక రోజు గెలిచి తీరుతామన్న ధీమా కావచ్చు, కొందరు మళ్ళీ మళ్ళీ పోటీలో నిలుస్తుంటారు. 
    ఇంతకీ-- గ్రామస్థాయిలో ఇంత కోలాహలం, ఇంతటి అనూహ్య స్పందన (? ) మున్నెన్నడూ కనీవినీ ఎరుగం! పల్లెటూరి ప్రజలు అమాయకులు, కల్లాకపటం తెలియనివాళ్లు, కల్మషం ఏమాత్రం లేని సహృదయులు, ఇంకా చదువు పెద్దగా లేకపోయినా సంస్కారం పుష్కలంగా ఉన్న వాళ్ళు అన్న అభిప్రాయం ఆదినుండీ ఉంది. కానీ, అలాంటి ప్రశాంతతకు ఆలవాలమైన పల్లెలు ఇప్పుడు ఇలా మారిపోయాయి అంటే ఏమనుకోవాలి? ఎవరిని నిందించాలి? 
    ఒకప్పుడు గ్రామం మంచి కోరి పాటుపడే వాళ్లకు ఏ ప్రతిఫలం ఆశించకుండా ఓటు వేసే వారు. గ్రామ పెద్దల మాటే వేదంగా ఉండేది. కానీ, ప్రస్తుతం కక్షలూ, కార్పణ్యాలూ, ఈర్ష్యా ద్వేషాలు ప్రబలి పరస్పరం అభిమానం, గౌరవం కరువైపోయింది మరి! 
     ఆఖరికి జనాలు ఎన్నికలు వస్తున్నాయంటే అదేదో పండుగ వస్తోంది అన్నట్లుగా ఫీలయి ఆనందిస్తున్నారు అంటే పరిస్థితి ఎలా తయారైందో ఊహించు కోవచ్చు. మహాత్మా గాంధీ ఇప్పుడు గనక పుట్టినట్లయితే స్వతంత్ర భారతావనిని చూసి తల పట్టుకుని తల్లడిల్లిపోతాడు ఖచ్చితంగా.
        ఆగండాగండి, అయిపోలేదు, ఇంకా ఉంది. అదిగో, కార్పొరేషన్ ఎన్నికలు. సంరంభం మొదలైంది. అభ్యర్థులు గుంపులు గుంపులుగా వీధుల వెంట కనిపిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారాలు సాగిస్తున్నారు, చూద్దాం, ఎవరి కలలు ఫలిస్తాయో !!

***************************************
               🌺భువి భావనలు 🌺
***************************************

No comments:

Post a Comment